భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ప్రదర్శితమయ్యే నాటిక 'ఆగిపోని నాటిక'. 1989 జనవరి 1న ఢిల్లీకి సమీపాన ఘజియాబాద్లో ప్రజాకళాసైనికుడు కామ్రేడ్ సఫ్దర్ హష్మి తన కళా బృందం 'జనమ్'తో 'హల్లాబోల్' అనే వీధినాటిక ప్రదర్శిస్తుండగా రాజకీయ కిరాయి గుండాలు మారణాయుధాలతో దాడిచేసి హష్మిని పొట్టన పెట్టుకున్నారు. ఆ దాడిని ఖండిస్తూ నాడు దేశవ్యాప్తంగా పలు భాషల్లో వేలాదిగా ప్రదర్శితమైన నాటిక 'ఆగిపోని నాటిక'. 30 ఏండ్లు గడిచినా నేటికీ ఈ నాటిక వన్నె తగ్గలేదు. ప్రాసంగికత కోల్పోలేదు.
ఇదే నాటికను ఇటీవల పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్మారక నాటకోత్సవాలలో స్థానిక బాలలు ప్రదర్శించారు. గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామంలో గత 18 ఏండ్లుగా మే 19, 20 తేదీలలో ఈ స్మారక నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రామాణిక తెలుగు నాటికలు ఈ సందర్భంగా అక్కడ ప్రదర్శితమవుతాయి. నాటికల్లోని వస్తు విలువలను, శిల్ప విలువలను చైతన్యవంతమైన ఆ గ్రామ ప్రజలు చర్చించుకోవడం కద్దు. ప్రదర్శనలకు అనుకూలమైన బహిరంగ శాశ్వత రంగస్థలం (ఓపెన్ ఎయిర్ ధియేటర్), ఆ గ్రామంలో ప్రజలు కష్టపడి నిర్మించుకోవడం కూడా కళాకారుల అభిమానాన్ని చూరగొంటున్నది. ఇదో విశేష ఆకర్షణ. పాడిబండ్ల ఆనందరావు వంటి పేరున్న కళాకారులు సైతం ఆ వేదికపై ప్రదర్శనీయాలని కోరుకోవడం గమనార్హం.
నాటిక ఇతివృత్తం ఏంటంటే...
ఇక నాటిక విషయానికి వస్తే... సిఐటియు కార్మిక ప్రదర్శనతో, నినాదాలతో ప్రారంభమవుతుంది ఈ నాటిక. ఆకస్మిక గుండాల దాడితో రంగస్థలం స్తంభిస్తుంది. ప్రయోక్త వచ్చి ఏ ఆశయ సాధన కోసం హష్మి నాటికలు ప్రదర్శిస్తూ హత్యగావించబడ్డాడో ఆ ఆశయం కొనసాగించవలసిన బాధ్యత కళాకారులపై ఉందని నొక్కి చెప్తాడు.
నాటిక ఇతివృత్తం ఓ జానపద కథ. అన్ని కథల్లో మాదిరి ఓ రాజ్యాన్ని ఒక రాజు పాలిస్తూ ఉంటాడు. పేరు దిబ్బరాజు. విలాసాల్లో మునిగి తేలుతుండగా రాజుకు జబ్బుచేస్తుంది. దానికి విరుగుడు- రాజు సంగీతం, పాటలు వినకూడదని రాజవైద్యులు మూర్ఖంగా చెబుతారు. దాంతో సంగీత సాహిత్యాలవంటి వాటిపైనా, పాటల పైనా రాజు నిషేధం విధిస్తాడు. ఆజ్ఞలు అతిక్రమించినవారికి శిక్ష శిరచ్ఛేదం అని చాటింపు వేయిస్తాడు.
కానీ ప్రజలు ఏ పని చేసుకోవాలన్నా పాటపాడక తప్పదు. పాటలతో తమ బతుకు ముడివడి ఉన్నదని, పాట లేకపోతే ఎట్లా అని దిగులు పడతారు. రాజభటులు పాటలు పాడేవారి దగ్గరి నుంచి లంచాలు తింటుంటారు.
కథలో కథానాయకుడు చిన్న పిల్లవాడు నాని. వాడు పాడకుండా అస్సలుండలేడు. అమ్మతోనైనా పాటతోనే సంభాషిస్తాడు. ''అమ్మా అమ్మా వెళ్లొస్తా, బడికి నేను పోయొస్తా, సాయంత్రం తిరిగొస్తా... పాలు, లడ్లు మింగేస్తా...'' ఇట్లా ఉంటుంది నాని గేయ భాష.
బడిలో పిల్లలందరితో కలిసి
''భావి పౌరులం మేం ప్రగతి పూవులం
దేశాన్ని ఉద్దరింప దీక్ష పూనుదాం''
అంటూ దేశభక్తి గీతాలు ఆలపిస్తాడు. కవితాహృదయం కలిగి నాయకత్వ లక్షణాలతో ముందుకు కదులుతాడు. రాజు నిరంకుశత్వాన్ని ఛేదిస్తూ ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది.
''పాటంటే వెలుగంటాము
వెలుగంటే బతుకంటాము
బతుకంటే పోరాటమే
అందుకొరకే పాటంటాము''
... అంటూ లయతో ముక్త కంఠంతో నినదిస్తారు. చివరకు రాజు నానిని బంధిస్తాడు. కానీ రాజు ఏ పని చేయబోయినా పాటలు అతని చెవులో గింగురుమంటుంటాయి. రాజు పిచ్చివాడైపోతాడు. కోట్లాది ప్రజలు గొంతు కలపడంతో కడకు రాజు మరణిస్తాడు. ప్రజలు అంతిమంగా పాటకు (నానికి) పట్టం గడతారు.
''ఈ ధరిత్రి మనదైనప్పుడు ఫలితం తప్పక లభిస్తుంది. ఈ నాటి హత్యలన్నింటికి మూల్యం చెల్లించే రోజు తప్పక వస్తుంది'' అని ప్రయోక్త ప్రకటించడంతో తెరపడుతుంది. సహమత్ హిందీలో రచించిన ఈ నాటిక (నాటక్ జారీ హై)ను పి.ఎ.దేవి తెలుగులోకి అనువదించారు. ఈ వ్యాస రచయిత దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం పెద్దల నాటికలతో సమాంతరంగా స్థానిక బాలలు ఈ నాటిక ప్రదర్శించి ప్రశంసలు చూరగొనడం ఎంతో ముదావహం. కుల, మత, లింగ వివక్ష లేకుండా ఈ నాటికను బాలలు సమైక్యంగా ప్రదర్శించడం భావి రంగస్థలానికి పూలబాటయింది.
Authorization