ఉస్మానియా యూనివర్సిటీలో ఓ అపురూపమైన జాతర జరిగింది. ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని జాతరది. తెలుగు నేల నలుమూలల (ముఖ్యంగా తెలంగాణ) నుంచి దాదాపు రెండువందల మందికి పైగా కళాకారులు తమ తమ వాద్యాలతో ప్రేక్షక శ్రోతలను ఉర్రూతలూగించారు. ఈలలు, చప్పట్లుతో ఆడిటోరియం దద్దరిల్లుతుంటే మారుమూల పల్లెలు; అడవులు, వాగులు, వంకల నుంచి వచ్చిన కళాకారుల కండ్లలో ఆనంద భాష్పాలు! ఉస్యానియా తెలుగు, సోషియాలజీ, ఇంగ్లీష్, జర్నలిజం శాఖలు తెలంగాణ రచయితల వేదికతో కలిసి మార్చి 17, 18 తేదీలో'మూలధ్వని' పేరుతో వాద్య సమేళనం నిర్వహించారు. దీనిలో కేవలం ఆదివాసీ, జానపద వాద్యకారులకు మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించారు. మేళా ముగిసిన మరుసటిరోజు ఈ మూలధ్వనిపై ఒక సదస్సు కూడా నిర్వహించారు. నాలుగు శాఖల విద్యార్థులు, పరిశోధకులు, ఆచార్యులు, సహాయ ఆచార్యులతోపాటు మరికొందరు బయటివారు కూడా ఈ సెమినార్లో పాల్గొన్నారు. ప్రముఖ పరిశోధకుడు, రచయిత ఆచార్య జయధీర్ తిరుమలరావు, ఆయనతో కలిసి పనిచేస్తున్న ఆచార్య గూడూరు మనోజ ఈ సమ్మేళనానికి కర్త, కర్మ, క్రియలుగా వ్యవహరించారు. ఆదివాసి, జానపద కళాకారులను దగ్గరగా చూసి, వారితో మాట్లాడి, వారి వాద్యాలను విని పులకించిన అనుభూతితో అందిస్తున్న విశేషాలివి.
ఆదివాసీ, జానపద వాద్య సమ్మేళనం ప్రారంభ, ముగింపు వేడుకలు మరపురాని అనుభూతులను మిగిల్చాయి. వందలాది కళాకారులు ఒక్కసారిగా తమతమ వాద్యాలతో, నృత్యాలతో చెలరేగిపోతుంటే ప్రేక్షకులు ఆనందంతో పైకిలేచి ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని తమదైన పద్ధతిలో వ్యక్తంచేశారు. ఎప్పుడో నలభై యాభై ఏండ్ల క్రితం చూసిన జానపద, గిరిజన వాద్యాలు తమ ముందు రాగాలు పోతుంటే ఎట్లా స్పందించాలో వెంటనే అర్థం కాక శ్రోతలు తమ చిన్ననాటి ధోరణిలో అభినందనల వెల్లువలో కళాకారులను ముంచి లేపారు. డప్పులు, డోళ్లు, ఢమరుకాలు... ఏం దరువులవి! అడవి బిడ్డలు కాదు అడవే హైదరాబాదు కదిలొచ్చిందా అనే అనుభూతి!! కొనూపిరితో ఉన్న కొన్ని వాద్య కళారూపాలు మనకు చివరిసారిగా వీడ్కోలు చెప్పడానికి మహానగరానికి నడిచివచ్చినట్టుంది (వీడ్కోలు పలకటం నిజం కాకుంటె ఎంత బాండు!).
ఆదివాసీలు సామూహికత్వానికి ప్రతీకలు. వారి ఆట, పాట వారి సామూహికతను వ్యక్తం చేసే సాధనాలు. ఆటైనా, పాటైనా వాద్యంతోనే ముడివడి ఉంటాయి. పని, ఆట, పాట... ఏదైనా కావచ్చు. అంతా సామూహికంగానే పాల్గొంటారు. అడవిలోని తమ సమూహం నుంచి వేరుచేసి ఈ జనారణ్యంలోకి తీసుకొచ్చి ఆడమన్నా, పాడమన్నా అడవి బిడ్డలకు కాస్త ఇబ్బందే కదా.
సందర్భానుగుణంగా పాటను, డ్యాన్సును మార్చుకుంటారు ఆదివాసీలు. పాటను, వాయిద్యాన్ని వేరుచేయలేం. పాటలేకుండా వాయిద్యాలను మోగిస్తూ వాటికి అనుగుణంగా నృత్యం చెయ్యమంటే అది కృత్రిమంగానే ఉంటుంది. అందుకే ఈ సమ్మేళనానికి వచ్చిన కళాకారులు కేవలం వాద్యానికే పరిమితం కాలేదు. దానితో ఆట, పాటను రంగరించారు.
