జనవరి 5, 6 తేదీలలో రాజమండ్రి శ్రీ వీరేశలింగం థీస్టిక్ కాలేజిలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా చరిత్ర కాంగ్రెస్ మాత్రం ఉమ్మడి సంస్థగానే కొనసాగుతున్నది. రెండు ప్రాంతాల చరిత్రకారులు, పరిశోధకులు ఎప్పటిలాగే ఈ చరిత్ర సదస్సుకి హాజరై తెలుగువారి చరిత్ర, సంస్కృతులపై తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ వ్యాస రచయిత కూడా 'నవతెలంగాణ' తరఫున ఈ సమావేశాల్లో పాల్గొని 'సమ్మక్క జాతర'పై పరిశోధనా వ్యాసం సమర్పించాడు. తెలుగువారి చరిత్ర, సంస్కృతులపై చరిత్రకారులు చెప్పిన విలువైన విషయాలే కాకుండా, భారత దేశం గర్వించదగిన గొప్ప సంఘసంస్కర్త వీరేశలింగం పంతులు జీవితంతో ప్రత్యక్షంగా ముడివడి ఉన్న ప్రదేశాలను చూసిన ఆనందం కలిపితే ఈ వ్యాసం అయింది.
కొవ్వూర్... కొవ్వూర్ అంటూ బస్ కండక్టర్ పెద్దగా అరవడంతో ఒక్కసారిగా మెలకువ వచ్చింది. కండ్లు తెరచి చూసేటప్పటికి మసక మసక చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు పైకిలేస్తున్నాడు. కొవ్వూరులో ఒకరిద్దరు ప్రయాణీకులు దిగిన తర్వాత బస్ మళ్లీ బయలుదేరింది. గోదావరి అవతల రాజమండ్రి, ఇవతల కొవ్వూరు. బస్ గోదావరిపై కట్టిన పొడవైన వంతెనపైగుండా రాజమండ్రివైపుకు పరుగులు తీస్తున్నది. రాజమండ్రిపై ఉదయిస్తున్న సూర్యుని ఎర్రని కాంతి గోదావరిపై పరచుకుంటూ కనిపించింది. పలుచటి పొగమంచుతెరల మాటున గోదావరిపై అప్పటికే చేపలవేట సాగిస్తున్న మత్స్యకారుల చిన్న పడవలు అక్కడక్కడా స్పష్టాస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత అద్భుతదృశ్యం! బ్యాగ్ నుండి వెంటనే కెమెరా తీసి ఆ దృశ్యాన్ని సొంతం చేసుకోవడం అసంకల్పితంగానే జరిగిపోయింది. బస్ ఉరుకుతుంటే కండ్లముందు దృశ్యాలు మారిపోతున్నాయి. రాజమండ్రి బస్స్టాండ్లో ఆగింది బస్. బస్నుండి కిందికి దిగుతుంటే తెలియని అనుభూతి! ఎందుకు? అనేక చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్షసాక్షి అయిన ఓ పురానగరంలో అడుగుపెడుతున్నందుకా? ఓ యుగపురుషుడు నడయాడిన ప్రదేశాలను చూడబోతున్నందుకా? రెండూనూ...
బస్టాండ్ నుండి కందుకూరి వీరేశలింగం స్థాపించిన ఎస్కెవిటి (శ్రీకందుకూరి వీరేశలింగం థీస్టిక్ కాలేజ్)కాలేజికి చేరుకునేటప్పటికి చరిత్రకారులు, విద్యార్థులు, పరిశోధకులు అక్కడికి మెల్ల మెల్లగా చేరుకోవడం కనిపించింది. కాలేజీలోకి ప్రవేశించిన వెంటనే హితకారిణి సమాజం అనే చిన్న బోర్డు కనిపించింది. కందుకూరి స్థాపించిన ఆ సమాజం చేసిన సేవను గుర్తుకు తెచ్చుకుంటూ, చరిత్రకాంగ్రెస్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బసకు చేరుకొని కాస్త సేదదీరి సమావేశ మందిరానికి చేరుకునే లోపు ఎందరో పాత మిత్రులు, యూనివర్సిటీ సహాధ్యాయులు, గురువులు కనిపించారు. అక్కడ చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన మాటలు తప్ప వేరే సంభాషణలు అంతగా వినిపించడంలేదు. ఉత్సాహవంతమైన వాతావరణంలో సదస్సు ప్రారంభమయింది.
