బంజారా పండుగలన్నీ ప్రకతితో ముడిపడి ప్రకతిని పూజిచి ఆరాధించేవే. మంత్రాలు, వేదాలు తండాలలో లేవు. పూర్వకాలం నుంచి తండాల్లో దేవుండ్లు గుడి, గోపురాలు కట్టి పూజించే సాంప్రదాయం లంబాడీలకు అంతగా లేదు. పంట కోసే ముందు, విత్తనం వేసేటప్పుడు మూడురాళ్లను కడిగి, బొగ్గు, పసుపు రాసి మొక్కులు తీర్చుకునేవారు. పంట రాసులు పండితే అదే తంతు జరిపేది. ఆ రాళ్లు మళ్లీ పొలంలో కలిసిపోయేవి. వేటకు వెళ్తే అదే తంతు లంబాడీల్లో ఉండేది. దేవుండ్లకు రూపం, విగ్రహాలు గాని బంజారాలలో లేవు. ఆయా సందర్భాన్ని బట్టి పూజలు చేసుకునేవారు. ఇప్పటిలాగ స్వాములు, బ్రాహ్మణులు వస్తేనే పెండ్లి మంత్రాలు చదువుకునే పూజలు వీరికి లేవు.
ప్రకృతి ఆధారంగా తరతరాలుగా తండాలను ఏర్పరచుకొని లంబాడీలు తమ మనుగడను కాపాడుకున్నారు. ఇందుకోసం అడవి దగ్గరగా భూమి, నీళ్లు పశుసంపదను అభివృద్ధి చేసుకున్నారు. ఇతరుల దాడుల నుంచి తమ సాంస్కృతిక ఆచార అలవాట్లు కాపాడుకుంటూ తమ సొంత వనరులపై ఆధారపడి తండా సమాజాన్ని ఏర్పర్చుకున్నారు. గిరిజనుల సంస్కృతి పూర్తిగా సమాజానికి దూరంగా ఉంది. భాష, పండుగలు, పెండ్లిళ్లు, సాంప్రదాయ దుస్తులు, వేషధారణ, ఆహారపు అలవాట్లు, పంచాయితీలు, వారి రంగులు, జీవన విధానం పూర్తిగా అడవిపై ఆధారపడి ఉంటాయి. రాజులు, సంస్థానాలు పాలిస్తున్న రోజుల్లో వీరికి భూమి దక్కలేదు. అడవి, కొండ, వాగులను ఆసరా చేసుకొని జీవనం సాగించారు.
17వ శతాబ్దంలో అనంతపురం జిల్లా గుత్తి మండలం రాంజి తండాలో జన్మించిన సేవాలాల్ మహారాజ్ తండా తండా తిరిగి లంబాడీలను చైతన్యపరచడం కోసం పనిచేశాడు. పశువులను, గొర్లను కాసుకుంటూ ఉప్పు అమ్ముకుంటూ కాలం వెళ్ల్లదీస్తున్న కాలంలో సేవాలాల్ మహారాజ్ బంజారాలకు కొన్ని సూచనలు చేశాడు. లంబాడీలు జీవించాలంటే ముందుగా స్థిరపడాలన్నాడు. అడవికి దగ్గరగా తండాలు ఉండాలన్నాడు. అటవి కుడివైపు ఉంటేటట్టు తండాను స్థిరపరచుకోవాలన్నాడు. కుడివైపు నుండి ఎడమవైపు నీళ్లు ప్రవహించే ప్రాంతమై ఉండాలన్నాడు. జీవనం కోసం భూమి, నీళ్లు, సాగుభూమి స్థిరపరచుకోవాలన్నాడు. బట్టలు లేని ఆనాడు నెమలి రంగులో వస్త్రాధారణ ఉండాలన్నాడు. ఒకే తాను బట్ట లేదు కాబట్టి లంగా, బురుకు, జాకెట్టు, నెమలి ఆకారాన్ని చూసి తయారు చేసుకున్నవే. నెమలిలా లయబద్ధంగా మహిళలు ఆడాలన్నాడు. కోయిలలా పాటలు పాడుకోవాలని సూచించాడు. అడవి ఫలాలతో గుడుంబ తయారు చేసుకొని పండుగలు, పెండ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలన్నాడు. అప్పటికి ఇంతగా తండా ప్రజలకు గాని లంబాడీలకు గాని బ్రాహ్మణులు తెలియరు. తండాలో ఏ కార్యం జరిగినా పెండ్లి, పుట్టుకలు, చావులు, పండుగలైనా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ. సప్త మాతల్లో ఒకరైన శీతల భవాని గురించి కొంత వివరణ ఇవ్వాలి.
