భాష, లిపి లేని రోజుల్లో ఎదుటివాడికి సమాచారాన్ని అందించడం కోసం మనిషి ముందుగా కొన్ని సంజ్ఞలు (గుర్తులు) గీసి చూపించేవాడు. ఆ తరువాత తన పరిసరాలు, తన జీవన విధానాన్ని ప్రతిబింబించే అనేక చిత్రాలను తనకు చేతనైన మేర చిత్రించి చూసుకొని మురిసిపోయేవాడు. ఈ చిత్రాల ద్వారా ఇతరులకు సమాచారాన్నీ ఇచ్చేవాడు. కొన్ని లక్షల ఏళ్ళు గడిచేటప్పటికి మానవుడు పెయింటిగ్ని ఒక కళగా తీర్చిదిద్దడం కోసం ఏ ప్రాంతానికి చెందినవాడు ఆ ప్రాంతంలో కొన్ని నియమాలు, సూత్రాలు, పద్ధతులను ఏర్పాటుచేసుకున్నాడు. వాటి ప్రకారమే బొమ్మలు వేసేవాడు. మిగతా ప్రపంచం మాట ఎలా ఉన్నా ఈ విషయంలో భారత దేశం అద్భుతమైన చరిత్ర కలిగి ఉంది. పూర్వం వృత్తిగత చిత్రకారులు ఎలా జీవించారు? వారి పద్ధతులు పద్ధతులు, సూత్రాలు, రంగులు, బ్రష్లు ఎట్లా ఉండేవి?
రూప పటాలు (పోర్ట్రెయిట్స్), మామూలు చిత్రాలు (జనరల్ పెయింటింగ్స్) అని రెండు రకాలుగా పెయింటింగ్స్ని విభజించవచ్చు. అప్పటి పోర్ట్రెయిట్స్కు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. బుద్ధ జాతక కథలను చిత్రించిన అజంతా గుహల్లోని చిత్రాలు చాలా వరకు ఈ కోవకు చెందినవే. పూర్వం రూప పటాలు ఎంత అద్భుతంగా చిత్రితమయ్యేవో చెప్పడానికి 'కావ్యప్రకాశ' లో మంచి ఉదాహరణ ఉంది. రాజ్యం కోల్పోయిన ఒక రాజుకు చెందిన రాజప్రాసాదంలో ఓ పెంపుడు చిలుక గోడల మీద రాకుమారి, ఆమె సేవకుల పోర్ట్రెయిట్స్ను చూసి నిజమైన మనుషులుగా భ్రమించి తనకు మేత పెట్టమని వాటిని అర్ధించిందని ఆ గ్రంథం పేర్కొంటోంది. చిత్తన్నవాసల్ (తమిళనాడు)లోని పెయింటింగ్స్లో పాండ్యరాజు, ఆయన రాణి, తంజావూరులో రాజరాజు తన భార్యతో ఉన్న చిత్రం, అలాగే తన గురువుగారితో ఉన్న చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు పొందాయి.
పనిముట్లు
చిత్రకారుడు తన చుట్టూ రంగులతో నిండిన పాత్రలను కలిగి ఉంటాడని, వాటిలో ముంచిన కుంచెలతో పనిచేస్తాడని 'మృచ్ఛకటి'లో చెప్పబడింది.'వర్ణికా కరండ సముద్గాక' (రంగులతో నిండి ఉన్న పెట్టె)ను గురించి కాళిదాసు పేర్కొంటాడు. ఇటువంటి కుంచెల పెట్టెలను గురించి ''దశకుమార చరిత''లోనూ 'రత్నావళి'లోను కూడ వర్ణనలున్నాయి. అభిలషితార్థ చింతామణి'' వంటి శిల్పశాస్త్రాల్లో కుంచెలగురించి, వర్తికలను గురించి వివరాలున్నాయి. వర్తికలను 'తిందువర్తి', 'కిట్టవర్తి' వంటిపేర్లతో పిలిచేవారు. 'కిట్టలేఖిని' అనికూడా పిలవబడే 'వర్తిక'ను 'ఖచోర' అనబడే ఒక సుగంధపు వేరును బియ్యపు అన్నంలో కలిపి మొన తేలిన కోపుగా తయారు చేస్తారు. మెత్తగా చూర్ణం చేసిన ఎండు ఆవుపేడతో ఇటుకపొడిని, నీరును కలిపి లేహ్యాన్ని తయారుచేసి దానితో మొనతేలిన కోపులను నిర్మిస్తారు. సంక్షిప్త చిత్రాలను గీయడానికి పలుచని వెదురు పుల్లకు రాగి సూదిని, ఒక చిన్న ఈకను తగిలించిన దాన్ని 'తూలిక' అంటారు.
