ఖోండులు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి బతికే ఆదివాసీలు. వీరు ఒరిస్సాలోనే కాక; శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని దట్టమైన అడవుల్లోనూ నివసిస్తున్నారు. స్థానికంగా ఈ ప్రజలను సామంతులు, కొండ కోడు, జాతపు, జాతపు దొర, కోడి, కోధు, కొండు, కుయింగ అనే పేర్లతో వ్యవహరిస్తారు. తమ స్థానిక భాషలో తమను తాము ఖోండులు 'కుయింగ'లుగా చెప్పుకుంటారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసిస్తారు. అక్షరాస్యత బాగా తక్కువగా ఉంది. కుయి లేక కుని అనే మాండలికాన్ని మాట్లాడుతారు. శ్రీకాకుళంలో నివసించే ఖోండులు తెలుగు భాష కూడా మాట్లాడుతారు. అరకు లోయలో ఉండే ఖోండులు రెండుకన్నా ఎక్కువ భాషలు మాట్లాడుతారు.
ఖోండులను డోంగ్రియా, దేస్య, కుట్టియా, తికిరియా, ఎనేతి అనే ఉపతెగలుగా విభజించారు. ఈ ఉపతెగలు మళ్లీ గోత్రాలుగా చీలిపోయి ఉన్నాయి. వీటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి గృహ దేవతలున్నారు. వివాహ సంబంధాలు అనుమతించిన గోత్రాలను 'తయింగ' లేదా 'సహౌదర' గోత్రాలు అంటారు. ఏకపత్నీవ్రతం సర్వసాధారణమైనా బహుభార్యత్వం కూడా కనిపిస్తుంది. ఖోండులలో ఒకరికన్న ఎక్కువ భర్తలు (బహు భర్తత్వృత్వం) కలిగి ఉండే సంప్రదాయం లేదు. వధువులను రెండు కుటుంబాలు ఇచ్చి పుచ్చుకోవడం, నచ్చిన అమ్మాయిని లేవదీసుకుపోవడం సేవ చేసి వధువును సంపాదించడం వంటివి ఈ తెగలో కనిపిస్తాయి.
రాజకీయ వ్యవస్థ
ఖోడుల రాజకీయ వ్యవస్థ గిరిజన మండలి మీద ఆధారపడి ఉంది. 'హవంత' అనే నలుగురి ఆధ్వర్యంలో నలుగురైదుగురు గిరిజన పెద్దలతో ఈ మండలి ఏర్పడుతుంది. 'హవంత' పదవి వారసత్వంగా లభిస్తుంది. మండలి లోని ఇతర సభ్యులను ప్రజలే ఎన్నుకుంటారు. వివాహాలకు, భూములకు సంబంధించిన వివాదాలను ఈ గిరిజన మండలి సాధారణంగా పరిష్కరిస్తూ ఉంటుంది.
ఖోండులు ప్రధానంగా పోడు వ్యవసాయం చేస్తారు. వీరు రాగులు, సజ్జలు, కందులు, సామలు, కొర్రలు, పండిస్తారు. అలాగే నువ్వులు, ఆముదాల పంటలు కూడా పండిస్తారు. వేటాడటం, చేపలు పట్టడంలోను ప్రావీణ్యం గలవారు. అట్లాగే బుట్టలు, చాపలు అల్లడంలో కూడా నేర్పరులు.
Authorization