కాశ్మీర్ చరిత్రలో 14వ శతాబ్దం గడ్డుకాలంగా చెప్పవచ్చు. సామాజికంగా, రాజకీయంగా కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి రావడం ఇందుకు కారణం. 14వ శతాబ్దం నాటికే అక్కడ 'త్రిక' పేరిట వివిధ మతాల భావ మిశ్రమం రూపుదిద్దుకున్నది. అందులో బౌద్ధం, తాంత్రికం, శైవం, అద్వైతం సంప్రదాయాలు కలగలిసిపోయాయి. నిజానికి త్రిక 9వ శతాబ్దం ఆరంభంలో కనిపించింది. కొందరు అది అదివరకే ఏర్పడి, తొమ్మిదవ శతాబ్దంలో పునరుద్ధరించబడిందని అంటారు. ఇస్లాం ప్రచారం తొలి దశలో ప్రాచీన సంప్రదాయాలకు, నూతన మత భావాలకు మధ్య ప్రత్యక్ష పోరాటం కాకపోయినా, ఘర్షణ అనివార్యమయింది. త్సార్లో నూంద్ రుషి అనే షేక్ నూరుద్దీన్ వలీ సుప్రసిద్ధ ముస్లిం ఫకీర్లు లేదా బాబాల పరంపరకు ఆద్యుడైనాడు. ఇతర చోట్ల నుండి వచ్చిన ఫకీర్లు, మత ప్రచారకులే కాక అలా కాశ్మీర్లోనే బయలుదేరిన ఫకీర్ల ప్రాభవం కూడా కనబడసాగింది.
ఇటువంటి ఘర్షణ ఫలితంగా హిందు పాలన అంతమైన తర్వాత కూడా సంస్కృతం అధికార కార్యకలాపాల భాషగా కొనసాగినా, క్రమంగా రాజ పోషణను కోల్పోయింది. దాని స్థానాన్ని పర్షియన్ భాష ఆక్రమించింది. సంస్కృతం తగ్గినా పర్షియన్ భాష దాని స్థానాన్ని పూర్తిగా ఆక్రమించకుండా ఉన్న సంధి కాలంలో హిందు సమాజం విచ్ఛిన్నమవుతూ వచ్చింది. ఆ కాలంలో యదార్థంగా ప్రజల భాషలో కవిత్వం వెలువడసాగింది. సరిగ్గా అలాంటి సాంఘిక, మత పరిస్థితుల్లో 1335 ప్రాంతంలో లల్లేశ్వరి జన్మించింది. ఆమెను లల్లా అరిషా అనీ, ఆప్యాయంగా లాల్ దేడ్ (లాల్ బామ్మ) అనీ పిలిచేవారు. ఆమె గురించిన తొలి ప్రస్తావన 1730 నాటి ఆజాం దేదామరి రచన 'వకీయత్-ఇ-కాశ్మీర్'లో కనిపిస్తుంది. ఆమె గురించి అనేక జానపద గాధలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
శ్రీనగర్కు ఆగేయంగా 6.5 కొలోమీటర్ల దూరంలో వున్న పంద్రేన్ థాన్లో ఆమె సంపన్న కుటుంబంలో జన్మించింది. బాల్యంలోనే ఆమె కుటుంబ గురువు సిద్ధమోల్ ప్రభావం ఆమెపై పడింది. శ్రీనగర్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మపురం (పాంపూర్)కి చెందిన పండిత కుటుంబంలోని వరునితో 12వ ఏట ఆమెకు వివాహం అయింది. అత్తగారింట ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. అత్తింటి ఆరళ్లు అధికమయ్యాయి. ఆమెను అనుమానిస్తూ నిందలు వేసేవారు. నియమ నిష్టలతో కఠోర జీవనం అలవాటుచేసుకుని నిందలను పట్టించుకోకుండా ఉండేది. నది నుండి నీళ్లు తేవడానికి వెళ్లినప్పుడు రోజూ ఒక నిర్జన ప్రదేశంలో కొంతసేపు ధ్యానం చేసుకుని వస్తూ ఉండేది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లి వస్తున్నదని అత్తగారి కుటంబం అనుమాన పడటానికి ఇదే ప్రధాన కారణం. త్వరలోనే ఈ ధ్యానం గురించిన సంగతి వారు తెలుసుకున్నారు.
