మహిళలను ఆదిశక్తిగా పూజించే దేశం మనది. పురాణాలు ఇతిహాసాలన్నింటిలోను మహిళలకు అత్త్యున్నత స్థానమే. కాని నిజ జీవితంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించే సమాజంగా కొనసాగుతున్నది మన భారతీయ సమాజం. స్త్రీలను బానిసలుగా చూడటం, కనీస హక్కులను నిరాకరించి అమానవీయంగా ప్రవర్తించడం పరిపాటయిన సమాజంలో ఉన్నాం. ఆధిపత్య కులాల స్త్రీలతో పోల్చినప్పుడు దళిత బహుజన వర్గాల స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఆచారాలు, సంప్రదాయ్లాలు, సంస్కృతి పేరుతోవారిపై జరుగుతున్న అకృత్యాలకు నిలువెత్తు సాక్ష్యం జోగిని వ్యవస్థ. మధ్యయుగాల్లో దేవాలయం కేంద్రంగా లేదా గ్రామదేవత కేంద్రంగా అణగారిన వర్గాలకు సంబంధించిన స్త్రీని పూజా విధానంలో జుగుప్సాకరమైన రీతిలో భాగస్వామిని చేశారు. ఆ వ్యవస్థని ఈ ఆధునిక కాలంలోనూ ఇంకా కొనసాగించడం మనం ఎటు పయనిస్తున్నామన్న ప్రశ్నను రేకెత్తిస్తుంది. జోగిని వ్యవస్థలో బంధీ అయిన స్త్రీ ప్రభుత్వ ఉద్యోగి అయినా జోగినిగా తన విధులు నిర్వర్తించాల్సిరావడం చూస్తే మన చట్లాలు ఎవరికి చుట్టాలో అర్థమవుతుంది. 'నవతెలంగాణ' ప్రతినిధి అందిస్తున్న ఈ వ్యాసం ప్రభుత్వం, తోటి మనుషుల కండ్లు తెరిపిస్తుందనే ఉద్దేశంతో 'జాతర' పాఠకులకు ప్రత్యేకంగా...
జోగిని అనే మాట వింటేనే ఫ్రీగా దొరికే ఆటబొమ్మరా అంటు కొంతమంది చేసే ఎగతాళి మాటలు గుర్తుకు వచ్చి మనసు బాధతో నిండిపోతుంది. దేవుడి పేరుతో దళిత స్త్రీని జోగినిగా మారుస్తూ, వారి జీవితాన్ని దుర్బరం చేస్తున్నారు. తమ జీవితాలపై తమకే హక్కులేని దౌర్బాగ్య స్థితిలో జోగినులు ఇంకా జీవిస్తున్నారు. క్రీ.శ.1350 సంవత్సరం నుండి ఆ దేవదాసి వ్యవస్థ కొనసాగుతున్నట్లు చరిత్ర కథనం. జోగిని, దేవదాసి పేర్లతో పిలిచే వీరిని ''నడి వీధిలో నాట్యమాడుతారని, ఊరి ఉమ్మడి ఆస్తి అని గ్రామంలోని ఆధిపత్య కులాల పురుషులు అంటుంటారు. వీరితోపాటు బీసీకులాలకు చెందిన పురుషులూ కలిసిపోయి జోగినిల పట్ల నిర్దయగా ప్రవర్తించడం గమనించాల్సిన మరో సంగతి.
ఒక్కొక ప్రాంతంలో ఒక్కో పేరుతో..
దేవుడు, దేవతల పూజావిధానంలో భాగమైన స్త్రీలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కేరళ రాష్ట్రంలో మహారీ అని, అస్సాంలో నాటీ అని, మహారాష్ట్రలో మురళి అని,త మిళనాడులో తెవెడియార్ అని, కర్ణాటక, రాయలసీమల్లో బసివి అని, తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల జోగిని అని, కరీంనగర్ లో పార్వతి అని; నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాతమ్మ, తాయమ్మ అంటు పిలుస్తారు. తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారం 30 వేల మంది, ఆంధ్రప్రదేశ్లో 20 వేల మంది జోగినులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 90 శాతం మంది దళిత సామాజిక వర్గానికీ చెందిన వారే ఉన్నట్లు సమాచారం. ఇంట్లో మగసంతానం లేకపోతే ఆడపిల్లను జోగినిగా మారిస్తే మగ సంతానం కలుగుతారనే నమ్మకం ఈ వ్యవస్థ రూపకల్పనలో ఒక భాగంగా ఉన్నది. అట్లాగే బలహీన వర్గాల అమ్మాయిలపై కన్నేసిన పెత్తందార్లు జోగినిలుగా వారిని మార్చేలా చేస్తున్నారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దళితుల్లో ఉన్న నిరక్షరాస్య, ఆధిపత్యకులాలవారి స్వార్థం, మూఢనమ్మకాలు ఈ వ్యవస్థకు మూలకారణాలుగా కనిపిస్తున్నాయి.
