భారతీయ శాస్త్రీయ నృత్యం, సంగీతంలో దైవారాధన ఒక ముఖ్యమైన భాగం. ఇదే కాదు సంప్రదాయ భారతీయ కళలన్నీ దేవుని (మతం)తో ముడిపడే అభివృద్ది చెందాయి. సత్రం నృత్యం అనే అస్సామీ కళారూపం కూడా ఇట్లాగే అభివృద్ధి చెందింది. ఇది వైష్ణవ మఠాలు లేదా సత్రాలలో మాత్రమే ప్రదర్శితమయ్యేది. దీన్ని వైష్ణవ పురుష సన్యాసులు మాత్రమే ప్రదర్శించేవారు. ఆరువందల ఏండ్ల ప్రాచీనత కలిగిన వైష్ణవ మఠాలు లేదా సత్రాలు అనేక సంప్రదాయాలు, ఆచార పద్ధతులకు వాహకాలుగా ఉండేవి. ఈ సత్రాలు అస్సాం సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగంగా కొనసాగుతూవస్తున్నాయి. ఈ సత్రాలు అస్సామీ ప్రజల సంస్కృతిపట్ల ఒక స్పష్టమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
సత్రంలోని 'నామ్ఘర్' అనే ప్రార్థన గృహంలో అర్చనలో భాగంగా వైష్ణవ సన్యాసులు చేసే నృత్యాన్ని సత్రం నృత్యం అని అంటారు. అయితే నృత్యం ఒకప్పుడు సత్రాలకే పరిమితమైనా 20వ శతాబ్దం మొదటి భాగం నుంచి బయట వేదికలపైనా ప్రదర్శితమవుతున్నది. ఈ మార్పు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మార్పులకు ప్రతిస్పందనగా వచ్చినదనే సంగతి మరువకూడదు.
అస్సాం గొప్ప సాంస్క తిక వారసత్వాన్ని కలిగి ఉంది, సంగీతం, నృత్యం అనేవి అస్సాం సామాజిక వ్యవస్థతో పెనవేసుకుపోయి ఉన్నాయి. సత్రాల్లో చేసే నృత్యం భారతీయ ఎనిమిది సంప్రదాయ నృత్యాల్లో ఒకటి. ఇది మానవుని ఉద్వేగాలు, ప్రేమ, భక్తిరసాల సంగమం. ఇది పురాణాలు, మత గ్రంథాల కథలను చెబుతుంది. అంతేకాదు అస్సామీ సంస్కృతిలోను అంతర్భాగం.
ఏకాంక నాటిక నుంచి...
సత్రం నృత్యం అస్సాం ప్రాంత బహుముఖీనమైన సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి ప్రతీక. ఈ నృత్య రూపం 'అంకియ భావోనా' అని పిపిలిచే ఏకాంక నాటిక నుంచి ఉద్భవించింది. పదిహేను, పదహారు శతాబ్దాల మధ్య నివసించిన శంకరాచార్యుడు భక్తి ఉద్యమంలో భాగంగా తాను చెప్పదలచుకున్న సంగతుల్ని ఈ కళా రూపం ద్వారా ప్రచారం చేయించేవారు. నృత్యం, అభినయం, సంగీతం మేలుకలయికలతో కూడిన ఈ అత్యంత సొగసైన కళా రూపం దైవారాధనలో భాగంగా ప్రారంభమయింది. ప్రేక్షకుల మనస్సులలో భక్తి భావాన్ని మేల్కొల్పడం ఈ ప్రదర్శన ముఖ్య లక్ష్యం. ఆయన మొదటి ఏకాంక నాటిక 'సింహ యాత్ర' నుండి, మిగిలిన ఆరు ఏకాంక నాటికల వరకు అన్నింటిలోనూ భక్తిరసమే ప్రధానమైనది.
అస్సాంలో నియో-వైష్ణవ... ఉద్యమం నృత్యం, సంగీతం, నటన, భక్తిపాటలు, పాటగాళ్లు, సంగీత సాధనాలు వంటి వాటితో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని తెచ్చిపెట్టింది. ప్రదర్శన వ్యవస్థీకృతం కావడంలో మతం, సత్రంలో నివసించే సన్యాసులు ముఖ్యపాత్ర పోషించారు. ఈ ప్రదర్శన రూపం ఏ మాత్రం మారకుండా ఇటీవలి కాలంవరకు కొనసాగటానికి సత్రాల్లో ఉండే వైష్ణవ సన్యాసులు సంప్రదాయాలను తు.చ. తప్పకుండా అనుసరించడం కారణంగా చెప్పవచ్చు. మతపరమైన కథలు, పురాణాలు ఈ సంప్రదాయ సాంస్కృతిక కళారూపంపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, అది కేవలం జానపద కథలను మాత్రమే సూచించవు. రోజువారీ జీవితంలోని నమ్మకాలు, విశ్వాసాలతో మిళితమై కనిపిస్తాయి. శంకరాచార్యుని నాటకాల్లో సత్రం నృత్యం విడదీయరాని భాగం అయింది.
