- సబ్బండ వర్ణాలు మెచ్చిన
ఊహాశక్తి సామర్థ్యానికి ప్రతీక. ఒక భౌగోళిక ప్రాంతంలో అనేక కళలు ప్రాచుర్యంలో ఉన్నా, ఆ ప్రాంత సంస్కృతిలో జనించి, అక్కడి సాహిత్యంతో జవ జీవాలను సంతరించుకుని, వేష భాషలలో ఆ జాతి లక్షణాలను స్ఫురింపజేస్తూ వారి దైనందిన జీవనంలో భాగమై, నైతిక ధార్మిక, అధ్యాత్మిక చింతన పెంపొందించే కళలే ప్రత్యేకంగా నిలుస్తాయి. తెలంగాణకు సంబంధించి అటువంటి అపురూపమైన ప్రదర్శనా కళల్లో దాసరి బాగోతం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ ప్రదర్శనలిచ్చేవారిని దాసరోళ్ళు లేదా దాసర్లు అంటారు
దాసరివారు భిక్షుక గాయకులు. భక్తి ఉద్యమం తలెత్తఇన
మధ్యయుగంలో వీరు శ్రీ మహావిష్ణువును తమగాత్రంతో అను నిత్యం కీర్తిస్తూ... ఊరూరూ తిరుగుతూ వైష్ణవాన్ని ప్రచారం చేస్తూ భిక్షమెత్తి బతకమని నిర్దేశించడం జరిగింది. నిలువు నామాలు నుదుటిపై దిద్దుకుంటారు వీరు. భిక్షాటన ద్వారా బతకడం కష్టమై పోవడంతో తమ కళను బాగోతంగా మార్చుకున్నారు. ఆ విధంగా భుక్తితో పాటు తమ సాహిత్య పిపాసని, కళాతృష్ణని తీర్చుకోవడానికి జరిగిన ప్రయత్నాల ఫలితమే దాసరి బాగోతం ఆవిర్భావం. అయితే కేవలం దాసరి బాగోతం ఆడి పొట్టపోసుకోవడం కష్టమైపోవడంతో తమకు చేతనైన పనులను వృత్తులుగా స్వీకరించారు. ఫలితంగా వీరిని వృత్తిని బట్టి కొన్న ఉపకులాలుగా విభజించారు. వాటిలో ముఖ్యమైనవి...
బుక్క దాసరి : బుక్కదాసరి అనగా చిన్న అద్దాలు, గులాలు, కుంకుమ, దశనపొడి (కాల్చిన పొగాకుతో తయారైన పళ్ళపొడి) అమ్మేవారు.
దండె దాసరి : మోటలకు తాళ్ళు నేసేవాళ్ళు (పేనేవారు, అల్లేవారు)
బుట్టదాసరి : బుట్టదాసరి అనగా ఈతనారతో, ఈత ఆకులతో తాటి కమ్మలతో చాపలు, బుట్టలు అల్లుచు జీవించేవారు.
గంటె దాసరి : దీపంలో ఆముదంపోసి వెలిగించి, ఆ వెలుగులో భాగవతాన్ని ప్రదర్శించేవారు, వీరు ఎక్కువగా మెదక్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ఉంటారు.
మాల దాసరి : మాల కులస్థుల అయ్యవార్లు (పెళ్ళిళ్ళ పంతుళ్ళు), మాలకులంలో వివాహాది శుభకార్యములు నిర్వహించే కులపెద్దలు వీరే.
బోడదాసరి : అయ్యరోళ్ళు (హరికథలు) చెప్పేవారు.
హరిదాసులు : సంక్రాంతిరోజుల్లో భిక్షాటన చేసేవారు, వీరు ఎక్కువగా ఆంధ్రప్రాంతంలో కనబడతారు.
హౌళియదాసరి : హౌళి పట్టి భిక్షాటన చేసేవారిని హౌళియదాసరులు అంటారు.
రాత్రి ముఖానన రంగేస్తే రాజు, తెల్లవారితే ఊరిలో తిరిగే భిక్షగాడు,.. రాత్రివేషంలో కిరీటాలు, ఆభరణాలు ధరిచిన రాజు వేషగాళ్ళు... పగలు ఊరిలో భిక్షాటన చేసే భిక్షగాళ్ళు!
దాసరి బాగోతం
తెలంగాణలో యక్షగానాన్ని భాగవతం, బాగోతం అని కూడా పిలుస్తారు. ఈ బోగాతాన్ని ఆడేవారిని భగవతులు, బాగోతులు అంటారు. దాసరోళ్ళ బాగోతం సంగీత, సాహిత్య, నృత్య అభినయాలతో కూడిన సమాహార కళారూపం, వీధుల్లో బాగోతం ఆడడం వలన ''వీధి బాగోతం'' అనే పేరు వచ్చింది. ఆట విడుపుకి కాలక్షేపానికి ప్రధానమైన మాధ్యమం ఈ కళా రూపం. రాత్రిళ్ళు మాత్రమే కళా ప్రదర్శన చేయడం దాసరి బాగోతం ప్రత్యేకత. మగవారు మాత్రమే స్త్రీ, పురుష పాత్రలు ధరిస్తారు. దాసరి స్త్రీలు బాగోతం ఆడరు. వారు సవరాలు అల్లుతారు. బొట్టుబిళ్ళలు అమ్ముతారు.
యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్య కవి వ్రాసిన యక్షగానాలను, దర్వులను తమకు అనుకూలంగా మార్చుకొని అద్భుతంగా ప్రదర్శిస్తారు.
