మన చరిత్ర, సంస్కృతులు తెలుసుకోవడానికి ప్రాచీన శాసనములు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మానవుడు లిపి, భాషలను ఉపయోగించిన నాటి నుండి ఆధునిక యుగం వరకు జరిగిన అనేక పరిణామాలను తెలుసుకోవాలంటే శాసనాలే ఆధారం. వీటిని చదవడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. ప్రాచీన లిపి, భాషలపై పట్టు ఉన్నవారే వీటిని చదవగలుగుతారు. మనదేశంలో అత్యంత ప్రాచీన శాసనాలు మౌర్య చక్రవర్తి అశోకుడు వేయించినవిగా నిర్ణయించారు. ఇవి క్రీస్తుకు పూర్వం నాటివి. వీటి తర్వాత ప్రాచీనతలో రెండో స్థానంలో నిలిచినది పశ్చిమ క్షాత్రప రాజు రుద్రదమనుడు వేయించిన సంస్కృత శాసనం. గిర్నార్ కొండకు దగ్గరలో ఉన్న ఒక రాతిపై జునాగఢ్ పట్టణానికి సమీపం(గుజరాత్)లో ఈ శాసనం ఉంది. క్రీస్తుశకం 150వ సంవత్సరం నాటి ఈ శాసనం నాటి రాచరిక వ్యవస్థ, ప్రజా సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి రాజు తీసుకునే చర్యలు, సమకాలీన ధర్మం, యుద్ధాలు వంటి అనేక విషయాలను పేర్కొన్నది. అశోకుడు వేయించిన శాసనానికి పై భాగంలోనే ఈ శాసనం ఉండటం గమనార్హం.
రుద్రదమనుని గిర్నార్ శాసనం బ్రాహ్మీ లిపిలో ఉంది. ఈ శాసనాన్ని బ్రిటీష్వాళ్ల కాలంలో ఇంగ్లీషులోకి అనువదించారు. ఆ తర్వాత అనేక స్థానిక భాషల్లోకి అవసరం వచ్చినవారు తర్జుమా చేసుకున్నారు. అట్లా తెలుగులోకి అవసరం మేరకు తర్జుమా అయిన శాసన ప్రతి ఇది. శాసనం ఉన్న రాయి బాగా అరిగిపోవడం వల్లనో లేక ఎవరో ప్రయత్న పూర్వకంగా చెక్కడం వల్లనో అక్కడక్కడా శాసనం అక్షరాలు చెరిగిపోయాయి. అటువంటి చోట శాసన పరిశోధకులు సందర్భఆనికి అనుగుణంగా ఊహించిన పదాలను చేర్చారు. అటువంటి పదాలను బ్రాకెట్లలో ఉంచారు. కొన్ని పదాలు ఊహించలేనప్పుడు ... ఇట్లా చుక్కలు పెట్టి వదిలేశారు. గమనించగలరు.
గిరినగర (ఆధునిక గిర్నార్)లోని సుదర్శన సరస్సు....దీని కట్ట నిర్మాణం కొండను సవాలుచేసేదిగా ఉన్నది, ఎందుకంటే వెడల్పులోను, పొడవులోను, ఎత్తులోను దీని కట్టలు ఏమాత్రం సందు లేకుండా రాయిలాగా అత్యంత పటిష్టంగా నిర్మిత మయ్యాయి....సహజమైన ఆనకట్టవలె నిలిచింది. ... చక్కగా తీర్చిదిద్దినట్లున్న కాల్వలు (పర్నాలీ), మురుగునీటి కాల్వలు, వ్యర్థపదార్థాలను నిరోధించే సాధనాలు... మూడు విభాగాలు... ఇతర సౌకర్యాలు (ఇప్పటికీ) ప్రశస్తమైన స్థితిలో ఉన్నాయి.