ఈ నయా పునరుజ్జీవనోద్యమం వైష్ణవాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ఉద్దేశించింది కాబట్టి సంగీతం, నృత్యం, నాటకం నామ్-కీర్తనల వంటి కళల ద్వారా మతపరమైన విషయాలను అభ్యసించడాన్ని ప్రోత్సహించింది. ఈ కళల ద్వారా కాలక్షేపమే కాకుండా భక్తిరసాన్ని అందించడం ఇక్కడ గమనించాలి. సత్రం నృత్య సంప్రదాయంలో అధిక భాగం ముద్రలు, హావభావాలు, భంగిమలు, వాచికాభినయం, ఆంగికాభినయం కనిపిస్తాయి. ఇది సత్రం ఆవరణలో ఒక ఆరాధనగా ప్రదర్శనగా ప్రదర్శించబడినప్పుడు, విస్తృతమైన దుస్తులు, అలంకరణలు ఉండేవికావు. చాలా తక్కువ స్థాయిలో ఇవి ఉండేవి..ఎప్పుడైతే బయట కూడా ఒక ప్రదర్శనా కళగా ఇది గుర్తింపు పొందినదో అప్పుడు ఇవి విశేష రీతిలో అధికమయ్యాయి.
సత్రం సంప్రదాయంలో రెండు ప్రత్యేకమైన ధోరణులు ఉన్నాయి... భావోనా-సంబంధమైనది ఒకటైతే రెండోది నృత్యం నంబర్ల(సంఖ్య)కు సంబంధించినది ఈ రెండో పద్ధతి సంప్రదాయ భావోనా నుండి స్వతంత్రంగా ఉంటుంది. భావోనా పద్ధతిలో హస్తముద్రికలు, సంగీతం, అడుగులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏకాంక నాటికలోని ప్రతి పాత్రకు ఓ నృత్యం ఉంటుంది. సూత్రధారుడు (స్టేజ్ మేనేజర్) లేదా నాటక దర్శకుడితో సహా ప్రతి ఒక్కరికీ ఒక నిర్దిష్ట నృత్యం ఉంటుంది. ప్రవేశ నృత్యం, నిష్క్రమణ నృత్యం, యోధుల నృత్యం వంటివి ఇందులో కొన్ని. గయాన్-బయాన్ అని పిలిచే ప్రాథమిక నృత్యం నాటిక ప్రారంభంలో ఉంటుంది.
మధ్య యుగం నుంచి ఇప్పటివరకు సత్రం నృత్యం మనుగడ సాధించడంలో ఎందరో వైష్ణవ సత్రాల్లో నివసించే సన్యాసుల కృషి ఉంది. కేవలం సత్రాలకే పరిమితమైన ఈ అద్భుత కళారూపాన్ని బయట వేదికలపై ప్రదర్శించడానికి 1920ల్లోనే కొందరు ప్రయత్నించారు. అస్సాంలోని మజులిలో ఉన్న గరమూర్ సత్రం అధికారి పీతాంబర్ దేవ గోస్వామి కృషిని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. 1922లో రాస్ పూర్ణిమ రోజున తరుణ్ రంగ్ మంచ్ పై పై సత్రం నృత్యాన్ని మొదటి సారిగా సత్రం బయట ప్రదర్శనా కళగా ప్రదర్శించారు.
మహిళల రంగ ప్రవేశం
పూర్వపు పురుషాధాపత్య సంస్కృతిలో సత్రం నృత్యాలు మగ సన్యాసులు మాత్రమే పవిత్రమైన ఆరాధనలో భాగంగా ప్రదర్శించారు. మొదట్లో స్త్రీలను ఈ సంప్రదాయంలో నేరుగా చేర్చలేదు. ఈ సన్యాసులందరూ బ్రహ్మచారులుగా ఉంటూ సత్రాలలో ఉండటం వల్ల స్త్రీలు అక్కడ ఉండే అవకాశం లేనందు వల్ల స్త్రీలకు ఈ కళా రూప ప్రదర్శనలో చోటు ఉండేది కాదు. ఈ కళను సామాన్య ప్రజలకు దగ్గరగా తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన రాషేశ్వర్ సైకియా బార్బయన్ ప్రయత్నాల వల్ల సత్రం నృత్యాన్ని క్రమంగా మహిళలు కూడా అభినయించడం ప్రారంభించారు.
-మౌక్తిక్