రాహుల్ సాంకృత్యాయన్ వంటి పండితులు తెలుగు నేలమీద ఉన్న ధాన్యకటకం (అమరావతి), శ్రీపర్వతం (నాగార్జున కొండ) ప్రాంతాలలో మంత్రయాన, వజ్రయానాలు పుట్టాయని భావిస్తారు. కాలచక్రంలోని సేకోద్దేశ విభాగంపై రాసిన వ్యాఖ్యానం సేకోద్దేసటిక ప్రకారం- బుద్ధ దీపాంకరుడు మంత్రయానాన్ని మొదటగా ప్రవచించాడని, శాక్యముని బుద్ధుడు, మన యుగం కోసం దాన్ని అనుసరించాడని తెలుస్తుంది. సుచండరాజు సంభాలుని కోరికపై బుద్ధుడు శ్రీధాన్యకటకంలో ఒక సభను ఏర్పాటుచేశాడు.అక్కడ మూడోసారి ధర్మచక్ర పరివర్తనం నిర్వహించి, మంత్రయానంపై ప్రసంగించాడు. ప్రత్యేక మంత్ర, పూజాదిక-ప్రార్థనా పద్ధతుల బౌద్ధత్వపు పరమోన్నత జ్ఞాన క్రమాన్ని శీఘ్రతరం చేస్తాయి. జ్ఞానాన్ని, మంచి గుణాలను ఈ పద్ధతి ద్వారా పెంపొందించుకొనే ధ్యాన మార్గాన్నే వజ్రయానం అన్నారు. ఉమ్మడి మహాయాన దార్శనిక సంప్రదాయంలో పెంపొందించిన అంత:దృష్టులపై ఈ పూజాదిక-ధ్యాన పద్ధతి ఆధారపడి ఉంటుంది.
వజ్రయాన మార్మికత్వమే మాధ్యమిక వాదం; రెండు సత్వ విచార అతివాదాల మధ్యే మార్గాన్ని ఇది ఎంచుకుంటుంది. ఒకటి వాస్తవికవాదం; అది వస్తువులకు అంతర్నిహిత ఉనికిని అంటగడుతుంది. రెండవది శూన్యవాదం; అది వస్తువుల కారణ సమర్థతను తిరస్కరిస్తుంది. వస్తువుకు అంతర్నిహిత ఉనికి ఏమాత్రం లేదు; దాని స్వభావం శూన్యం.అయినా కారణాలు, పరిస్థితుల నుండి అది పుడుతుంది. మనస్సును యోగం ద్వారా నియంత్రించడం వల్ల, వజ్రయానం మధ్యమ వర్తిపాద్ లేక మధ్యే మార్గాన్ని తెలుసుకుంటుంది. సమరిక స్థితిలో మనస్సు ప్రాపంచిక భ్రమ రూపాలను చూసి ఆకర్షించబడి మొదటిదానిలో ఉత్పన్నమవు తుంది. ఇది ఉత్పత్తి కర్మ స్థితి; ఇది మనస్సు సృజనాత్మక శక్తిని వినియోగిస్తూ వాస్తవికత్వపు నవ్యదైవ దృష్టిని ప్రభవింపచేస్తుంది. ఈ ఊహాత్మక దృష్టి లేక మండల యోగుల జ్ఞాన పరివర్తనమే; ఇక్కడ ఆత్మ,పరిసరాల సామాన్య రూపం దేవతలు వసించే ఆదర్శ ప్రపంచంగా మారిపోతుంది. మూల బౌద్ధ మానసిక తాత్విక రూపాల దైవీకరణమే మండల ప్రతీకాత్మకత. మండల దేవతలు దృగ్విషయాలు; వాటి శూన్యత్వాన్ని గుర్తించడం ద్వారా అభ్యాసుని వ్యక్తిత్వం స్వచ్ఛత పొందుతుంది. ఉత్పత్తి దశలో అభ్యాసి సామాన్య ఎరుకను మొదట శూన్య జ్ఞానంలోకి విలీనం చేస్తాడు. ఆ ర్వాత ఈ శూన్యజ్ఞానం లోపలే అభ్యాసుని మనసు మండల రూపంలో వ్యక్తమవుతుంది. ఉత్పత్తి దశలోని మండల అభ్యాసం ద్వారా తనను వ్యవస్థితం చేసుకొని దృగ్విషయాలకు స్వతంత్ర అంతర్నిహిత ఉనికి లేదన్న, అవి మనోకల్పనలన్న గాఢ అవగాహనను యోగి పొందుతాడు.
క్రీసు శకం ఏడో శతాబ్దంలో తెలుగు దేశంలో పర్యంటించిన యువాన్ త్సాంగ్ అనే చైనా యాత్రికుడు పర్యటించాడు. ధాన్యకటకం అప్పటికే వజ్రయానం, ధరణిల కేంద్రమైపోయిందని చెప్పాడు. ఆంధ్రదేశంలోని బౌద్ధులు వజ్రయానపు తాంత్రిక పద్ధతులను అనుసరిస్తున్నారని పల్లవుల శాసనాలు కూడా చెబుతున్నాయి. మంత్రాలు, ధరణిలు పఠనం, ముద్రల అభ్యసనం , దేవీదేవతల ఆరాధన, సంక్లిష్ట తాంత్రిక విధానం. చాలామంది పరిశోధకుల అభిప్రాయంలో తాంత్రిక విధానం ఆదిమ తెగల అంధ విశ్వాసాలు, అనాది ఆచారాల నుండి ప్రారంభమై ప్రముఖ మతంగా భారత దేశం అంతా వ్యాపించింది. భారతీయ మత చింతనా చరిత్రలో భాగమయింది. ఏడు పదమూడు శతాబ్దాల మధ్య కాలాన్ని తాంత్రిక యుగం అంటారు ఎల్.ఎం.జోషి వంటి పరిశోధకులు.
-రత్నం
Authorization