43 ఏండ్ల క్రితం ప్రారంభమైన మొదటి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్లో పాల్గొన్న ముగ్గురు ఫౌండర్ సభ్యులు ప్రొ.వకుళాభరణం రామకృష్ణ, కాళిదాసు పురుషోత్తం, డా.జి.వెంకటేశ్వరరావు అక్కడి వాతావరణాన్ని స్ఫూర్తివంతం చేశారు. ఇన్ని రోజులు ఒక రాష్ట్ర హిస్టరీ కాంగ్రెస్ నిరాటంకంగా జరగటం చాలా అరుదైన విషయం. సదస్సులో జరిగిన చర్చోపచర్చల గురించి ముచ్చటించుకోబోయే ముందు ఈ హిస్టరీ కాంగ్రెస్ తెలుగు జాతికి చేసిన సేవలను కొద్దిగానైనా పాఠకులు తెలుసుకోవాలి. నలభై మూడేండ్ల నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఈ సంస్థ సదస్సులు నిర్వహించి ప్రొసీడింగ్స్ని ముద్రిస్తూనే ఉంది. ఎందరో సాధారణ విద్యార్థులను చరిత్ర పరిశోధకులుగా తీర్చిదిద్దింది. అన్నింటికన్నా గొప్పగా చెప్పుకోవలసిన విషయం 'ఆంధ్రప్రదేశ్ కాంప్రహెన్సివ్ హిస్టరీ' సిరీస్లో భాగంగా 9 సంపుటాలు ముద్రించడం. ఈ సంపుటాలు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల చరిత్రపై సమగ్ర సమాచారాన్ని అందించాయి. ప్రాచీన శిలాయుగాల నుండి క్రీస్తుశకం 2000 వరకు ఉన్న తెలుగు ప్రాంతాల చరిత్రను ఎంతో శ్రమకు ఓర్చి తెలుగు ప్రజలకు అందించిన ఈ సంస్థను తెలుగువారు ఎప్పుడూ మరువరాదు. ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ జనరల్ ఎడిటర్గా వెలువడిన సంపుటాలకు ఎందరో చరిత్రకారులు, పరిశోధకులు రచనాసహకారం అందించారు. వారందరూ తెలుగువారికి ఎనలేని సేవచేసినవారుగా గుర్తుండిపోతారు.
ఇక సదస్సు విశేషాలకు వస్తే... ప్రాచీనయుగం, మధ్యయుగం, ఆధునికయుగం, స్థానిక చరిత్రల విభాగాలే కాకుండా హిస్టరియోగ్రఫీ (చరిత్రరచనా శాస్త్రం) అనే విభాగంతో కలిపి మొత్తం ఐదు విభాగాలుగా ఈ చరిత్ర సదస్సు విభజితమై సాగింది. ఆధునిక, మధ్య యుగ చరిత్ర విభాగాల్లో ఎక్కువ మంది పరిశోధకులు పాల్గొన్నా మిగిలిన విభాగాల్లోనూ చర్చలు ప్రయోజనాత్మకంగా జరిగాయి.
