హైదరాబాదులో ఈ ఏడాదికి బోనాలెత్తటం ముగిసింది. భాగ్యనగర ప్రజలకు బోనాలు మొదటి పండుగగా చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసం మొదటి వారంలో గోల్కొండ (ఎల్లమ్మ) జగదాంబిక అమ్మవారి ఆలయంలో జరిపిన పూజలతో బోనాలు ప్రారంభమయ్యాయి. తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి ఆలయంలోను, చార్మినార్ సమీపంలో గల లాల్ దర్వాజా మాహంకాళీ అమ్మవారు, కార్వాన్ అమ్మవారితో పాటు జంటనగరాలలోని చాలా దేవతల ఆలయాలలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో, వైభవంగా బోనమెత్తి పూజలు జరుపుకున్నారు.
ఈ ఏడాది మంచిగా వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని 'రంగం' లో చెప్పడం బోనమెత్తినవారి నందరినీ సంతోషపరచింది.
వర్షాకాలం ప్రారంభమయ్యాక అనేక అంటువ్యాధులు, జ్వరాలు వస్తూ ఉంటాయి. ఇట్లా రోగాలు, మహమ్మారిలు రావడానికి తనకు తెలియని దైవశక్తుల (స్త్రీదేవతలు, దేవుళ్లు)కి కోపం రావడమే అని భావించేవాడు మనిషి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దేవతలను శాంతింపచేసి సంతృప్తి కలుగజేయడానికి జాతర్లు నిర్వహించేవారు. ఈ జాతర్లను ఉత్సవాలు, తిరుణాళ్లు, పండుగలు అని రకరకాల పేర్లుతో వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. మొదట్లో మాతృస్వామ్యం ఉన్నందువల్ల మన తెలుగు రాష్ల్రాల్లోనే కాక మొత్తం భారత దేశంలో స్త్రీదేవతలనే ఎక్కువగా పూజించడం ప్రారంభించారు. మానవ సమూహాలు గ్రామాలుగా స్థిరపడిన తర్వాత ఆయా సమూహాలు పూజించే దేవతలనే గ్రామదేవతలుగా వ్యవహరించడం ప్రారంభించారు. రోగాలు రాకుండా కాపాడమని, అట్లా కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసే జాతర్లే కాక, కోరిన కోర్కెలను తీర్చమని లేక అటువంటి మహిమ ఉందని నమ్మే దేవతలకు జాతర్లు చేయడం ఇప్పటికీ కొనసాగుతున్నది. అదిగో అటువంటి జాతరే బోనాల పండుగ.
ఇంటిలో భోజనం (బోనం) వండుకుని భక్తి శ్రద్ధలతో దాన్ని ఒక పాత్రలో ఉంచి నెత్తిమీద పెట్టుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం బోనాల పండుగ ప్రత్యేకత. అందుకే ఈ పండుగను బోనాల పండుగ అని పిలుస్తారు. ఇది తెలంగాణలో మాత్రమే కనిపించే పండుగ కావడం విశేషం. నెల రోజులు కొనసాగిన బోనాల పండుగ నిన్న సోమవారంతో ముగిసింది.
Authorization