మా పెద్దలు చెప్పిన కథలో ఒక కథ ప్రకారం... రాక్షసులు, దేవతలు సురాభాండం విషయంలో యుద్ధం చేశారు. రాక్షసులను సంహరిస్తూ ఈ ప్రాంతానికి శంకరుడు వచ్చాడు. అలా అలసి పోయిన శంకరుడు తన స్వేదంతీసి బండపై వేయగా ఆ చెమట చుక్కలో నుండి చౌడేశ్వరి (చాముండేశ్వరి) పుట్టింది. ఆమె ఏం కావాలో కోరుకో అని శివుడిని అడిగింది. అందుకు శివుడు రాక్షసులను సంహరిస్తే వారి రక్తం చుక్క భూమిమీద పడితే ఒక్కో రక్తంచుక్క నుండి కోటి రాక్షసులు ఉద్భవిస్తున్నారు. వీరిని ఎలా అంతమొందించాలి అని శంకరుడు చౌడేశ్వరిని అడుగుతాడు. అప్పుడు చౌడేశ్వరి నీవేం బాధపడకు నేను దీనికి పరిష్కారం చూపిస్తా అని చెప్పి రాక్షసుల రక్తం నేల చిందకుండా ఆమె నాలుకను భూగోళమంత పెద్దగా చేసి వారి రక్తాన్ని భూమిపై పడకుండా చేసిందని చెబుతారు. ఫలితంగా రాక్షసులను శివుడు అంతం చేయడానికి వీలుకుదిరింది. ఈ ఘట్టం ఈ గుట్టవద్ద జరగడంతో లింగమంతుల స్వామిగా, చౌడేశ్వరిగా ఈ గుట్టవద్ద వెలిశారని చెబుతారు. కొంత కాలం ఇక్కడ పూజలు చేస్తూ వచ్చారు. అనంతర కాలంలో జాతర రోజు ఈ గుట్టపై ఓ గర్భిణి గంపతో ఎక్కుతూ జారి కిందపడి మరణించింది. ఆ కారణంతో లింగమంతుల స్వామి ఓ వ్యక్తి కలలో కనిపించి తనను పెద్దగట్టుకు మార్చాలని చెప్పడంతో ఉండ్రుగొండ గుట్టపై నుండి దురాజ్పల్లి గుట్టపైకి జాతరను మార్చినట్టుకూడా చెబుతుంటారు. దీంతో 200 ఏళ్లుగా పెద్దగట్టులో జాతర నిర్వహిస్తున్నారు.
మరో కథ ప్రకారం... పూర్వం ఆలయాలను నిధుల కోసం పిండారీలు ధ్వంసం చేసి దోపిడీ చేసేవారు. వీరి భారీ నుంచి విగ్రహాలు చోరీ, ధ్వంసం కాకుండా అప్పటి యాదవులు లింగమంతుల, పాలచర్లయ్య, చౌడేశ్వరి, గంగ విగ్రహాలను ఒక పాత బావిలో దాచి పెట్టారు. దీంతో ఉండ్రుగొండ గుట్ట ప్రాంతమంతా చెల్లాచెదురైందని, ప్రజలు కూడా కరువు కాటకాలతో ఆగమైనట్టు చెబుతారు. కాలక్రమేనా విగ్రహాలు దాచిపెట్టిన భావి కూరుకుపోయింది. ఇదే ప్రాంతంలోని మిర్యాల, చీకటాయపాలెం, కేసారం గ్రామాలకు చెందిన మెంతబోయిన వంశానికి చెందిన ఒకరు, మున్నా వంశానికి చెందిన ఒకరు, గొర్ల వంశానికి చెందిన మరొకరు కలిసి పశువులను మేపుకుంటూ కాలం వెళ్లదీసేవారు. ఒకరోజు ఆవులుమేపుతూ విగ్రహాలు దాచిన పాత బావి పక్కన ఉన్న మర్రిచెట్టు కింద సేద తీరారు. వీరిలో ఒకరికి కలలో లింగమంతులస్వామి ప్రత్యక్షమై ''నేను ఈ పాత బావిలో ఉన్నాను. నన్ను బయటకి తీసి గుడి కట్టించండి. మీకు మేలు జరుగుతుంది'' అని చెప్పాడట. వెంటనే వడ్డెరులను పిలిపించి బావిలో తవ్వకాలు జరిపి విగ్రహాలను బయటకు తీయించారు. ఈ క్రమంలోనే ఓ విగ్రహానికి గునపం తగిలి విగ్రహం నుంచి పాలు కారినట్టు పూర్వీకులు పేర్కొంటున్నారు. ఇలా బయటికి తీసిన మూలవిరాట్ విగ్రహాలను దురాజ్పల్లి గుట్టమీద ఏర్పాటు చేశారు. తర్వాత మా తాత మట్టా రంగయ్య చిన్న గుడి కట్టించాడు. తర్వాత కాసారం గ్రామానికి చెందిన గొర్ల లింగమరెడ్డి, మెంతబోయిన భిక్షం యాదవ్ లింగమంతుల స్వామి ఆలయం నిర్మించి అభివృద్ధి చేశారు. మెంతపోయినవారు, మున్నా వంశస్థులు కలిసి చౌడేశ్వరమ్మ గుడి కట్టారు. అయితే 33 విగ్రహాలతో ఉన్న లింగమంతుల పరివార దేవరపెట్టే తండా వంశస్థుల వద్దే ఉంటుంది. యాదవుల ద్వారా ఈ విగ్రహాలు బయట పడటంతో వారికి జాతర, స్వామివారి కల్యాణం నిర్వహించడంలో హక్కులు కల్పించారు. కాలక్రమేణ ఈ దేవాలయం దేవాదాయశాఖ వారి ఆధీనంలోకి వచ్చింది. అయినా పూర్వ ఆచారం ప్రకారం దేవరపెట్టెను చీకటాయపాలెం నుంచి తండా వంశస్థులు తీసుకొచ్చిన తర్వాతనే జాతర ప్రారంభమవుతుంది.
- మట్టా చక్రయ్య, ఆలయ పూజారి
Authorization