'యథా రాజా తథా ప్రజ' అన్నది ఒక నానుడి. అయితే రాజులు మూర్ఖులు, చవటలు, భోగలాలసులు అయినప్పుడు 'యధా ప్రజ తథా రాజా' అని తిరగ రాయవలసి వస్తుందని; ప్రజలు దుర్మార్గానికి, అణచివేతకు వ్యతిరేకంగా తప్పక తిరగబడతారని తెలియజెప్పే నాటకం 'బకాసుర'. రసరంజని హైదరాబాదువారు నెలవారీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 'సమాహార'వారు ఈ జానపద నాటకం 'బకాసుర'ను ఇటీవల (జూన్20, 21) తెలంగాణ సారస్వత హాలులో ప్రదర్శించారు.
ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకు ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉంటాయి. పైగా తిండిపోతుత నిదురపోతు, సోమరిపోతు కూడా. ఈ నగర రాజ్యానికి ఆవల కొండ కోనల్లో బకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు.బతుకుదెరువు కోసం అడవుల్లోకి వెళ్లినవారిని చంపుకుతింటుంటాడు. రాక్షసుని బారిన పడిన ప్రజలు రక్షణకై పరుగులు పెడతారు.
రాజ్యాన్ని రక్షించాల్సిన రాజు, మంత్రి, కొత్వాలు సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తుంటారు. నాన్చుతుంటారు. విషయమేమిటంటే... ఆ రాక్షసుని ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ ఉండదు. లోలోపల అందరికీ భయమే. పైపెచ్చు అట్లా ఒక రాక్షసుడు ఎప్పుడూ ఉంటేనే తమ పరిపాలన సజావుగా సాగుతుందని రాజుకు, రాజ్యపాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో ఎటువంటి తిరుగుబాట్లు, విప్లవాలు చెలరేగవని తమకు తామే నమ్మబలుక్కుంటూ, తమలో తామే సంతోషపడుతుంటారు. వందిమాగధులు, వేదపండితులు సరేసరి... అదే విధంగా భజన చేస్తారు. భూస్వాములు లాభాల కోసం వచ్చిన వ్యాపారులు కూడా తానా తందానా అంటూ ఉంటారు. ఇట్లా రాజుగారి ఆస్థానం అంతా పిచ్చి భ్రమల్లో మునిగి తేలుతూ ఉంటుంది.
కాని లోపలి పరిస్థితి వేరు. బయట పరిస్థితి వేరు. ఈ నేపథ్యంలో భద్రమ్మ అనే యువతి ప్రజల పక్షం వహించి రాక్షసుని ప్రమాదం గురించి రాజుకి విన్నవిస్తుంది. దుష్టత్రయం భద్రమ్మను రుజువులు, సాక్ష్యాలు అడిగి హేళనతో అవమానించి భద్రమ్మ విన్నపాన్ని కొట్టిపారేస్తారు. భద్రమ్మ రాక్షసుడు ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ పడిఉన్న కంకాళాలను, కళేబరాలను చూసి చెలించి పోతుంది. అజేయమైన ప్రజాబలంతోనే రాక్షసుణ్ణి జయించగలమనే కృతనిశ్చయానికి వస్తుంది. ప్రజలను సమీకరించి పోరుకు సిద్ధపడుతుంది.
రాజుకి ఇది నచ్చదు. భద్రమ్మను రాజ్యద్రోహిగా ముద్రవేస్తాడు. ఎట్టకేలకు భద్రమ్మను బంధించి రాజాస్థానానికి తీసుకువస్తారు. తూతూ మంత్రంగా విచారణ జరిపి 'విప్లవకారిణి' అన్న నెపంతో శిరచ్ఛేదం శిక్ష విధిస్తారు. కుట్ర ఏమిటంటే... భూస్వామి, వ్యాపారి మాటలు విని రాజు రాక్షసునితో చెలిమి చేయడానికి ఒప్పుకుంటాడు. రాక్షసుని మెప్పించడానికి రాజు రోజుకో మనిషిని, రెండు దున్నల్ని, ఒక బండి అన్నం ఆహారంగా పంపడానికి నిర్ణయిస్తాడు. తొట్టతొలుత ఆకలితో అల్లాడుతున్న ఓ వికలాంగుడైన వెర్రి బాలుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధమవుతుంది దుష్టత్రయం.
ఊహించని విధంగా భద్రమ్మ ఖైదు నుంచి తప్పించుకుని, ప్రజల్ని కూడగట్టి రాక్షసుడితో యుద్ధం చేసి జయిస్తుంది. ఆ క్రమంలో తాను కూడా క్షతగాత్రురాలై నేలకొరుగుతుంది. వెర్రి బాలుడు తన ప్రాణాలు కాపాడిన తల్లి భద్రమ్మ అని పొర్లి పొర్లి ఏడుస్తుంటాడు (ఇదంతా వ్యాచ్చంగానే ప్రేక్షకునికి తెలుస్తుంది).
ప్రజల ఆగ్రహావేశాలు చల్లబరచేందుకు దుష్టత్రయం వెనువెంటనే భద్రమ్మకు భారీ శిలావిగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. భూస్వామి, వ్యాపారి ఇందుకోసం భూరి విరాళాలు ప్రకటిస్తారు. ప్రజల్లో అజ్ఞానాంధకార రాక్షసత్వం ఉన్నంతవరకు పాలకులు ఇట్లాగే మోసం చేస్తూ ఉంటారని భద్రమ్మ శిలా విగ్రహం నుండి బయటికి వచ్చి ఉద్భోధించడంతో నాటకం పరిసమాప్తమవుతుంది.
సన్నివేశాలు, సంభాషణలు అన్నీ అడుగడుగునా సమకాలీన రాజకీయ చిత్ర పటాన్ని ప్రతిబింబించే విధంగా ఉండటమే ఈ నాటకం ముఖ్య విశేషం. రచన అంత బిగువుగా సాగింది. 'సమాహార' యువ బృందం రెండు నెలల పాటు శిక్షణ పొంది ఈ నాటకాన్ని ప్రదర్శించింది. సంగీతం, రంగాలంకరణ, రంగోద్దీపన తగు స్థాయిలో ఉండి, సన్నివేశాలు మరింతగా దృశ్యమానమై సాగితే నాటక రాజంగా మిగలటానికి అవకాశం ఉంది. ఎన్.తారక రామారావు రచించిన ఈ నాటకానికి దర్శకత్వం వహించింది పి.నాగరాజు. నిర్మాత రత్న శేఖర రెడ్డి.
Authorization