సీత్ల భవానీ పండుగ
సీత్ల భవాని పండుగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న లంబాడీలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ఇలాంటి పండుగ తెలుగు పండుగల్లో ఎక్కడ చూసినా కనిపించదు. ఇది బంజారా ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. పంట పొలాలు సాగుచేసే క్రమంలో తొలిసారిగా వారి పండుగ ఆరంభమవుతాయి. హిందూ పండుగల్లో ఉగాది తొలి పండుగ ఎలా ఉందో అలాగే సీత్ల భవాని పండుగ బంజారాలకు తొలి పండుగ. ఈ పండుగను వివిధ తండాల్లో ఆ తండా ప్రజలు పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢమాసంలో ఒక మంగళవారం ఎంచుకొని సీత్ల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఈ పండుగ ప్రత్యేకత, ఆనవాయితీ. లంబాడీల పండుగలో మొదటిది, ప్రధానమైనది దాటుడు, సీత్ల పండుగ. తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవానిని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు మేకలతో, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశానికి వెళ్తారు.. ఈ క్రమంలో అందరు కలిసి పాటలు పాడుతారు. సీత్ల భవాని దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటిని పైనుంచి పశువులను దాటిస్తారు. అలా చేయడం వల్ల పిల్లాజెల్లా ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారా నమ్మకం. దేవతను పూజించే క్రమంలో పెద్ద మనిషిని పూజారిగా ఉంచి అతని చేతుల మీదగా కార్యక్రమం నిర్వహించడం బంజారాల ఆచారం. ఎక్కువ పశు సంపద వృద్ధి చెందాలనీ, తండా ప్రజలందరినీ దేవత సల్లగా ఉండేలా దీవించాలనీ, పశువులకు ఎటువంటి రోగాలు రాకూడదనీ, ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలనీ తండావాసులు వారి పశువులను ఒకేచోట చేర్చి అందరూ కలిసి భవాని దేవతను పూజిస్తారు. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదని మొక్కులు తీర్చుకుంటారు. పశు సంపద కోసం, పశువుల ఆరోగ్యం కోసం తండా సౌభాగ్యం కోసం సీత్ల భవాని పూజ చేయడం ఆనవాయితీ. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం.
కొత్త పేర్లు, కొత్త రూపాల్లో పండుగలు తండాలలోకి ప్రవేశిస్తున్నాయి. తండా సంస్కృతిని ధ్వంసం చేయజూస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా తమ జీవన విధానాన్ని సహజీవనాన్ని ధ్వంసం చేయడమేనని లంబాడీలు గుర్తించాలి. గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యమైనా... పండుగైనా, పెండ్లి అయినా, పంచాయితీ అయినా సామూహికంగా పరిష్కరించుకునేది. కార్యం పూర్తి చేసేది. ఇప్పుడు అది లేకుండా పోయింది. తండా కట్టుబాట్లు అభివృద్ధి వైపు ఉండేవి. ఇప్పుడు బ్రాహ్మణీయ, పాశ్చాత్య సంస్కృతులు తండామీద పడుతున్నాయి.
- గుగులోతు శంకర్ నాయక్
9908817986
Authorization