ఏ ఊరన్నా వెళ్తే మనకు ఎన్ని రకాల ఇండ్లు కనిపిస్తాయో! అలాంటిది ఇటలీలో దక్షిణ ప్రావిన్స్లోని పుగ్లియా పట్టణంలో అబ్బెరోబెల్లో అనే ఊళ్లో ఒకేలా ఉన్న వందల ఇండ్లు కనిపిస్తాయి. అయితే ఏంటీ అంటారా? ....ప్రతి ఏటా కేవలం వీటిని చూసేందుకే కొన్ని వేల మంది వస్తుంటారట. ఇంతకీ వాటి విశేషమేంటో తెలుసా.. చూసేందుకు చిన్న చిన్న పిరమిడ్లలా, శంఖాకారపు పైకప్పుతో ఉండే వీటిని ట్రుల్లిలు అంటారు. వీటి నిర్మాణానికి సున్నపురాయి, బండరాళ్లు మాత్రమే వాడారట. 14వ శతాబ్దంలో కట్టించినా, ఈ నాటికీ చెక్కు చెదరలేదు. వీటిని కట్టించింది ఆ ప్రాంతపు రాజు రాబర్ట్ డి అంజూ. ఆయన కాలంలో దండయాత్రలప్పుడు తన సైన్యం చేసిన సేవలకు గుర్తుగా 15 వందల ట్రుల్లిలను నిర్మించి ఇచ్చాడు. చాలాకాలం సైనికుల వారసులే వీటిలో నివసించారు. ప్రస్తుతం వాళ్లంతా వలసవెళ్లి పోయారు. దాంతో ఈ ఇండ్లన్నీ ఖాళీ అయిపోయాయి. తరువాత వింత ఆకృతిలో ఒకేలా ఉన్నవాటిని చూసేందుకు పర్యాటకులు రావడం మొదలుపెట్టారు. ఇంకేముంది స్థానికులు వాటిని ఆక్రమించుకుని దుకాణాలు, హోటళ్లు, రిసార్టులుగా మార్చేశారు. పర్యాటక శాఖ ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దింది. విశేషమేమిటంటే.. వీటి నిర్మాణంలోని ప్రత్యేక శైలి వల్ల ఇవి వేసవిలో చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటాయట. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
Authorization