రంజాన్ మాసం చివరి రోజుల్లో ఉన్నాం. హైదరాబాదు ముస్లిం సంస్కృతికి పెట్టింది పేరు. బహమనీ రాజ్య కాలం నుంచి ఇప్పటివరకు దక్కన్లో ఇస్లాం తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది. స్థానిక ప్రజల జీవనంతో మమేకమై అనేక ఆచార, సంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నది. హిందువుల పండుగలకు ముస్లింలు, ముస్లిం పండుగలకు హిందువులు తమ సహాయ, సహానుభూతులను అందించడం హైదరాబాదీ సంస్కృతిలో ఒక భాగం. అది ఎట్లా కొనసాగుతుందో చూడాలని రంజాన్ మాసం చివరి శుక్రవారం నాడు 'జాతర' ప్రతినిధి చార్మినార్, మక్కామసీదు ప్రాంతాలను సందర్శించాడు. ఎందరితోనో మాట్లాడాడు. తాను చూచిన, విన్న విశేషాలతో రాసిన ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం...
సాయంత్రం 6:45 గంటలు అయ్యేటప్పటికి మక్కా మసీదుకు చేరుకున్నాం. ఫొటోగ్రాఫర్ వెంకటేష్ కెమెరాతో చకచకా పనిచేసుకుపోతున్నాడు. అప్పటివరకు ఉపవాసాలతో ఉన్న ముస్లిం సోదరులు పండ్లు, పానీయాలతో ఉపవాసాన్ని చాలించే పనిలో ఉన్నారు. మమ్మల్ని చూసి షంషాబాద్ నుంచి వచ్చిన వారు మాకూ ఖర్జూరం, మామిడి జ్యూస్ ఇచ్చారు. వారి ఆతిథ్యానికి ఒళ్లు పులకరించింది. వారితో మాటలు కలిపితే ఆనందంతో రంజాన్ విశేషాలు చెప్పుకొచ్చారు. స్త్రీపురుషులు వేలల్లో అక్కడ బృందాలు బృందాలుగా కూర్చొని తింటున్నారు. కొద్ది సేపటికే స్త్రీలు తప్ప మిగిలినవారు మక్కా మసీదు లోపలికి వెళ్లి ప్రార్థనల్లో మునిగిపోయారు.
మెల్లగా మక్కా మసీదు నుంచి బయటకు వచ్చి చార్మినార్ చుట్టుపక్కల తిరగడం ప్రారంభించాం. అధిక సంఖ్యలో స్త్రీలు షాపింగ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా గాజుల బేరమే. కేవలం ముస్లిం స్త్రీలే కాదు హిందు వనితలు కూడా ఉత్సాహంగా గాజులు, నగలు కొంటూ కనిపించారు. వాళ్లతో మాటలు కలిపితే ఆనందంగా రంజాన్ షాపింగ్ విశేషాలు పంచుకున్నారు. కాకపోతే ముస్లిం స్త్రీలే ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. ఎంతో బ్రతిమిలాడితే చంచల్ గూడ కి చెందిన ఓ కుటుంబం మాట్లాడటానికి ఇష్టపడింది. ముగ్గురు యువతులు, ఒక పిల్లవాడు ఒక బృందంగా తిరుగుతూ కనిపించారు. అందులో ఒక అమ్మాయి పెండ్లి కుదిరిందట. ఆమె కోసం షాపింగ్ చేస్తున్నారు. రంజాన్ పండగ సందర్భంగా వాళ్లు ఎంత ఎంజారు చేస్తారో చెప్పుకొచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కబుర్లే ఉన్నాయి. కానీ రంజాన్ నేపథ్యం గురించి తెలుసుకుంటే కానీ ఇప్పటి హైదరాబాదు సంస్కృతిని అర్థం చేసుకోవడం వీలు కాదు.
రంజాన్ పండుగ గురించి అర్థం కావాలంటే ముందు ఇస్లాం పుట్టుక, అందులోని ప్రధాన శాఖలు, ఆ మతం ఇతర భూభాగాలకు వ్యాపించిన సంగతులు సంక్షిప్తంగానైనా తెలుసుకోవాలి.
