భారతీయ ఆదివాసీలు సాంకేతికాభివృద్ధిలో వివిధ దశల్లో ఉండటం వల్ల వాటి రాజకీయ వ్యవస్థ కూడా వివిధ దశల్లో ఉంది. దేశం దక్షిణ ప్రాంతంలో కాదర్, ఇరుల, చెంచు వంటి తెగలు ఇంకా ఆహారం సేకరణ, వేటాడటం ద్వారానే జీవనం సాగిస్తున్నాయి. (మైదాన ప్రాంతాల్లో ఉన్న కొద్దిమంది తప్ప). తెగల సాంకేతిక స్థాయి అతి తక్కువగా ఉన్నది. అయితే మేఘాలయలోని గారో, ఖాసీ తెగవారు; అరుణాచల్ ప్రదేశ్లో నివసించే అపతానీ తెగవారు వ్యవసాయాన్ని, తోటలను అభివృద్ధి చేసి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. హిందు, క్రైస్తవ మతాలతో సంబంధాలను బట్టి కూడా గిరిజన తెగలను విభజించవచ్చు. మధ్యప్రదేశ్లోని ఛోటా నాగపూర్ ప్రాంతంలోని తెగలు హిందు మతాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నాయి. మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, ప్రాంతాల్లో గిరిజనులు ప్రధానంగా ఆదివాసీలు క్రైస్తవాన్ని అనుసరిస్తున్నారు. భారతదేశంలోని ఆదివాసీలందరూ ఒకే రకమైన జీవనాన్ని గడపడంలేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భిన్నమైన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవనాన్ని అనుసరిస్తూ తమ పరిసర పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తున్నారు. ఆశ్చర్యకరమైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నా ఆదివాసీలు అనేక రకాల రాజకీయ వ్యవస్థలను, సంస్థలను అభివృద్ధి చేశారు. ఈ తెగల్లో కొన్ని పూర్తి వికేంద్రీకరణను అనుసరిస్తే, మరికొన్ని పూర్తిగా నియంతృత్వ, కేంద్రీకృత పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ రెండు పద్ధతులు పక్క పక్కనే సహజీవనం చేయడం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆదివాసీల రాజకీయ సంస్థలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు దేశం ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఖాసీ, గారో, లుషాయీ, జయింతియా, మిజో, అపతానీ, అనేక నాగా తెగలు నివసిస్తున్నాయి. అస్సాంలోని తెగలు ప్రజాస్వామ్య రాజకీయ సంస్థలను అనుసరిస్తున్నాయి. భూమిపై ఉమ్మడి యాజమాన్యాన్ని ఈ తెగలు గుర్తిస్తాయి తప్ప, వ్యక్తిగత యాజమాన్యాన్ని అసలు గౌరవించవు. ఒక గ్రామంలో నివసించేవారు తమకిష్టమొచ్చిన ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవచ్చు. గ్రామాల్లో నివసించే వివిధ కుటుంబాల ఆర్థిక స్థాయిలో తేడాలున్నప్పటికీ సామాజిక వర్గీకరణ స్పష్టంగా జరిగే స్థాయికి ఈ తేడాలు చేరుకోలేదు.