విశాలమైన మైదానం దాని చుట్టూ ఆదివాసీల ఇండ్లు, మైదానం మధ్యలో నెగడు వెలిగించుకొని మసక మసక చీకటి పడుతుండగానే పనులు ముగించుకొని కాస్తంత తిని అక్కడికి చేరి ఆడమగ ఆటలు ఆడుతూ, పాటలు పాడుకునే దృశ్యాన్ని, ఈ ప్లడ్లైట్ల కాంతిలో వందల మంది సమక్షంలో పావుగంటలో ఆడిపాడి, వాద్య పరికరాలతో ప్రదర్శన ఇవ్వడం కృతకంగా ఉంటుందని నిర్వాహకులకూ తెలుసు. జానపద కళాకారులకు కూడా ఇదే వర్తిస్తుంది. అయినా మన ఆదివాసీ, జానపద వాద్య సంపద, దానితో పెనవేసుకున్న సామాజిక జీవితాన్ని కొంతలో కొంతైనా ప్రజాబాహుళ్యానికి తెలియజేయడానికి ఈ సమ్మేళనాన్ని ఎంతోశ్రమకు ఓర్చి నిర్వహించారు.
కొత్తగా పరిశోధనలోకి ప్రవేశించే విద్యార్థులకు సమ్మేళనంలో చూసిన, విన్న విశేషాలు ఆదివాసీ, జానపద సంగీతం వారి వారి జీవితాలతో ఎట్లా పెనవేసుకుపోయాయో చెప్పే క్రమంలో ఒక ప్రాథమిక అవగాహన కలిగించాయని చెప్పక తప్పదు. అట్లాగే సంగీత సాహిత్యాలు, జానపద విజ్ఞానం పట్ల, సంస్కృతి పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఉన్న ఎందరికో ఈ 'మూలధ్వని' గొప్ప అనుభూతిని మిగిల్చింది. అదే సమయంలో ఇంకా పరిశోధన చేయవలసిన అంశాలు, వెలుగులోకి తేవలసిన కళాకారులు, కొనూపిరితో ఉన్న కళారూపాలు, వాద్య సంగీతాలు... ఇట్లా ఎన్నో విషయాలను మనముందుంచి ఏం చేస్తారో చెయ్యమని సవాల్ విసిరింది. ఈ సవాల్ని మనందరం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అంశం.
మూలధ్వనిలో కళాకారులతో సంభాషణలు, వారివాయిద్య విశేషాలపై విన్న సంగీతం, సాహిత్యం, నృత్యాలు అన్నింటినీ మేళవిస్తే మనిషికి ఆటపాటలు లేని జీవితం ఆదిమ సమాజాల నుంచి నేటివరకు ఎక్కడా లేదని అర్థమవుతున్నది.
పాట తొలి వాహకం
కోయ, గోండీ వంటి తెగలకు లిపి అందుబాటులో లేనందువల్ల వారు తమ తరువాతి తరాలకు అందించాల్సిన ముఖ్యమైన విషయాలను మౌఖికంగానే అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ మౌఖిక విజ్ఞానం ఎక్కువగా పాటల రూపంలో ఉండటం ఇక్కడ గమనార్హం. పాటలు లయబద్ధంగా, నృత్యంతో కలిపి ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి కొత్త తరంవారు నేర్చుకోవడానికి, సామూహికంగా పాడుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. అట్లా ఆకర్షణీయంగా ఉండే ఆటపాటల ద్వారా వ్యవసాయం, వేట వంటి ఆర్థిక కార్యకలాపాల నుంచి పెండ్లయి అత్తవారింటికి వెళ్లి కొత్త వారితో ఎట్లా మెలగాలి వంటి జీవితంలోని సమస్త అంశాలను పాటల ద్వారానే బోధించడం కనిపిస్తుంది. అట్లాగే జానపద కళాకారులు పాడే తత్వాలు, ఐతిహాసిక ఘట్టాలు, కథలు కులం, మతంతో మమేకమై భారతీయ సాంస్కృతిక మూలాలు, కళాకారుల సృజన, ధిక్కార స్వరాలకు సంకేతాలుగా కనిపిస్తాయి.
జయధీర్ తిరుమలరావు, గూడూరు మనోజ 'మూలధ్వని' పేరుతో జానపద గిరిజన సంగీత వాద్యాల సామాజిక చరిత్రను తెలిపే పుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రాశారు. వాటిని ఈ సమ్మేళనంలో ఆవిష్కరించటం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని ఆదివాసీ, జానపద వాద్యపరికరాలు, వాటిని వాయించే కళాకారుల గురించి ఇక్కడ రాయడానికి స్థలం చాలదు. అరుదైన, సాధారణ జనానికి అంతగా తెలియని వాద్య విశేషాల్లో కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం జరిగింది.
