ఏ మనిషికైనా తాను కురూపి అనే భావం కలిగిందంటే అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది స్త్రీ పురుషులు ఇరువురికీ వర్తించే మానసిక లక్షణం. ఎదుటివారికి ఎట్లా కనిపించినా తమకు తాము అందంగా ఉన్నామనే (వికారంగా లేమని) ప్రతివారూ భావిస్తారు. ఉన్నంతలో మంచి బట్టలు, నగలు ధరించడం, జుట్టును రకరకాలుగా దువ్వుకోవడం, కాస్మొటిక్స్ని వాడటం... ఇట్లాంటివన్నీ తమ అందాన్ని పెంచుకొనే పనిలో భాగంగానే చేస్తారనేది వాస్తవదూరం కాదు. ఇందులో బట్టలు ధరించడం వంటివి అవసరాలుగా ప్రారంభమైనా చివరికి అందాన్ని ప్రోదిచేసే రూపాన్ని సంతరించుకున్నాయని గుర్తించాలి.
అలంకరణ అనేది మానవునికి మాత్రమే సాధ్యమైన పని. అది అతడి మెదడులో నుంచి మాత్రమే పుట్టిన ఆలోచన. ప్రాచీన కాలం నుండి మానవుడు తనను తాను అలంక రించుకొని ఎదుటివారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనిషికి సహజంగానే అలంకరణ పట్ల జిజ్ఞాస ఎక్కువ. అసలు కట్టుకోవడానికి బట్టలే లేని కాలం నుంచి కొత్త కొత్త డిజైన్లు, మెటీరియల్స్తో అద్భుత మైన దుస్తులు, నగలు, కాస్మొటిక్స్ ఉన్న నేటి కాలం వరకు ఉన్న పరిణామాన్ని పరికిస్తే ఔరా మనిషి ఎంత తెలివి మీరాడు అనిపిస్తుంది. పురావస్తు శాఖవారు జరిపిన తవ్వకాల్లో వేల ఏండ్ల క్రితం నాటి మనుషుల కంకాళాలు బయటపడ్డాయి. ఇనుపయుగం, అంతకు ముందు ఉన్న రాతియుగ సమాధుల్లో ఈ మానవ అవశేషాలతోపాటు ఎన్నో రకాల పూసలు, గాజులు, కడియాలు, మట్టితో చేసిన పాత్రలు లభించడం తెలిసిందే. మనిషికి మరణం తరువాత మరో జన్మ ఉంటుందనే నమ్మకంతో ఆనాటి మానవుడు అతడు వాడుకున్న వస్తువులతో పాటు అలంకరించుకున్న వాటిని కూడా శవంతోపాటు పూడ్చిపెట్టేవారు. అంటే రాతియుగాల్లోనే మానవుడు తన దేహాన్ని రకరకాలుగా అలంకరించుకున్నట్లు ఈ పూసలు, కడియాలు లేదా గాజులు నిరూపిస్తున్నాయన్న మాట. అట్లా రాతి యుగాల్లో ప్రారంభమైన ఈ అలంకరణ తొలి చారిత్రక యుగం ఆ తరువాత యుగాల్లోనూ కొనసాగి ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నది. తెలంగాణలోని కొండాపూర్లో వేలాది పూసలు తవ్వకాల్లో బయటపడి శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ప్రాచీన కాలంలో మానవుడు ప్రకృతి నుంచి తన అలంకరణ సామగ్రిని ఎట్లా సమకూర్చుకున్నాడు అని చెప్పడానికి నేటి ఆదివాసీల అలంకరణ వస్తువులను చూస్తే అర్థమవుతుంది.
ప్రస్తుతం ఉన్న ఆచార సంప్రదాయాలు, పద్ధతులను పరిశీలించి ప్రాచీన మానవుని జీవనాన్ని వూహించడం లేక వ్యాఖ్యానించడం ఆధునిక పరిశోధనా పద్ధతుల్లో ఒకటి. దీన్నే 'ఎత్నొలాజికల్ స్టడీ' అంటారు. దీని ప్రకారం చూసినప్పుడు చాలామంది ఆదివాసీలు ఇప్పటికీ పక్షి ఈకలను, పూసలను, గవ్వలు, పూలు, ప్రకృతి వనరులనుంచి సేకరించిన రంగులను, లోహాలతో చేసిన నగలను ఉపయోగించి రకరకాలుగా అలంకరించుకోవడం కనిపిస్తుంది. ఈ అలంకరణ వారికి వంశపారం పర్యంగా తరం నుంచి తరానికి సంక్రమిస్తూ వస్తున్నదే. అందుకే ఒక జాతిని గుర్తుపట్టడానికి వారి భౌతిక జైవిక లక్షణాలనే కాక వారి దుస్తుల ధారణ, పచ్చబొట్లు, నగల అలంకరణ పద్ధతుల వంటివాటిని కూడా పరిగణణలోనికి తీసుకోవాలి. కొన్ని రకాల నగలను కొన్ని జాతులవారే ధరిస్తారు. కొద్ది మార్పులతో ఇవ్వాళ ఉన్న ఆదివాసీల పద్ధతులనే వీరి పూర్వులూ వేల ఏండ్ల క్రితం అనుసరించి ఉంటారు.