మతోన్మాదం ఆధునిక కాలపు కుక్కమూతి పిందె
చరిత్ర సదస్సుకు ముఖ్య అతిధిగా, హిస్టరియోగ్రఫీ సెషన్కి అధ్యక్షులుగా ప్రొఫెసర్ సలీల్ మిశ్రా మతోన్మాదుల కండ్లు తెరిపించే ఉపన్యాసం ఇచ్చారు. మతసామరస్యం గొప్పదనాన్ని, చరిత్ర రచనలో మతోన్మాదం (కమ్యునలిజం) ఎట్లా ఉన్నదన్న విషయాలను ఈయన ఉదాహరణ సహితంగా వివరించారు. ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీకి ప్రో వైస్ఛాన్సలర్గా వ్యవహరిస్తున్న ఈ చరిత్ర ఆచార్యుడు కమ్యునలిజంపై విస్తృతమైన పరిశోధనచేశారు. ప్రముఖ చరిత్రకారుడు బిపన్ చంద్ర శిష్యుడైన ఈయన తన గురువు చెప్పిన సంగతులను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్న మతోన్మాదం మధ్యయుగ కాలం నుండి భారతీయ సమాజానికి వారసత్వంగా సంక్రమించినది కాదని అన్నారు. భారతదేశం వంటి అనేక మతాలు, సంస్కృతులు ఉన్నదేశంలో మతపరమైన గొడవలు జరిగి అశాంతి రేగడం సహజమే అన్నమాటా సరికాదన్నారు. మతపరమైన విభేదాలు ఉన్నా అవి మతోన్మాదానికి దారితీస్తాయన్న మాట అవాస్తవం అన్నారు. మతోన్మాదం కేవలం ఆధునిక కాలపు పరిణామం మాత్రమే. ఈ పరిణామానికి ఆధునిక కాలపు సామాజిక, రాజకీయ అంశాలే కారణాలు అని ఆయన నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు. ఈ ఆధునిక రాజకీయ, సామాజిక శక్తులు, అంశాలు దోహదం చేయకపోతే ఇప్పుడు మనం చూస్తున్న మతోన్మాదం తలెత్తేదేే కాదని ఆయన అన్నారు. మతోన్మాద మూలాలు మరీ అంత ప్రాచీనం కాదు కాబట్టి, దానికి భారతీయ చరిత్ర, సంస్కృతులకు అవినాభావ సంబంధం లేదు కాబట్టి దానిపై యుద్ధం చేసి మన సమాజం నుంచి తరిమివేయవచ్చని ప్రొఫెసర్ సలీల్ మిశ్రా గట్టిగా చెప్పుకొచ్చారు.
మునిగిపోతున్న వారసత్వ సంపదను...
కాలంతో పాటు విలువలూ, ప్రాధమ్యాలు కూడా మారిపోతుంటాయి. చరిత్ర, సంస్కృతులకు ఇచ్చే గౌరవ మర్యాదలు, వాటిని రక్షించుకునేటందుకు పడే తపన కూడా మార్పులకు లోనవుతున్నది. భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న అన్ని పరిణామ దశలకు భారతదేశం ప్రత్యక్ష సాక్షి. ముఖ్యంగా మానవ పరిణామానికి సంబంధించిన అన్ని యుగాలకు, దశలకు సంబంధించిన భౌతిక ఆధారాలు మనదేశంలో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలను ఆదిమానవుని నుంచి నేటి మానవుని వరకు మానవుని కార్యకలాపాలను రికార్డు చేసిన రిజిస్టర్లు మాదిరిగా చెప్పుకోవచ్చు. ఆదిమానవుని పనిముట్లున్న ప్రాంతాలు, సమాధులు, తొలిచారిత్రక యుగపు బౌద్ధ స్థూపాలు, జైన బసదులు, ఆలయాలు; మధ్యయుగపు దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు ఇట్లా ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు త్వర త్వరగా నాశనమైపోతున్నాయి. జనాభాపెరుగుదల, అభివృద్ధికార్యకలాపాలు ఊపందుకోవడం వంటి కారణాల వల్ల ఈ చారిత్రక సంపద నాశనమైపోతున్నది. మానవ ఆవాసాలు, వ్యవసాయం కోసం కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతున్నది. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల వందల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న భూ భాగాలు నీటి రిజర్వాయర్లలో మునిగి పోతున్నాయి. ఈ భూభాగాల్లో పైన చెప్పుకున్న అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉంటాయి. అందులో ఇప్పటికే మనకి తెలిసినవి కొన్ని ఉండవచ్చు. తెల్వనివీ ఉండవచ్చు. ఇవన్నీ శాశ్వతంగా జలసమాధి కాకముందే వాటి చరిత్రను రికార్డుచేయవలసి ఉంటుంది. ప్రాచీన స్థలాల్లో దొరికిన మానవుని పనిముట్లను సేకరించాలి. రాక్షసగుళ్లు అని పిలిచే ఇనుపయుగపు సమాధులను తవ్వి నాటి ప్రజల జీవన విధానాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. అట్లాగే గుడులు, గోపురాలు ఉంటే వాటిని అధ్యయనం చేయాలి. అవి మరీ విలువైనవి అనుకుంటే ఆ గుడులను ఏ రాయికి ఆ రాయిగా విప్పి అక్కడికి దూరంగా వేరే ప్రాంతానికి తరలించి మళ్లీ ఇదివరకు ఎట్లాగున్నవో అట్లాగే నిర్మించాలి. ఈ కార్యకలాపాలన్నీ సాల్వేజ్ ఆర్కియాలజీలో భాగం. ప్రపంచంలో పెద్ద ఎత్తున మొదటి సారిగా సాల్వేజ్ ఆర్కియాలజీ కార్యకలాపాలు ఈజిప్టులోని ఆశ్వాన్ డామ్ నిర్మాణ సమయంలో జరిగాయి. ఆ తర్వాత మన నాగార్జునసాగర్లోనే ఆ స్థాయిలో ఈ కార్యకలాపాలు నిర్వహించారు. నాగార్జున సాగర్లో ఇప్పుడు కనిపిస్తున్న బౌద్ధ స్థూపాలు, ఇతర కట్టడాలు ముంపుకు గురయ్యే ప్రాంతాల నుంచి తరలించి పునర్నిర్మించినవే. ఇందుకు ఎంతో సమయం, శ్రమ, టెక్నాలజీ అవసరం. దేశం మొత్తం మీద ఈ ప్రక్రియలో మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ప్రావీణ్యం మరెవరికీ లేదు. శ్రీశైలం, జూరాల, సోయమశిల, పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణంలోనూ ప్రాచీన కట్టడాలను, నిర్మాణాలను, వస్తువులను అన్వేషించి, తవ్వి వేరే ప్రాంతాలకు తరలించారు. ఇటువంటి ఎన్నో సాల్వేజ్ ఆర్కియాలజీ కార్యకలాపాల్లో పాల్గొన్న కె.ఎస్.బి.కేశవ ప్రాచీన చరిత్ర విభాగానికి అధ్యక్షులుగా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన అధ్యక్ష ఉపన్యాసంలో తన అనుభవాలను చెప్తూ సాల్వేజ్ ఆర్కియాలజీ ఆవశ్యకతను వివరించారు.
వస్తు సంస్కృతులు, స్థానిక చరిత్రలు
మధ్యయుగ చరిత్రవిభాగానికి అధ్యక్షులుగా వ్యవహరించిన ప్రొ.కె.కనకరత్నం తన ఉపన్యాసంలో మధ్యయుగంలో తెలుగు నేలపై విలసిల్లిన కులవృత్తులవారి వస్తు సంస్కృతులను ఆవిష్కరించారు. కమ్మరి, వడ్డెర, కాశె, కుమ్మరి, చాకలి, మంగలి, మాదిగ, యాదవ, విప్రవినోదులు, వీరముస్టి, పిచ్చికుంట్ల, గౌడ వంటి కులాలు ఉపయోగించిన పనిముట్లు, వాటి ఉపయోగితా విలువలను వివిధ సాహిత్య, శాసనాధారాల ఆధారం చేసుకొని వివరించారు.
అట్లాగే ఆధునిక చరిత్ర విభాగానికి అధ్యక్షత వహించిన మహమ్మద్ సిలాల్ నిజాం కాలంలో ప్రజలు తిరుగుబాటు చేసి స్థాపించుకున్న పరిటాల, గానుగపాడు స్వతంత్ర రిపబ్లిక్ల గురించి తన అధ్యక్ష ఉపన్యాసంలో విశ్లేషించారు. కమ్యూనిస్టుల మార్గదర్శకత్వంలో ప్రజలు ఏ విధంగా పోరుబాట పట్టారు, ఏ విధంగా దాదాపు ఒక ఏడాదిపాటు స్వయంపాలన సాగించుకున్నారనే విషయాలను కూలంకుషంగా చర్చించారు. ఇట్లాంటి స్థానికంగా జరిగిన తిరుగుబాట్లన్నింటినీ విడివిడిగా అధ్యయనం చేస్తేనే తెలంగాణ సాయుధపోరాటం బృహత్తర స్వరూపం ఆవిష్కృతం అవుతుందని ఆయనన్నారు.
చరిత్ర కాంగ్రెస్కి ఆతిథ్యం వహించిన ఎస్కెవిటి కాలేజి ప్రిన్సిపల్ డా.పి.ఎబెల్ రాజబాబు స్థానిక చరిత్ర విభాగానికి అధ్యక్షత వహించారు. ఆయన గోదావరి జిల్లాల చరిత్రపై ఉపన్యసించారు. ప్రాచీన కాలం నుంచి 1925వ సంవత్సరం వరకు ఆ జిల్లాల భూభాగంలో జరిగిన పరిణామాలను విశ్లేషించారు. ముఖ్యంగా గ్రామదేవతలపై ఆయన పేర్కొన్న సంగతులు ఆసక్తికరంగా ఉన్నాయి.
