ఇండియాలో చాలామందికి పిల్లి అంటే అశుభ శకునం. కానీ ఈజిప్టులో మాత్రం పిల్లులంటే దేవుడితో సమానం. వాటిని ఎంతగానో గౌరవిస్తారు. అయితే పిల్లుల పట్ల వీరికున్న ప్రేమే వారిని ఓ యుద్ధంలో ఓడిపోయేటట్లు చేసిందంటే నమ్ముతారా?
పాలియూనస్ అనే మాసిడోనియా రచయిత రాతలను బట్టి క్రీస్తుశకం రెండవ శతాబ్దంలో పర్షియాకి, ఈజిప్టుకు యుద్ధం జరుగుతోది. ఈజిప్టు సైనికులు ఎత్తయిన కోట గోడలపై నుంచి బాణాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈటెలు దూసుకువస్తున్నాయి. కోట బయట ఉన్న పర్షియా సైన్యం కకావికలమైపోతోంది. పర్షియా రాజు రెండవ క్యాంబిసెస్ తీవ్రగా ఆలోచించి ఓ ఎత్తుగడ వేశాడు. ఆ ఎత్తుకు ఈజిప్టు వీరులు చిత్తయిపోయారు.
ఎత్తుగడలో భాగంగా పర్షియా సైనికులు వందలాది శిక్షణ పొందిన పిల్లులను యుద్ధ రంగంలోకి దించారు. అవి ఈజిప్టు కోటద్వారం వైపు దూసుకువస్తున్నాయి. వాటిని అనుసరించి పర్షియా సైనికులు ముందుకు చొచ్చుకువస్తున్నారు. పిల్లులను అల్లంత దూరంలో చూసిన ఈజిప్టు సైనికులు అవి తమకు పవిత్రమైనవి కాబట్టి తమ బాణాలు వాటికి తగిలి మరణిస్తాయేమో అనే భయంతో బాణాలు వెయ్యడం ఆపేశారు. దీంతో పిల్లులను అనుసరిస్తూ ముందుకురికిన పర్షియా సైనికులు విజృంభించారు. దీంతో వేలాదిమంది ఈజిప్టు సైనికులు మరణించారు. కోట పర్షియా వశమయింది. ఈ యుద్ధం గురించి యుద్ధ చరిత్రకారుడు హెరొడోటస్ రాస్తూ.. యాభై వేలమంది ఈజిప్టుసైనికులు మరణిస్తే పర్షియా వైపు కేవలం ఏడువేల మంది మాత్రమే చనిపోయినట్లు చెప్పాడు.
నిజానికి పర్షియా వారొక్కరే పిల్లులను యుద్ధంలో ఉపయోగించలేదు. పదహారవ శతాబ్దంలో జర్మనీవారూ పిల్లులను, పక్షులను ఉపయోగించి విషవాయువులను వ్యాప్తిచేసేవారు. ముఖ్యంగా పిల్లులకు విషవాయువులు నింపిన చిన్న చిన్న గాజు జాడీలను కట్టి శత్రువుల కోటల్లోకి వెళ్ళేలా వ్యూహం రూపొందించేవారు.
బ్రిటన్లో యుద్ధ సమయంలో ప్రజలు పిల్లులను అనుసరించేవారు. మనుషులకన్నా పిల్లులు విమాన దాడులను ముందుగానే పసిగట్టి సురక్షిత స్థలానికి పరుగు తీసేవి. ఇది చూసి ప్రజలూ జాగ్రత్తపడేవారు.
Authorization