ఖురేష్ తెగ వాణిజ్య కార్యకలాపాలు
అరేబియాలోని మక్కాలో హరమ్ షరీఫ్ అనే పవిత్ర స్థలాలు ఆరవ శతాబ్దంలో ఖురేష్ అనే తెగ ఆధీనంలో ఉండేవి. ఈ తెగను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ తెగకున్న ఆధిపత్యం కారణంగా ఉత్తర, దక్షిణ ప్రాంతాల ఇతర తెగలతో వీరికి ఒప్పందాలు ఉన్నాయి. ఆ విధంగా అరేబియాలో వ్యాపార వాణిజ్యాలకు ద్వారాలు తెరుచుకున్నాయి. ఫలితంగా దక్షిణ యెమెన్ నుంచి మక్కా వరకు, అక్కడి నుంచి ఉత్తరాన బైజాంటియం లేదా తూర్పున ఇరాక్ వరకు వర్తక బృందాలు స్వేచ్ఛగా తిరిగేవి. అటువంటి ఒప్పందమే ఆక్సమ్ (ఇథియోపియా)తోను, ఆఫ్రికా తీరంతోను వాణిజ్య సంబంధాలు ఏర్పడి అరేబియా సముద్రతీరానికి మార్గాలు తెరుచుకున్నాయి. ఖురేష్ తెగ సభ్యులు పై పేర్కొన్న అన్ని ప్రాంతాలతోను వాణిజ్య ఒప్పందాలు చేసుకుని అరేబియా వెలుపల వాణిజ్యాన్ని వృద్ధి చేసుకున్నారు. ఈ కాలంలో ఆర్థిక, సామాజిక రంగాల్లో మక్కా పరివర్తన దశకి చేరి ఇతర అరేబియా పట్టణాలకంటే విశిష్టమైనదిగా మారింది. ఖురేష్ తెగ ప్రజలు బానిసలు, సుగంధద్రవ్యాలు, ఇతర వస్తువుల వాణిజ్యం ద్వారా బాగా ధనవంతులయ్యారు.
ఇస్లాం స్థాపన
ఈ వాణిజ్య సమాజంలోనే మహమ్మద్ ప్రవక్త క్రీ.శ570లో జన్మించారు. ఖతీజా అనే ధనిక వితంతువుతో వివాహం వర్తకునిగా ఆయన హౌదాను పెంచింది. కానీ మక్కాలో అల్లా ఏకత్వాన్ని ప్రవచిస్తూ ఆయన ప్రసిద్ధికెక్కారు. ఆవిధంగా ఆయన ఏడవ శతాబ్దంలో అరేబియాలో ఇస్లాంని స్థాపించారు. క్రమంగా ప్రపంచంలో ఒక ప్రధాన మతంగా అభివృద్ధి చెందింది. మహమ్మద్ క్రీ.శ.622లో మదీనాకు వెళ్లి మొత్తం ముస్లిం సమాజానికి నాయకుడు, న్యాయాధిపతి అయ్యారు. ఇస్లాం యుగ స్థాపన ప్రారంభానికి ఈ వలస ప్రాముఖ్యం వహించింది.
