అడవిలో చెంచులు, చెట్లు, పుట్టలు, అడవిజంతువులతో మమేకమై బాహ్యప్రపంచానికి దూరంగా ఆకులు, అలమలు తింటూ జీవనం సాగిస్తున్నారు. చెంచులు నల్లగొండ, నాగర్కర్నూల్, కర్నూల్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వీరు నివసిస్తున్నారు. మైదాన ప్రాంతం కన్నా చెంచులు అధికంగా నల్లమల అడవుల్లోనే ఎక్కువగా జీవిస్తున్నారు. వీరు నల్లమలలో ప్రధానంగా పూజించే దేవుడు మల్లన్న. స్త్రీ దేవత బౌరమ్మ. ఈ బౌరమ్మే శ్రీశైలంలో భ్రమరాంబగా హిందుత్వీకరణకి గురయింది. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో దట్టమైన అడవిలో బౌరమ్మ పేరు మీదుగానే బౌరాపురం అనే ఊరు ఉన్నది. ఇక్కడ బౌరమ్మ, మల్లయ్యలను చెంచులు ఎంతో భక్తి భావంతో పూజిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన బౌరమ్మ జాతర నేడు ముగుస్తుంది. ఈ జాతర సందర్భంగా చెంచుల స్థితిగతులపై ఇస్తున్న ప్రత్యేక వ్యాసం ఇది.
గుంటూరు, ప్రకాశం, కర్నూల్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 48వేల మంది చెంచులు ఉంటారు. తెలంగాణ లో 13వేలు ఉంటే ఒక్క నల్లమల్లలోనే 8వేలకు పైచిలుకు చెంచు ప్రజలు నివసిస్తున్నారు. 30 అసెంబ్లీ నియోజక వర్గాలు, 10 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో చెంచులు ఉన్నారు. వీరికి ఉమ్మడి రాష్ట్రంలో రెండు ఐటీడీఏలు ఉండగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వీరి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మిని ఐటీడీఏను అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో ఏర్పాటు చేశారు. చెంచులు ప్రధానంగా సంచార జీవులుగా ఉండి ఆహార సేకరణ చేస్తూ వ్యవసాయానికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే వీరు అచ్చమైన తెలుగు మాట్లాడుతారు. అయితే అడవిలోకి ఇతరులు ప్రవేశించనంత వరకు చెంచులు, ఇతర ఆదివాసిలు ఆరోగ్యంగా సుఖసంతోషంగా ఉండేవారు. కలప, జంతు మాఫియా ఎప్పుడైతే అడవిలోకి ప్రవేశించిందో చెంచుల ఆయురారోగ్యాల పై ప్రభావం పడింది. మైదాన ప్రాంతానికి చెందిన వ్యాధులు చెంచులకు అంటుకొని పరిస్థితి దుర్భరంగా మారింది.
చెంచు రిజర్వుగా...
1938, 39ల్లో ఇంగ్లాండుకు చెందిన హైమన్డార్ఫ్ మానవ శాస్త్రవేత్త 9ఏండ్ల పాటు చెంచు పెంటలను తిరిగి ఒక పుస్తకాన్ని రాసి అనేక సమస్యల్ని పరిష్కరించే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాడు. చెంచులను కాపాడాలని వారి ఆరోగ్యానికి ముప్పుఏర్పడిందని మలేరియా, టీబీ లాంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. 1942 మార్చి లో నిజాం నవాబు నల్లమల్ల ప్రాంతాన్ని చెంచు రిజర్వుగా ప్రకటించాడు. లక్ష ఎకరాలను చెంచులకు ధారాధత్తం చేస్తూ సాగు చేసుకోమ్మని చెప్పాడు. కాని అటవిక చట్టం అమలుకాకపోవడం, చెంచుల్లో చైతన్యం లేకపోవడం వల్ల సాగు చేసుకోలేకపోయారు. 1950లో ఇండియాలో ఉండే ఇలాంటి తెగలకు ఎస్టీ హౌదా ఇచ్చారు. చెంచులు అప్పటి వరకు బీసీలుగానే కొనసాగుతూ ఉండేవారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని రాజ్యాంగంలో షెడ్యుల్ 5, 6 చేర్చి చెంచులు ఉండే ప్రాంతాలను వారే పరిపాలించుకునే విధంగా వీరి హక్కులను గవర్నర్ పరిధిలోకి తెచ్చారు. చెంచుల అభివృద్ధి కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గవర్నర్ ద్వారానే జరగాల్సి ఉంది. ఇవేవి ప్రస్తుతం అమలు కావడం లేదు. 1965లో అటవీ హక్కుల చట్టం అమలు కోసం 1/70 చట్టాన్ని ఆదివాసుల కోసం తెచ్చారు. ఈ చట్టం ద్వారా చెంచులకు సంబంధించిన భూమిని కొనరాదు, అమ్మకూడదంటూ శాసన ం చేసారు. 2006లో పార్లమెంటులో అటవీ హక్కు చట్టం వచ్చింది, చట్టం వచ్చిన తరువాత కూడా దీనిని పటిష్టంగా అమలు చేయకపోవడం వల్ల వీరికి ఏ హక్కులు వర్తించడం లేదు. ఈ చట్టం ప్రకారం 75 ఏండ్ల నుంచి అడవిలో నివసిస్తున్న చెంచులకు అటవిక చట్టం వర్తింపచేసి 10ఎకరాల భూమి, ఇండ్లు, తాగునీరు, రోడ్లు, శ్మశాన వాటికలు, బావులు, చెరువులు, గుడులు, గోపురాలు, చెట్లు, చేమల ఇలా 13రకాల హక్కులతోపాటు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. కాని పాలకుల నిర్లక్ష్యానికి వివక్ష తోడై ఇవేవి చెంచులకు రావడం లేదు. విద్య, వైద్యం వంటివి కూడా అమలు కావడం లేదు.
