పాములవారు బుట్టలో పాములను పెట్టుకొని నాగస్వరం ఊదుతూ ఇంటింటికి వెళ్ళి పాముల నాడిస్తూ భిక్షాటన చేస్తారు. అది వారి వృత్తి. వీరి భాష లిపి లేని భాష. పాములవారు చాలా జాగ్రత్తగా పాములను పట్టి వాటి కోరలను తీసేసి బుట్టల్లో బంధిస్తారు. నాగస్వరాన్ని ఊదుతూ పాములను ఆడిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ నిజానికి నాగస్వరం మనకు తప్ప పాములకు వినిపించదు. ఎందుకంటే పాములకు చెవులుండవు. కాబట్టి వినికిడి శక్తి ఉండదు. వినికిడి శక్తే లేనప్పుడు అవి నాగస్వరానికి మైమరచిపోతూ ఆడటం అనేది ఉండదు. అయితే మరి పాములు నాగస్వరం ఊదుతున్నప్పుడు అటు ఇటు పడగవిప్పి ఊగిపోతున్నట్లు కనిపిస్తుంది కదా.. మరి దాని సంగతేంటని అడగవచ్చు. పాములవారు నాగస్వరాన్ని అటు ఇటూ ఊపుతూ వాయిస్తూ ఉంటారు. పాము అలా కదులుతున్న నాగస్వరం తనపైకి వచ్చి హాని కలిగిస్తుందేమోననే భయంతో నాగస్వరం కదలికలకు అనుగుణంగా కదులుతూ గమనిస్తుంది. దీన్ని చూసి మామూలు జనం నాగస్వరానికి అనుగుణంగా పాము నృత్యం చేస్తుందనుకుంటారు. పెద్దలు పిల్లలు పాముల ఆట అనుకుంటున్న ఈ ప్రదర్శన చూసి చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి రెండు కోడె త్రాచుల్ని ఎదురెదురుగా ఉంచి నాగస్వరాన్ని ఊది వినోదం కలిగిస్తూ ఉంటారు పాములవారు. వాటికి తోడు వీరు కూడా నృత్యం చేస్తారు. విషం తలకెక్కినట్లు తుళ్ళుతూ సొక్కిపోవడం, నృత్యం చేస్తూ తర్వాత పాముకాటు నుంచి బయటపడ్డట్టు ఆనందాతిశయంతో ఉప్పొంగిపోయి నృత్యం చేయ మొదలుపెడతారు. నల్లతాచు, గోధుమవర్ణపు తాచువంటి రకాలను కష్టపడి పట్టుకొని జనం ముందు ప్రదర్శించడంతో చూసేవారు అబ్బురపడతారు. పాముకాటుకు పనిచేస్తాయని చెబుతూ కొన్ని మూలికలను, ఇతర మందులను ప్రజలకు అమ్ముతూ ఊళ్ళ వెంట తిరుగుతూ జీవనం సాగిస్తారు.
మోడీల ప్రదర్శన
పాములాటకు తోడు మోడీల ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. మోడీల పోటీలకు పూర్వం ప్రజలు తండోపతండాలుగా హాజరయ్యేవారు. ఈ ప్రదర్శనలు జాతర్ల సందర్భంలో సంతలు జరిగేటప్పుడు ఉంటాయి. చాలా కాలం క్రితం ఈ మోడీల ప్రదర్శనలు పాములవారి ముఠాల మధ్యనే జరిగేవి. పెద్దేటి గొల్లలు మొదలైనవారు కూడా ఈ ప్రదర్శనలు చేసేవారు. మోడీలు ప్రదర్శించే కళాకారులు ఇంద్రజాలం, హస్తలాఘవం విద్యల్లోను ఆరితేరి ఉంటారు. గ్రామం మధ్యలోనో లేక విశాలమైన మైదానంలోనో మోడీ ప్రదర్శన జరిగేది. ఇరుపక్షాలవారు హస్తలాఘవాన్ని ప్రదర్శించి తమ మంత్ర, తంత్ర విద్యలను ప్రదర్శించేవారు.
ఇరుపక్షాలవారు గుడారాలను నిర్మించుకునేవారు. గుడారంలో ఒక గొయ్యి తియ్యటం, కుంకుమ, పసుపు కలిపిన రంగునీళ్ళలో ముంచిన కొబ్బరికాయను దానిలో పెట్టడం చేస్తారు. మోడీ ప్రారంభం కాగానే పాము బుర్ర ఊదుతూ గుడారానికి ముందున్న గీతను దాటి గుడారపు గుంటలో ఉన్న కొబ్బరికాయను తియ్యాలి. ఆ ప్రాంతానికి ఎవ్వరూ రాకూడదు. మంత్రాలను వల్లిస్తూ, మంత్రించిన కందులను చల్లుతారు. అవి కందిరీగల్లాగా కుట్టినట్లు అక్కడికి వచ్చిన వ్యక్తి బాధపడ్తాడు. రెండు జట్లూ మంత్ర ప్రయోగాలు చేసుకొంటూ గుంటలోని కొబ్బరికాయను తీయడానికి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎవరు కొబ్బరికాయను ముందుగా తీస్తారో వారు గెలిచినట్లు లెక్క. నాగస్వరాలు, డప్పువాయిద్యాలతో మోడీచేసే వ్యక్తులను ఉత్తేజపరుస్తారు. ఇరుజట్లు ధరించిన తలపాగాలు, నల్లకోట్లు, అంగవస్త్రాలను గమనిస్తే చూచేవారికి అది భయంకర పోరాటంగా కనిపిస్తుంది. రూపాయలను సృష్టించడం, రూపాయ నోటును తెల్ల కాగితంగా మార్చడం, వేపాకులను దూసి తేళ్ళను సృష్టించడం, పొడి ఇసుకను నీళ్ళలో కలిపి తడిపి మళ్ళీ పొడి ఇసుకనే తీయటం, తడిబట్ట మీద ముడి జొన్నలు చల్లి వాటిని పేలాలుగా వేయించడం, మండే నిప్పును మింగటం, నాలుకను కోసుకున్నట్లు చూపించటం... ఇట్లా ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలతో కనికట్టు విద్యను ప్రదర్శించి చూపరులను విస్మయానికి గురిచేస్తారు. ఇవన్నీ పాములవారు ప్రదర్శిస్తారు. ప్రముఖ పరిశోధకురాలు వకుళాభరణం లలిత పాములవారి జీవనంపై చేసిన పరిశోధన వల్ల ఎన్నో విషయాలు బయటి ప్రపంచానికి తెలిసివచ్చాయి.
కళాత్మక, ఆశ్చర్యకరమైన విన్యాసాలు చేసే పాములవారి జీవనం ఇప్పుడు భయానకంగా ఉంది. పాములను ఆడించడం చట్టప్రకారం నేరమయిపోయింది. పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వ్యవసాయం చేద్దామన్నా భూముల్లేవు. ప్రస్తుతం దీంతో పాములవారు చాలామంది వ్యవసాయ కూలీలుగా బతుకులీడుస్తున్నారు. వారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.
-మౌక్తిక్
Authorization