వాక్కులు
చివరికి ఆమె ఇల్లు వదిలి సన్యాసినిగా మారి దేశ సంచారం చేయసాగింది. కొండకోనల్లో, గుహల్లో తిరుగుతూ ఉండేది. ఒంటిమీద సరిగా బట్టలు లేక అర్ద దిగంబరంగా ఉన్నా ఆమెకు పట్టేది కాదు. ఆమె పొట్ట బాగా పెరిగి ముందుకు జారి ఆమె మర్మావయవాన్ని కప్పివేసిందట. అప్పుడు అందరూ ఆమెను లాల్ అని పిలవసాగారు. లాల్ అంటే కాశ్మీరీ భాషలో పొట్ట అని అర్థం. 'వాక్కులు' అనే పేరుతో ఆమె కొన్ని చాటువులు చెప్పింది. దానిలో కొందరు తనను దూషిస్తారు, మరికొందరు భూషిస్తారు. ఆ నిందగానీ, పొగడ్తగానీ తనకు పట్టదు- అని రాసుకుంది.ఆమె సంచారంలో ఎందరో హిందు, ముస్లిం సాధువులనూ, ఫకీర్లను కలుకున్నది. ఆమె ప్రత్యేకత ఏమిటంటే అటు హిందువుల పైనా, ఇటు ముస్లింల పైనా ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపింది. ఒక హిందు భక్తురాలు హిందు, ముస్లింలపై అంతటి ప్రభావాన్ని చూపిన సందర్భం మరొకటి కానరాదు. ముస్లిం చరిత్రకారులు ఆమెను ప్రశంసిస్తూ రాశారు. 'అరీఫా కామిలా లల్లా మజ్జూబా' (ఆజాం దేదామరి), 'అరిఫా కామిలా శాని రబియా (తారీఖ్-ఇ-హసన్) అని కీర్తించారు. ఆమెను ఇప్పటికీ ఆత్మ దర్శనం చేసుకున్న యోగినిగా, స్ఫూర్తిదాయికమైన గురువుగా కొలుస్తున్నారు. ఆమె 'వాక్కులు' (కీర్తనలు) ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికీ జనం నాలుకలపై ఆడుతున్నాయి. ఇస్లాంలో పుట్టిన సూఫీ సంప్రదాయం, ప్రాచీన హిందు వేదాంత తత్వం- ఈ రెడింటి మేలు కలయికగా కాశ్మీర్లోను, భారత దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రూపొందిన సంస్కృతి, మత సంప్రదాయాల కలయికకు ఆమె ఆద్యురాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఎట్లా ప్రభావితం చేసింది?
ప్రజల ఆలోచనలపై అంత ప్రభావం చూపి, వారి ఆప్యాయతను అంతగా చూరగొనడానికి కారణం ఏమిటి? ఇందుకు మూడు కారణాలు అని చెబుతారు. ఆమె స్థానికంగా మనుగడలో ఉన్న శైవాన్నే అనుసరించినా తన భక్తి భావాల ప్రచారానికి ప్రజల వాడుక భాషనే ఎన్నుకొనడం మొదటి కారణం. బహుశా కాశ్మీరీ ప్రజలకు మొట్టమొదటిసారిగా అంతవరకు రహస్యంగా ఉన్న సత్యాలు, వాటి సాధనకు అనుసరించదగిన మార్గాలూ ప్రజల భాషలో జనం అందరికీ తేలికగా అర్థమయ్యే పద్ధతిలో లాల్ ఆ తత్వ రహస్యాలను వెల్లడించింది ఈమోయే. ప్రజా భక్త కవయిత్రిగా ఆమెకు పేరు తెచ్చింది జటిల వేదాంత తత్వాలు గానీ, కుండలినీ, నాదబిందు యోగ సాధనాలుగానీ కాదు. ఆమె చిత్త శుద్ధి అందర్నీ ఆకట్టుకున్నది. గుహ్యత్వానుభూతుల గాఢత ఆమెలో ప్రస్ఫుటమయ్యేది. శక్తివంతమైన పలుకుబడి పదజాలంతో ఆమె సాధికారంగా తత్వ రహస్యాలను, అల్ప పదాలతో అనల్ప అర్థాలను వివరించే తీరు అద్భుతం.
ఇక రెడో కారణం ఏమిటంటే... ముస్లిం రుషి సంప్రదాయంలో శైవ, బౌద్ధ గుహ్య సాధనలకు సంబంధించిన సంగతులెన్నో చోటుచేసుకున్నాయన్నది నిర్వివాదాంశం. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన ముస్లిం సూఫీ సాధువుల 'హామోస్తు' (సర్వం అతడే) సంప్రదాయపు బోధనలకూ, శైవ, బౌద్ధ గుహ్య తత్వాలకు మధ్య సామ్యం బాగా కనిపిస్తుంది. అందుకే ఐనీ అక్బరీలో చెప్పినట్లు ''రుషులు సంప్రదాయబద్ధులు కారు.యదార్థంగా దైవారాధకులు. ఏ మతాన్ని వారు నిందించరు. తోసిరాజనరు.''19వ శతాబ్దంలో సర్ వాల్టర్ లారెన్స్ 'తాను రాసిన 'ది వాలీ ఆఫ్ కాశ్మీర్'లో ''ఆమెకు కాశ్మీర్ లోయతో సన్నిహిత సంబంధం ఉంది. గ్రామీణ ముస్లిం జనాభా రుషుల మందిరాల ఆరాధన విషయంలోను, హిందువుల పట్ల సహనం విషయంలోను ఇతర ప్రాంతాల ముస్లింల వలె కాదు'' అని రాశాడు.
ఇక మూడో కారణం... లాల్ దేడ్కు కపటం, వంచన గిట్టవు. భక్తి లేకుండా విగ్రహారాధన చేయడం, బాహ్య పూజలు చేయడం వంటివి ఆమెకి ఇష్టంలేని పనులు. జంతుబలిని ఖండించింది. నిర్మలమైన మనసు, రుజువర్తనం అవసరం అని చెప్పింది. చాదస్తం, మూర్ఖత్వం ఆమెలో లేవు. వివిధ మతాల పట్ల సహనం ఉండేది.
కాశ్మీరీ సాహిత్యాన్ని లాల్ పరిపుష్టం చేసింది. సహనం, అవగాహన అవసరమన్న సందేశాన్ని అందించింది. తన జన్మ భూమిలో సంస్కృతీ విభేదాల సమన్వయం కోసం కృషి చేసింది. కాశ్మీరీ భాషలో కవిత్వానికి ఆమె ఆద్యురాలు కూడా.
Authorization