సరిగ్గా యిదే (సరస్సును) -ఎవరి పేరునైతే మర్యాదస్తులు పలుమార్లు పలుకుతారో (రాజు, క్షత్రప, ప్రభువు, జయదమన పుత్రుడు) అయిన, రాజు (రాజేణ) మహాక్షాత్రప రుద్రదమనుని పాలనలోని మార్గశీర్ష మాసం కృష్ణపక్షం ప్రథమంలో, అంటే, డెబ్బరు రెండవ-72వ-సంవత్సరం (క్రీస్తు శకం150, నవంబరు 16).... పౌత్రుడు ఎవరిపేరునైతే శుభప్రదంగా భావిస్తారో ఆ రాజు మహాక్షాత్రప స్వామి చస్తన... మేఘాలు సంతత ధారగా వర్షాన్ని కురిపించడంతో, సువర్ణసికతా, పలాషినితో పాటు ఉర్జయత్ పర్వతంపైని యితర సెలయేళ్లు ఉప్పొంగి వెల్లువెత్తాయి- భూతలం మహాసముద్రంగా మారిపోయింది. ఆనకట్ట (సేతువు) బద్దలయింది.... తగిన జాగ్రత్తలు (తీసుకున్న ప్పటికీ), నీరు -గాలివాన కారణంగా అల్లకల్లోలమై ప్రళయ భీకరంగా మారి ప్రపంచ ప్రళయం (యుగాంతం) అన్నట్లుగా అనిపించింది. పర్వత శిఖరాలను, నదుల ఒడ్డులను, గోపురాలను, మిద్దెలను, వాకిళ్లను, నివాసాలను బద్దలుకొట్టు కుంటూ-చెల్లాచెదురు చేస్తూ, ముక్కలు ముక్కలు చేస్తూ.... రాళ్లు, చెట్లు, పొదలు, లతలు విసిరివేసినట్లయ్యాయి. ఆ రకంగా (ఆనకట్ట) కుప్పకూలి నదీగర్భంలో కలిసిపోయింది. 420 మూరల పొడవు, దాదాపు అంతే వెడల్పు, 75 మూరల లోతు పరిమాణంలో పడిన గండీ నుంచి నీరంతా వెళ్లిపోయింది. దానితో ఆ (సరస్సు) ఇసుక ఎడారిలా (మారి) అత్యంత వికారంగా మారింది....
ఈ ఆదేశాల ప్రకారం... (సరస్సును)... మౌర్య రాజేన చంద్ర గుప్తుని ఏలుబడిలోని ప్రాంతీయ (రాష్ట్రీయ) పాలకుడు వైశ్య, పుష్యగుప్త నిర్మాణం చేశాడు. ... మౌర్యశోకుని కోసం యవన రాజు తుషాస్ఫ కాల్వలను తవ్వించాడు. ....ఆదేశాల ప్రకారం రాజుకి తగినట్లే నిర్మాణం జరిగింది. ఈ శిథిలాలలో విశాలమైన ఆనకట్ట జాడలు కనపడుతున్నాయి.