అయితే వీరు కోల్పోతున్న హక్కులను తిరిగి కాపాడడానికి 2001లో 'చెంచులోకం'ని స్థాపించారు. ఇందులో చెంచులనే సభ్యులుగా పెట్టి హక్కులను అమలు చేసేలా ఒత్తిడి తెచ్చారు.
ప్రమాదంలో ఆరోగ్యం
చెంచులు అడవిలో ఉంటు పండ్లు, ఫలాలతో జీవనం సాగిస్తున్నారు. మైదాన ప్రాంతం నుంచి ఎప్పుడైతే అడవిలోకి గిరజనేతరులు ప్రవేశించారో అప్పట్నుంచే వారి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. అయితే చెంచుల ఆరోగ్యాలను కాపాడడం కోసం అనేక మంది అనేక రకాలుగా సేవలందిస్తున్నప్పటికి మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో సూపరిండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ రాంకిషన్ సేవలు మరువలేనివి. తన జీతంలో 50శాతం చెంచుల ఆరోగ్యం, వారి జీవన విధానం కోసమే ఖర్చు చేస్తున్నారు . మరో 20శాతం అనాధలు, వృద్దుల కోసం తమ డబ్బును వెచ్చిస్తున్నారు. సామాజిక సేవలో ముందు వరుసలో ఉంటున్న రాంకిషన్ 30 ఏండ్లుగా చెంచుల అబివృద్ధి కోసం అనేక రకాలుగా కృషిచేస్తున్నారు. టీబీ, కలరా, మలేరియా, చర్మవ్యాధులు వీరిని చుట్టుముట్టిప్పుడు ఇప్పటికి 2వేల సార్లు క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్సలు అందించారు. తిండి లేకపోవడం వలనే టీబీ, చర్మవ్యాధులు, మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. వాటి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధుల ద్వారా వారి ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. చెంచుల అభివృద్ధి కోసం వీరు చేస్తున్న కృషిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం జూన్2న వీరికి అవార్డు ఇచ్చింది. నిజాయతీగా పనిచేస్తున్న వీరు అవార్డు కు వచ్చిన డబ్బును ఇప్పటి వరకు తమ అకౌంట్లో వేసుకోకపోవడం విశేషం.
బౌరాపురం జాతర
సలేశ్వరం, మల్లెలతీర్థం, లొద్ది మల్లయ్య, శ్రీశైలం యాత్రల మాదిరిగానే బౌరాపురం పేరు ప్రఖ్యాతలు గాంచింది. 70ఏండ్ల కాలంలో ఒకేసారి బౌరాపూర్ చెరువు ఎండిపోయింది. ప్రతిఏటా కళకళలాడే ఈ చెరువు సమీపంలో చెంచుల ఆరాధ్య దైవమైన బౌరమ్మ , మల్లయ్యలు ఉన్నారు. ఇక్కడే వీర శిల ఒకటి ఉంది. చెంచుల వీరత్వాన్ని తెలిపే విగ్రహంగా ఈ వీరశిలలను చెప్తారు. నీలం సంజీవ రెడ్డి ఫిబ్రవరి 14న బౌరాపూర్ నుంచి నేరుగా శ్రీశైలం రోడ్డు వేయాలని నిర్ణయించారు. కాని ఆ తరువాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదు. ఈ వీర శిలను దేవునిగా కొలిచేవారు. బౌరాపూర్లో బౌరమ్మ, మల్లన్నలు చెంచులకు ఆరాధ్య దైవాలుగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఈ బౌరాపూర్ మల్లన్న జాతరను చెంచులు ఇష్టమైన ఉత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 1991, 92లోనే చెంచు పెంటలలో ఉన్న చెంచుల చేత సుండుపెంటలో బౌరాపూర్ జాతర నిర్వహించారు. 12 చెంచు పెంటలతో 2008 నుంచి బౌరాపూర్ జాతరను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోవడం చేత 2014 నుండి అధికారికంగా ఈ జాతరను చేస్తున్నారు. సుండుపెంట చెంచులంతా బౌరాపూర్ చేరి అక్కడ తమ ఆచార వ్యవహారాలను ప్రదర్శించి ఇష్టమైన మల్లయ్య, బౌరమ్మలను కొలుచుకుంటారు.
