నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం, జంగారెడ్డిగూడెం గ్రామపంచాయతీలోని గ్రామం రామలింగాల గూడెం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు వేలాది ఏండ్లుగా మానవ కార్యకలాపాలకు నిలయాలుగా కొనసాగుతున్నాయి. నార్కెట్ పల్లి- అద్దంకి జాతీయరహదారిలో నల్లగొండ జిల్లా కేంద్రానికి 11 కి.మీ.ల దూరంలో వుంది రామలింగాలగూడెం. మధ్య యుగాల నాటి మార్కండేయాలయం, ఉంది.ఈ దేవాలయం మంటపంలోనే వినాయకుడు, కేశవుడు, నంది వున్నాయి. బయట ఎల్లమ్మగా కొలువబడే నాగదేవత వుంది.
ఈ గుడిపక్కన చిన్నగుట్ట వుంది. అందుకని ఈ వూరును గుట్టకాడిగూడెం అని కూడా పిలుస్తారు. ఈ గుట్టమీద ఒకప్పుడు దేవాలయం వుందనడానికి సాక్ష్యంగా రెండు శిల్పం లేని రాతిస్తంభాలున్నాయి. వాటి మధ్య దొరుకుతున్న ఇటుకలు సాతవాహన కాలం నాటివని. 13న్నర అంగుళాల పొడవు, 13 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల మందంతో కొన్ని, పదమూడున్నర, పది ముప్పావు, మూడు అంగుళాల పొడవు, వెడల్పు, మందాలతో కొన్ని, పదకొండు అంగుళాల పొడవు, పదిన్నర అంగుళాల వెడల్పు, మూడు అంగులాల మందం కలిగిన కొన్ని ఇటుకలు కనిపించాయి. ఇవి క్రీస్తు శకారంభ కాలానివి కావచ్చు. గుడికి ఎదురుగా చిన్న రాతిదోనె సరస్సు రూపంలో కనిపిస్తున్నది. ఇక్కడికి కొంచెం పైవైపు దక్షిణంగా పేర్చిన రాతిగుండ్లు, రాతి పునాదులు, ఇటుకల నిర్మాణం అగుపిస్తున్నది. ఇదొక ప్రాచీన ఆవాసంగా వుండేదని చెప్పడానికివి ఆధారాలు.
పాటిగడ్డలు
గుట్టకు పడమర దిశ, ఉత్తరదిశలో పాటిగడ్డలు ఉన్నాయి. టెర్రకోట మట్టిపూసలు, పెంకుల తొక్కుడు బిళ్ళలు, ఎరుపుపూత, నలుపుపూత పెంకులు, కుండమెడల ముక్కలు, దంపుడురాళ్ళు, ఈ పాటిస్థలానికి దగ్గరలో పెద్ద ఇటుకలతో కట్టిన గోడ అగుపిస్తున్నది. ఇది నివాసమా, బౌద్ధానికి సంబంధించినదా పరిశోధించాల్సిన అవసరముంది. ప్రస్తుత గ్రామం ఈ గుట్టకు పడమరన వుంది. అక్కడి పాటిగడ్డలో లభిస్తున్న కుండపెంకులు బూడిదరంగులో లభిస్తున్నాయి. ఇవి మధ్యయుగాల నాటివి. అంటే ఒకప్పుడు గుట్టవద్ద వున్న గ్రామం పడమరకు తరలిపోయిందని తెలుస్తున్నది. అక్కడొక హనుమంతుని విగ్రహం వుంది. 'గావ్ జలే హనుమాన్ బాహర్' అనే లోకోక్తి ప్రకారం అక్కడ ఊరుండేదనడానికి హనుమంతుడే సాక్ష్యం. అడుగడుగున రాతితో చేసిన నూనెగానుగలు, ఇనుము చిట్టెములు కనిపిస్తున్నాయి. ఇవి ఒకప్పుడు అక్కడ నూనె పరిశ్రమ, ఇనుముతయారీ కేంద్రాలుండేవని చెప్పడానికి సాక్ష్యాలు. గ్రామంలో అక్కడక్కడ కనిపిస్తున్న దేవాలయాల, శిల్పాల శిథిలాలు ఇక్కడ దేవాలయాల సముదాయాలుండేవని చెపుతున్నాయి. 90ఎకరాలకు పైగా విస్తరించిన చిన్న చెరువు, పెద్దచెరువులు గ్రామ వ్యవసాయానికి ఆదరువులు. వీటిని కందూరుచోడుల కాలంలో నిర్మించారు. పానగల్లు ఉదయసముద్రం నీళ్ళు ఈ చెరువులకు అందుతుంది.
తొలి, మలి చారిత్రక యుగాల ఆధారాలు: ఇక్కడ చరిత్రపూర్వయుగపు ఆనవాళ్ళు కూడా లభించాయి. చెరువులో పదులకొద్ది బంతిరాళ్ళ సమాధులు (మెగాలితిక్), సమాధుల నుంచి బయటపడ్డ నలుపు, ఎరుపు రంగు కుండల పెంకులున్నాయి. కొత్తరాతియుగానికి చెందిన రాతిపనిముట్లైన చేతిగొడ్డండ్లు, వడిసెలగుండ్లు చాలా దొరికాయి. గుట్టమీద రాతిపనిముట్లు నూరిన గుంటలు కూడా వున్నాయి. ఇక్కడొకప్పుడు చరిత్రపూర్వయుగపు మానవులు నివసించి వుంటారు.
Authorization