విభేదాలు
ప్రవక్త బోధించినట్లుగా ఒక ఏకీకృత, స్థిరీకృత సమాజమనే భావన ఉన్నప్పటికీ ప్రవక్త మరణించిన వెంటనే ముస్లిం సమాజంలో అంతర్గతంగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఆయన వారసత్వం విషయంలో ఈ విభేదాలు తలెత్తాయి. ఇది ఘర్షణకు దారితీసి ఇస్లాం షియాలు, సున్నీలు అనే విభాగాలుగా చీలిపోయింది. సున్నీలు ప్రవక్త మామ అయిన అబూబకర్ని కొత్త ఖలీఫాగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన తర్వాత ఉమర్ రెండవ ఖలీపాగా, ఉత్మాన్ మూడవ ఖలీపాగా ఎంపికయ్యారు. ఉత్మాన్ హత్య తర్వాత ప్రవక్త అల్లుడు అలీని ఖలీఫా కావడానికి మదీనాకి ఆహ్వానించారు. ఆ విధంగా అలీ షియాల సమర్థనతో నాల్గవ ఖలీఫా అయ్యాడు. అలీకి విధేయులైన షియాలను న్యాయబద్ధులు అంటారు. షియా సిద్ధాంతంలో నాయకత్వ భావన ఒక కేంద్ర పాత్ర పోషిస్తుంది. షియా ముస్లింలు నాయకత్వమన్నది ఖలీపా పద్ధతి వ్యవస్థగా ఒకరి నుండి ఒకరికి రావడాన్ని అంగీకరించరు. మహమ్మద్ ప్రవక్త వారసులకు మాత్రమే ఇమాములు అయ్యే హక్కు ఉందని భావిస్తారు. అందువల్ల మొదటి ముగ్గురు ఖలీఫాలను తిరుగుబాటుదారులుగా షియాలు భావిస్తారు. అలీని నిజమైన తొలి ఇమామ్గా గుర్తిస్తారు. ఈ భేదాలు మొదట్లో నాయకత్వం ఎవరిదన్న ప్రశ్న నుంచి ఉద్భవించినా చివరికి మతపరమైన భేదాలుగా స్థిరపడిపోయాయి. తరువాత కాలంలో సున్నీలు, షియాల్లో కూడా అనేక తెగలు ఏర్పడ్డాయి. తర్వాతి శతాబ్దంలో రెండు ఖలీఫా రాజ్యాలు స్థాపితమయ్యాయి. ఇస్లాంను ఒక ప్రపంచ రాజకీయ శక్తిగా ఇవి అభివృద్ధి చేశాయి.
ఇస్లాం విస్తరణ
దేవుడొక్కడే అన్న విషయంలో ఎటువంటి రాజీలేనితనాన్ని కాపాడుకుంటూ, కొన్ని అత్యవసర మతాచారాలకు తు.చ. తప్పకుండా కట్టుబడి ఉంటూ, ఒక చిన్న అనుచర బృందానికి మహమ్మద్ బోధించిన మతం అతి వేగంగా మధ్య ప్రాచ్యం నుంచి ఆఫ్రికా, యూరప్, భారత్, మలే ద్వీపం, చైనా వంటి ప్రాంతాలకు విస్తరించింది.
ఇదే సమయంలో బైజాంటియం, ససానియన్, పర్షియా బలహీన పడటంతో అరబ్ తెగలు సంపదను, భూములను కొల్లగొట్టడంతో పాటు కొత్త మతాన్ని వ్యాపింపచేయడానికి దండయాత్రలకు బయలుదేరారు. 11వ శతాబ్దం నాటికి అరబ్బులు తిరుగులేని ఆర్థిక ప్రాబల్యాన్ని సాధించారు.
మొదటిసారిగా అరబ్బులకు భారత దేశంతో వాణిజ్య కార్యకలాపాల రూపంలోనే సంబంధాలు ఏర్పడ్డాయి. హిందు మహాసముద్ర వ్యాపార మార్గాలు పర్షియన్ గల్ఫ్కి, దక్షిణ భారత దేశానికి మధ్య సంబంధాలు ఏర్పడటానికి వాహికలయ్యాయి. ముస్లిం వర్తకులు, వ్యాపారులతో పాటు ఇరానియన్ కులీనులు, పాలకులు, సైనికులు, సాహిత్యవేత్తలతో కూడిన చిన్న చిన్న బృందాలు దక్కన్లో ప్రవేశించాయి. ఇరాన్పై మంగోలు దండయాత్రలు జరిగిన 13వ శతాబ్దంలోను, ఆ తర్వాత ఇరానియన్ కులీనులు షియా మతాన్ని స్వీకరించారు. ఈ సంస్కృతి ఇరాన్ నుండి దక్కన్కి 16వ శతాబ్దం వరకు కొనసాగుతూనే ఉంది. ఇరానీయులు తమతో పాటు ఉసూలీ షియా మతంలో తమ విశ్వాసాన్ని తీసుకువచ్చారు శుక్రవారపు ప్రార్థనా సమావేశాల మసీదులకు, ఇతర ఇథ్నా, అషారి ఫోషణనిచ్చారు. తర్వాత వజ్రాల వ్యాపారం ఎందరో షియాలను ఇరాన్ నుంచి దక్కన్కి రప్పించింది. ఆవిధంగా షియాల ఉనికి దక్కన్లో పెరిగింది. దక్కన్లో ముస్లిం రాజ్యాలు ఎక్కువగా షియామతాన్నే అనుసరించాయి. గోల్కొండ కుతుబ్షాహీలు షియాలు అన్న విషయం ఇక్కడ గమనించాలి. అయితే మోఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్కన్ని ఆక్రమించడంతో సున్నీల ప్రాబల్యం కొంత పెరిగిందనే చెప్పాలి. మొఘల్ ల ప్రతినిధిగా వచ్చి, ఆ తర్వాత స్వతంత్రులైన ఆసఫ్జాహీలు (నిజాంలు) సున్నీలుగా ప్రసిద్ధులు. నవాబులు ఏ మతాన్ని అనుసరించినా షియా, సున్నీ శాఖలవారిరువురూ సామరస్యంతో జీవించారు. ఇప్పటికీ అదే జీవనం వారసత్వంగా హైదరాబాదీలు కొనసాగిస్తున్నారు. కొద్ది తేడాలతో ముస్లింలు ముఖ్యమైన పండగలను ఆనందోత్సాహాలతో కలిసే జరుపుకుంటున్నారు. అందులో రంజాన్ పండుగ ఒకటి.
