నాటి చరిత్రలో ఎన్నో అద్భుత విషయాలు దాగి ఉంటాయి. వాటిని వెలికితీసి నలుగురికీ తెలియజేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ప్రజలకు తమ చరిత్ర సంస్కృతుల పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఈ అవగాహన ఎన్నో చారిత్రక తప్పిదాలు జరగకుండా జనాన్ని కాపాడుతుంది. చారిత్రక భూగోళ విషయాల పట్ల ఎరుక మన ఘనమైన వారసత్వం పట్ల అనురక్తి పెరుగుదలకు కారణమవుతుంది. 'సపాదలక్షదేశం' అనేది మధ్యయుగాలనాటి పరిపాలనా ప్రాంతం. దీన్ని దాదాపు ఒక రాజ్యం అనే అర్థంలో సమకాలీన శాసనాలు వాడాయి. ఇంతకు సపాదలక్ష దేశం ఇప్పుడెక్కడ ఉన్నది? దీని ప్రత్యేకత ఏమిటి?
తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన రాజవంశాల్లో వేములవాడ చాళుక్యవంశం ఒకటి. ఈ వంశానికి చెందినవారిలో మొదటి వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750-775) చాలా పేరెన్నికగన్నవాడు. ఈయనను గొప్ప విజేతగా చెబుతారు. తురుష్క, యవన, బర్బర, కాశ్మీర, కాంభోజ, మగధ, మాళ్వ, కళింగ, గాంగ, పల్లవ, పాండ్య, కేరళ ప్రభువులు యుద్ధమల్లుని పాదపూజ చేశారని కొల్లిపర రాగిరేకులపై ఉన్న శాసనాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ తరువాతి శాసనాలు ప్రస్తావించాయి. అయితే పైన పేర్కొన్న దేశాల జాబితాను అవి పేర్కొనలేదు కాని అతడు సపాదలక్ష దేశాన్ని పాలించాడని, ఆదేశాన్ని మరెవరూ పాలించగలిగి ఉండేవారు కాదని, పోదన (నేటి నిజామాబాద్ జిల్లా బోధన్)లో ఒక పెద్ద నూనెను నింపిన చెరువులో అతడు తన ఏనుగులన్నింటినీ స్నానం చేయించాడని, దుర్గమమైన చిత్రకూట దుర్గాన్ని పట్టుకున్నాడని ఇవి పేర్కొన్నాయి. అయితే కన్నడంలో ఆదికవిగా పేరొందిన పంపడు రాసిన విక్రమార్జునవిజయం అనే గ్రంథం, పర్భనీలో లభించిన రాగిరేకు శాసనాలు చిత్రకూటపై అతడి విజయాలను పేర్కొనలేదు. కాని అతడు సపాదలక్ష దేశాన్ని పాలించాడని చెప్పాయి. విక్రమార్జునవిజయం అతడి ఏనుగుల సంఖ్య ఐదు వందలనీ, అవి ఒక కొలనులో కాదు ఎన్నో తైల తటాకాల్లో స్నానం చేశాయని చెప్తుంది.
సపాదలక్ష రాజస్థాన్లో ఉందా?
ఈ ఆధారాలు ప్రస్తావించిన సంఘటనల్లో, సపాదలక్ష దేశంపై పాలనే అతడు సాధించిన మొదటి విజయంగా భావించవచ్చు. ఇంతకు ఈ సపాదలక్ష దేశం ఎక్కడున్నట్లు? సోమదేవసూరి రచించిన యశస్తిలక వాఖ్యానకారుడు శ్రుతసాగరుడు సపాదలక్ష దేశం అశ్మాంతకలో ఉన్నదని చెప్పాడు. పాల్కురికి సోమనాథుడు కూడా తన పండితారాధ్య చరిత్రలో సపాదలక్షను సమాన అర్థంలో వాడాడు. అయితే దాన్ని నేపాల, కేదార, తిర్కర్తి, కాశ్మీర, కన్నోజ, కొంకణ, కళింగ రాజ్యాల సంఖ్యానుబంధాలు చెప్పడంకోసం ఉపయోగించడం జరిగింది. క్రీశ.