''శతాబ్దాల కాలంగా
మనిషి... మనస్సులో నిండి
జీవం పండించింది ఈ భూమి
భావితరాల సంపదంత ఈ సౌందర్యం
దీనిని ధూర్త పుత్రులు కొందరు స్వాహా చేస్తున్నారు
కాదిది అక్షయ పాత్ర అమిత వ్యయానికి...
ఈ భూమి మనది అందరం కలసి
మన భూమాతను మనం కాపాడుకుందాం''
1987 భారత జనవిజ్ఞాన యాత్రకు సంబంధించిన 'భూమి' కలారూపంలోని అమృతవాక్యాలివి. ఇది ఓ సంగీత శిల్పం. ఈ రూప నిర్దేశకులు ఎస్.రఘునందన్. కన్నడ రంగస్థలదర్శకుడు, ప్రయోక్త, కవి అయిన రఘునందన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగీత నాటక అకాడమి అవార్డును తిరస్కరించడం హిందుమత ఛాందసవాదులకు మింగుడు పడటంలేదు. శుద్ధ కళావాదులకు ఆశ్చర్యం గొల్పుతున్నది.
దేశం కోసం సైన్స్,, శాంతి కోసం సైన్స్, ప్రజల కోసం సైన్స్ అనే నినాదాలతో భారత జన విజ్ఞాన సమితి ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా ఆ నినాదాలకు ప్రాణం పోస్తూ కళాయాత్రలు చేపట్టింది. స్వాతంత్య్రానంతరం ప్రజాకళారూపాలు దేశమంతటా వెల్లువెత్తిన దశ అది. విద్యార్థులను, యువతను, మధ్యతరగతి మేధావులను ఆ కళాయాత్రలు విపరీతంగా ఆకర్షించాయి. దాదాపు నూట యాభైమంది కళాకారులు మూడు నెలల పాటు ఏకథాటిగా దీక్షతో శిక్షణ పొంది ఈ బహుభాషా కళా యాత్రల్లో పాల్గొనడం విశేషం.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆ కళాయాత్ర భూమికలోను, రూపకల్పనలోను రఘునందన్ వంటి ప్రతిభామూర్తుల అద్వితీయ భాగస్వామ్యం ఉన్నదని చెప్పడానికే. ఆ కళాకారుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా ఈ రచయిత పొల్గొని ఒక మరపురాని అనుభూతిని మిగుల్చుకున్నాడు.
రఘునందన్ మొదటి నుండి కళలో సత్యం-శివం-సుందరం తత్వాన్ని పాదుకొల్పాలని తాపత్రయపడేవాడు. ఆ విధంగానే ఎక్కడైనా, ఎప్పుడైనా తర్కించేవాడు. మనం ప్రదర్శించే కళారూపంలో వాస్తవం (సత్యం) ఎంత? అభివ్యక్తీకరించే శక్తి సామర్థ్యం (ఎనర్జీ-శివం) ఎంత? ప్రేక్షక హృదయాలను ఆకర్షించే నిర్మలత్వం (సౌందర్యం) ఎంత? ఈ ప్రశ్నలను ప్రతి కళాకారుడు తనకు తాను సంధించుకోవాలని కోరుకుంటాడు. సత్య నిష్ట గల ఆ కళాజ్యోతి జ్వాజ్వల్యమానంగా వెలగనంత వరకు ఆ కళాకారుడు గాని, ఆ కళా రూపం గాని ప్రకాశించదని నిష్కర్షగా తెగేసి చెబుతాడు. ఈ నిక్కచ్చితనం, సూటితనం కాలక్షేప కలాకారులను ఇబ్బంది పెట్టేది కూడా. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (న్యూఢిల్లీ) విద్యార్థి దశ నుండే ఈ ప్రస్థానం వరవడి రఘునందన్లో కొనసాగింది. కనుకనే ప్రగతిశీల కళాకారులకు ఆదర్శంగా నిలిచాడు.
ఇక అవార్డు తిరస్కారం గురించి చూద్దాం. అవార్డును తిరస్కరిస్తూ ఆయన రాసిన ఉత్తరాన్ని చూస్తే ఆయనేమిటో మనకు మరింత స్పష్టమవుతాడు. ''దేవుడు... మతం పేరిట నేడు దేశంలో మూకదాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తినే తిండిపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఇందుకు పాలనాధికార స్థానాల్లో ఉన్నవారే ప్రధాన బాధ్యులు. సామాజిక మాధ్యమాల్లో కూడా నేడు పెద్దఎత్తున విద్వేష విషప్రచారం సాగుతున్నది.
విశ్వవిద్యాలయాల నుండి ప్రాథమిక స్థాయి వరకు మనుషుల మధ్య వివక్షాపూరిత ప్రచారం యధేచ్ఛగా సాగిపోతున్నది. పాఠ్యాంశాల బోధనగానూ మారిపోతున్నది. వసుధైక కుటుంబం అనే భారతీయ ఆదర్శాన్ని ఈ ఉన్మాదులు వికృతం చేస్తున్నారు. ఈ పరిణామాల పట్ల నా లాంటి కళాకారులం అమిత వేదనను అనుభవిస్తున్నాం. 'మనుషులంతా ఒక్కటే' అన్న నిత్య సత్య స్ఫూర్తిదాయక ఆదర్శానికి భారత దేశంలో తావులేకుండా చేస్తున్నారు. దేశ భవిష్యత్తును తీర్చగలిగే కన్హయ్య కుమార్ వంటి యువకులపై దేశ ద్రోహ నేరాన్ని ఆపాదిస్తున్నారు. మరి కొంతమంది మేధావులు, సామాజిక కార్యకర్తలు ఇదే విధమైన ఆరోపణలు ఎదుర్కొంటూ శిక్షలు అనుభవిస్తున్నారు. చాలా మందికి బెయిలు రాక జైళ్లలోనే మగ్గుతున్నారు.
ప్రపంచంలో ఎక్కడైనా బాధితుల పక్షాన నిలబడి వాదించేది నిజమైన మేధావులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలే. వారి పోరాటం శాంతియుతం. ప్రజాస్వామ్యబద్ధం. అయినా వీరికి శ్రీకృష్ణ జన్మస్థానమే నెలవవుతున్నది. ప్రజలు, బాధితులు ప్రశ్నించకుండా మౌనంగా ఉండేందుకు కోసమే పాలకులు వారిని హింసిస్తున్నట్లు భావించాల్సి వస్తున్నది. ప్రజలే దేశ భక్తులు. ఆ సామాన్య ప్రజల శ్రేయస్సునే వీరు కోరుకుంటున్నారు. దానికోసమే వారు ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నారు.
నా దేశంలో ధర్మపరులకు ఇలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఓ నాటక రంగ ప్రయోక్తగా, కార్యకర్తగా సంగీత నాటక అకాడమి అవార్డును స్వీకరించేందుకు నా అంతరాత్మ అంగీకరించడంలేదు. ఇది నిరసన కాదు. ఓ నిర్వేదం నుండి గైకొన్న నిర్ణయమిది. అందరినీ పరమ శివుడు కరుణించుగాక!'' అని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.
రఘునందన్ ఈ లేఖ ద్వారా ప్రస్తుత స్థితిని వ్యక్తం చేయడమే కాక కళాకారులకు దిశానిర్దేశం చేసినట్లయింది. ప్రజాస్వామ్య రక్షణకు నడుం కట్టమని పరోక్షంగా పిలుపునిచ్చినట్లయింది.
- కె.శాంతారావు,
9959745723