ఈ మడుగు మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, శివ్వారం గ్రామంలో వుంది. ఏలాల జాతర తొవ్వదాటి 15కి.మీ.లు పోతే శివ్వారం ఊరిచివర 1కి.మీ. దూరంలో ఎల్.మడుగు వుంటుంది. గోదావరిఖని నుంచి మంచిర్యాల తొవ్వలో ఇందారం అనే ఊరు నుంచి 35కి.మీ.ల దూరంలో ఉంటుంది. మంచిర్యాల, చెన్నూరు నుంచి బస్సుల్లో రావచ్చు.
ఎల్-మడుగు ఒడ్డున కనిపించే బౌద్ధగుహారామాలను పెద్దపల్లి జిల్లా చారిత్రక పరిశోధకుడు సముద్రాల సునీల్ అన్వేషించాడు. గడిచిన పదేళ్ళలో ఈప్రాంతంలోని అనేక చారిత్రక విశేషాలను వెలుగులోనికి తెచ్చాడు. ఈ ప్రాంతంలోని టూరిస్టులకు, చరిత్రకారులకు గైడ్. ప్రసిద్ద చారిత్రక రచయితలకు విషయమందించిన మంచి సర్వేయర్.
ఎరబాటి బాబూరావుగారు రచించిన 'రామగిరిచరిత్ర'(1971)లో ఈ మడుగుకొక పురాణకథను జోడించారు. 'జటాయువు దహనసంస్కారాలు చేసి గోదావరిననుసరించి రామ, లక్ష్మణులు నడిచిపోతున్నపుడు అయోముఖి అనే రాక్షసి లక్ష్మణున్ని చూసి 'రావోయి రమిద్దాం' అని గట్టిగా కౌగిలిలో పట్టుకున్నదట. అపుడు కోపధారి లక్ష్మణుడు చురకత్తి తీసి అయోముఖి ముక్కు,చెవులు కోసాడట. ఇది పురిపండా అప్పలస్వామి రాసిన 'వ్యవహారికాంధ్ర వాల్మీకి రామాయణారణ్యకాండ'లో వివరించినారట. ఆ అయోముఖి అవమానంతో పరుగుతీసి గోదావరి అంచున పడి మరణించిన నీటిమడుగును లంజమడుగు (ఎల్.మడుగు) అన్నారట.
శివ్వారం ఎర్రచెరువుదాటి ఈ మడుగు దగ్గరకు పోవచ్చు. ఇక్కడ మొసళ్ళ పెంపకకేంద్రం వుంది. అద్భుతమైన గోదావరి ప్రవాహదారుల అందాలను చూడగలిగే ప్రాక తిక ప్రదేశం ఇది. ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తే విహారయాత్రాస్థలం అవుతుంది. ఇసుకరాతిగుట్టల ధూళిని మోసుకొచ్చిన కొండనీటి ప్రవాహాలు ఈ మడుగు ఒడ్డుపక్కన బీచులను తలపించే ఇసుకనేలను పరిచాయి. చుట్టూరా ప్రాక తిక సౌందర్యం వర్ణనాతీతం.
ఈ మడుగు ఒక అంచున నిలిచివున్న కొండగట్టు (దాదాపు 250 అడుగుల ఎత్తు)లో మానవనిర్మిత కొండగుహలున్నాయి. ఇందులో ఒక గుహలో ఇసుకరాతిలో చెక్కిన ఎత్తైన పానవట్టంతో శివలింగం కనిపిస్తున్నది. ఇక్కడి రాతిస్తంభాలకు గౌరికుండం జలపాతం వద్ద గుహాలయ స్తంభాలకు పోలిక కనిపిస్తున్నది. ప్రస్తుతానికి అగుపించే నాలుగు గుహాలయాలు బయటకు ద్వారస్తంభాలతో, లోపల రాతిగద్దెలతో దేవాలయాలనిపించే విధంగాను, దీపాల గూడులతో, మలుపు తిరిగిన రాతిగోడలతో చదునైన రాతినేలలతో బౌద్ధుల 'వస్సావాసా' (వర్షరుతువులో బౌద్ధ భిక్షకులు నివసించే తాత్కాలిక ఆవాసాలు)లనిపించే విధంగా వున్నాయి. గుహలున్న ప్రదేశంలోనే లభించిన ముతక ఇటుకలు సాతవాహన కాలానివి. సైజులో పెద్దవి. తయారీలో పాతవి. ఇటుకల అడుగులు పచ్చి ఇటుకలను పరిచిన గుర్తులు కలిగి వున్నాయి. ఒకగుహ ద్వారం పక్కన గుర్రంమీద స్వారీచేస్తున్న (రాచ)జంట శిల్పం కనిపిస్తున్నది. ద్వారస్తంభాల మీద పెట్టిన బ్రాకెట్లు, స్తంభాల శిల్పం పురాతనశైలికి చెందినవి. మరొకగుహ గదులుగా చక్కగా తొలిచిన పైకప్పుతో, దేవతాప్రతిష్టాన గర్భస్థానంతో అగుపిస్తున్నది. గుహల బయట కనిపిస్తున్న ప్రదేశం చక్కగా చెక్కిన రాతిస్తంభాలు, రాతి ఇటుకలు, రాతికడీలు పరచివుంది. గుహల పైభాగంలో కూడా తొలిచిన రాతిమెట్లు కనిపిస్తున్నాయి. గుహలు, గుహల బయట చక్కని ప్రణాళికతో నిర్మించిన నివాసాలు, ఆరామాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు గుహలు క్రీ.పూ.1,2 శతాబ్దాల నాటివని చెప్పవచ్చు. అటవీశాఖ అనుమతితో పరిశోధిస్తే ఈ ప్రాంతంలో మరిన్ని బౌద్ధారామాలు లభించే అవకాశం వుంది.
వజ్రయాన బౌద్ధంలో భిక్షుకులు ఆచరించిన తాంత్రికాభ్యాసంలో స్త్రీలను చేర్చుకోవడం వలన, మైథున తంత్రాల వల్ల బౌద్ధాన్ని ఆనాటి సమాజం బూతుపదాలతో అభిశంసించింది. నాటి బౌద్దుల ఆరాధనాస్థలాలను లంజగుళ్ళు అని, వారున్న ఆ ప్రదేశపు నీటిమడుగును 'లంజమడుగు' అని పిలిచారు. బౌద్ధం అంతరించింది కాని, పిలుపు మిగిలి పోయింది.
- శ్రీరామోజు హరగోపాల్, 9949498698, ఫోటో కర్టెసీ, స్థల పరిశోధన: సముద్రాలసునీల్
Authorization