తెలంగాణలోని ఆశ్రిత జానపద కళారూపాల్లో గోత్రాల కళారూపం ప్రత్యేకమైంది.
ఈ కళారూపం కళాకారులు వంశపారంపర్యంగా మున్నూరు కాపుల వంశవృక్షాన్ని, గోత్రాన్ని కీర్తిస్తూ, తమ సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు. గోత్రం అంటే మూల పురుషుడని, గోవులను రక్షించువాడని అర్థాలున్నాయి. అయితే ఈ కళాకారులు కాపుల గోత్రాన్ని కీర్తించడం తోనే తమకు ఆ పేరు వచ్చిందని చెబుతారు. గోత్రాల కులం పుట్టుక గురించి గోత్రాల ఎల్లయ్య సంతోష్ ఇట్లా చెప్పారు...
పూర్వం పరాశర మహర్షి కొందరు మునులతో కలిసి తమకు కలిగిన ధర్మ సందేహాలను తీర్చుకోవడానికి మార్కండేయుని వద్దకు వెళతారు.అతనితో పరాశర మహర్షి తమకు కలిగిన సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటాడు. సృష్టి పుట్టుక, భూమి, ఆకాశం, సూర్య చంద్రులు, త్రిమూర్తుల జననం ఏ రకంగా జరిగిందని, వీరి గోత్రాలు నిర్మించిన గోత్ర రుషి ఎవరని అడుగుతాడు. అందుకు మార్కండేయుడు ఆ పరమాత్మ విశ్వసృష్టి చేయదలచి పంచముఖాలున్న పరబ్రహ్మను సృష్టించాడని, ఆ తర్వాత పరంజ్యోతి సంకల్పానుసారం ఆదిశక్తి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీ పార్వతులు సృష్టించబడినారని, త్రిమూర్తులకు పెళ్లి చేయాలని నిర్ణయించిన పరబ్రహ్మ మొదట త్రిమూర్తులను వారి గోత్రాలను నిర్మించు కొమ్మంటాడు. కానీ వారు తమకు తెలియదనగా, ఆ పరమాత్మనే క్షీరాబ్ది మట్టిని తెచ్చి గోత్రఋషిని సృష్టిస్తాడు. ఆ ఋషి పార్వతీపరమేశ్వరులకు వృషకళ గోత్రం, లక్ష్మీ నారాయణునికి శ్రీవత్స గోత్రం, బ్రహ్మ సరస్వతికి అంగీరస గోత్రం నిర్మిస్తాడు .అందుకు పరబ్రహ్మ త్రిమూర్తులచే గోత్ర కట్నం ను ఇప్పిస్తాడు ఆ తర్వాత పరబ్రహ్మ తాను పుట్టించిన 33 కోట్ల బ్రాహ్మణులకు ఋషులకు గోత్రాలు నిర్మించమని ఆదేశించాడు. ఆ రకంగా గోత్రఋషి సప్తర్షులకు దేవర్షులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహాల అధిపతులకు, పంచ భూతాలకు గోత్రాలను నిర్మిస్తాడు. అలాగే గోత్ర ఋషి చే బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులైన పద్మశాలీలకు మార్కండేయ గోత్రం, గౌడ వారికి కౌండిన్య గోత్రం, మున్నూరు కాపులకు పస్పునూల గోత్రం, ముది రాజులకు సోమ కుల గోత్రం కుమ్మరి కి అచ్యుత గోత్రం, యాదవులకు శివ నందన గోత్రం... ఇట్లా అనేక కులాలకు గోత్రాలను నిర్మించడంతో పరబ్రహ్మ మరియు ఆదిశక్తి గోత్ర ఋషిని గోత్రానికి సూత్రధారివని, సృష్టిలో జనులకు గోత్రం చెప్పిన నీకు కట్నం ఇచ్చి గౌరవించి ఆదరిస్తారని, గోత్ర ఋషిగా వర్ధిల్లుతారని దీవిస్తారు. అప్పటినుండి కులస్తులందరికీ గోత్రాలను చెప్పి కట్నం స్వీకరిస్తూ వస్తున్నారు. అయితే క్రమక్రమంగా గోత్రీకుల వంశం వృద్ధి చెందడంతో ఏ కులం వారికి ఆ కులం వారే ప్రత్యేకంగా గోత్రం చెప్పడానికి నిర్ణయింపబడ్డారు. ఇదే ఆచారంతో మున్నూరు కాపు కులానికి గోత్రాలవారు వారి గోత్రాన్ని వంశవృక్షాన్ని కీర్తిస్తూ, అతి బిడ్డలుగా వస్తున్నారు అయితే కేవలం గోత్రాన్ని వంశాన్ని కీర్తిస్తే కాపు వారి దగ్గర ఆదరణ లేకపోవడంతో భారత భాగవత రామాయణ కథలతో పాటు ఇతర కథలను నాటకాల రూపంలో ప్రదర్శిస్తూ మనుగడ సాగిస్తున్నారు.
