మానవ సమాజాలు మత్తు పానీయాలను తయారుచేసుకొని సేవించడం అతి ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నది. మనిషి జీవితంలోకి ఈ పానీయాలు ఎందుకువచ్చినట్లు? రాతియుగం నుంచి మానవుడు నాగరికతలను సృష్టించుకునే నేపథ్యంలో అధికమైన శారీరక శ్రమ చేయవలసి వచ్చేది. అట్లాగే ఎన్నో మూఢనమ్మకాలూ ఏర్పడ్డాయి. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు మత్తుపానీయాలను సృష్టించాయి. వాటిని తాగిన తర్వాత మనిషి తాత్కాలికంగానైనా తన ఒళ్లు నొప్పులను మరచి హాయిగా నిద్రించేవాడు. దేవతలు, దేవుళ్లకు జాతరలు, పూజలు నిర్వహించేటప్పుడు ఈ మత్తు పానీయాలనే సమర్పించి తమ కష్టాల నుంచి బయటపడేయమని కోరేవారు. ఇప్పటికీ ఆదివాసులు, జానపదులు అనూచానంగా వస్తున్న ఈ ఆచారం ప్రకారం, కల్లు, సారాయిలను గ్రామదేవతలకు సమర్పించడం మనకు తెలిసిన సంగతే కదా. మధువును సేవించి క్రూరమృగాలతో ధైర్యంగా పోరాడేవాడు మనిషి. వ్యవసాయం, మిగులు వుత్పత్తి కారణంగా వ్యాపార వాణిజ్యాలు వృద్ధి చెంది పట్టణాలు, రాజ్య వ్యవస్థ ఏర్పడటం; వీలున్నంత ఎక్కువ భూమిపై ఆధిపత్యం సాధించాలనే తపన, సంపద పోగుచేసుకోవాలన్న ఆశ వంటి కారణాల వల్ల తరచుగా రాజులు యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ధైర్యంతో పైశాచికంగా యుద్ధం చేసి శత్రువులను అంతమొందించడం కోసం మత్తుపానీయాలను సైనికులకు పోసేవారు. విజయం తర్వాత కూడా మత్తుపానీయాలు సేవించి మజా చేసుకోవడం పరిపాటిగా ఉండేది. యుద్ధంలో పాల్గొనే మదపుటేనుగులకు కూడా మత్తు పానీయాలను తాగించి శత్రు సేనలపై వదిలేవారు. అట్లా మొదలైన మత్తుపానీయాలను ఇప్పుడు రకరకాల బ్రాండుల పేరుతో ఇబ్బడిముబ్బడిగా మధువును తయారుచేస్తున్నారు. అతి ప్రాచీన కాలంలోనే మానవ సంస్కృతిలో మత్తుపానీయాలు భాగమయ్యాయని చెప్పడానికి మన వేదాల్లో కనిపిస్తున్న 'సుర' అనే పానీయం మంచి ఉదాహరణ. కేవలం సారస్వత సాక్ష్యాలే కాదు ప్రాచీన కాలంలో మత్తు పానీయాలను సేవించారని తెలియజేసే పురావస్తు ఆధారాలూ ఇటీవల కాలంలో లభించాయి. అందుకు మంచి ఉదాహరణలు ఈజిప్టులో ఉన్నాయి.
చైనా పురావస్తు శాస్త్రవేత్తలు గత నెలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు కొన్ని పాత్రలు బయటపడ్డాయి. అందులో కంచుతో తయారుచేసిన కెటిల్ కూడా ఉంది. దీనికి గట్టిగా బిగించిన మూత ఒకటి ఉంది. శాస్త్రవేత్తలు కెటిల్ మూతను తొలగించి చూసినప్పుడు అందులో తెల్లని ద్రవం కనిపించింది. ఇదేమయి ఉంటుందా అని లేబరేటరీలో పరీక్షించారు. అది 22200 ఏండ్ల క్రితం తయారైన మత్తు పానీయంగా ఆ పరీక్షల్లో తేలింది. చైనా షాంగ్జీ ప్రావిన్స్లోని క్విన్ వంశ రాజుల సమాధి అంచున లభించింది కెటిల్. ఈ ప్రాంతంలోనే 2016లో ఐదువేల ఏండ్ల క్రితం తయారైన బీర్ను కనుగొన్నారు. పూర్వం చనిపోయినవారితో పాటు వారు వాడిన వస్తువులు, ధనధాన్యాలు, ఇష్టమైన ఆహార పానీయాలను ఉంచడం పరిపాటయిన విషయమే. ఇప్పటికీ మన సమాజంలో కూడా మాంసం, సారా వంటివాటిని ఇష్టపడేవారు చనిపోతే వారితో పాటు కోడి లేదా మేక; సారా, బీర్, వైన్ బాటిళ్లను పూడ్చిపెట్టడం కనిపిస్తున్న సంగతే కదా. అట్లాగే అప్పటి మద్యం ఉంచిన కెటిల్ని కూడా మృతునితో పాటు పూడ్చిపెట్టిఉంటారు. క్విన్ వంశస్థుల (క్రీ.పూ221 207) సమాధుల నుంచి లభించిన 260 వస్తువులలో ఈ కెటిల్ ఒకటి. ఈ వస్తువులలో అధిక భాగం సంప్రదాయక అంత్యక్రియల్లో ఉపయోగించినవేనని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ మత్తు పానీయాన్ని తయారు చేయడానికి వేటిని వాడారు, క్విన్ వంశస్థుల రాజధాని గింజయాంగ్ తాగుడు సంస్కృతి ఎటువంటిది వంటి విషయాలపై విశ్లేషణాత్మక పరిశీలన జరగాలని వారంటున్నారు.
ఈ క్విన్ వంశస్థుల సమాధుల చుట్టుపక్కల జరిపిన తవ్వకాల్లో మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యమైనది కంచుతో తయారుచేసిన 60 సెంటీమీటర్ల పొడవున్న ఒక కత్తి. ఇది కూడా ఒక మానవ కంకాళంతో పాటు దొరికింది. దానిపై ఉన్న కొన్ని గుర్తులను బట్టి అది యుద్ధంలో వాడిన ఖడ్గంలా కనిపిస్తున్నది. మరో అద్భుతమైన, నమ్మశక్యంకాని విశేషం కూడా ఈ సమాధిలో బయటపడింది. 14 సెంటీమీటర్ల పొడవున్న తాబేలు డొప్పతో తయారు చేసిన వస్తువు ఒకటి కనిపించింది. దానిపై కాల్చిన గుర్తులు కూడా కనిపించాయి. దాన్ని తిరగేసి, బోర్లేసి గమనించి, ఈ వస్తువును నాటి మానవులు భవిష్యతును తెలుసుకోవడానికి ఉపయోగించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Authorization