భారత దేశంలో భక్తి ఉద్యమం తలెత్తేనాటికి బౌద్ధ, జైన మతాలు బాగా క్షీణదశలో ఉన్నాయి.ఈ కాలంలో బౌద్ధమతం తన మాతృ దేశం నుంచి దాదాపు మటుమాయమయింది. అదే సమయంలో హిందూ మత పనరుజ్జీవనం జరిగింది. ఈ కాలంలో శివునికి, విష్ణువుకి సంబంధించిన ప్రార్థనలు ఎక్కువయ్యాయి. ఈ ఇద్దరు దేవుళ్ల భక్తిని ప్రోత్సహిస్తూ అనేక మత ఉద్యమాలు కూడా నడిచాయి. మేధావుల స్థాయిలో బౌద్ధ, జైన మత సిద్ధాంతాలను సవాలు చేయటం పరిపాటయింది. శివుడికీ, విష్ణువుకీ సంబంధించిన ప్రార్థనల ప్రాబల్యం పెరిగి సూర్యుడు, బ్రహ్మవంటి దేవుళ్లను పూజించే పద్ధతి బాగా తగ్గిపోయింది. తూర్పు భారత దేశంలో శక్తి ఆరాధన పుంజుకుంది. సృష్టికి మూలం స్త్రీ మూర్తే అన్న ఆలోచనా ధోరణి తూర్పు ప్రాంతంలో విస్తరించింది. హిందువులు ఈ స్త్రీ మూర్తిని దుర్గ, కాళి రూపాల్లో శివుని అర్థ భాగంగా పూజించేవారు. దాదాపు ఈ సమయంలోనే శంకరాచార్యుడు అప్పటి వరకు ఉన్న హిందు విశ్వాసాలను వ్యతిరేకిస్తూ తనదైన తత్వాన్ని ప్రచారం చేయడం ప్రారంభించాడు.
భారతీయ తాత్విక చింతనకు మహోన్నతమైన సేవలు అందించిన శంకరాచార్యుణ్ని భారతీయ తాత్వికుల్లో అత్యుత్తముడుగా పేర్కొంటారు. శంకరాచార్యుని తాత్విక చింతనలోని వైవిధ్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈయన అద్వైత వాదాన్ని ప్రవేశపెట్టాడు. అద్వైత వాదం నిర్గుణ బ్రహ్మను విశ్వసిస్తుంది. వేదాలు లోపాలకు అతీతం కాదని విశ్వసించిన మొదటి భారతీయ తత్వవేత్త శంకరుడు. ఉపనిషత్ సిద్ధాంతాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. భక్తి మార్గం, కర్మ మార్గాలతో పాటు ముక్తి సాధనకు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యుడు ప్రవచించాడు.
అద్వైతం ప్రకారం భగవంతుడు నిర్గుణ బ్రహ్మ. అతనికి రూపం లేదు. గుణం లేదు. అతడు నిర్వచనానికి అతీతుడు. ఈ సిద్ధాంతం ఉపనిషత్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది. బ్రహ్మ కోసం తపస్సు చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారమవుతుంది. ఆత్మకు, పరమాత్మకు ఉండే సంబంధం అప్పుడే బోధపడుతుంది. జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు. ఉపనిషత్తులకు శంకరాచార్యుడు భాష్యాలను రాయడమే కాకుండా బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశాడు. ఆయన రచనల్లో తాను విశ్వసిస్తున్న అద్వైత మార్గాల గురించి వివరించాడు. ఆత్మను అర్థం చేసుకోవ డానికి ఆయన ఒక గ్రంథం రచించాడు.
ఆత్మకు, పరమాత్మకు భేదం లేదని విశ్వసిం చిన వ్యక్తి శంకరాచార్య. ఆత్మ నిర్గుణ బ్రహ్మతో సమానమైందే నని ఆయన నమ్మకం. ఈ ఆత్మ, పరమాత్మల ఏక రూపత గురించి తెలియనందు వల్ల మానవులు నానా యాతనలు పడుతున్నారని ఆయన వాదన. అవిద్యవల్ల, భ్రమల వల్ల మానవుడు ఏక రూపం ఉన్న చోట్ల అనేక రూపాలను చూస్తున్నాడని, శంకర ఉవాచ. భగవంతుడు ఒక్కడే అయినా మానవుడు అనేకమంది భగవత్ స్వరూపాలను దర్శించడానికి కూడా ఇదే కారణమని ఆయన విశ్వాసం. విద్య లేదా జ్ఞాన మార్గం ద్వారా మానవుడు తనను ఆవహిచి ఉన్న భ్రమల నుంచి బయటపడతాడని, భగవంతునికీ, తనకు ఉన్న ఏక రూపతను గుర్తిస్తాడని శంకరాచార్యుడు పేర్కొన్నాడు. మోక్షం అంటే ఇదేనని, ఉపనిషత్తులు ప్రవచించిన 'తత్వం-అసి' అర్థం ఇదేనని శంకరాచార్యుడు వివరించాడు. ఈ ఆత్మసాక్షాత్కారమనేది మరణానంతరం మాత్రమే సిద్ధించనవసరం లేదు. ఈ జీవిత కాలంలో కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించవచ్చునని పూర్వకర్మ బంధాలు విచ్ఛిన్నమయ్యేవరకు శరీరం ఉంటుందనీ ఆయన పేర్కొన్నాడు. ఇలా జీవన్ముఖుడైన వ్యక్తి బ్రహ్మలో ఐక్యం అయిపోతాడని, మళ్లీ అతడికి జన్మ, జరాబాధలుండవని శంకరుడు పేర్కొన్నాడు.
మానవుని ఆధ్యాత్మిక ప్రగతికి ఉత్తమ ప్రవర్తన, నైతిక జీవనం అత్యంతావశ్యకమని గౌతమ బుద్ధునిలాగే శంకరాచార్యుడూ విశ్వసించాడు. నైతిక జీవనం గడపలేని వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించలేడని శంకరాచార్యుడు పేర్కొన్నాడు. ఆత్మ సాక్షాత్కారానికి సరైన జ్ఞానంతోపాటు సన్మార్గం, రుజువర్తన అత్యంతావశ్యకాలని ఆయన స్పష్టం చేశాడు. కోర్కెల వల్లనే దుర్నడతకు అవకాశం ఏర్పడుతున్నదని, అందువల్ల కోర్కెలను పూర్తిగా విసర్జించాలని ఆయన ఉద్బోధించాడు.
-లత, కె.వి.పి