జానపదులు గొప్ప సాంస్కృతిక విలువలు కలిగిన వారు. అందుకు కారణం వారి ఆచార, సంప్రదాయాలే అని చెప్పవచ్చు. జానపదుల సంస్కృతిలో గ్రామ దేవతలను పూజించడం ఒక సంప్రదాయం. ప్రజలు తమ గ్రామాన్ని గ్రామ దేవతలే కాపాడుతారని నమ్మకంతో ప్రతి సంవత్సరం వారిని పూజించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి గ్రామంలో గ్రామదేవతల జాతరలు, కొలుపులు చేస్తారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ నాగులమ్మ వంటి ఎందరో దేవతలు మన తెలుగు నేలపై పూజలందుకోవడం కనిపిస్తున్న సంగతే. అయితే ఈ దేవతలలో ఎల్లమ్మ దేవత దాదాపు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పూజలందుకుంటున్నది. ఈమెనే రేణుక-ఎల్లమ్మ అని కూడా పిలుస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎల్లమ్మ జాతరలు కొన్ని చోట్ల పెద్దఎత్తున నిర్వహిస్తారు. అందులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రామంలో జరిగే జాతర ఒకటి. ప్రతి ఏటా మే నెలలో ప్రారంభమై నెల రోజుల పాటు జరుగుతుంది. ఆ విశేషాలే ఇవి...
''మావూరి దేవత ఎల్లమ్మ. మమల్ని చల్లంగా చూస్తుంది. కోరిన కోర్కెల తీర్చే అమ్మల కన్న అమ్మ మా ఎల్లమ్మ తల్లి'' అని ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తారు ఎల్లమ్మను. ప్రచారంలో ఉన్న కథల ప్రకారం... ఎల్లమ్మ తల్లి భర్త పేరు 'జమదగ్ని'. వారికి ఒక్కగానొక్క కొడుకు పరశురాముడు. రామాయణంలో సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో ఎల్లమ్మ తల్లి కూడా అన్ని కష్టాలూ పడింది. అటు భర్త, ఇటు కుమారుడు ఆమెను ఎన్నో అవమానాలకు, కష్టాలకు గురిచేస్తారు. చివరికి ఆమె మహిమ గల దేవతగా నిరూపించుకున్నది. అట్టి ఎల్లమ్మ తల్లి 8 అడుగుల విగ్రహం హుస్నాబాద్ (అప్పటి భార్గవపురం)లో 10వ శతాబ్దంలో ఒక పాము పుట్టలో వెలిసిందని చెబుతారు. కాకతీయుల కాలంలో నీటి సమస్య ఏర్పడినప్పుడు ఈ ఎల్లమ్మ విగ్రహానికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు చేస్తున్న ప్రజలను చూసి రాణి రుద్రమ దేవి ఆ విగ్రహానికి ఒక గుడిని కట్టించడమే కాక చెరువును కూడా తవ్వించిందట. ఈ చెరువునే ఎల్లమ్మ చెరువుగా పిలుస్తారు. ఈ ప్రాంత ప్రజలు వైశాఖ మాస శుద్ధ పౌర్ణమిని ఎల్లమ్మ పున్నమి అని వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే పౌర్ణమి రోజు నుంచి నెలరోజుల పాటు బోనాలు, అన్న ప్రసాదాలు, ఎడ్లబండ్లు, ఊరేగింపులు, శివసత్తుల సద్దులు, ఒడిబియ్యాలతో జాతర జరుగుతుంది.
ఏం చేస్తారు?
ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుద్ధ పౌర్ణమి రోజున జరిగే జాతరకు ముందు రోజున తెల్లవారు ఝామునే ఈ ఊరి పోలిమేరలో ఉన్న బీరప్ప గుడి వద్ద కొబ్బరి కాయలు కొట్టి, బోనాలు చేస,ి ప్రసాదాలు సమర్పించి ఎంతో భక్తి శ్రద్దలతో కొలుస్తారు. హుస్నాబాద్కు దగ్గర ఉన్న పోట్లపల్లి ఊరి పొలిమేరల్లో కొండచరియల్లో పరశు రాముడికి భయపడి ఎల్లమ్మ తల్లి దాక్కుందని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ. ఈ కొండ కోనల్లో ఉన్న పెద్ద బండరాయికి అమ్మ వారి విగ్రహము చెక్కి ఉంది. ఊరి ప్రజలు ఈ విగ్రహానికి కూడా బొట్టు, బోనాలు సమర్పిస్తారు. ఈ జాతరలో గౌడ కులస్తులు తమ కులదైవమైన ఎల్లమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జాతర రోజుల్లో పంబలవారు ఎల్లమ్మ పట్నాలు వేస,ి బోనాలు చేసి మేకపోతులను, కోళ్లను బలి ఇచ్చి రకరకాల వేషాలు వేసుకుని కల్లు, బెల్లం పానకంతో అమ్మ వారికి ఇష్టమైన పిండివంటలతో పూజలు చేస్తారు.
