తమిళనాడులోనే కాక ప్రపంచవ్యాప్తంగా తమిళులు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో జరిగే పండుగల్లో ముఖ్యమైనది 'తిమితి' పండుగ. ఇది అక్టోబర్ - నవంబర్ మాసాల్లో వచ్చే పండుగ. తిమితి అంటే గుండం అనే అర్థం ఉంది. ఈ పండుగ రోజు అగ్నిగుండంలో నడుస్తారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. తిమితిని ద్రౌపది అమ్మాళ్ గౌరవార్థం జరుపుకుంటారు. పాండవ పత్నియైన ద్రౌపది అవతారమే మరియమ్మన్ దేవత అని తమిళ హిందువులు నమ్ముతారు. అందుకే ఈ పండుగరోజున ఇద్దరినీ పూజిస్తారు. శ్రీలంక, సింగపూర్, మలేషియా, మారిషస్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తమిళులు ఈ పండుగను అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు. పండుగ రోజు అనేక భక్తులు, డ్రామా ట్రూపులవారు అనేక సంఘటనలను వేషధారణతో ప్రదర్శిస్తారు. పెరియాచికి హిజ్రాను బలివ్వడం ఈ ప్రదర్శనల్లో ఒకటి. అట్లాగే మరియమ్మన్కి క్షీరాభిషేకం చేస్తారు. అన్నింటికన్నా ముఖ్యమైనది అగ్నిగుండంలో కణ కణలాడే నిప్పుకణికల మీద నడవడం.
సింగపూర్లోని సిరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాల్ దేవాలయంలో ఈ ఉత్సవాలు రాత్రి పదిగంటలకు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి పూజారి ఆధ్వర్యంలో భక్తులు ఊరేగింపుగా సౌత్ బ్రిడ్జి రోడ్లో ఉన్న మరియమ్మన్ దేవాలయానికి పోతారు. ఇక్కడే ప్రధానంగా తిమితి పండుగ జరిగేది. ఈ దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పూజారి ఒక పవిత్రజల పాత్ర (కరకట్టం)ను నెత్తినపెట్టుకొని నడవడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. పూజారిని అనుసరిస్తూ పురుష భక్తులు తమ కోర్కెలను తీర్చమని కోరుతూ నిప్పులమీద నడుస్తారు.
పండుగ సందర్భంగా జరిగే కార్యక్రమాలు
తిమితి పండుగకు ఒక వారం రోజుల ముందే మహాభారతంలోని వివిధ ఘట్టాలను భక్తులు, నాటకాలు వేసేవారు ప్రదర్శిస్తారు. అట్లాగే పెరియాచి దేవునికి ప్రార్థనలు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కాపాడమని పెద్దఎత్తున మరియమ్మన్ని ఉద్దేశించి ప్రార్థనలు చేస్తారు.
ఇక రెండవ కార్యక్రమంగా అర్జునుడు-ద్రౌపది వివాహ మహోత్సవాన్ని ప్రతీకాత్మకంగా నిర్వహిస్తారు. ఈ వివాహ కార్యక్రమం జరిగిన వెంటనే అతిముఖ్యమైన తంతునొకదాన్ని నిర్వహిస్తారు. అదే హిజ్రాను 'బలిచ్చే' కార్యక్రమం. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు పాండవుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఒక హిజ్రాను బలిచ్చారట. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ హిజ్రాను బలిస్తున్నట్లు ఒక కార్యక్రమాన్ని ప్రతీకాత్మకంగా నిర్వహిస్తారు. అంతే కానీ నిజంగా బలి ఇవ్వరు.
ఆ తర్వాత భక్తులు పాల పాత్రలను సమర్పించడం, కుంబిదుతండం (సాష్టాంగ నమస్కారం) చేయడం, అంగప్రదక్షిణ చేయడం వంటివాటిని నిర్వహిస్తారు. భక్తులు సమర్పించిన పాలతో మరియమ్మన్కి క్షీరాభిషేకం చేస్తారు. ఇట్లా చేస్తే మనుషులు చేసిన పాపాలు తుడిచిపెట్టుకుపోతాయని భక్తుల నమ్మకం.
Authorization