ఇంద్రియాల నుండి జ్ఞానం (నాలెడ్జ్ ఫ్రం సెన్సెస్)... ఇది యుగయుగాల అనుభవ సత్యం. గౌతమ బుద్ధుని నుండి గాంధి మహాత్ముని వరకు అందరూ నొక్కి చెప్పిందిదే. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో బాల్యం ఛిద్రమవుతున్న తీరు మనం గమనిస్తూనే ఉన్నాం. చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం- ఈ పంచేంద్రియాలను మనం జ్ఞానేంద్రియాలుగా పిలుచుకుంటున్నాం. వీటిని సమన్వయ పరిచేది మెదడు. ఊహ తెలిసినప్పటి నుండి శిశువులో ఇవి పనిచేయడం ప్రారంభిస్తాయి. తల్లి స్పర్శను, గొంతును, రుచిని, వాసనను అన్నిటినీ శిశువు ఇట్టే పట్టేయగలదు. వీటి స్పందనను ఆరోగ్యవంతంగా అభివృద్ధి చేయడమే పెద్దల బాధ్యత. ప్రస్తుతం నర్సరీ నుండే పిల్లలు (రెండుమూడేండ్లకే) అటు కాన్వెంటులకు గాని, ఇటు అంగన్వాడీ కేంద్రాలకు గాని వస్తున్నారు. బాలల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం కల్పించవలసిన బాధ్యత కూడా మన విద్యావ్యవస్థకు ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే చెప్తున్నది.
కెరీర్ పరుగులాటే ప్రధాన లక్ష్యంగా కార్పొరేట్ స్కూళ్లు విద్యను మార్కెట్ చేస్తున్న క్రమంలో బాలల మానసిక వికాసం, ఇంద్రియాల స్పందన దెబ్బతింటున్న విషయం కాదనలేం. ఈ నేపథ్యంలో ప్రతి అధ్యాపకుడు ప్రాథమిక విద్యను పిల్లలకు వంట బట్టే విధంగా ఆకర్షణీయంగా బోధించడమెలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కేవలం యాంత్రికంగా, మొక్కుబడిగా పాఠాన్ని బట్టీ పట్టించే పద్ధతిలో బోధిస్తే సహజంగా వికసించాల్సిన ఇంద్రియాలు మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ఇప్పటి పిల్లలు స్మార్ట్ ఫోన్లలో టచ్స్క్రీన్తో వీడియో గేమ్స్ ఆడుతున్నారు. వాటిల్లో ప్రాణాంతకమైన పబ్జీ, బ్లూ వేల్స్ గేమ్స్ ఉంటున్నాయి. అవి ఏకాంత వ్యసనాలుగా కూడా మారుతున్నాయి. ఉన్మాదాన్ని రెచ్చగొట్టే ఈ హింసాయుత గేమ్స్ వల్ల బాలల మనో వికాసానికి తీవ్ర విఘాతం కలుగుతున్నది. అందుకే బాలల్లో నేడు 'కుదురు' లోపిస్తున్నది. ఇంద్రియాల స్పందన పట్ల శ్రద్ధ కరవవుతున్నది. దోపిడీ వ్యవస్థ కుట్రలో భాగమే ఇది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమని జాతీయ ఉపాధ్యాయ ప్రణాళాక చట్టం (ఎన్సిఎఫ్టిఇ- 2019) పేర్కొన్నది. అందులో భాగంగా ఉపాధ్యాయ విద్యను గుణాత్మకంగా మలిచేందుకు రెండేండ్ల డి.ఎల్.ఎడ్ కోర్సుకు రూపకల్పన చేసి కళలు-కళావిద్య (ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్) పాఠ్యాం శాన్ని పొందుపరిచింది. గతమూడేండ్లుగా ఇది అమలవుతున్నది.
కళ అంటే ఏమిటో, మానవ నాగరికత నిర్మాణంలో కళల పాత్ర గురించి సమాచారం ఈ పుస్తకంలో ఉన్నది. సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, నాటకం, జానపద కళలు, కథలు చెప్పే ప్రక్రియ, చేతిపని (క్రాఫ్ట్ వర్క్), తెలంగాణ కళలు-హస్తకలలు వంటి వాటి గురించి స్థూల వివరణ కనిపిస్తుంది. అంతే కాదు భారతీయ, పాశ్చాత్య తత్వవేత్తల, విద్యావేత్తల కళావిద్య దృక్పథాలు, విద్యా విధానంలో కళల సమన్వయం, ఆవశ్యకత, చేసిన ప్రయోగాలు-వాటి ఫలితాలను కూడా చర్చించింది. ముఖ్యంగా ప్రాథమిక తరగతుల బాలల సమగ్ర అభివృద్ధిలో కళావిద్య నిర్వహించే ప్రాధాన్యతను కృత్యాధారంగా వివరించడం కనిపిస్తుంది. మాద్యమిక విద్యా తరగతులలో కళా విద్య పాత్రను తెలియజెప్పడంతో పాటు, ప్రాపంచిక స్థితిగతులతో అనుసంధానం చేయవలసిన తీరును వక్కాణిస్తున్నది.
చివరిగా కళా విద్య ఒక బోధనోపకరణంగా ఉపయోగపడే తీరును విశదపరుస్తున్నది. కాగా ఏ కళారూపాలు ఏయే పాఠ్యాంశాలు బోధించడానికి అనువుగా తోడ్పడతాయనే అంశాన్ని కూడా సోదాహరణంగా తెలుపుతున్నది. కళావిద్య, కళావిద్య మదింపును కూడా చర్చించింది. 'కళ అనంతం-జీవితం స్వల్పం'. అందువలన ఇందులో ఉన్న పాఠ్యాంశాల విషయ పరిధి కూడా అనంతం. కొద్ది పుఠలలో ఇమడ్చడం అసాధ్యం. కొంతలో కొంత మహుముఖ పార్శ్వాలను స్ఫృజించడం హర్షించదగినది. అందుకే ఈ పుస్తకం శిక్షణలో ఉన్న భావి ఉపాధ్యాయులకు, కళారంగంలో రాణించాలనుకునేవారికి కూడా ఒక కరదీపికగా పనికొస్తుందని సంపాదకులు ప్రవేశికలో తెలిపారు.
కలల గురించి ప్రాథమిక అవగాహన కలగడానికి ఒక అక్షరమాలగా తోడ్పడుతుంది. ముఖ్యంగా పిల్లలతో పిల్లల్లా కలిసిపోయే ఉపాధ్యాయులకు, ఎప్పటికప్పుడు పాఠాన్ని కొత్త పద్ధతుల్లో ఆకర్షణీయంగా బోధించాలనుకునేవారికి కళాత్మకంగా మమేకమై హృదయానికి హత్తుకునేలా అంశాన్ని బోధించాలనుకునేవారికి, అన్నింటికీ మించి తరగతి గదినే ఓ రంగస్థలంగా తీర్చిదిద్దాలనుకునేవారికి ఈ పుస్తకం ఓ అస్త్రంలా పనిచేస్తుంది.
వివిధ రంగాలలో నిష్నాతులైన ప్రముఖులుఈ పుస్తక రచనలో పాల్గొన్నారు. ఆచార్య సి.హెచ్.కృష్ణారెడ్డి సంపాదుకులు. తెలుగు అకాడమి దీన్ని ప్రచురించింది.
-కె.శాంతారావు,
9959745723
Authorization