కుంభమేళా భారతీయ యాత్రా మేళాలకు సంబంధించినంతవరకు అత్యంత పెద్ద మేళా. ఐక్యరాజ్యసమితి (యెనెస్కో) 'ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హుమానిటీ లిస్టు - 2017లో దీన్ని కూడా చేర్చింది. 12 ఏండ్లకోమారు జరిగే కుంభమేళా రొటేషన్ పద్ధతిలో నాలుగు నదుల ఒడ్డున జరుగుతుంది. ఒకసారి గంగా నది ఒడ్డున ఉన్న హరిద్వార్లో, మరోసారి గంగా, యమున, సరస్వతి సంగమమైన ప్రయాగరాజ్ (అలహాబాద్)లో, ఇంకోసారి ఉజ్జయినీలోని షిప్రా దగ్గర; గోదావరి ఒడ్డున ఉన్న నాసిక్ దగ్గర ఒకసారి కుంభమేళాలు జరుగుతాయి. 12 ఏండ్ల లోపల ఆరేండ్లకోమారు చిన్న చిన్న మేళాలు కూడా జరగుతాయి. వీటిని అర్థ కుంభమేళాలు అంటారు. ఈ ఏడాది మకర సంక్రాంత్రి నుంచి శివరాత్రి వరకు అర్థకుంభమేళా ప్రయాగరాజ్లో జరిగింది. ఈ సందర్భంగా ఇస్తున్న కుంభమేళా విశేషాలు ఇవి..
సన్యాసులు, గృహస్థులు, ధనవంతులు, పేదలు, దిగంబరులు, వస్త్రదారులు, ఆడ, మగ, పిల్ల, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారు పవిత్రస్నానం ఆచరించడానికి కుంభమేళాకి వస్తారు. హిందుమత సామాజిక, సాంస్కృతిక మూలాలపై ప్రభావం కలిగించే కథలు ఈ కుంభమేళా పుట్టుకకు సంబంధించినవి చాలా ప్రచారంలో ఉన్నాయి. ఆశ్ఛర్యకరమైన సంగతేమిటంటే మన ప్రాచీన మతపరమైన గ్రంథాల్లో ఎక్కడా కుంభమేళా ప్రస్తావనే కనిపించదు. కేవలం కుంభమేళా గురించి ప్రచారంలో ఉన్న కథలన్నీ జనం నోళ్లలో నానుతూ ప్రచారం అవుతున్నవే.
ఔను, వేద గ్రంథాలు, సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు, ధర్మశాస్త్రాలు లేదా ఏ ఇతర ప్రాచీన సాహిత్యంలోనూ కుంభమేళా గురించిన సమాచారం కనిపించదు. అమృతం కోసం దేవ దానవులు సముద్ర మధనం చేశారని, ఫలితంగా ఉద్భవించిన అమృత భాండం నుంచి నాలుగు చుక్కలు చింది నాలుగు నదుల దగ్గర పడ్డాయని, ఆ స్థలాలలోనే కుంభమేళా జరుపుతున్నారని చెబుతారు. అయితే పురాణాల్లో సముద్రమధనం గురించి ఉన్నా నాలుగు చుక్కలు చింది నాలుగు చోట్ల పడటం మాత్రం కనిపించదు. అయితే ఈ కట్టుకథ ఎందుకు ప్రచారంలోకి వచ్చినట్లు? బహుశ ఎక్కువ ప్రాచీనతను కుంభమేళాకు ఆపాదిస్తే ఎక్కువ గౌరవం, భక్తి శ్రద్ధలు జనంలో కలుగుతాయని భావించి తరువాతి కాలంలో వచ్చిన కుంభమేళాలకు ఈ కథలు ఆపాదించినట్లు అర్థంచేసుకోవచ్చు. అయితే కొన్ని పురాణాల్లో కుంభ ప్రస్థావనలు ఉన్నాయి కాని అవి పండుగను సూచించేవి కాకపోవడం గమనార్హం.