టెక్నాలజీ పాత్ర మరువరానిది
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంత్రొపోలజీ (మానవ అధ్యయన శాస్త్రం) విశ్రాంత ఆచార్యులు కె.తిమ్మారెడ్డి ఏపి హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్గా అద్భుతంగా ఉపన్యసించారు. తెలుగువారి చరిత్రలోని చాలా ఘట్టాలను పునర్నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. చరిత్రకారుల దృష్టి అంతగా పడని ఎన్నో రాజవంశాలను, వారి కాలపు ప్రజల బతుకుల గురించి మళ్లీ అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆర్కియాలజీ (పురావస్తు శాస్త్రం) వంటి వాటికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వక పోగా ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తరువాతి తరాలవారికి మన చరిత్ర సంస్కృతులను అందించడానికి పురావస్తు శాస్ల్రం, చరిత్ర వంటి సబ్జెక్టుల అవసరం ఎంతైనా ఉందన్నారు. పురావస్తు శాఖ కుడా కొత్తతరానికి అన్వేషణ, తవ్వకాలు, శాసన విభాగం నాణేల అధ్యయనం వంటి వాటిలో శిక్షణ ఇవ్వాలన్నారు.
ముఖ్యంగా మన ప్రాచీన, మధ్య యుగాల నాటి టెక్నాలజీపై తగిన శ్రద్ధ చూపడంలో చరిత్రకారులు విఫలమయ్యారని ప్రొ.తిమ్మారెడ్డి అన్నారు. పెద్ద పెద్ద, గుడులు, గోపురాలు నిర్మించడానికి ఎటువంటి టెక్నాలజీ వాడారో కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండజిల్లా పానగల్లో ఉన్న ఛాయా సోమేశ్వరాలయాన్ని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ఆలయంలోని స్తంభాల నీడ (ఛాయ) రోజులో ఏ సమయంలోనైనా గర్భగుడిలోని శివలింగంపై పడుతుంది. ఇది సాధ్యమవ్వడానికి నాటి నిర్మాణకారులు వాడిన టెక్నాలజీ ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఇక్కడే కాదు అరసవెల్లిలోని సూర్యదేవాలయం, శ్రీశైలంలోని భ్రమరాంబిక ఆలయం, నెల్లూరులోని ఉదయకాలేశ్వర దేవాలయం వంటి దేవాలయాలు ఇటువంటి అద్భుత విజ్ఞానంతో కట్టినవేనని, ఈ విజ్ఞాన రహస్యాలను వెలికితీయవలసిన అవసరం ఉందని చెప్పారు.
బోగస్ పురాణాలు, ఉపనిషత్తులు...
మధ్యయుగ చరిత్రపై ఓ స్కాలర్ ప్రవేశపెట్టిన ప్రరిశోధనా పత్రంపై చర్చలో పాల్గొంటూ చెన్నైనుంచి వచ్చిన కె.వి.రామకృష్ణారావు మాట్లాడుతూ లిఖితాధారాలు అన్నీ నమ్మదగినవి కావని, వాటిలో కొన్ని బోగస్ రాతలు ఉంటాయని అటువంటివాటిని గుర్తించి చరిత్ర రచన చేయాలని హెచ్చరించారు. ఏవో ప్రయోజనాలను ఆశించి కొందరు వాస్తవవిరుద్ధమైన రాతలు రాశారని, కాలక్రమంలో అవే చరిత్రకారులు చారిత్రక ఆధారాలుగా భావించి చరిత్రనిర్మాణానికి సాక్ష్యాలుగా తీసుకుంటున్నారని ఇది సరికాదని అన్నారు. అక్బర్ కాలంలో హిందు పండితులు రాసినట్లు చెబుతున్న అల్లా ఉపనిషత్, బ్రిటీషర్స్ కాలంలో తమిళనాడులో సృష్టించబడిన అగ్ని పురాణం, ఇలందై పురాణం, వలందై పురాణం వంటివాటిని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంలో సాధ్యమైనన్ని ఎక్కువ కులాలను సృష్ట్టించి భారతీయ సమాజాన్ని మరింత సంక్లిష్టంచేయాలని బ్రిటీష్వాళ్లు భావించారని, ఎన్ని పాయలుగా చీలిపోతే తమ అధికారం నిలవడం అంతసులువవుతుందని వారు భావించారని, ఆయనన్నారు. బ్రిటీష్వారి ఆజ్ఞమేరకు తాము కొత్త పురాణాలు రాస్తున్నట్లు ఆ పురాణ రచయితలే స్వయంగా ముందుమాటలో చెప్పిన విషయాన్ని రామకృష్ణారావు గుర్తు చేశారు. ఈ పురాణాలన్నీ 18, 19 శతాబ్దాల్లో సృస్టించబడినవేనని ఆయన పేర్కొన్నారు.