ఈశాన్య భారతదేశంలో ఉన్న కొన్ని తెగలు బహిర్వివాహం చేసుకునే చిన్న చిన్న తెగలుగా విడిపోయి ఉన్నారు. మిగిలినవారు విభజన లేకుండా గ్రామాలలో ఉమ్మడిగా నివసిస్తున్నారు. ఈ గ్రామాలు ఒక అధిపతి నాయకత్వంలో ఉండి ఇతర గ్రామాలతో సంబంధం లేకుండా స్వేచ్చగా ఉంటాయి. ఖాసీ తెగలో తెగ నాయకుని హౌదా, ప్రతిపత్తి పెద్ద సోదరి జ్యేష్ట కుమారునికి సంభవిస్తాయి. అతని మృతి తర్వాత అన్నకు కాని, మేనమామకు కాని లభిస్తాయి. మగ వారసులు లేని సందర్భాల్లో తెగ నాయకుని జ్యేష్ట సోదరికి గాని, జ్యేష్ట సోదరి కుమార్తెకు కాని వారసత్వ అధికారం సంక్రమిస్తుంది. ఖాసీ తెగవారు నివసించే ప్రాంతం గతంలో 25 స్వతంత్ర రాజ్యాలుగా విభజితమై ఉండేది. ఈ స్వతంత్ర రాజ్యాలకు సీమ్ అనే నాయకుడు నేతగా ఉండేవాడు. పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా ఉండేది. ఖాసీ తెగ నాయకునికి భూమిపై కాని, అడవులపై కాని ప్రత్యేకాధికారాలంటూ ఉండేవి కావు. అతనికి స్వతంత్రంగా పన్నులు విధించే అధికారం కాని, కొత్త చట్టాలను అమలుచేసే అధికారం గానీ, విధానాలను అమలుచేసే హక్కుగానీ లేవు. రాజ్యంలోని పురుషులందరూ సమావేశమై ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను మాత్రమే అతడు అమలుపరచాలి. అటువంటి సమావేశాలకు రాజ్యంలోని పురుషులందరూ తప్పనిసరిగా హాజరుకావాలి.
ఖాసీ తెగ అధినేత సీమ్ కంటే లుషాయీ తెగ నాయకులకు ఆధిపత్యం, ఆధిక్యత ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్రామ పెద్దల అభిప్రాయాలను త్రోసిరాజని పరిపాలన చేయడం చాలా కష్టం. తెగ నాయకత్వం వారసత్వంగా వచ్చినప్పటికీ పరిపాలన ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది.
ఉత్తర కచార్ జిల్లాలో నివసించే తెగలు తమ నాయకుణ్ణి ఎన్నుకోవడానికి వారసత్వ పద్ధతిని ఎన్నికలను కూడా ఏక సమయంలో వినియోగించుకుంటున్నాయి. గ్రామానికి చెందిన వారందరూ సమావేశమై తెగ సమస్యలను పరిష్కరించుకుంటారు. తెగలోని వ్యక్తులకు హానిచేసినవారిపై సమావేశం తీసుకున్న నిర్ణయం మొత్తం తెగ తీసుకున్న నిర్ణయంగా చలామణీ అవుతుంది. గ్రామ పెద్దలు ఒక సంఘంగా ఏర్పడి తమ గ్రామ సమస్యలను గానీ, తమ గ్రామ సముదాయం సమస్యలను గానీ ఎప్పటికప్పుడు చర్చిస్తుంటారు.
గారోల రాజకీయ వ్యవస్థ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే నడుస్తుంది. నిజానికి వీరిలో తెగ నాయకుడంటూ ఎవరూ ఉండరు. ఉన్నా అతడు కేవలం నామమాత్రపు నాయకుడే. ప్రధానమైన అంశాలన్నింటినీ గ్రామ పెద్దలు, లేక కుటుంబ పెద్దలు సమావేశమై నిర్ణయిస్తారు.
మికిర్ తెగ రాజకీయ వ్యవస్థ
స్టీఫెన్ పుచ్ 'మికిర్' తెగలో మూడు దశల్లో గ్రామ పాలనా వ్యవస్థ ఉన్నట్లు వివరించాడు. మికిర్ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలిసిన వృద్ధులు కింది స్థాయిలో గ్రామ పాలనలోని దిగువ స్థాయి పదవులను నిర్వహిస్తారని, వీరిని అకోం అసర్ అని వ్యవహరిస్తారని ఆయన రాశారు. గ్రామ పెద్ద అయిన మబె వీరిని నియమిస్తాడు. హబె అధికార పరిధి కూడా గ్రామాన్ని మించి విస్తరించదు. ఈ హబేలను పిన్పోలు నియమిస్తారు. మికిర్ కొండల పరిపాలనకు తన ప్రతినిధులుగా జయింతియా పాలకుడు ఈ పిన్పోలను నియమించేవాడు. పిన్పో పదవి వారసత్వంగా లభిస్తుంది. పిన్పోలుగా ఆయా తెగలకు చెందినవారినే నియమిస్తారు.