సంప్రదాయవాదుల ప్రయాస
కుంభమేళా చరిత్ర అతి పురాతనమని చెప్పడానికి కొందరు సంప్రదాయవాదులు అధర్వ వేదం నుంచి రెండు పేరాలు (IV.34.7;XIX.53.3) యేడు పేరాలను రుగ్వేదం నుంచి (1.8.9, X.89.7, XII.3.23), యజుర్వేదం నుంచి ఒక దానిని (మధ్యానందిన,19.87) ఉటంకిస్తున్నారు. అధర్వ వేదం నుంచి ''చతుర్: కుంభాశ్రతుర్థ్ దదామి'' అనే వాక్యాన్ని, ''పూర్ణ్:కుంభో...'' అని ఉన్న మరో వాక్యాన్ని వీరు తమ వాదనలను బలపరచుకోవడానికి వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ కుంభ అనే పదాన్ని సంస్కృతంలో 'నీటికుండ' అనే అర్థంలోనే ఉపయోగించారు కాని పండగ, మేళా అనే అర్థంలో ఉపయోగించలేదనేది సుస్పష్టం. మధ్యయుగ కాలపు నాటి వేద పండితులు ఉద్గిథుడు (17వ శతాబ్ది), శాయణుడు (14 -15 శతాబ్దాలు) వంటివారుకూడా కుంభ అనే పదాన్ని పండుగ అనే అర్థంలో వాడలేదు. నిజానికి 14వ శతాబ్దం తర్వాత పండుగలు, తీర్థయాత్రలు ఎక్కువగా జరుపుకోవడం ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు ఆ అర్థంలో చూడలేదంటే వాస్తవం అర్థంచేసుకోవచ్చు. రుగ్వేదం, అధర్వ వేదంలోనూ కుంభ అనే పదాన్ని పండుగ అనే అర్థంలో ఉపయోగించలేదు. ఇక్కడ మరో సంగతి గమనించాలి. పాశ్యాత్య లేక రోమన్ రాశిచక్రాల సంకేతాలు గురించిన జ్ఞానం క్రీస్తుశకం తరువాతే భారతీయులకు పరిచయి అయ్యాయి. వేదాలు క్రీస్తుకు పూర్వం మనుగడలోకి వచ్చినవి. వేదకాలం నాటి ప్రజలకు అది తెలియదు. పాశ్యాత్య రాశుల గమనాన్ని లెక్కించే పద్ధతితో కుంభమేళాకి అవినాభావ సంబంధం ఉన్నందు వల్ల వేదకాలంలో కుంభమేళాను నిర్వహించలేదని గట్టిగా చెప్పవచ్చు.
ఇక పురాణాల దగ్గరికి వస్తే వాయు పురాణం (II.15.47) శ్రాద్ధ కర్మను నిర్వహించే పవిత్ర స్థలంగా కుంభను పేర్కొన్నది. బహుశ ఈ కుంభమే నారదీయ పురాణం (II.65.100) పేర్కొన్న ప్రాచీన సరస్వతి నది ఒడ్డున ఉన్న శ్రీకుంభం కావచ్చు. ఇక్కడ పవిత్ర స్నానమాచరిస్తే యజ్ఞం చేసిన పుణ్యం వస్తుందని నారద పురాణం పేర్కొన్నది.
ప్రయాగ, నాసిక్, ఉజ్జయినిలో కుంభరాశితో సంబంధం ఉన్న ఏ సంకేతంతోను కుంభయోగం జరుగదు. హరిద్వార్ కుంభమేళాలో మాత్రమే కుంభ అనే పదాన్ని ఉపయోగించే ఆచారం ఉన్నది. మిగతా చోట్ల ... అంటే ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్ లలో ఈ పేరుతో మేళా జరుగదు. నాసిక్, ఉజ్జయినిల్లో జరిగే మేళాలను సింహస్థ మేళా అని పిలుస్తారు. కుంభమేళా అని వ్యవహరించరు. ఇందుకు కారణం గురు గ్రహం సింహరాశిలో ప్రవేశించడమే.
పూర్ణ కుంభమేళా 12 ఏండ్లకోసారి జరిగిేతే, ఆరేండ్లకోమారు జరిగేది అర్థకుంభమేళా. ఇక 144 ఏండ్లకోమారు జరిగేది మహాకుంభమేళా. 2013లో మహాకుంభమేళా జరిగింది. మళ్లీ 2157లో కానీ ఇది జరుగదు. కుంభరాశిలోకి గురుడు, మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభమేళా నిర్వహిస్తారు. ప్రతి పన్నెండేండ్లకు గురుడు, సూర్యుడు ఆయా రాశుల్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి 12 ఏండ్లకు కుంభమేళా జరుగుతుందని అంటారు.