ఎందుకు జరుపుకుంటారు?
రంజాన్ పండుగ ఏడవ శతాబ్దం నుంచి ముస్లింలు జరుపుకుంటున్నారు. మహమ్మద్ ప్రవక్త మక్కాకు ఉత్తరాన ఉన్న ఓ గుహలో ధ్యానం చేసుకోవడానికి వెళ్లిన సంఘటన జరిగినప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పండుగను జరుపుకుంటారు. ఏడాదిలో 'లెలాత్ అల్ ఖదర్' లేదా 'శక్తివంతమైన రాత్రి' ని ఇటు షియాలు, అటు సున్నీలు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. రంజాన్ మాసంలోని 23వ రాత్రిని షియాలు, 27వ రాత్రిని సున్నీలు 'శక్తివంతమైన రాత్రిగా జరుపుకుంటారు. ఈ ఒక్క రాత్రిలో చేసే ప్రార్థనలు వెయ్యిరాత్రులు చేసే ప్రార్థనలు లేక పూజలకంటే ఎక్కువ ఫలితాలనిస్తాయని పవిత్రగ్రంథం ఖురాన్ పేర్కొన్నట్లు ముస్లింలు చెబుతున్నారు. దేవుని వర్తమానాలను మహమ్మద్ ప్రవక్త అందించిన రోజుగా ఈ రోజును భావిస్తారు.
ఆధ్యాత్మిక శుద్ధీకరణ
రమదాన్ (రంజాన్) అంటే అరబీ భాషలో అత్యంత వేడిమి అని అర్థం.ఈ విత్ర రంజాన్ మాసం లో 30 రోజులపాటు పగలు ఉపవాసంతో గడుపుతారు. తెల్లవారకముందే నిద్ర లేచి ఆహారం తీసుకుంటారు. దీన్నే 'సుహర్' అంటారు. పగలంతా ఆహారం తీసుకోరు. నియమిత కాలవ్యవధిలో ప్రార్థనలు జరుపుతారు. సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం ప్రార్థనలకు ముందు మళ్లీ ఆహారం తీసుకుంటారు. దీన్నే 'ఇఫ్తార్' అంటారు. ఉపవాసం ద్వారా పాపాలను కాల్చివేయడం రంజాన్ మాసం ప్రతీకాత్మకంగా చూపెడుతున్నది.