శ.1050, 1051 నాటి గుజరాత్ చాళుక్యరాజు కుమారపాలుని చిత్తోర్ఘర్ శాసనంలో సపాదలక్ష పదం కనిపిస్తుంది. అందులో రాజు శాకంభరి పాలకుడిని జయించాడని, చిత్రకూట పాదంలోని శాలిపురంలో విడిది చేశాడని ఉంది. సపాదలక్షదేశాన్ని శాకంభరిగా గుర్తించారు. దీన్ని తూర్పు రాజస్థాన్ లోని సంభార్ ప్రాంతంగా గుర్తించారు. బహుశ చాళుక్యరాజు, రాష్ట్రకూట దంతిదుర్గుని సామంతునిగా మాళవ, లాట, టంక, సింధు ప్రాంతాలపై దండయాత్ర చేసినప్పుడు అతన్ని అనుసరించి వెళ్లి ఉండవచ్చు. అక్కడే సపాదలక్షపై దంతిదుర్గుడు అధికారం నెరపాడు. రాష్ట్రకూట శాసనాల్లోనూ ఈ విజయం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ చాళుక్యరాజు సహకారంతోనే నిస్సందేహంగా దంతిదుర్గుడు ఈ విజయాలను సాధించి ఉంటాడు. వినయాదిత్యుని వారసులు బహుశ పేరుకు మాత్రం రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్నారు. వినయాదిత్యుడు దంతిదుర్గున్లి సంబంధాలు స్నేహపూర్వకమైనవి. తూర్పు రాజస్థాన్ని సపాదలక్ష అని గుర్తించడంతో వినయాదిత్యుడు రాష్ట్రకూట సామంతుడనే అర్థం వస్తుంది. కానీ వినయాదిత్యుని తరువాత వచ్చిన అతని కుమారులెవరూ తూర్పు రాజస్థాన్ ప్రాంతాన్ని పాలించినట్లు ఎప్పుడూ చెప్పుకోలేదు. వారి పాలన ఎప్పుడూ తెలంగాణకు మాత్రమే పరిమితమయింది. అందువల్ల సపాదలక్ష అనేది తూర్పురాజస్థాన్లోని శాకంభరిగా గుర్తించడంలో ఔచిత్యం కనిపించదు. సపాదలక్ష దేశాలలో శాకంభరి ఒకటై ఉండవచ్చని కె సూర్యనారాయణ వంటి పరిశోధకులు అంటున్నారు. కళ్యాణి చాళుక్యులు వేములవాడలో వేయించిన శాసనం (క్రీ.శ. 1083) 'కొసవలంసవలక్షకె' (కన్నడంలో సపాదలక్ష)ని పేర్కొంది. అందులో ఒక భాగాన్నే ఆరవ విక్రమాదిత్యుని సేవలో ఉన్న ఒక నాయకుడి పాలనలో ఉన్నట్లు చెబుతున్నదది.
నిజామాబాదు-కరీంనగర్ ప్రాంతమే...
తెలంగాణలోని నిజామాబాదు, కరీంనగర్ జిల్లా ప్రాంతం సపాదలక్ష అని యం.వెంకటరమణయ్య వంటి పరిశోధకులు నిర్థారించారు. సపాదలక్ష దేశానికి ఉత్తరాన గోదావరి, ఆగేయాన బాలాఘాట్ పర్వతశ్రేణులు, తూర్పున మూసీనది, పశ్చిమాన బహుశ కృష్ణానది సరిహద్దులుగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.
సపాదలక్ష అంటే పన్నులు కట్టగలిగిన 125000 గ్రామాలు లేక యూనిట్లు అని అర్థం రాజుకు పన్నుగట్టగలిగిన గ్రామాలు ఇన్ని ఉండటం అప్పట్లో చాలా గొప్పవిషయం. చాలా గ్రామాలనుండి పన్నులు వసూలు చేశారని చెప్పడానికి సారవంతమైన భూములున్న ప్రాంతాన్ని సపాదలక్ష దేశం అని ఉండవచ్చు. ఈ సపాదలక్ష భ్రష్టరూపాన్ని 'సవాలక్ష'గా భావించవచ్చు. ఇప్పటికీ మన తెలుగు భాషలో 'సవాలక్ష'ను 'చాలా' అనే అర్థంలో వాడటం ఈ సందర్భంగా గమనార్హం. నిజామాబాదు, కరీంనగర్, ఆ పక్కనే ఉన్న మెదక్ ప్రాంతాలు ఇప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రాలుగా ఉన్నాయి.పోదన లేక పౌధన్యపురం అని పిలిచిన నేటి బోధన్ను పూర్వం 'బహుధాన్యపురం' అనికూడా పిలిచేవారని ఇప్పటికీ స్థానికులు చెబుతున్నారు. అంటే అత్యధిక పంటలతో ఆ ఊరు కళకలలాడుతూ ఉండేదన్నమాట. కరీంనగర్ని కూడా పూర్వం ఇదే పేరుతో పిలిచేవారంటారు. అట్లాగే మెదక్ని మెతుకు సీమ లేక మెతుకు దుర్గం అని పిలిచేవారు. ఈ పాత పేర్లను బట్టి ఈ ప్రాంతమే పరిశోధకులు గుర్తించినట్లు సపాదలక్ష దేశమై ఉంటుంది.
-జి.శివరామకృష్ణయ్య
Authorization