సాంస్కృతిక పునరుజ్జీవన కాలం అందించిన అధ్బుత కళాకారులు లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, రాఫెల్. 15వ శతాబ్దంలో జన్మించిన ఈ ముగ్గురూ ఆధునిక కళా కళాప్రపంచంపై ఎనలేని ప్రభావాన్ని చూపారు.వీరు జీవించి ఉన్న ఈ శతాబ్దాన్ని 'హై రినైజాన్స్' అని పిలుస్తారు.
శవాలను కోస్తుంటే...
లియోనార్డో డావిన్సీ (1452-1519). బహుముఖప్రజ్ఞాశాలి. చిత్రం, శిల్పం, వాస్తువు, ఇంజినీరింగ్, గణితం, తత్వశాస్త్రం, వృక్షశాస్త్రం, సంగీతం వంటి వాటిలో ప్రతిభ ఉన్నవాడు. గొప్ప పరిశోధనా జిజ్ఞాసి. అందుకే కళలో ఎన్నో ప్రయోగాలు చేయగలిగాడు. నాలుగేండ్ల వయసులో తల్లి చనిపోతే ఆ మె ముఖాన్ని, జ్ఞాపకాలను లీలగానైనా జీవితాంతం గుర్తుంచుకోగలిగాడు. తండ్రి ప్రోత్సాహంతో చిత్రలేఖనం వంటి కళలను అభ్యసించాడు. ప్రకృతి అన్నా, అందులో ఉండే జీవులన్నా వల్లమాలిన అభిమానం. జీవహింసను ఎవరూ పెద్దగా పట్టించుకోని ఆ కాలంలోనే ఆయన శాకాహారిగా మారాడు. అతడి చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన బొమ్మల్లోని అంగసౌష్టవం, కొలతలు అన్నీ సహజంగా మానవుల కొలతలకు అతి దగ్గరగా ఉంటాయి. ఆయన వేసిన భారీ చిత్రాన్ని చూస్తే నిజంగా మనుషుల్నే ఫొటో తీసినట్లు ఉంటుంది. ఇంత కచ్చితత్వాన్ని సాధించడానికి ఆయన ఎంతో శ్రమపడ్డాడు. ఎంతో పరిశీలన జరిపాడు. ముఖ్యంగా మెడికల్ కాలేజీకి పోయి ఎనాటమీ డిపార్ట్మెంట్లో శవాలను దగ్గరగా పరిశీలించేవాడు. శవాలను వైద్యులు కోస్తుంటే చూస్తూ ఉండేవాడు. ఆ విధంగా మానవ శరీర నిర్మాణం పట్ల గొప్ప అవగాహనను సొంతం చేసుకొని తన చిత్ర రచనలో వాటిని ఉపయోగించుకున్నాడు.
భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం కాంతి వస్తువులు, మనుషులపై ఎట్లా పడుతుందో గ్రహించి అవే సూత్రాలను బొమ్మల చిత్రీకరణలో ఉపయోగించుకునేవాడు. అందుకే ఆయన సృష్టించిన పెయింటింగ్స్లో కాంతి, దాని ప్రభావం అతి సహజంగా కనిపిస్తుంది. 'ది లాస్ట్ సప్పర్, 'మోనాలీసా' వంటి పెయింటింగ్స్ ఆయనకి ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. యూరప్లో బయలుదేరిన సాంస్కృతిక పునరుజ్జీవనం (రినైజాన్స్)కాలంలో ఈయన తన వంతు కృషి చేశారు.
మైకెలాంజిలో
మెకెలాంజిలో 1475లో జన్మించి 1564 వరకు జీవించాడు. తన పదమూడవ యేట కుంచె పట్టాడు. ఫ్లారెన్స్లో పెరిగిన ఇతడు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలియే. శిల్పం, చిత్రం, వాస్తు శాస్త్రంలో ప్రావీణ్యం గడించాడు. పాలరాతి శిల్పాలను ఎన్నో చెక్కాడు. రోమ్లో సెంట్ పీటర్స్ చర్చిలో అతడు చెక్కిన శిల్పం ఎంతో భావనాత్మకంగా ఉంటుంది. తల్లి చేతిలో నిర్జీవంగా ఉన్న క్రీస్తు శిల్పం అది. దాన్ని చూసిన వారెవరైనా కరిగిపోతారు. అట్లాగే డేవిడ్ అనే బాలకుని శిల్పం కూడా ఈయన చెక్కినదే. 17 అడుగుల ఎత్తున్న ఈ శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీన్ని ఇప్పుడు ఫ్లారెన్స్లోని అకాడెమీ గాలరీలో చూడవచ్చు. రెండవ పోప్ జూలియస్ ఆదేశాలను అనుసరించి సిస్టైన్ చాపెల్ సీలింగ్ పై బైబిల్ కథలను చిత్రాలుగా వేశాడు. ప్రధానంగా శిల్పకారుడైన మైకెలాంజిలోకి ఈ చిత్రాలు వేయడం ఇష్టం లేకపోయినా పోప్ చెప్పాడు కాబట్టి వేశాడు. నాలుగేండ్లు కష్టపడి దీక్షతో 350 మనుషుల ఆకారాలతో అద్భుతమైన మ్యూరల్ని సృష్టించాడు. ఆ విధంగా కళా జగత్తుకి విస్మయం గొలిపే బహుమానం ఇచ్చాడు మైకెలాంజిలో.
రాఫెల్
సమకాలీన ప్రపంచంలో మరో గొప్ప కళాకారుడు రాఫెల్. ఇతడు కేవలం 37 ఏండ్లు మాత్రమే జీవించాడు. లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో వంటి గొప్ప పరిశోధనా పటిమ ఆయనలో లేకపోవచ్చేమో కానీ వారి స్థాయిలోనే ఈయన చిత్రాలూ ఉంటాయి
పదిహేనవ శతాబ్దంలో ఈ ముగ్గురు కళాకారులూ ఎనలేని సృజనాత్మకతను ప్రదర్శించి కళా చరిత్రలో హై రినైజాన్స్ అనే ఒక అధ్యాయాన్ని సృష్టించారు. వారి కృషి ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శమై నిలిచింది. ఫలితంగా ఎందరో కొత్త కళాకారులు వారి మార్గంలో ప్రయాణించారు.
Authorization