...(రుద్రదమనుడు) ఎవరైతే గర్భంలో ఉన్నప్పటి నుండి, చెక్కుచెదరని, ఉత్కృష్టమైన రాచరిక అదృష్టం (రాజ్యలక్ష్మి) కారణాన, అతనిని అన్ని కులాలు (సర్వవర్ణాలు) ఆశ్రయించుకొని, తమకు రక్షణ కల్పించే తమ ప్రభువుగా ఎంచుకున్నాయో; యుద్ధంలో మినహా మనుష్య వధకు దూరంగా ఉంటానని ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో, అతని జీవితంలో తుదిశ్వాస వరకు దానిని నిజం చేసినవాడు; ఎవరైతే కనికరం (చూపారో)... సముడైన విరోధిముఖాముఖి తారసపడినప్పుడు దెబ్బను ఎదుర్కొనడంలో విఫలం కానివాడు; వేరే ఎవరైతే జనపదుల జీవనానికి అభయాన్ని ప్రసాదించారో, ఆయనముందు ప్రమాణాన్ని ఆచరించినవారికి, వారి ఇచ్ఛ ప్రకారం నడుచుకున్నవాడు; ఎవరైతే నగర, నిగమ, జనపదాలకు ప్రభువో ఎవరైతే దస్యుల, సర్పముల, అడవి మృగముల, వ్యాధుల ఇంకా అలాంటివాటి భయం లేకుండా ఉన్నారో, ఎక్కడైతే మొత్తం తూర్పు, పశ్చిమ అకరావంతీ అనూపదేశము, ఆనర్త, సురాష్ట్ర,స్వభ్రమరు, కచ్ఛ, సింధు-సౌవీర, కుకుర, అపరాంత, నిషాద, ప్రాంతాలన్నీ ఆయన తన శౌర్య పరాక్రమాలతో సంపాదించుకున్నవే. ఎక్కడైతే ఆయన బలంతో (సంపద), సౌఖ్యములను (నిత్యం పొందుతున్నాడో ; క్షత్రియ లోకంలో నాయకులమన్న గర్వంతో లొంగుబాటుకు ఒప్పని యౌధేయులను ఎవరైతే శక్తితో విధ్వంసం చేశారో; ఎవరైతే దక్షిణాపథ ప్రభువైన శాతకర్ణిని ధర్మపోరాటంలో రెండుసార్లు ఓడించి సత్గౌరవాన్ని (పొందారో)... ; ఎవరైతే రాజ్యాన్ని కోల్పోయిన రాజులను తిరిగి సింహాసనాసీనులను కావించారో, ఎవరైతే దక్షిణ హస్తాన్ని పైకెత్తడంద్వారా ధర్మానికి గట్టిగా కట్టుబడి వున్నారో; ఎవరైతే వ్యాకరణం (శబ్దార్థ), సంగీతం (గాంధర్వ), తర్కం (న్యాయ) తదితర మహాశాస్త్రాలను (విద్య) అధ్యయనం చేసి ధారణ చేసి విశేష ప్రఖ్యాతి గాంచారో; ఎవరైతే...అశ్వ, గజ, రథములను నడపటంలోను, కత్తి-డాలు, మల్ల యుద్ధం తదితరాలలోనూ... వేగంగా, సమర్థంగా శత్రువులను ఎదిరించడంలోను ప్రవీణులో; ఎవరైతే ప్రతి నిత్యం కానుకలను, బిరుదులను ప్రసాదించే అలవాటును కలిగి ఉన్నారో, ఎవరి ధర్మాగారమైతే ధర్మబద్ధంగా పొందిన పన్నులు (బలి), శిస్తు (శుల్క), వాటాలతో పుష్కలంగా నిండి, బంగారం, వెండి, రత్నములు, గరుడ పచ్చల రాశులతో నిండి ఉన్నదో, ఎవరి.... గద్య, పద్యములు తేటయై, ఆమోదయోగ్యమై, మధురమై, మనోహరమై, సుందరమై, చక్కని పదవినియోగంతోను, అలంకారాలతోను అలరారుతున్నవో; ఎవరి సుందర కాయమైతే నిడివితోపాటు గాత్రము, నడక, వర్ణము, సౌష్టవము వంటి శుభ చిహ్నాలను కలిగి ఉన్నదో, ఎవరైతే మహాక్షాత్రప బిరుదును స్వయంగా సముపార్జించుకున్నారో, ఎవరైతే స్వయంవరాలలో రాకుమార్తెలు వేసిన పుష్పమాలికలతో అలంకృతమయ్యారో-అతను మహాక్షాత్రప రుద్రదమనుడు, సహస్ర వర్షాలపాటు గో బ్రాహ్మణులు, మత ప్రాభవములు వృద్ధి పొందేలా - పన్నులు (కర), బలవంతపు చాకిరి (విష్టి), నిర్బంధ దానాదులు (ప్రణయక్రియ)- పట్టణ, గ్రామీణ, ప్రజలను (పౌర జానపద జనములు) అణచివేయకుండ, తన ధనాగారంలోని అపార ధనాన్ని వెచ్చించి ఆనకట్ట (సేతువు)ను వెడల్పులోనూ, పొడవులోనూ మూడు రెట్లు బలంగా ... యీ (సరస్సును) మరింత సుందరంగా తీర్చిదిద్దాడు.