సందర్భం వచ్చింది కాబట్టి అల్లా ఉపనిషత్ గురించి కూడా రెండుమాటలు చెప్పుకోవాలి. ఈ ఉపనిషత్నే అల్లోపనిషత్ అని కూడా అంటారు. మొగలాయీ చక్రవర్తి (16వ వతాబ్దం) పరిపాలనా కాలంలో సృష్టించిన ఉపనిషత్గా దీన్ని చరిత్రకారులు భావిస్తున్నారు. స్వామి దయానంద సరస్వతి విరచిత 'సత్యార్థప్రకాశిక' అల్లోపనిషత్ ఉపనిషత్తులలో భాగం కాదని, అధర్వవేదంలోకూడా ఎక్కడా దాని ఊసు లేదని అంటున్నది. రాముడు హనుమంతునికి సాధికారికమైన ఉపనిషత్తులు అని చెబుతూ ఇచ్చినట్లు ప్రచారంలో ఉన్న 108 ఉపనిషత్ల జాబితా (ముక్తికా)లోను ఈ ఉపనిషత్ కనిపించదు. అల్లోపనిషత్ అక్బర్ని దేవదూతగా పేర్కొంటున్నది. అనంతకృష్ణ శాస్త్రి ముస్లిం పాలకుల బారి నుండి తప్పించుకోవడానికి కొందరు ఆర్య పండితులు ఈ ఉపనిషత్ని సృష్టించి ఉంటారని అభిప్రాయపడ్డారు. చార్లెస్ ఇలియట్ 'దీన్ ఇ ఇలాహి' స్థాపించిన కాలంలో అక్బర్ని ఉన్నతీకరిస్తూ రాసిన గ్రంథం కావచ్చని అభిప్రాయం వ్యక్తంచేశాడు. స్వామి వివేకానంద ఇది అక్బర్ కాలంలో హిందు, ముస్లింలను ఒకతాటిపైకి తీసుకువచ్చే క్రమంలో రాసినదిగా పేర్కొన్నాడు.
కాబట్టి ఏవో కొన్ని ప్రయోజనాలను ఆశించి ఇటీవలి శతాబ్దాల్లో సృస్టించిన పురాణాలను, ఉపనిషత్తులను ప్రాచీన కాలపువాటిగా భావించి ఆ కాలపు సమాజ చరిత్ర, సంస్కృతులను నిర్మించే ప్రయత్నం చేయకూడదని, ఈ విషయంలో పరిశోధకులు జాగరూకులై మెలగాలని రామకృష్ణారావు అన్నారు.
అవీ ఇవీ..
హిస్టరీ కాంగ్రెస్ మొదటి రోజునాడు గత ఏడాది హిస్టరీ కాంగ్రెస్లో సమర్పితమైన పరిశోధనా వ్యాసాల (ప్రొసీడింగ్స్)ను ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదికాక మరో ఐదు వివిధ రచయితలు రాసిన గ్రంథాలను కూడా ఆవిష్కరించి పరిశోధకులను ప్రోత్సహించారు. ఇట్లా ప్రతిఏడాది జరుగుతుండటం ముదావహం. చివరి రోజు ముగింపు సమావేశాల్లో మన తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు పాటలతో ఎస్కెవిటి కాలేజి విద్యార్థులు అలరించారు. అట్లాగే ప్రిన్సిపల్ రాజబాబు వీరేశలింగం పాత్ర ధరించిన వీరేశలింగం జీవిత చరిత్ర డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు. కాలేజీ విద్యార్థులు సిబ్బంది మిగతా పాత్రల్లో జీవించిన ఈ డాక్యుమెంటరీ అప్పట్లో వీరేశలింగం ఎదుర్కొన్న కష్టాలను, చేసిన సేవను కండ్లముందుంచింది.