గోండు వాద్యాలు
గోండులకు దాదాపు పన్నెండు వాద్యాలు ఉన్నాయి. ఈ వాయిద్యాలంటే వారికి ప్రత్యేకమైన గౌరవం. పన్నెడు మెట్ల వాద్యం గోండు తెగలో మాత్రమే మిగిలి ఉంది. కిక్రీ వీరు వాయించే వాద్యాలలో ఇంకా కొనసాగుతున్న ప్రాచీన వాయిద్యం. తుడుం, గుమేల, కాలికోం, పెప్రె వంటి వాద్యాలు ఇప్పటికీ కొనసాగుతున్న వాద్యవిశేషాలు.
ఊపేసిన సిద్ధిగోమాలు
ఆఫ్రికా నుంచి మూడువందల యాభై ఏండ్ల క్రితం భారత దేశం వచ్చి స్థిరపడిన ప్రజలను సిద్ధీలు లేదా సిద్ధిగోమాలు అంటారు. వీరు మాతృభూమిని వదిలి వందల ఏండ్లవుతున్నా తమ సాంస్కృతిక మూలాలను మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారని చెప్పడానికి వారి వాయిద్యాలు, నృత్యాలే సాక్ష్యాలు. మన హైదరాబాదులో వీరు ఉన్నారు. వీరు మార్ఫా, అరబీ డఫ్, గడా అనేవాయిద్యాలను వాయిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. వీరి ప్రదర్శన ప్రేక్షకులనే ఉర్రూతలూగించింది.
గొరవయ్యల...
మధ్యయుగ వేషధారణలో ఉండే శైవులు గొరవయ్యలు. కురవ కులంవారికి గురువులుగా వ్యవహరిస్తారు. మహబూబ్నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వీరు పూజలు, వివాహాలు నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నారు. వీరు నోటిలో పిల్లనగ్రోవిని పెట్టుకొని ఒక చేత్తో వాయిస్తూ మరో చేత్తో ఢమరుకాన్ని ఏకకాలంలో వాయిస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి తమ వాయిద్యాలకు అనుగుణంగా తామే నృత్యాలు కూడా చేస్తారు. ఈ విధంగా ఒకే సారి ఒకే కళాకారుడు మూడు వాయిద్యాలను వాయిస్తూ నృత్యం చేయడం చాలా కష్టంతో కూడిన పని. వాయిద్యాలకు తోడు మధ్యలో పాట, వచనం ఉంటుంది.
దుబ్బు
మధ్యప్రదేశ్, తెలంగాణలో కనిపించే అరుదైన వాద్యం దుబ్బు. దీన్ని కూర్చొని వాయిస్తారు. దుబ్బుకి గజ్జెలు కడతారు. వాయించే కళాకారుడు కూడా కాలుకి గజ్జెలు కట్టుకొని దరువుకి అనుగుణంగా గజ్జెల సవ్వడి వచ్చేలా కాలు ఊపుతాడు. ఈ వాద్యం వాయించే కళాకారులు కనకదుర్గమ్మ కథలు చెబుతారు. తెలంగాణలో బహుజన కులాలవారు ఈ వాద్యాన్ని తమ కథాగానాల్లో ఉపయోగిస్తారు.
బంజారా వాద్యాలు
బంజారాలు లేదా లంబాడీలు అని పిలిచే గిరిజనులకు దవుడియా, భాట్లు, ధాడీలు అనే మూడు ఉపతెగలు ఉన్నాయి. వీరే రకరకాల వాయిద్యాలను వాయించి లంబాడీల ఆచార సంప్రదాయాల్లో ముఖ్య పాత్ర వహిస్తారు. భాట్లు సారంగి అనే వాద్యం వాయిస్తారు. ధాడీలు రబాబ్ అనే తంత్రీ వాయిద్యాన్ని వాయిస్తారు. చిరుతలు, తాళాలు, నగారాలు వంటి వాటినీ వీరి ఆటపాటల్లో ఉపయోగిస్తారు.