బౌరాపురంలో పెండ్లిళ్లు
బౌరాపురంలో చెంచులు తమ బిడ్డల పెండ్లిండ్లు జరుపుతారు. పెండ్లిల్లో చెంచు పెద్ద అయ్యవారి గా ఉండి పెండ్లిని పూర్తి చేస్తారు. ఇందులో మంత్రాలు, తంత్రాలు, పూజలు ఏమి ఉండవు. టెంకాయలు, అగర్బత్తిలు కూడా కనపడవు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను కూర్చోబెట్టి పెండ్లి కుమారుని తల్లి దండ్రుల చేత పెండ్లి కుమారుని చేత బాస చేయిస్తాడు. మీ బిడ్డను క్షేమంగా చూసుకుంటామని ఎలాంటి కష్టాలు పెట్టమని హామీ తీసుకుంటారు. అమ్మాయి చేత కూడా భర్తతో కలిసి అత్తమామలతో సేవ చేయడానికి వస్తున్నానని ఇకనుంచి మీ ఇంట్లో అన్ని తానై చూసుకుంటానని బాస చేయించి పెండ్లి పూర్తి చేయిస్తారు. అయితే పెండ్లి సందర్భంగా చెట్టు, పుట్ట, నీళు,గాలి, అగ్ని దేవతలను ఆరాధిస్తారు. స్వామి నీవు బాగుండు, మమ్మలను బాగా చూడు, అడవి తల్లి మా ఆకలి తీర్చు మా పక్కన ఉన్న వారి ఆకలి తీర్చమంటూ వారు ప్రకృతిని వేడుకుంటారు
దర్బార్
బౌరాపురం జాతర సందర్భంగా చెంచులు దర్బార్ పెడతారు. ఈ దర్బార్లో చెంచులకు ఏడాదికి సరిపడే ప్రణాళికను రూపొందిస్తారు. వీటిని అమలు చేయాలని అధికారుల ముందు ఉంచుతారు. ఆదివాసిలకు అక్షర జ్ఞానం ఉండదు కాని మిగతా జ్ఞానం అందరికంటే ఎక్కువగా ఉంటుంది. వీరి ఇంట్లో సోఫాసెట్లు, కూర్చీలు, మంచాలు లాంటివి ఏమి ఉండవు, ఎండిన కట్టె ఎండిన గడ్డితో గుడిసెలు వేసుకుంటారు. ఏ రోజుకు ఆహారం ఆ రోజే వెతుక్కుంటారు తప్ప దాచుకోరు. చిన్న చిన్న జంతువులను వేటాడడం తప్ప పెద్దవాటి జోలికి వెళ్లరు. పులిలాంటి పెద్ద జంతువులు అడ్డంవస్తే పక్కకు తప్పుకుంటారు తప్ప ఎలాంటి హాని చేయరు. వీరు ప్రకృతిలో వస్తున్న మార్పులను బట్టి తుఫాన్, చలి వేడిమి వంటి వాటి గురించి చెప్తారు.
చెంచు జాతిని రక్షించాలి
ఐటీడీఏ ఏర్పడి 40ఏండ్లయినా చెంచుల అభివృద్ధి జరుగలేదు. కోట్లాది రూపాయలు అడవిపాలైన చెంచుల ప్రగతి గుడిసెను దాటడం లేదు. ఇప్పటికి చెలిమె నీళ్లు, బుగ్గబావి నీళ్లు తాగుతున్నారు, పసరు మందులతో గాయాలు మాన్పుకుంటున్నారు. గుడిసెలో ప్రసవాలు జరుగుతున్నాయి. మలేరియా జ్వరం వణికిస్తున్నది. టిబి ప్రాణం తీస్తున్నది. ఏడో తరగతి పాసైన పిల్లల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు. బాల్యవివాహాలు పెరిగి బాలింత రోగాల బారిన పడుతున్నారు. 30ఏండ్లకే వారికి ముసలితనం వస్తుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి వారి సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టి వారి జాతిని కాపాడాల్సిన బాధ్యత పాలకుల పై ఉంది.
ప్రేమ పెండ్లిళ్లు
వీరు పెండ్లిండ్లు, పేరంటాలు ఏవైనా పెద్దల ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్తారు. అవగాహన కుదిరి ప్రేమించుకుని కొంతకాలం సహజీవనం చేసిన తరువాత చెంచు పెద్దలు పిలిపించి పెండ్లిండ్లు చేసే ఆనవాయితీ చెంచు పెంట (పల్లె)ల్లో ఉంది. 11.08.1933లో అమ్రాబాద్ తహసీల్దార్ సయ్యద్గౌస్ మొదటి చెంచు మహాసభలు జరిపించారు. అప్పట్నుంచి వెలుగులోకి వచ్చిన ఈ చెంచులు ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు తినే ఆహారం ఇప్పటికి ఏ మాత్రం మారలేదు.
Authorization