కళా ప్రదర్శనలు
జాతరలో జానపద కళాకారులు గ్రామదేవతలైన ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి చరిత్రలను ఒగ్గు కథల రూపంలో చెప్పి అలరిస్తారు ఈ ఎల్లమ్మ తల్లి గూర్చి ఒగ్గు కథ ద్వారా, పాట ద్వారా విన్నప్పుడు ఎంతటి కఠిన హృదయులైనా కంట తడి పెడతారు. ప్రత్యేకంగా ఎల్లమ్మ కథని చెప్పిన వారిలో అవార్డు గ్రహీతలున్నారు. వారిలో మిద్దె రాములు, చుక్క సత్తయ్య లు సుప్రసిద్ధులు. శారదగాండ్లు, బైండ్ల వారు, పంబలవారు కూడా ఎల్లమ్మ కథాగాన ప్రదర్శనలు జాతరలలో ఇసూ,్త మేకపోతులను బలిస్తారు. జాతర లోే ముందుగా బోనాలు చేసిన తర్వాత వాటిని చెల్లించే కార్యక్రమంలో బైండ్ల వారు జమిడిక వాయిద్యాలను ఉపయోగించి కథాగానం చేస్తారు. పాటలు పాడుతూ మేకపోతులను మత్తు గొలుపుతారు.
ఎక్కరాని గట్లల్లమేకమ్మ నీవు ఎక్కెక్కి మేస్తివే ...
మేకమ్మ దిగరాని గట్లల్లా మేకమ్మ నీవ్ దిగిదిగి మేస్తివే ...
అంటూ పాటలు పాడుతూ వేప మండలతో మేకపోతును మత్తు గొలిపి నిద్రబుచ్చుతారు. ఆ సమయంలో బైండ్ల వారు జమిడిక, వాయిద్య్యాన్ని , మాదిగ వారు డప్పులను చాల లయబద్ధంగా వాయిస్తారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు పోతురాజు మొదటగా ఆ మత్తు గొల్పిన మేకపోతును వెనుక భాగంలో కొంత కోసి అందులో నుండి లోపలి భాగాలను వేరు చేసి బలి ఇస్తాడు. తర్వాత ఎల్లమ్మ గుడిలోకి చొచ్చి మళ్లీ డప్పుల చప్పుళ్ల మధ్య ఊగుతూ మరొక మేకపోతును తన భుజాలపై వేసుకొని అమ్మ వారు పూనినట్లు గా ఆ ఆలయ పరిసరాలన్నీ తిరుగుతూ ఉగ్రరూపంతో, వీరావేశంతో అద్భుతమైన ప్రదర్శనను చేస్తూ... ఆ మేకపోతును గొంతు కొరికి చంపుతాడు. దీన్నే 'గావు పట్టడం' అంటారు. గావుపట్టినప్పుడు కారిన రక్తాన్ని అమ్మ వారికి సమర్పించి, దానిని అక్కడి ప్రజలకు తిలకంగా దిద్దుతాడు. ఈ విధంగా పోతురాజు మేకపోతును బలి ఇచ్చిన తర్వాత భక్తులు ఆ పోతురాజు చేతిలోని 'వీరగోల'లతో దెబ్బలు కొట్టించుకుంటారు. ఆలా చేస్తే మంచి జరుగుతుందని వీరి నమ్మకం. ఇక్కడి ఎల్లమ్మ చాల మహిమకలదని, కోరిన కోర్కెలు తీర్చుతుందని వీరికి చాలా నమ్మకం. సకాలంలో వర్షాలు కురువాలన్నా, పంటలు పండాలన్నా, సంతానం కలగాలన్నా ఈ దేవేతను మొక్కుకుంటారు ఇక్కడి ప్రజలు.
ఎట్లా బయలెళ్లతారంటే...
ఈ జాతరకు వచ్చే భక్త జనాలు అనేక రకాలుగా వరాలు కోరుకుని, ఆ మొక్కులను చెల్లించుకోవడానికి తండోపతండాలుగా వస్తారు. సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాదు, వరంగల్ తో పాటు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి భక్తులు రావడం విశేషం. భక్తులు జాతరకు ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు పట్టుకొని వస్తారు. బోనం సమర్పించి, కోళ్లను, మేకలను బలిచ్చి, కల్లు సాక, బెల్లం పానకం తో అమ్మ వారిని కొలిచి మంచి జరగాలని, భవిష్యత్తు తరాలకు కూడా మంచి జరగాలని మొక్కులు మొక్కుకుంటారు. ఆలయప్రాగణంలో చెట్ల కింద అమ్మవారికి నైవేద్యం సమర్పించి, తర్వాత ఇంటిళ్లిపాదిగా భోజనాలు చేస్తారు. సుఖ సంతోషాలతో ఉండాలని మళ్ల్లీ ఏడాదికి వస్తామంటూ తిరిగి ఇండ్లకు చేరుతారు.
- సునీల్ కుమార్, బోయిని
సెల్ నెం. 9000148273
Authorization