మరొక కథనం లో సృష్టి పుట్టుక జరిగి త్రిమూర్తులు జన్మిస్తారు .ఆ తర్వాత సకలజనుల తో పాటుగా 12 కాపు కులాలు ఉద్భవిస్తాయి. ఆ పరమ శివుడు 116 గోత్రాలను పంచమని శింగర శిష్యున్ని సృష్టించి ఆదేశిస్తాడు. అయితే మున్నూరు కాపు కులం లో ఐదుగురు అన్నదమ్ముల తోబుట్టువుగా అంకెమ్మ అనే ఆడపడుచు పుడుతుంది. ఆమెకు అన్నదమ్ములు ఆస్తులు భూములు పంచ కపోవడంతో శివుణ్ణి అర్థిస్తుంది. పార్వతీ పరమేశ్వరుడు ఆమెను చూసి అర్థం చేసుకొని ,పార్వతి ఒక పసుపు ముద్ద చేసి శివుని చేతికిస్తుంది. అంకెమ్మకు ఏ ఆధారం లేదని శివుడు, ఆ పసుపుముద్దనే పస్పునూల గోత్రమై ఆమెకు ఆధారం అవుతుం దని, చేతికిచ్చి పంపుతాడు. ఆమె దాన్ని తీసుకెళ్లి దాచుకుంటుంది. అయితే ఆమె ఐదుగురు అన్నదమ్ముల్లో ని పెద్ద కొడుకు పెళ్లి చేసే సమయంలో పంతులు వారి గోత్రం చెప్పమంటాడు. అప్పుడు వారు గోత్రం లేదనటం తో పెళ్లి చేయ నంటాడు పంతులు. అప్పుడు అన్నద మ్ములు అంకెమ్మ దగ్గరికి వెళ్లి మాకు గోత్రం చెప్పమనగా, ఆమె పసుపు ముద్దను వారికి సగం ఇచ్చి పస్పునూల గోత్రం అని చెబుతుంది.ఈ రకంగా గోత్రం చెప్పడంతో అంకెమ్మ సంతతియే గోత్రాల వారిగా మారారని అంటారు. ఆ పసుపుముద్దను చెరి సగం తీసుకోవడంతో అందుకే గోత్రాల వారికి కూడా పస్పునూల గోత్రమే ఉంటుందని చెప్తారు.
కళాకారులు ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ప్రదర్శన నిమిత్తం సంచారం చేయడానికి కట్టడి గ్రామాలకు బయలుదేరుతారు. ఈ రకంగా వెళ్ళేముందు ఒక మంచి రోజున కళాకారులు మేళం గా ఏర్పడతారు. ఈ రోజున ప్రదర్శనలో ఉపయోగించే వాద్యాలు, ఆభరణాలు వస్తువులు, తాళపత్ర ప్రతులు అన్నింటిని నరసింహ స్వామి ముందు ఉంచి పూజ చేసుకుంటారు. దీనినే 'పెట్టే పూజ' అని అంటారు. ఇదే రోజు కళాకారులు కట్టడి గ్రామాల్లో వచ్చే ప్రతిఫలం పంపకాల గురించి మాట్లాడుకుంటారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కట్టడి గ్రామానికి వెళ్లి మొదట కాపుకుల పెద్దలను కలుస్తారు. తమకు వంశపారంపర్యంగా వస్తున్న హక్కులను గుర్తుచేసి, తమ దగ్గర ఉండే తాళపత్ర ప్రతులను రాగి పత్రాలను చూపించి భాగోతాలు ప్రదర్శించే విషయమై చర్చించుకుని త్యాగం నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత కళాకారులు కాపుల ప్రతి ఇంటికి వెళ్లి వారి వంశ వృక్షాన్ని ,గోత్రాన్ని ఈ రకంగా కీర్తిస్తారు.
''శ్రీ నాయ కాశీ వళ్లభ శేవ్య కులాది మారుంగాది పరుశ రాముండవు..., ఉత్తరాన జేద్యంబు గాలి చేతి కర్పూర మా హనుమంతుని చేతి హస్త రేఖలు రాసినారు. పాతాళ మందు పనులు చేపట్టినారు. కొండ్రవేలుగ దున్ని కోటికి పడగెత్తినారు. వాల్యం బులు దున్ని వెల రాజుల బండ్లు వెత్తించినారు... బసవ శంకర బిరుదు పసుపునూల గోత్రాన పేరుద్ధరించినారు. చాల్వాది గొల్వంగ, చంద్ర కూలాంకురం అర్థి దీవన, ఆడబిడ్డ దీవెన, శివ దీవెన, బ్రహ్మ దీవెన, బసవయ్య దీవెన, నోరులేని కైలిగంగ్యావు దీవెన కలిగి జెయీభవ, దిగ్విజయీభవ.''
కళాకారులు కాపు వారి ఇంటిలో భోజనం చేసే ముందు కూడా ఈ రకంగా దీవెన చేస్తారు.
''ధనం ధాన్యం పరాశబ్రహ్మ పుత్రలాభం శత సంవత్సరం మేదిని సాగనాంతం, కోటి కన్న ప్రధానం పచ్చని కల్యాణంబు, పచ్చని తోరణంబులు గౌరీ కంకణంబు శ్రీ శోభనంబు యాటాట పెళ్లిళ్లు మేలు కీర్తనలు ఏటికి ఎడ్లు గలిగి పాటికి బర్లు కలిగి చిన్న ల్యాగలు, మీ మంద బాగా సంపతి కలిగి కలవారై గంభీరులై సకలోమనుమనులై, జయం జయం మీ లోగిలి వర్ధిల్లవలె విజయీభవ దిగ్విజయీభవ.''
కళాకారులు భాగోతాలు ప్రదర్శించడానికి కాపు వారి అభిరుచి మేరకు వారు సూచించినట్టుగా రాత్రి గాని పగలు గాని ఏర్పాటు చేస్తారు .వేదికను కూడా వారి ఇష్టానుసారంగా కుల పెద్దలు చూసినట్టుగానే కుల పెద్ద ఇంటి దగ్గర గాని లేదా వాడలో గాని ఏర్పాటు చేస్తారు.
- డా.బాసని సురేష్.
9989417299
Authorization