గోత్రాలవారు వంశపారంపర్యంగా మున్నూరు కాపులనే కాకుండా పాకనాటి, మోటాటి, గోనె కాపు, పంటి రెడ్డి, సీమకాపు చిట్టెపు, చౌదరి, కమ్మ కాపు, సద్గుణాటి, రెడ్డి గాండ్ల అనే మిగతా కాపులకు గోత్రాలు చెప్పి గోత్ర కట్నం స్వీకరిస్తారు. వీరితో పాటుగా వెలమల గోత్రాలను కీర్తించి కూడా గోత్ర కట్నం స్వీకరించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం కళాకారులు రెడ్డి, మున్నూరు కాపు, గోనె కాపు, చౌదరి కాపు, రెడ్డి గాండ్లను మాత్రమే ఆశ్రయించి తమకు కట్టడి ఉన్న గ్రామాలకు వెళ్లి గోత్రాలను కీర్తించి ప్రతిఫలం పొందుతున్నారు. అయితే మున్నూరు కాపు వారికి ఒకే గోత్రం ఉండగా, మిగతా కాపులకు 116 గోత్రాలు ఉంటాయని వాటన్నింటిని భద్రపరుస్తూ కీర్తిస్తూ వస్తున్నామని వారంటున్నారు.'రాచవళంభు హరిశ్చంద్రాదిఫలంబభు రాంగ రాంగ మీకు వైభోగ ఫలంభు,మెత్తని వర భూములు మేలని ధనాలు చాలు గట్టిన సవాలక్ష గుర్రాలు,యాడికాడిక పూదోటలు మంచి ఎకరాన బావులు మడ విడ చిత్రాలు,మామిడి వనం తరాలు భూమేలే రెడ్డి రాజా భూపాలాదిగనుండమా శాలోకాది, మన్మధ... జై యీభవ, దిగ్విజయీభవ... అంటూ గోత్రాలవారు చౌదరి మరియు రెడ్డి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీవించి కీర్తిస్తారు.అలాగే వెలమలను ''కంచెల పద్మరాజుండమ గజ గొండ పరుశరామముండమ సోమ కుల పరశురాముండమ, అమరిం చిన దుర్గంభు...77 సింహాస నాలు, 77 రచ్చలు గలుగు రాజులు జై భవ, విజయీ భవ దిగ్విజయీభవ అంటూ దీవిస్తారు.కాలక్రమంలో దీవనలతో పాటు కథలు చెప్పి తాము ఆశ్రయించిన కులాలవారిని మొప్పించడం ప్రారంభించారు. వీరనాలు, ఉపంగం వాద్యాలు ఉపయోగించి మహాభారతం లోని 18 పర్వాలను కథా గాన రూపంలో ప్రదర్శించేవారు. ఈ రకంగా కూడా సరైన ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతం భాగోతాల రూపంలో ప్రదర్శనలిస్తూ ఆదరణ పొందుతున్నారు. ప్రదర్శనలో పదిమంది వరకు కళాకారులు ఉంటారు. ఆరోజు ప్రదర్శించే కథను బట్టి కళాకారులు ఆయా పాత్రల వేషాలను వారే స్వయంగా వేసుకుంటారు. కథలోని స్త్రీ పాత్రలను మగవారు ధరిస్తారు. భాగోతాన్ని ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రసవత్తరంగా ప్రదర్శిస్తారు. ప్రదర్శనలో బఫూన్ పాత్ర కీలకంగా ఉంటుంది. రంగస్థలం మీదికి వచ్చిన పాత్రను పరిచయం చేయడం, ప్రేక్షకులకు కలిగే సందేహాలను, తానే అడిగి నివృత్తి చేయడం, హాస్యాన్ని పండించడం ప్రధానంగా చేస్తాడు. ప్రదర్శనకు పవిత్రతను ఆపాదించడం కోసం కళాకారులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులను కూడా భాగస్వాములను చేస్తారు. భాగోతం రాత్రి సమయంలో ఆడినట్లయితే మొదటి రోజు విరామం తీసుకొని ఆ మరుసటి రోజు తిరిగి ఆడతారు. ఈ రకంగా కళాకారులు ఒక్కో గ్రామంలో పది నుండి పదిహేను రోజులు ప్రదర్శిస్తారు. వీరు ప్రదర్శించే భాగోతాలలో మహాభారతం, భాగవతం, రామా యణం కథలతో పాటుగా ఇతర కథలు ఉంటాయి. వీటిలో ద్రౌపదీ స్వయంవరం, కిరాతార్జునీయం, కీచకవధ, భద్రసేన, డాంగినేయం, ధర్మాంగద, సుభద్ర విలాసం, సతీ సావిత్రి, భక్త మార్కండేయ, సుందరాకాండ, వాలి సుగ్రీవ, బాలనాగమ్మ, భూకైలాసం వంటి కథలు సుమారుగా 30 వరకు భాగోతాల రూపంలో ఆడతారు. త్యాగం తీసుకొని ఆడే భాగోతాలు కాకుండా కాపు వారి ఇండ్లలో ఎవరైనా చనిపోయిన సందర్భంలో కూడా భాగోతాలు ఆడతారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థం గాకూడా కాపు వారు దానమిస్తారు.