అట్లాగే తమ ఆదాయంలో ఖురాన్ నిర్దేశించిన భాగాన్ని పేదలకు పంచుతారు. దీన్నే 'జకత్' అంటారు. సాధారణంగా ఈ జకత్ని తమ బంధువుల్లో ఉన్న పేదవారికి ఇవ్వాలి. బంధువుల తర్వాతే చుట్టుపక్కలవారికి పంచాలనేది ఒక నియమమట. అట్లాగే తమ దగ్గర ఉన్న బంగారం విలువలో కొంత భాగాన్ని తప్పనిసరిగా బంగారం లేని పేదవారికి ఇవ్వాలనేదీ ఒక నియమం. హైదరాబాదులో లక్ష విలువ చేసే బంగారం ఉంటే రెండున్నర వేల రూపాయలు పేదలకిస్తున్నామని శమీమం అనే ముస్లిం మహిళ చెప్పింది. అట్లాగే తమ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులం ఉన్నామని ఒక్కో సభ్యునికి రెండున్నర కేజీల గోధుమల చొప్పున పది కేజీల గోధుమలను డబ్బుల రూపంలో (300 రూపాయలు) ఇచ్చామని, ఇట్లా ప్రతి ముస్లిం కుటుంబం పేదవారికి ధాన్యాన్ని ఇవ్వడాన్ని 'ఫిత్రా' అంటారని ఆమె చెప్పింది. రంజాన్ మాసం చివరి రోజును 'ఈద్ అల్ ఫితర్' అంటారు. ఈ రోజున ఘనంగా విందు ఏర్పాటుచేసుకుంటారు. ఉన్నంతలో బంధు మిత్రులకు విందు ఇస్తారు ముస్లిం సోదరులు. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు కొనుక్కుంటారు. కొందరు పేదవారికి కొత్తబట్టలు కొని దానం చేస్తారు.
సంపదను పోగుచేసుకోవడం తప్పుకాదు. దాన్ని మన సమాజంలో ఉన్న ఇతరులకూ కొంత పంచాలని, పేదల పట్ల కరుణ, దయ చూపాలని, పాపాలను కడిగివేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త జీవితం ఆరంభించాలని చెప్పే రంజాన్ పండుగ నియమాలు సమతావాంఛకు ప్రతీకలుగా భావించవచ్చని కొందరన్న మాటలు గమనించదగినవే!
ప్రత్యేక వంటకాలు
రంజాన్ మాసంలో చేసేవంటకాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. రంజాన్ పండుగ సందర్భంగా తీసుకునే ఆహారంలో హలీంది ప్రధమ స్థానం. చికెన్, మటన్, బీఫ్ల్లో ఏదో ఒకదానితో హలీం వండుతారు. ఈ వంటకం చేయడానికి రోజంతా పడుతుంది. మాంసం బాగా ఉడికి మొత్తటి పదార్థమవుతుంది. దీనిలో నెయ్యి, అనేక సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. రోజంతా ఉపవాసం ఉండే భక్తులకు ఇది మంచి శక్తిని అందజేసి నీరసం రాకుండా చేస్తుంది.
పేద, ధనిక అనే తేడా లేకుండా చేసుకునే మరో స్పెషల్ ఫుడ్ ఐటం 'షీర్ కుర్మా'. ఇక మన హైదరాబాదీ బిర్యాని వంటి వంటకాలు ఉండనే ఉన్నాయి. మేం చేసుకునే పండగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ రంజాన్. ఆ పండుగ కోసం ఇంటిల్లిపాదీ ఎదురుచూస్తుంటాం.
- నిఖత్, చంచల్గూడ
ఓ భగవంతుడా...
రంజాన్ దినాల్లో మా ఊరు చివరికి వెళ్లి మేమంతా ప్రార్థనలు చేస్తాం. రంజాన్ సందర్భంగా ఒక్క రూపాయి ఖర్చుపెడితే 70 రూపాయలు దక్కే బంపర్ ఆఫర్ ఇస్తాడు దేవుడు. రంజాన్ దినాల్లో పూర్వం మా పెద్ద గురువు పగలు అన్నం తినకుండె. నమాజ్ చేస్తుండె. అందుకే మేమూ అట్లాగే చేస్తున్నాం. ''భగవంతుడా 30 రోజులు ఒక్క పొద్దు ఇచ్చినావు. తప్పుంటే క్షమించు '' అని ప్రార్థన చేస్తాం. ఈ మాసం అంతా మాకు చాలా సంతోషంగా ఉంటుంది.
- మహమ్మద్ బాబా, శంషాబాద్
మాకూ ఆనందమే
మా ఇంటికి బంధువులు వస్తే వారిని కూడా తీసుకువచ్చాను. రంజాన్ పండుగ ముస్లింలకే కాదు నా లాంటి హిందువులకు కూడా ఆనందాన్నిస్తుంది. చూడండి ఎన్ని షాపులో. బాగా తిని చౌకగా కావలసినవి షాపింగ్ చేసుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఏముంటుంది? అందుకే ఇక్కడికి వచ్చాం.
-స్వర్ణలత, కూకట్పల్లి