రంగులను వేయడానికి ఉపయోగించే పనిముట్టును 'లేఖిని' అంటారు. దీన్ని 'తూలిక' అని కూడా అంటారు. కానీ దీన్ని ఆవుదూడ చెవిలోని మెత్తని వెంట్రుకలను లక్కతో అంటించి తయారుచేసేవారు. వెడల్పు పూతకు, సన్నని పూతకు కూడా పనికివచ్చే విధంగా దీని మందం ఉంటుంది. దానికి ఉపయోగించబడిన మెత్తని వెంట్రుకల పరిమాణాన్ని అనుసరించి వెడల్పు, మధ్యరకం, సన్నం అని కుంచెల రకాలు ఉండేవి. ఉడుత తోక నుంచి, గొర్రె పొట్ట నుంచి తీసిన వెంట్రుకలను కూడా కుంచెలను తయారుచేయడానికి వాడేవారు.
రంగులు
పటం (కాన్వాస్) మీద వేసిన చిత్రం పూర్తయిన తరువాత, దాన్ని పట్టుగుడ్డలో కాని లేక మరో ఆచ్ఛాదనతో కానీ చుట్టి పదిలపరచేవారు. గుడ్డను అంటించిన ఫలకాన్ని కూడ ఉపయోగించేవారు. కానీ అన్నింటికంటే ప్రధానంగా గోడ (భిత్తి) మీద చిత్రించడం అభిలషణీయంగా ఉండేది. వీటినే భిత్తి చిత్రాలు అంటారు. రంగులు వనజాలుగా కానీ, ఖనిజాలుగా కానీ ఉండేవి. గైరిక (ఎరుపు), నీలి, సుధా (తెలుపు), కజ్జల (నలుపు) హరితాల (పసుపు) అనేవి నాటి రంగులు. 'వజ్రలేప' , నిర్యాస కల్క అనేవి రంగులను అతికించే మాధ్యమాలు
పూర్వం మిగతా లలిత కళళ కన్నా చిత్రలేఖనాన్ని చాలామంది ఉన్నత వంశీయులు, సాధారణ జనులు అభ్యసించేవారు. శిల్పం వంటి శారీరక, మానసిక శ్రమ అధికంగా ఉండే కళలకన్నా ఇది కాస్త సులువుగా ఉండటం వల్ల ఎక్కువ మంది దీన్ని నేర్చుకునేవారు. నాడు కళ జీవితంలో కలిసి ఉండేది. అందుకే ఆసక్తి ఉన్న యువతీ యువకులు నృత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటి కొన్ని పాపులర్ కళలను అభ్యసించేవారు. ఇందువల్ల వృత్తి కళాకారులకు ప్రయోజనం చేకూరేది. అనేక కళలతో పరిచయం ఉన్న పౌరులు వృత్తి కళాకారుల పనితనాన్ని నిర్ణయించి వారికి తగిన పారితోషికం లభించేలా ప్రోత్సహించేవారు.
ఆయా కళల్లో సిద్ధహస్తులకు లభించే గౌరవాన్ని ప్రత్యేకించి చెప్పాలి. కళాఖండాల సౌందర్యపు విలువల గురించి అభిప్రాయం చెప్పమని రాజులు వారిని ఆహ్వానించేవారు. చిత్రకారుల నైపుణ్యాన్ని 'హస్తోచ్ఛాయ' అంటారు. డిండినులు పాత చిత్రాలను, చెక్కడాలను, పతాకాలను, మరమ్మతు చేసేవారు. వీరు పాత చిత్రాలను మరమ్మతు చేయడానికి బదులు తరచూ చెడగొడుతుంటారని 'పాద తాడితాక' చెబుతోంది.
Authorization