భారత దేశంలోనే కాక ప్రపంచం మొత్తం మీద చూసినప్పుడు ప్రాచీన రాజులు, చక్రవర్తులందరిలోనూ మొదటి స్థానంలో నిలిచేవాడు అశోకుడు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత విజయగర్వంతో సింహనాదాలు చేసే రాజుల గురించి తెలుసు. కాని తాను సాధించిన విజయం చూసి దు:ఖంతో కుంగిపోయినవాడు మాత్రం అశోకుడే. యుద్ధంలో లక్షలాదిమంది చనిపోవడం, క్షతగాత్రులవ్వడం, బందీలుగా చిక్కడం తలచుకొని... వారి బంధువులు, స్నేహితులు ఎంతగా బాధపడ్డారో కదా అని విలపించినవాడు అశోకుడు. యుద్ధ విజయం కంటే దమ్మ (బౌద్ధ ధర్మ) విజయమే అత్యున్నతమైనదని ఆయన భావించాడు. మౌర్య సామ్రాజ్య పట్టాభిషిక్తుడైన ఎనిమిదేండ్లకు కళింగ (ఒరిస్సా) రాజ్యాన్ని జయించిన తర్వాత కలిగిన పరివర్తనతో అశోకుడు అనేక శాసనాలు వేయించాడు. అందులో ఓ రాతిపై కాందహార్లో వేయించిన (మేజర్ రాక్ ఎడిక్ట్ 13) శాసనం ఒకటి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో ఉన్న ఈ శాసనం గ్రీకు, అరామిక్ భాషలో ఉన్నది. 14వ శాసనంతో పాటు 13వ శాసనం కూడా ఈ రెండు భాషల్లో జారీచేశాడు అశోకుడు. అశోకుని మానసిక పరివర్తనను, అతడి కాలపు నాటి సమాజం, ఇరుగుపొరుగు రాజులు, అతడు జయించిన రాజుల సమాచారం ఉన్న క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి చెందిన పదమూడవ రాతి శాసనం తెలుగు అనువాదం 'జాతర' పాఠకుల కోసం...
రాజా దేవానాంపియ పట్టాభిషేకం తర్వాత 8వ ఏట కళింగపై విజయం సాధించాడు. వంద వేలకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ మందిని బందీలుగా తీసుకెళ్లారు. వంద వేల మంది నరికివేయబడ్డారు (యుద్ధంలో), మరియు దాదాపు అంతమంది మరణించారు. కళింగులు లొంగిపోయిన తర్వాత దేవానాంపియలలో దమ్మ కోసం పోరాడాలన్న, దమ్మను సాధించాలన్న, దమ్మను బోధించాలన్న కొత్త దృష్టి తలెత్తింది. కళింగులను జయించినందుకు అతడిలో పశ్శాత్తాపం మొదలయింది. ఓడనివారిని ఓడించడమంటే సంహారం, మరణం, జనాన్ని (బందీలుగా) తరలించుకుపోవడం. ఇది బాధాకరం. తీవ్రమైన విషయం అని దేవానాం పియ భావించాడు. అంతకంటే తీవ్రమైన అంశం: అక్కడ నివసించేవారు బ్రాహ్మణులు, సమనులు (శమణులు), ఇతర తెగలు (పాసండులు), గృహస్తులు. వారిలో తమవారి పట్ల విధేయత, తల్లిదండ్రుల పట్ల విధేయత (కనిపిస్తూ) ఉంది; అక్కడ జీవించేవారిలో స్థితిమంతులు ఉన్నారు. వారు పెద్దల పట్ల విధేయత, స్నేహితులపట్ల, పరిచయస్తులు, సహచరులు, బంధువుల పట్ల; చివరకు బానిసలు, సేవకుల పట్ల దయ, దృఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. అలాంటివారు గాయపడ్డారు, చంపబడ్డారు, ఆప్తుల నుంచి ఎడబాటుకు గురిచేయబడ్డారు. లేదా, ఒకవేళ వారు అన్ని సువిధాలు (సువిహితినం) కలిగినవారై, స్నేహితుల, పరిచయస్తుల, సహచరుల, బంధువుల పట్ల నిరంతర (తరగని) అభిమానం గలవారైఉండి, ఆ ప్రియమైన వారిని దురదృష్టం వెంటాడటం వల్ల వారు కూడా బాధకు లోనయ్యారు. మనుషులందరికీ ఇది దురదృష్టం; దేవానాంపియకు ఇది తీవ్రమైన విషయం.