తాళపత్ర ప్రతులుతమకు వంశపారంపర్యంగా సంక్రమించిన తాళపత్ర ప్రతులు తమ పూర్వీకులే, కాపుల వంశవృక్షాన్ని రాశారని కళాకారులు చెప్తారు. వాటిమీద కట్టడి గ్రామాల్లోని కాపుల ప్రతి కుటుంబం యొక్క వంశక్రమం, పూర్వీకుల పేర్లు సుమారుగా 30 తంతెల వరకు రాయబడి ఉంటాయి. అందుకే గోత్రాల ఎల్లయ్య దగ్గర ఉన్న తాళపత్ర ప్రతులు నాలుగు వందల సంవత్సరాల కింది వని చెప్పటం జరిగింది. కళాకారులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామాలకు వెళ్ళగానే, ఆ గ్రామంలోని కాపు వారికి కలిగిన పురుష సంతానాన్ని, కుటుంబాల సంఖ్యను రాసుకుంటారు. ఒకప్పుడు తాటికమ్మ లమీద కొన్ని సంవత్సరాలు రాసుకోగా, ఆ తర్వాత దస్త్రాల మీద కొన్ని సంవత్సరాలు రాసుకున్నారు. ప్రస్తుతం నేటితరం పుస్తకాలలో రాసుకుంటూ భద్రపరుస్తున్నారు. ఈ తాళపత్ర ప్రతులను కళాకారులు స్థిరాస్తి గా భావించి గౌరవంగా చూసుకుంటారు. అలాగే వీరి దగ్గర ఉండే రాగి పత్రాల మీద మున్నూరు కాపు వారిని గోత్రాలవారు అర్థించే హక్కు (మీ రాశి) ఉందని రాసి ఉంటుంది. ఈ రాగి పత్రాలను కూడా కళాకారులు పవిత్రంగా చూసుకొంటారు.
నేటి స్థితి
కళాకారులు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిలాపూర్, సైదాపూర్, బూడిద పల్లి వెంకటేశ్వర పల్లి, రేగులపల్లె, హుస్నాబాద్లోను; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాజిపల్లి, జైపూర్, బెజ్జాల, గెరక పల్లిలోను; సిద్దిపేట జిల్లా ఇబ్రహీం నగర్ లోను; నిజామాబాద్ పట్టణ కేంద్రంలోను; ఆర్మూర్, మంతిని, బోధన్, భీంగల్, రాగుట్ల లోను; రంగారెడ్డి లోను స్థిరపడి 12 బృందాలుగా ఏర్పడి కట్టడి గ్రామాల్లో ప్రదర్శనలిస్తూ మనుగడ సాగిస్తున్నారు. వీరు ఇంటిపేర్లలో కొంక్యాల, తిపిరిశెట్టి, బత్తిని, చిందం నరెడ్ల, తాళ్ల, చిలుకానీ, గందెశ్రీ, ఇటిక్యాల, మేళ్ల, మడికొండ, పడిగె, కుమ్మరి ఉన్నాయి. వీరి గోత్రం కూడా కాపు వారికి ఉండే పస్పునూల గోత్రమే ఉంటుంది. కానీ ఒకరికొకరు సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం లేదు. కేవలం కంచం పొత్తు మాత్రమే ఉంటుంది.
ఈ కళాకారులకు మహారాష్ట్రలోని బల్లార్షా చుట్టూ ప్రాంతాల్లో కూడా కట్టడి గ్రామాలు ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్లి వారి గోత్రాలను కీర్తించి వస్తారు. అలాగే తెలంగాణలో భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాంతంలోనే ఉండే రెడ్డి గాండ్ల దగ్గరికి వెళ్లి కూడా వారి గోత్రాలను కీర్తించి ప్రతిఫలం పొందటం జరుగు తుంది. ఇట్లా కళాకారులు తమకు వంశాను క్రమంగా సంక్రమిం చిన గ్రామాలకు వెళ్లి తమ సాంస్కృతిక నేపథ్యాన్ని అనుసరిస్తూ, తమ సంస్క తిని నిలుపుకునే ప్రయత్నం చేస్తూవస్తున్నారు. గోత్రాల కళాకారులు గత చరిత్రను వర్తమానంలో కీర్తిస్తూ, వర్తమాన చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా వంశవృక్షాలను భద్రపరుస్తూ వస్తున్నారు, అంతేగాక వారి పూర్వీికులను మననం చేస్తూ, వారిని పరిపరివిధాలుగా కీర్తిస్తూ, వారి సంస్కృతిని సజీవంగా నిలుపుతున్నారు. ఇదే క్రమంలో కళాకారులు ఇతిహాసాలను నాటకాల రూపంలో ప్రదర్శిస్తూ వినోదాన్ని కలిగిస్తూ మనుగడ సాగిస్తున్నారు. అయితే వారు తమ సంస్కృతీ పరంపరను వర్తమానంలో కొనసాగించడానికి అనేక అవరోధాలను ఎదిరిస్తూ వస్తున్నారు. కళాకారులకు ప్రదర్శనలు లేకుంటే ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొని ఉంది. వీరు వృత్తి గాయకులుగా, సంప్రదాయ కళాకారులుగా, ఆశ్రిత గాయకులుగా బతుకుతు న్నందువల్ల ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
Authorization