ఎన్నో అవమానాలు..
దేవుని పేరుతో జోగినిగా చేసిన తమకు కనీస ఆదరణ లేదని పలువురు జోగినిలు వాపోయారు. వయస్సు పైబడుతున్న కొద్ది ఆరోగ్యం సహకరించక, ఆదరించే వారు లేక, వృద్ధ్దాప్యంలో తోడులేక దుర్భరంగా జీవిస్తున్నట్లు పలువురు ఈ రచయితతో తమ ఆవేదనను పంచుకున్నారు. దేవుని పేరుతో ఉన్న తమకు దేవుని మాన్యం అయిన భూములను తాము అనుభవించలేని పరిస్థితిలో ఉన్నామని వీరు చెబుతున్నారు. గ్రామాల్లోని అనేక దేవాలయాల్లో పూజారులకు ప్రభుత్వం దీపం వెలిగించి పూజలు చేసేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి జీతం ఇస్తున్నారని, తమను దేవుని భార్యలంటూ అనేక విధాలుగా దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి వేతనం కాని, మాన్యం కాని ఇవ్వడంలేదని, ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. జోగిని పిల్లలు బడిలో చేరాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బడిలో చేర్పించడానికి వెళితే తండ్రిపేరు అడుగుతున్నారు. జోగినిని ఊరుమ్మడి ఆస్తిగా భావించి ఊళ్లో పురుషులు ఆమెపై లైంగిక దాడులకు దిగుతుంటారు. ఎవరి వల్ల బిడ్డలు పుట్టారో ఆ అభాగినులు ఎట్లా చెప్పగలరు? ఒకవేళ చెప్పినా ఈ మర్యాదస్తులైన పురుషులు ఆ బిడ్డలకు తండ్రులుగా గుర్తింపు పొందటానికి ఒప్పుకుంటారా? అట్లాగే హాస్పిటల్లో కనడానికి వెళితే భర్త పేరు అడుగుతున్నారు. ఏ భర్తపేరు చెప్పాలి. దేవుడి భార్య కాబట్టి ఏదో ఒక దేవుడి పేరు చెబితే హాస్పిటల్ అధికారులు అంగీకరిస్తారా? పదవ తరగతి పరీక్షలు తండ్రిపేరు చెబితేనే రాయనిస్తామని పాఠశాల అధికార్లు అంటే ఏంచేయాలి? ఈ సమస్యలకు తాళలేక జోగినులు పై అధికార్లకు మొరపెట్టుకుంటే డీఎన్ఏ పరీక్షలు చేయించాలని అధికారులు భావించగా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పురుష ప్రపంచం నిరసనలు తెలిపింది, దీంతో స్పందించిన ప్రభుత్వం 2009 డిసెంబర్ 30న జీ.ఓ139 ని విడుదల చేసింది. పాఠశాలలో తండ్రిపేరు లేకపోయినా తల్లి పేరుతో దరఖాస్తు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగినీ వదల్లేదు...
తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లాలో ఈ జోగిని ఆచారం ఎక్కువగా ఉందనేది ప్రచారం. జిల్లాలోని వర్ని , ఎడపల్లి, బోధన్, నవీపేట్ తదితర మండలాల్లో ఎక్కువగా జోగిని వ్యవస్థ ఉంది. ప్రముఖ సంఘ సంస్కర్త అయిన హేమలత లవణం ఈ దురాచారాన్ని ఎలాగైనా రూపుమాపాలనే ఉద్దేశంతో 'సంస్కార్ ప్లాన్' అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా వారికి ఉపాధి కల్పించడం, సమాజం పట్ల అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేశారు. కాలక్రమేణ ఆ సంస్థ మూతపడడంతో మళ్లీ ఈ జోగిని దురాచారం గ్రామాల్లో బయటికీ వస్తున్నది. మళ్లీ ఆరోజులను గుర్తుచేస్తూ కొంతమంది పెద్దలు ఆచారం సాగించాలంటూ పండగల సందర్భంలో జోగినులతో నృత్యాలు చేయిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఇది ఎంత అవమానకరమైన, అమానవీయ చర్య! తాజాగా బోధన,్ కోటగిరి మండలాల్లో బోనాల పండగ సంధర్బంగా జోగిని స్త్రీలను ఊరేగింపులో నృత్యాలు చేయించడం బహిరంగంగానే జరిగింది. ఈ వీడీయోలు సామాజిక మాధ్యమాలలో టీవీలలో ప్రసారమయినా అధికారులు గాని, ప్రభుత్వ పెద్దలు గాని పట్టించుకోకపోవడం విశేషం. చివరికి సంప్రదాయవాదులు ఎంతగా బరితెగించారంటే... బోధన్ రెెవెన్యూ డివిజన్లోని ఓ గ్రామంలో ప్రభుత్వ అధికారిగా పనిచేసే ఓ మహిళను పండగ సందర్భంగా డ్యాన్స చేయాల్సిందేనని పట్టుబట్టారు.చిన్నప్పటి నుంచే జోగినిగా ఉండడంతో ఆ మహిళ తన ఆత్మాభిమానాన్ని పక్కనబెట్టి బోనాల పండుగ రోజు పోతరాజులతో కలిసి నృత్యం చేసింది. తన ఉద్యోగిని సైతం ఈ ఆచారం నుంచి రక్షించలేని ప్రభుత్వం సాధారణ జోగినులను రక్షిస్తుందని ఎట్లా ఆశించగలం?
ఊర పండగలో అమానుషం...
ఊరపండగ అంటే అది మూడు రోజులపాటు అత్యంత నిష్టతో చేసే పండగ. ఎవరు కూడా ఊరిలో నుంచి బయటికి వెళ్లకూడదు బయటి వారు రాకూడదు అనేది నిబంధన. అందుకోసం గ్రామం పొలిమేర చుట్టు పసుపులో కలిపిన వస్తువులతో భండారా వేస్తారు. దాంతో పండగ క్రతువు ప్రారంభమవుతుంది. గ్రామ దేవత ముందు నిర్వహించే క్రతువులో భాగంగా పోతరాజులను జోగినులను పూనకం వచ్చేలా డప్పుల చప్పుళ్లతో అంతా సిద్ధం చేస్తారు. ఊరిజనం అంతా అక్కడ జరిగే తంతుని తిలకించడానికి వస్తారు. అందరి మధ్యలో జోగినులు, పోతరాజులు నృత్యాలు చేయాలన్నమాట. లేకుంటే దేవుడు శాంతించడంటూ ప్రచారం చేస్తారు. అలాగే గ్రామానికి అరిష్టం కలగకూడదంటూ ఓ దళిత వ్యక్తిని ఒళ్లు గగుర్పోడిచే విధంగా తయారుచేసి గ్రామం చుట్టు తిప్పుతారు. ఎలాగంటే... దళిత వ్యక్తిని తెల్లవారుజామున అంటే 3 గంటల ప్రాంతంలో గ్రామ దేవత వద్ద నగంగా తయారుచేసి అతని నడుము చుట్టు వేప ఆకులు కడతారు. అట్లాగే నెత్తిపై పేడ తట్టపెట్టి, అందులో దున్నపోతు వ్యర్థాలు వేస్తారు..అనంతరం అతని నోటిలో దున్నపోతు పచ్చిమాంసాన్ని ఉంచి ఊరు చుట్టూ తిప్పుతారు. ఇలా చేస్తే గ్రామానికీ అరిష్టం కలగదంటూ చెప్తారు. గ్రామంలో దేవతలు శాంతించాలంటే దళితులే నగంగా ఊరేగాలా.. దళిత స్త్రీలే జోగీనిలా నాట్యమాడాలా...ఆధిపత్య వర్ణాల వారు దిగంబరంగా తిరగటం దేవునికి ఇష్టం ఉండదా?
ఎప్పుడో రద్దుచేసిన జోగిని వ్యవస్థను తెలంగాణ సంస్కృతి పేరుతో మల్లీ మనుగడలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల కాలంలో జోగిని నృత్యాల వార్తలు తరచుగా వినిపిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు. సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్న స్త్రీని జోగిని కాబట్టి డ్యాన్స్చేయాల్సిందేనని ఊరుజనం నృత్యం చేయిస్తే ఇక నిరక్షరాస్య జోగినుల బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో ఊహించండి.
- లింబురి లక్ష్మణ్
నవతెలంగాణ- బోధన్
6305491627
Authorization