వైవిధ్యభరితమైన నాగా వ్యవస్థలు
నాగాల రాజకీయవ్యవస్థలో చాలా వైవిధ్యం ఉంది. కొన్ని నాగా తెగల్లో తెగ నాయకులు విశేషమైన అధికారాలు కలిగి ఉండి నియంతలుగా పరిపాలిస్తారు. కొన్ని గ్రామాల్లో తెగ నాయకునికి అధికారాలు నామమాత్రంగా ఉండి పరిపాలన ప్రజాస్వామ్యబద్దంగా ఉంటుంది. నాగా తెగల వారిని రక్త పిపాసులుగా, యుద్ధ ప్రియులుగా వర్ణించడం తరచుగా జరుగుతున్నా అది పూర్తి సత్యం కాదు. నాగా తెగలు పరస్పరం కలహించుకుంటూ నిరంతరం కక్షలు తీర్చుకోవడంలో మునిగిఉంటాయన్న మాట చాలావరకు యదార్థమే. అయితే ఈ అంశాన్ని సామాజిక, చారిత్రక దృష్టితో అవగాహన చేసుకోవాలి. ఎవరికి వారు తానే చట్టం అని భావించే నాగా తెగలో స్థిరమైన పాలన ఎట్లా సాధ్యమని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయ వ్యవస్థలు మనుగడ సాగిస్తూ ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనయ్యాయి. కొన్యాక్ నాగాలు తమ తెగ నాయకుణ్ణి చాలా పవిత్రునిగా భావిస్తారు. అనేక గ్రామాలను ఈ నాయకుడు పరిపాలిస్తాడు. గిరిజనుల సంపదకు ప్రతినిధిగా, పవిత్రతకు, జీవన సిద్ధాంతాలకు సంకేతంగా తెగ నాయకున్ణి వారు ఆరాధిస్తారని పుచ్ పేర్కొన్నాడు. కొన్ని గ్రామాల్లో తెగ నాయకుని కాలును నేలకు ఆననివ్వరు. అతడి ప్రయాణ సమయంలో కొన్యాక్ నాగాలు మోసుకుపోతారు.
అంగామీ నాగాలలో పరిపాలనకు ప్రాథమిక యూనిట్ గ్రామం కాదు. అంగామీ నాగాలు నివసించే సబ్డివిజన్ని వారు యూనిట్గా భావిస్తారు. ఈ యూనిట్ని ఖెల్ లేదా తెవూ అని వ్యవహరిస్తారు. ఈ తెగలు బహిర్వివాహ పద్ధతి అనుసరిస్తాయి. ఈ తెగలోనివారు తమ పూర్వీకుడు ఒక్కడే అని భావిస్తారు. తెవూల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి.
ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తమకు భద్రత, రక్షణ అవసరమని నాగాలు భావించడం వల్లనే వారి రాజకీయ సంస్థలు మనుగడ సాగిస్తున్నాయి. హేమన్డార్ఫ్ అభిప్రాయం ప్రకారం దైవదత్తమైన అధికారాలు కలిగి ఉన్న తెగల నాయకులు పవిత్రులన్న నమ్మకం ఈ తెగల ప్రజల్లో ఉన్నది. అందువల్లనే ఈ తెగల నాయకులు సరైన కుటుంబాల్లో జన్మించారని, సమాజంలోని మంచి శక్తులను, దుష్ట శక్తులను వీరు ప్రేరేపించగలరని ఆ విధంగా ప్రకృతి వైపరీత్యాలను వీరు అడ్డగించగలరని ఆదివాసీలు విశ్వసిస్తారు.
Authorization