యీ విషయంలో మహాక్షాత్రప మంత్రులు (మతి-సచివ), పాలనాధికారులు (కర్మ-సచివ), సంపూర్ణమైన అర్హతలున్న మంత్రులు (అమాత్యులు) కలసి బ్రహ్మాండమైన గండి పడినందున దానిని బాగుచేసే పని వ్యర్థమని తలచారు, పని ప్రారంభాన్ని వ్యతిరేకించారు. ఆనకట్టను పునర్నిర్మించాలని ప్రజలు అభ్యర్థించడంతో, పట్టణ, గ్రామ ప్రజల సంక్షేమంకోసం (పౌర-జానపద జనులు) ఆనర్త, సురాష్ట్రలను పాలించేటందుకై మంత్రిసత్తముడైన (అమాత్య) పహ్లవ, కులైప పుత్రుడు సువిసఖలను రాజు నియమించాడు- వీరు సరియైన విధానాల ద్వారా (వ్యవహార) ప్రాపంచిక విషయాల గురించిన ఆలోచనలు (అర్థ), ఆధ్యాత్మిక (ధర్మ) సంబంధాలను (ప్రజలతో) పెంచుకు న్నారు. ఎవరైతే శక్తివంతులో, సహనపరులో, నిస్సంశయాత్మకులో, నిగర్వులో, కులీనులో, అక్రమార్జనకు ఆశపడరో (ఆహార్య) అటువంటి వ్యక్తి, సుపరిపాలనతో తమ యజమాని ఆత్మిక ఘనతను, ప్రతిభను, కీర్తిని పెంచుతారు.
పై శాసనంలో పేర్కొన్న శాసనాన్ని బట్టి దాదాపు రెండువేల ఏండ్ల క్రితమే భారత దేశంలో పెద్ద పెద్ద చెరువులు (సరస్సులు) తవ్వించి మరమ్మత్తులు చేయించేవారని అర్థమవుతున్నది. కాకతీయులు, విజయనగర రాజుల కాలంనాటి చెరువుల తవ్వకం, నిర్వహణకు సంబంధించిన శాసనాలు కోకొల్లలు. వీటిని చూసినప్పుడు కేవలం వెయ్యేండ్ల క్రితం నాడు తప్ప అంతకు పూర్వం తటాక నిర్మాణం గురించిన విశేషాలు లేవేమో అనుకుంటారు సామాన్య జనం. రాజ్యాలు, నగరాలు కేవలం నదులు, సెలయేళ్ల దాపుల్లోనే వర్థిల్లాయని చాలామంది అనుకుంటారు. నిజానికి అతి ప్రాచీన కాలం నుంచి చెరువులు, బావుల త్వకం ఉన్నది. అందుకు మంచి ఉదాహరణ రుద్రదమనుడు మరమ్మత్తులు చేయించిన సుదర్శన తటాకం లేక సరస్సు. ఆ కాలంలో వచ్చిన వరదల భయంకర స్వరూపాన్ని కూడా ఈ శాసనం తెలియజేసింది. రెండు వేల ఏండ్ల క్రితమే చెరువులో కలవకూడని వ్యర్థాలను నిరోధించే సాధనాలను ఉపయోగించినట్లు ఈ శాసనం పేర్కొంది. ఇంత ఆధునిక కాలంలో కూడా మన పాలకులకు ఈ ఎరుక లేకుండా పోయింది. భయంకరమైన కాలుష్యాలను యథేచ్ఛగా చెరువులు, సరస్సుల్లోకి వదిలివేయడం మామూలయిపోయింది.
-జి.శివరామకృష్ణయ్య
7702508259
Authorization