పూసల ధారణ కొత్తరాతియుగం నాటిది
ఎప్పుడో నవీన శిలాయుగంలో ప్రారంభమైన పూసల ధారణ ఇప్పటికీ భారతీయ సమాజంలో కనిపించడం విడ్డూరం కాదు. చిన్న పిల్లలకు దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం చేతులకు కడుతున్న పూసలు కొత్త రాతియుగ మానవుడు మనకు అందించిన ఆచారమే. అడవుల్లో పురుగు పుట్ట కాలికిందపడకుండా పక్కకు పంపించ డానికి ఆదిమానవుడు కాళ్లకు కట్టుకున్న గజ్జెల పట్టీలను ఇప్పుడు అలంకరణ నగగా వాడటం కనిపిస్తున్నది. పచ్చబొట్టులు శరీరమంతా పొడిపించు కొని చెట్టు పుట్టల్లో కలిసిపోయి క్రూర జంతువుల నుండి రక్షణ పొందారు నాటి మానవులు. అట్లాగే జంతువులను వేటాడటంలోనూ ఈ కామోప్లాగింగ్ పద్ధతి వారికి పనికివచ్చింది. ఇప్పుడు పచ్చబొట్టు పొడిపించుకోవడం కొందరు ఫ్యాషన్గా భావిస్తున్నారు. చాలామంది ఆదివాసీలకు ఈ పచ్చబొట్లు వారి ఆచారంలో భాగమైపోయాయి. స్త్రీలకు వడ్డాణం ఒక పెద్ద ఆభరణం. నిజానికి ఈ ఆభరణం బాలింతల కోసం ఉద్దేశించినది. ఇప్పుడంటే కనిపించడంలేదు కానీ యాభై, వందేళ్ల క్రితం వరకు వడ్డాణం వంటి నగ కాకపోయినా ప్రసవించిన స్త్రీ నడుముకు ఒక కండువా లేక తువ్వాలు వంటి వస్త్రాన్నైనా గట్టిగా కట్టేవారు. ప్రస్తుతం ఛత్తీస్గర్ రాష్ట్రంలోని సత్నామీలు ఇతర ఆదివాసీలే కాకుండా దాదాపు అన్ని కులాలవారు చవకబారు లోహంతో చేసిన 'కర్ధాన్' అనే ఆభరణాన్ని నడుముకు ధరిస్తారు. ఇది ఒకరకమైన వడ్డాణమే. ఎక్కువగా ప్రసవించిన స్త్రీలే ఈ వడ్డాణాలను ధరించడం బట్టి వడ్డాణం ధరించడమనే సప్రదాయం కేవలం బాలింత స్త్రీలకు పొట్ట పెరగకుండా ఉండేందుకు ఉపయోగించేవారని అర్థమవుతుంది. (ఇప్పటికీ ఈ ఉద్దేశంతోనే వడ్డాణానికి బదులు పల్లెల్లో బాలింతల నడుముకు గుడ్డను గట్టిగా బిగించి కట్టడం చూడవచ్చు). దీన్నిబట్టి ఏమర్థమవుతుంది? ఒక ప్రయోజనాన్ని ఆశించి ప్రవేశపెట్టిన వేషం, పనిముట్లు చివరికి నగలుగా, ఫ్యాషన్గా మారిపోయాయన్నమాట. అట్లాగని ప్రస్తుతం ఉన్న నగలన్నింటికీ ఈ అభిప్రాయాన్ని అంటగట్టాల్సిన అవసరంలేదు.
నగలను రికార్డు చేసే ప్రాజెక్టు
ఛత్తీస్గర్లో వాడుకలో ఉన్న నగలను రికార్డుచేసి భావితరాలకు అందించడానికి ఆ రాష్ట్ర పురావస్తు శాఖ ఒక ప్రాజెక్టును చేపట్టింది. కాలి బొటన వేలి నుంచి తల పిన్ను వరకు శరీరంలోని అన్ని భాగాల్లో ధరించే నగలను ఈ ప్రాజుక్టులో భాగంగా రికార్డుచేశారు. వాటిపేర్లు, మన తెలుగువారు ధరించే పేర్లకు తేడాలున్నా చాలావరకు (అంటే గాజులు, ముక్కు పుడకలు, బేసర్లు, కంఠహారాలు, వడ్డాణాలు, కాళ్లపట్టీలు వంటివి) మన తెలుగువారు ధరించే నగలను పోలినవే అక్కడ ధరిస్తున్నారు. అయితే ఇక్కడికన్నా భిన్నమైన నగలూ, నగలు తయారుచేసే లోహాలు అక్కడ కనిపిస్తాయి. ఇప్పటికీ ఇనుము, కంచుతో చేసిన నగలను ధరించడం చూడవచ్చు. ఈ నగలకు గిలత్ అనే లోహపు పైపూతను పూస్తారు. కాస్త డబ్బు ఉన్నవారు వెండి, బంగారు నగలు ధరిస్తారు. ఇప్పటికే అక్కడ పూర్వం ధరించిన నగలు క్రమంగా అదృశ్యమవడాన్ని గమనించి పురావస్తు శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇక్కడ కనిపించే నగలు, నగలు ధరించిన స్త్రీపురుషుల ఫొటోలు చాలావరకు ఆ ప్రాజెక్టులో భాగంగా తీసినవే.
మన నగలు, దుస్తుల ధారణలో వచ్చిన మార్పులు మన జీవితంలో వచ్చిన మార్పులను సూచిస్తాయి. గతిశీల మైన సమాజంలో మార్పులు సహజమే. ఈ మార్పులు ఉన్న సంస్కృతిని సుసంపన్నం చేయాలే కాని అసలు మూల సంస్కృతినే కూకటి వేళ్లతో పెకళించి వేయ కూడదు. అట్లా జరిగితే జాతులకు జాతులే తమ ఉనికిని కోల్పోబోతున్నట్లు అర్థంచేసుకోవాలి.
-జి.శివరామకృష్ణయ్య, 7702508259
Authorization