చివరి రోజు వీరేశలింగం నివసించిన గృహానికి వెళితే అది ప్రభుత్వ మ్యూజియంగా దర్శనమిచ్చింది. ఆయన జన్మించిన గది, పత్రికలు ప్రింట్ చేసిన గది, వితంతువులకు ఆశ్రయం ఇచ్చిన గది, తన భార్య రాజ్యలక్ష్మి పేర కట్టిన గృహం... ఇట్లా ఆ గృహసముదాయంలో తిరుగుతూ ఆ మహానుభావుడు వాడిన వస్తువులు, స్వదస్తూరితో రాసిన లేఖలు, అందుకున్న లేఖలు, ఇతర సమాచారాన్ని తెలిపే ప్రతులు చూసి మేమందరం ఎంతో ఆనందించాం. ఆయన తన ప్రచురణల కోసం వాడిన ప్రింటింగ్ మిషన్ ఇప్పటికీ ఉన్నది. అట్లాగే వీరేశలింగంగారు స్థాపించిన ఇతర విద్యాసంస్థలను కూడా దర్శించాం. చివరగా వీరేశలింగం దంపతుల సమాధులున్న మందిరాన్ని చూసి గుండెనిండా ఆయన స్ఫూర్తినింపుకొని హైదరాబాదు బస్ ఎక్కాం.
తెలంగాణ నుంచి..
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్సు, లెక్చరర్స్, పరిశోధక విద్యార్థులు.. ఎవరైతేనేం... మొత్తానికి ఒక 30మంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్లో పాల్గొన్నారు. అట్లాగే హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనిర్సిటీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్ వంటి చోట్ల ఉన్న డిగ్రీకాలేజీల నుంచి కూడా చాలామంది వచ్చారు. నాకు తెలిసినంతవరకు యాభై నుండి అరవైమంది వరకు ఈ సదస్సులో తెలంగాణ నుంచి వచ్చినవారు పాల్గొన్నారు. మొత్తం మీద సుమారు 180 దాకా పేపర్లు ప్రెజెంట్ చేసినవారుంటే అందులో తెలంగాణవారు అరవైమంది వరకు ఉన్నారంటే... పాలనా పరంగా రెండు ప్రాంతాలుగా తెలుగు నేల విడిపోయినా చరిత్రకారులు మాత్రం కలిసే ఉన్నారని అర్థమవుతున్నది. ఆంధ్ర ప్రాంతంవారు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్లో పాల్గొనవచ్చు, తెలంగాణవారు ఏపి హిస్టరీకాంగ్రెస్లో పాల్గొనవచ్చు. అందరమూ తెలుగువారి చరిత్రను బయటకు తీయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.
- ప్రొ.అయూబ్ అలీ; తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
ఇది ఉమ్మడి ఆస్తి
ఇది తెలుగువారు అందరూ అభివృద్ధి చేసుకున్న సంస్థ. తెలుగు నేల పాలనా సౌలభ్యం కోసం ప్రాంతాలుగా విడిపోయింది. కాని తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతి ఉమ్మడి ఆస్తులుగానే ఉండిపోతాయి. వీరి మూలాలు ఒక్కటే. వీటిని ఎవరూ విభజించలేరు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవారి ఉమ్మడి సంస్థగానే కొనసాగుతున్నది. రెండు ప్రాంతాల చరిత్రకారులు, పరిశోధకులు ఎప్పటిలాగే ఈ సంస్థ సదస్సులను జయప్రదం చేస్తున్నారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ను ఆ ప్రాంతవాసులు ఏర్పాటుచేసుకున్నారు. అదికూడా ఏపి హిస్టరీ కాంగ్రెస్లాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆ ప్రాంత చరిత్రసంస్కృతులపై మరింత కృషిజరిగితే అది మొత్తం తెలుగు జాతికి జరిగే మేలులో భాగమే అవుతుంది కదా!
- ప్రొ.వకుళాభరణం రామకృష్ణ, విశ్రాంత ఆచార్యులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు
Authorization