గుజ్జిడి మొగ్గ
ఆడ, మగ సామూహిక నృత్యంచేయడం గుత్తికోయల సంప్రదాయాల్లో ఒకటి. పురుషులు డోలు కొయ్య వాయిస్తుంటే స్త్రీలు అందుకు అనుగుణంగా తమంత ఎత్తు ఉండే ఇనుప కడ్డీని పట్టుకొని మధ్య మధ్య లయాత్మకంగా దానితో నేలను తాకిస్తూ ఉంటారు. దానిపైన ఇనుమును పోతపోసి మొగ్గలు చేస్తారు. వాటిలోపల ఇనుప గుండ్లు అమరుస్తారు. కడ్డీ పైభాగాన మూడు చిన్న ఇనుప చువ్వలతో బుడిపె ఆకారం చేసి వాటిలో మొగ్గల కొనలకి కొక్కెం లాగా తయారుచేసి బుడిపెలో అమరుస్తారు. ఇట్లా ఎనిమిది తొమ్మిది మొగ్గలను తొడుగుతారు. ఈ వాద్యాన్నే గుజ్జిడి మొగ్గ అంటారు.
స్కాలర్షిప్ ఇస్తారు
అతి ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న వాద్య విశేషాల్లో బుర్ర వీణ ఒకటి. రేపో మాపో మరుగున పడబోతున్న తంత్రీవాద్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం దీన్ని వాయించగల కళాకారుడు ఒక్కరే ఉన్నారు. పాత మహబూబ్నగర్ జిల్లా దామరగిద్దె గ్రామానికి చెందిన దాసరి కొండప్ప ఒక్కరే దీన్ని వాయించగల ఏకైక కళాకారుడు. అతడి వీణావాదనకు సభికులందరూ ఆనందంలో మునిగితేలారు. అతడి సంతానం కాని, ఇతరులు కానీ బుర్రవీణ వాదన నేర్చుకోలేదు. అందువల్ల కొండప్పతోనే ఈ వాయిద్య విశేషం మరుగునపడిపోతుందని సాంస్కృతిక ప్రేమికులు భయపడుతున్నారు. ఈ సమ్మేళన నిర్వాహకులు ఇటువంటి మరుగై పోతున్న కళారూపాలను నేర్చుకుంటే స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఛోన్కా, సంభళ్
గోంథళీ కథాప్రదర్శన నిజాం సంస్థానంలోని తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాల్లో పూర్వం జరిగేది. ప్రస్తుతం అది తెలుగు నేలపై అవసాన దశలో ఉన్నది. మహబూబ్ నగర్ ప్రాంతంలో ఒకరిద్దరు కళాకారులు మాత్రమే మరాఠి, తెలుగు భాషల్లో ఈ ప్రదర్శన ఇస్తున్నారు. ఈ కళాకారులు ఛోన్కా, సంభళ్ అనే వాయిద్యాలను వాయిస్తారు. మొగలిపొద కాండంతో ఛోన్కా తయారుచేస్తారు. ఇది జమిడికను పోలి ఉంటుంది. కానీ దానికంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఛోన్కాని ఉక్కుతీగతో వెదురు బొంగు మీదుగా బిగించుకుంటారు. పై భాగంలో నల్లటేకుతో చేసిన పిణ్ణితో నాదం సరిచూసుకుంటారు. ఛోన్కా కింది భాగం మేక చర్మంతో మూస్తారు. గోంథళ్ కథ చెప్పే నాయకుడు దీన్ని వాయిస్తాడు. ఇక సంభళ్ కథనం పరంగా, సంగీత పరంగా ప్రాముఖ్యం ఉన్న వాయిద్యం. ఇత్తడి డోళ్లమీద ఇనుముతో చేసిన ఒక చట్రాన్ని అమర్చి, దాన్ని చర్మంతో మూస్తారు. దానికి తొమ్మిది రంధ్రాలు చేసి తొమ్మిది తాళ్ల ఉపయోగించి తొమ్మిది ముడులతో బిగిస్తారు. ఈ సంభళ్ని కురుపణ్తో వాయిస్తారు. రెండో చేతిలో కాడి ఉంటుంది.
చెంచుల జేగంట
చెంచులు వాయించే జేగంట ప్రత్యేకమైనది. ప్రత్యేక వేషధారణతో చెంచులు తమకు హక్కుగా ఇచ్చిన పట్టీ గ్రామాల్లో తిరుగుతూ చిన్న చిన్న పదాలతో పాటలు పాడుతూ మందంగా ఉండే వెడల్పైయిన లోహపు ప్లేట్పై చెక్క పుల్లతో లయాన్వితంగా కొడుతూ ఇంటింటికీ తిరుగుతారు. గృహస్థులు ఇచ్చే ధన ధాన్యాలను స్వీకరిస్తారు. శ్రీశైలం అడవుల్లోని చెంచుల ఇండ్లలో ఈ గంటలు కనిపిస్తాయి. అక్కడి నుంచి వలసవచ్చి మహబూబాబాద్ ప్రాంతంలో స్థిరపడిన చెంచులు ఇప్పటికీ ఈ జేగంటలను వాయిస్తున్నారు.
Authorization