జానపదులు దాసరిబాగోతాన్ని ఒకప్పుడు అన్ని కులాల వారు ఆదరించేవారు. దాసరి బాగోతం ఆడుతున్నారంటే ఆ గ్రామంలోని ప్రజలు ప్రదర్శన తిలకించడానికి ముందుగానే వెళ్ళి అక్కడ స్థలాన్ని ఆపుకునేవారు. దాసరివాళ్ళు ఆడుతున్నారంటే ఆ ఊరిలో అందరికి ఆనందమేనట. దాసరోళ్ళు ఆడే బాగోతాలు. అల్లీరాణి, హరిచంద్ర, లవకుశ, కీచకవధ, దేవయాని వంటివాటిని రాత్రంతా ప్రజలు కుటుంబ సమేతంగా చూసేవారట, పాత్రలతో పాటు ప్రజలు లీనమై చూసేవారట. ప్రహ్లాదలో నరసింహస్వామి వేషం రాగానే కొబ్బరికాయలు కొట్టేెవారట కొందరు. కోళ్ళు మేకలు కోసేవారట, నిజంగానే నరసింహస్వామి వచ్చినట్టుగా దాసరివాళ్ళు అభినయించేవారట.
ఇప్పుడు టీవీలు, సినిమాలు వాడుకలోకి వచ్చి త కళకు ఆదరణ తగ్గింది అని ఇప్పటికీ ఎవరైనా శుభాలకు, అశుభాలకు పిలిస్తే అక్కడక్కడ ఆడుతున్నాం అని దాసరి కళాకారులు చెబుతున్నారు. దాసరలు అంటే ఎవరు?
మాల్యం
ఈ దాసరులు ప్రతి సంవత్సరం పది కుటంబాలు కలిసి దళంగా (సమూహంగా) ఏర్పడి తెలంగాణలోని ఏదో ఒక జిల్లాకు వెళ్ళి అక్కడి పల్లెల్లో టిక్కెట్ పెట్టి బాగోతాన్ని ఆడేవారట. అందులో ఒక్కొక్కరికి వారి కష్టానికి ఫలితంగా ఒక విస (పాలు) ఉండేదట. ఒక విస 3 వేల రూపాయలు అనుకుంటే 30 వేల రూపాయలు తీరేవరకు బాగోతాలు ఆడేవారట. అలా అందరిపాలు అయిపోయిన తర్వాత చివరగా తమ ఇష్టదైవాన్ని కొలిచి (బంతిపెట్టి) వారి సొంత గ్రామానికి వచ్చేవారట. అప్పటికీ వేసవికాలం అయ్యేదట.
ఊరి మీది ఆట
దాసరి కళాకారులు వేసవి కాలంలో తమ సొంత గ్రామాలకు చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలను వంతులుగా చేసుకొని గ్రామాలకు వెళ్ళి బాగోతం ఆడేవారట. దీనినే ఊరి మీది ఆట అంటారు. ఫలితంగా ఆ గ్రామ ప్రజల దగ్గర ధాన్యాన్ని వసూలు చేసుకునేవారట. ఆ ధాన్యం వారి ఒక కుటుంబానికి సంవత్సరం పాటు వచ్చేదట. వీరు ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉండేవారట.
ఈ దాసరి కళాకారులు ఒకరి వంతుకు వచ్చిన ఊరిలో ఇంకొకరు బాగాతాన్ని ఆడేవారు కాదట. అంటే ఒక ఊరు ఒక్క కళాకారునికి మాత్రమే సొంతమన్నమాట. ఊరిమీది ఆట అంటే అందరు కుటుంబ సమేతంగా (ఉచితంగా) తిలకించేది అనివారు చెపుతున్నారు.
ఈ దాసరి కళాకారులు ఎక్కువగా నిరక్షరాష్యులు, కాని జ్ఞాపకశక్తి మాత్రం ఎక్కువగా ఉంటుంది. వీరి బాగోతం మొదట అంబ కీర్తనతో ప్రారంభం అవుతుంది. ''అంబ బ్రోవుమా, జగదాంబ గావుమా'' అనే అంబ కీర్తనతో బాగోతం మొదలవుతుంది. బుడ్డన్ఖాన్ వేషంతో బాగోతం మొదలైన తరువాత రాజు, రాణి అనేక పాత్రలతో బాగోతం రక్తి కట్టిస్తూ మంగళ హారతితో ముగిస్తారు. వీరు తబల, హార్మోనియం, గజ్జెలు, తాళం వంటి వాయిద్యాలను ఉపయోగిస్తారు.
దాసరుల నేటి జీవితం
గొప్ప కళారూపా లను ప్రదర్శించే ఈ దాసరి కళాకారులు ఆనాడు తమ కళకోసం మగవారు సిగలను పెంచుకునేవారు ఎందుకంటే బాగోతంలోని స్త్రీ, పురుష పాత్రలను రెండూ వీరే పోషించేవారు కనుక స్త్రీ పాత్రల కోసం జుట్టఉ పెంచేవారు. అయితే నేడు ఈ కళారూపానికి ఆదరణ కరువై వారు తమ సిగలను పెంచడం లేదు. టీవీ సినిమాలు, ఇతర ఆధునిక సౌకర్యఆలు రావడంతో కాలక్షేపానికి వాటినే చూస్తున్నఆరు జనం. ఫలితంగా వీరి కళకు ఆదరణ లేకుండా పోయింది.ప్రస్తుతం ఈ కళాకారుల్లో చాలామంది పాత సమాన్లు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు.
- కర్రెపు నర్సింహులు
సెల్ : 9177810557
Authorization