బ్రాహ్మణులు, సమనులు అనే వర్గాలు లేని యోనుల (గ్రీకుల) భూభాగం తప్ప మరే ఇతర భూభాగం (జనపదం) లేదు, ఏ ఇతర భూభాగం (జనపద) మనుషులు ఏదో ఒక వర్గంతో సంబంధం లేని ప్రాంతం లేదు, (ముందు) ప్రస్తావించిన వర్గాల పేర్లు తప్ప. అందువల్ల కళింగులు లొంగిపోయినప్పుడు, అంతమందిలో కేవలం వందో వంతు వెయ్యోవంతు మందే మరణించినా, ఊచకోతకు గురైనా, (బందీలుగా) తీసుకుపోబడినా, దేవానాంపియకు అది చాలా తీవ్రమైన విషయమే.
ఇవ్వాళ, ఎవరైనా ఒక హానికర కృత్యానికి పాల్పడితే, దేవానాంపియ అతడిని, క్షమించగలిగినవాడైతే, క్షమించాలని కోరుకుంటున్నాడు. దేవానాంపియ రాజ్యంలోని అడవి (అటవి) (జనులను) కూడా, సమాధాన పరచాలని ధ్యానానికి పురికొల్పాలని కోరుతున్నాడు. వారికి దేవానాంపియ పశ్ఛాత్తాంపం, బలం (కూడా) వివరించడం ద్వారా వారిని సిగ్గుపడేలా చేయవచ్చు. హతులు కాకుండా కాపాడవచ్చు. అన్ని ప్రాణుల పట్ల అహింస, స్వీయ నిగ్రహం, తటస్థభావం, ఆనందం ఉండాలని దేవానాంపియ కోరుకుంటాడు. ఇది (సాధించడం) ప్రధాన విజయంగా- ధమ్మవిజయంగా దేవానాంపియ భావిస్తాడు.
ఇక్కడ (తన భూభాగంలో), ఆరువందల యోజనాల (లీగులు) దూరాన ఎక్కడైతే ఆంటియోకస్ అనే యోన (గ్రీకు) రాజు, ఆ ఆంటియోకస్ ఎగువన గల నలుగురు రాజులు టాలమీ, ఆంటగోనస్, మగాస్, అలెగ్జాండర్లు ఉన్నారో ఆ (రాజవంశీక) ఇరుగుపొరుగులందరిలో, అలాగే ఇతర (దిగువ) దిక్కులో (ఉన్నటువంటి) చోట, పాండి యలతో పాటు తంబపమ్ని వరకూ గల భూభాగాలలో దేవానాంపియ దీన్ని, మరోసారి, జయించాడు.
అదేవిధంగా, ఇక్కడ రాజు పాలిత ప్రాంతాల్లోనూ యోన-కాంబోజ, నాభక-నాభపంతీ, భోజ-పితినిక మరియు ఆంధ్ర-పరింద ఇలా ప్రతి రాజ్యంలో దేవానాంపియ దమ్మబోధలు ఆచరిస్తుండేవారు. దేవానాంపియ దూతలు వెళ్లని ప్రాంతాల్లోనూ ఆయన దమ్మ ఆజ్ఞలు బోధనల గురించి విని దమ్మకు నిబద్ధులై ఉండేవారు. అలా సాధించిన విజయం అత్యున్నత విజయం. ఇటువంటి అత్యున్నత విజయం ఆనందాన్నిస్తుంది- ఈ ఆనందం దమ్మ పోరాటం ఫలితంగా వచ్చినటువంటిది. కానీ ఈ ఆనందం (దానికది) చిన్నవిషయమే. కానీ ఈ మహాపుణ్యం మించి ప్రపంచంలో లభించేదేమిటనే దేవానాంపియ ఆలోచిస్తాడు.
నా కుమారులు, మనుమలు మరొక కొత్త విజయం గురించి ఆలోచించక పోవచ్చునని భావించి, ఈ ప్రయోజనం ఆశించి ఈ దమ్మ శాసనం రాయబడింది. ఒక కొత్త విజయం వారిని ఆనందపరిచేట్లయితే సాధుత్వంతో, చిన్నపాటి శిక్షలతో సంతృప్తి పడాలి, విజయం అంటే, అది ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం ఆవల కూడా, దమ్మ విజయమై ఉండాలి. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం వెలుపల కూడా శ్రమలో పొందే సంతృప్తే వారి ఆనందం కావాలి.
-జాతర డెస్క్