రెండు మూడు వందల ఏండ్ల నుండే...
విక్రమ స్మృతి గ్రంథం ప్రకారం ఉజ్జయినీ సింహస్థ 18 శతాబ్దం చివరిలో ప్రారంభమయింది. దీనిని మరాఠా రాజు రాణోజీ షిండే ప్రారంభించాడు. అతడే ఈ మేళాకి అఖరాలను ఆహ్వానించాడు.
ప్రయాగరాజ్లో ఏడాదికొకమారు జరిగే పండుగ గురించి రామచరితమానస్ (16వ శతాబ్దం), కులసత్ ఉత్ తవారిఖ్ (1695), చహర్ గుల్షన్ (1759) వంటి గ్రంథాలు ప్రస్తావించాయి. కానీ ఇవేవీ కుంభ అనే పదాన్ని ప్రస్తావించలేదు.
హరిద్వార్లో కుంభమేళా చైత్రమాసంలో జరిగితే, మాఘమాసంలో ప్రయాగ వద్ద జరుగుతుంది. నాసిక్ లో భాద్రపదం మాసంలో అయితే, వైశాఖమాసంలో ఉజ్జయినిలో జరుగుతుంది. బ్రిటిష్వాళ్ల కాలంలో ప్రయాగలో జరిగే కుంభమేళాకి సంబంధించిన మొదటి ప్రస్తావన 1868 పరిపాలనా పరమైన నివేదికలో కనిపిస్తుంది. శానిటేషన్, యాత్రికుల నియంత్రణకి సంబంధించిన వివరాలు అందులో పేర్కొన్నారు. ఆ నివేదికలో 'కూంభ్ ఫెయిర్' అనే పద సముదాయాన్ని కుంభమేళాను సూచించడానికి వాడారు.
అఖరాలు
అఖరా అని పిలిచే సన్యాసులు కుంభమేళాల్లో ఒక భాగంగా ఉంటారు. శంకరాచార్యులు విధించిన నియమాల ప్రకారం నడుచుకునేవారు కొందరైతే మరికొందరు సిక్కు పవిత్రగ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ ప్రకారం నడుచుకుంటారు. వీరుకాక జున అఖరాలు ఉన్నారు. వీరు శైవాన్ని అనుసరించేవారు. అఖరాలకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ వీరి శాఖే అతి పెద్దది. వీరు సుమారు నాలుగు లక్షలవరకు ఉంటారని భావిస్తున్నారు. ఇందులో 52 వంశాలవారు ఉన్నారు. బౌద్ధమత గురువు పద్మసంభవుడు స్థాపించిన ఒక వంశానికి చెందిన అఖరాలు కూడా ఉన్నారు. అందుకే మేళా సమయంలో బౌద్ధ గురువు దలైలామా సందర్శనకు వస్తూ ఉంటారు.
కుంభమేళాకు వచ్చే సాధువుల్లో నాగ సాధువులు దిగంబరంగా ఉంటారు. సమూహాలుగా వచ్చే ఈ సాధువులకు అఖండ స్వాగతం లభిస్తుంది. వారిని గుర్రాలపైన, ఏనుగులపైన ఊరేగిస్తూ తీసుకువస్తారు.
కుంభమేళా సందర్భంగా ఆరు పవిత్రస్నానాలు ఆచరిస్తారు. వీటినే షహిస్నానములని అంటారు. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, పుష్య పౌర్ణిమ, మాఘపౌర్ణిమ, బసంత పౌర్ణిమ, మహాశివరాత్రి దినాల్లో చేసే స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. 2019లో2019లో ప్రయాగలో జరిగిన అర్థ కుంభమేళాలో మొదటి షహి స్నానం చేయడానికిరెండు కోట్లమంది భక్తులు వచ్చారనిఏది ఒక అంచనా.
1895లో ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ కుంభమేళాలో పాల్గొన్నాడు. ''మన చలిదేశాల్లోని తెల్లోళ్లకి కుంభమేళా ఊహాతీతం, మహాద్భుతం'' అంటూ రాశాడు కూడా. స్వతంత్రం రాకముందు బ్రిటిష్వాళ్లే కుంభమేళాను నిర్వహించేవారు. భారత ప్రభుత్వం 1954లో మొదటిసారిగా అధికారికంగా నిర్వహించింది.
Authorization