ప్రాచీన కాలం నుంచి బంగారం అంటే విపరీతమైన మక్కువ చూపిస్తున్నాడు మనిషి. అందుకే దాన్ని సంపాదించడానికి రకరకాల పాట్లు పడుతున్నాడు. ఖనిజరూపంలో ఉన్న బంగారాన్ని గనుల నుంచి వెలికి తీసి శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అలాగే బంగారపు గనులు కూడా తక్కువే. అందువల్ల కావలసిన బంగారాన్ని చౌకగా ఉత్పత్తి చేయడం కుదరడంలేదు. దీంతో కొంతమంది తక్కువ విలువ ఉండి ఎక్కువ పరిమాణంలో లభించే సీసం వంటి లోహాలను బంగారంగా మార్చడానికి ప్రయత్నాలు చేశారు. మరి కొందరు పాదరసాన్ని బంగారంగా మార్చే ప్రయత్నం చేశారు.
రకరకాల శాస్త్రాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మనిషికి అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. లోహాల రంగుని, రూపాన్ని మార్చడం సాధ్యమని కొందరు నిరూపిస్తున్నారు. వాటిలోని కాఠిన్యాన్ని, మృదుత్వాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలుపడుతోంది. అలాంటప్పుడు ఇతర లోహాలను బంగారంగా మార్చడం ఎందుకు వీలుపడదు అనే ప్రశ్న తలెత్తింది. ద్రాక్షరసం వైన్గా, వైన్ వెనిగర్గా, గొంగలిపురుగు సీతాకోక చిలుకగా మారుతుందన్న విషయం ఆనాటి ప్రజలకు తెలుసు. జీవమే ఇన్ని మార్పులకు లోనవుతున్నప్పుడు నిర్జీవ పదార్థాలను మార్చడం ఎందుకు వీలుపడదనే ఆలోచన తలెత్తింది. కృత్రిమంగా సమకూర్చే ఖనిజ లవణాలతో మొక్కలు వేగంగా ఎదగడం కూడా వారి దృష్టిని ఆకర్షించింది. అదే ప్రక్రియను వెనక్కి తిప్పి ఎదుగుదల నిదానంగా సాగేటట్లు చేయగలిగితే ముసలితనం, మరణాలను జయించడానికి ఆస్కారం ఉందని నాటి రసవాదులు తలచారు. ఇదే క్రమంలో బంగారాన్ని తయారుచేయవచ్చని భావించారు. అయితే వీటిలో ఏది సాధించాలన్నా పరుసవేది (ఫిలాసఫర్స్ స్టోన్) తప్పనిసరని వారు నమ్మారు.
మానవుడు జంతు దశను దాటి క్రమమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని జీవించే స్థాయికి వచ్చేటప్పటికి కొన్ని లోహాల పాత్ర కీలకమయింది. ఆర్థిక వ్యవస్థ మనుగడకు అవసరమైన కరెన్సీ (ద్రవ్యం) ముద్రణకు అరుదుగా లభించే లోహాల నిల్వలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అలా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర నిర్వహించే స్థాయికి పెరిగాయి. అదే తరుణంలో ప్రపంచంలోని చాలా సమాజాల సంస్కృతి ఈ విలువైన లోహాలతో పెనవేసుకుపోయింది. ఇందుకు మంచి ఉదాహరణ భారతదేశమే. పుట్టుక, వివాహం, చావు, పండగ... సందర్భం ఏదయితే ఏం.. భారత దేశంలో బంగారంతో సంబంధం లేని సామాజిక వ్యవహారం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా అటు ఆర్థిక వ్యవస్థ మనుగడకు, ఇటు సామాజిక, సాంస్కృతిక అవసరాలకు బంగారం కేంద్రంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎవరి దగ్గర బంగారం ఉంటే వారే బలవంతులు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాల్లో బంగారాన్ని చేజిక్కించుకోవడం ఒక లక్ష్యంగా ఉండేది. ఇంత ప్రాముఖ్యం ఉన్న బంగారం దొరికే ప్రాంతాలను గుర్తించి తవ్వి తీసి వాడుకకు అనుకూలంగా తయారుచేయడం చాలా ఖర్చుతోను, శ్రమతోనూ కూడిన పని. అంత శ్రమపడి తీద్దామన్నా అది ఎక్కడపడితే అక్కడ దొరికే ఖనిజం కాదాయె. అందుకే కృత్రిమంగా బంగారాన్ని తయారుచేయగలిగితే ఎంతబాగుండు అనే ఆలోచన కలిగింది.
ప్రాచీన, మధ్యయుగాల్లో తత్వవేత్త (ఫిలాసఫర్స్)లకు సమాజంలో ఎంతో విలువ ఉండేది. వారే సమాజ మనుగడలో కీలక భూమిక నిర్వహించేవారు. ఇప్పుడు మనం చూస్తున్న అనేక ఆధునిక శాస్త్రాలు అన్నీ అప్పట్లో తత్వశాస్త్రంలో భాగంగా ఉండేవి. అంటే తత్వవేత్త అనేక శాస్త్రాల్లో ప్రావీణ్యం గడించి ఉండేవాడు. అరిస్టాటిల్ వంటి తత్వవేత్త బహుముఖ ప్రజ్ఞతో ఎన్నో శ్రాస్త్రాల అభివృద్ధికి ఎలా పాటుపడ్డాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. అంటే అప్పట్లో తత్వవేత్తల్లో చాలా మంది సైంటిస్టులన్నమాట. బంగారం తయారుచేయాలని ప్రయత్నించిన మొదటి తరం సైంటిస్టులు కూడా ఈ ఫిలాసఫర్సే. అయితే వీరు బంగారం, ఇతర విలువైన లోహాలు తయారు చేయడానికి ఒక రాయిని తయారు చెయ్యాలని ప్రయత్నించారని, ఆ రాయిపేరే ఫిలాసఫర్స్ స్టోన్ ( పరుసవేది) అనీ భావిస్తారు. నిజానికి పరుసవేదిని తయారు చేశారంటే బంగారాన్ని తయారుచేసినట్లే లెక్క. ఎందుకంటే ఈ పరసువేదితోనే బంగారం తయారు చేస్తారని చెబుతారు. అలాగే పరుసవేదికి చాలా శక్తులు ఉంటాయని వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, యవ్వనంగా ఉండటంతోపాటు చనిపోయినవారు బతకవచ్చనీ నమ్మేవారు. అందుకే 'పరుసవేది' అనే పదం ప్రాచీన మధ్యయుగాల్లో ఎందరో రాజులకు నిద్రలేకుండా చేసింది. పరుసవేది సహాయంతో దేశంలో బంగారు గుట్టలను సృష్టించి ద్రవ్యం (డబ్బు) విలువ పడిపోయేలా చేస్తారేమోననేది వారి భయం. అలాగే పరుసవేదికి ఉన్న శక్తులతో రాజ్యాధికారాన్ని కైవశం చేసుకుంటారనీ భయపడేవారు. ఈ అన్ని కారణాల వల్ల తమ రాజ్యాల్లో పరుసవేదిని తయారు చేయడం నిషేధించారు. అంటే బంగారాన్ని తయారుచేయడం నిషిద్ధమన్నమాట.
ఎందరో బంగారం తయారు చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. రసాయనాల వల్ల మతి భ్రమించి పిచ్చివాళ్లయ్యారు. మన చరిత్రలో నాగార్జునాచార్యుడు (సిద్ధనాగార్జునుడు) బంగారం తయారుచేశాడని అంటారు కాని దాన్ని ధృవీకరించే ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు.
Authorization