దాసరి వారి జీవితం కష్టాల మయం. వారిలో చాలామంది భిక్షుక కళాకారులుగా ఊరూరా తిరుగుతూ జీవించే క్రమంలో సొంత ఇల్లు, కాని, ఆస్తి కానీ సమకూర్చుకోలేకపోయారు. అసలు వారికి ఆస్తిని కూడబెట్టుకోవాలన్న యావ ఉన్నట్టు కూడా కనిపించదు. మధ్యయుగాల్లో భక్తి ఉద్యమ కాలంలో పుట్టుకు వచ్చిన ఈ కళాకారులు వైష్ణవ మత ప్రచారకులు. విష్ణువును కీర్తిస్తూ తిరుగాడే ఈ 'దరిద్ర నారాయణుల' జీవనాన్ని కండ్లకు కడుతుంది ఈ వ్యాసం.
మానవుని ఆలోచన, ఊహాశక్తికి ప్రతిరూపాలే కళలు. ప్రకృతి అనుకరణ రూపాలు కళలు. కళలు సహజంగా మానవుని శ్రమజీవన ప్రతీకలు. సాధారణంగా కళలు 64 అంటారు. అందులో ఐదింటిని మాత్రం లలిత కళలుగా చెప్పవచ్చు. అవి: కవిత్వం, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం. ఈ కళారూపాలన్నీ చెమట చుక్కల నుండి పుట్టినవే. అందుకే అవన్నీ ప్రజా అమోద కళారూపాలయ్యాయి.
శ్రమ జీవన సౌందర్యంలో ఆరాటం, పోరాటం అనే అంశాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. బ్రతుకు ఆరాటం, పోరాట సంఘర్షణలో మనిషికి ఒక ఆలోచన పుట్టుకొస్తుంది. ఆ ఆలోచన నుండి అనేక కళారూపాలు పుట్టుకొచ్చాయి. ఆ బ్రతుకు ఆరాటం నుంచి పుట్టుకొచ్చిన అనేక కళారూపాల్లో అపురూప కళారూపమే దాసరి బాగోతం.
దాసరి బాగోతం అంటే?
దాసర్లు ప్రదర్శించే బాగోతాన్ని దాసరి బాగోతం అని ప్రజలు అంటూ ఉంటారు. ఇది ఆట, పాట, మాటల మిశ్రమ కళారూపం. తమ కళతో ప్రజలను ఉర్రూతలూగించినా... ప్రజామోదాన్ని పొందినా... ప్రభుత్వ గుర్తింపునకు నోచుకోని కళారూపం. ఏ కళారూపమైనా సమాజ ఆమోదాన్ని గుర్తింపునూ సంతరించుకోవాలంటే దానికి ఓ సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక నేపథ్యాలు కారణంగా ఉండాలి అంటారు. మరి దాసరులకు వందల యేండ్ల చరిత్ర ఉన్నది. స్వయంగా శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యద గ్రంథంలో దాసరులు అనగా వైష్ణవ భక్తులని, భిక్షకులని వ్రాశారు.
దాసరి బాగోతం, చిందు యక్షగానాల మధ్య భేదాలు
యక్షగానానికి ప్రత్యామ్నాయంగా పుట్టినదే ఈ దాసరి బాగోతం. ఒక బాగోతాన్ని ప్రదర్శించడానికి దాసరి కళాకారులై నా, చిందు కళాకారులైనా చెప్పే కథ ఒక్కటే... కాని ఎవరి దరువులు వారివే. ఆ దరువులను వారికి అనుకూలంగా మలుచుకుంటారు. చిందు బాగోతంలో చల్తి ఎక్కువగా ఉంటుంది. దాసరి బాగోతంలో నిదానం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు చిందు యక్షగానంలో... అల్లీ రాణి బాగోతం తీసుకుంటే అల్లియిటురావే కల్పవల్లి అని వ్యవదానం లేకుండా పాడుతారు. అదే దాసరి బాగోతంలో దాసరి కళాకారులు మాత్రం అల్లీ.... యిటురావే కల్పవల్లి అని పాడుతారు. చిందు కళాకారులు పగలు వేషాలు వేస్తారు. కాని దాసరి కళాకారులు రాత్రి సమయంలో మాత్రమే బాగోతం ఆడతారు. స్త్రుతం చిందు బాగోతంలో ఆడవారు, మగవారు కలిసి, స్త్రీ, పురుష పాత్రలు ప్రదర్శిస్తారు. (పూర్వం పురుషులే స్త్రీ, పురుష పాత్రలు ధరించేవారు). దళితులపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తారు. అదే దాసరి బాగోతంలో పురుషులు మాత్రమే స్త్రీ, పురుష పాత్రలు ప్రదర్శిస్తున్నారు. వీరు సబ్బండ వర్ణాలపై ఆధారపడి జీవిస్తారు. దాసరి స్త్రీలు వేషాలు వేయరు. వారు చాపలు, బుట్టలు, సవరాలు ఇంటివద్దే అల్లి ఊరిలో తిరుగుతూ అమ్ముతారు.
పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి
'పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి' అనే సామెత ఎందుకొచ్చిందంటే దాసరులు పాడిన కీర్తనలే మళ్ళీ మళ్ళీ పాడతారని ఈ సామెతను చెపుతారు. దాసరి కళాకారులు రాత్రి బాగోతం ప్రదర్శించి. తెల్లవారుజామునే భిక్షకు బయలుదేరుతాడని 'పాచిపండ్ల దాసరికి కూటిమీదనే ఆలాపన' అనే మరో సామెత వచ్చింది. దాసరులు బాగోతంతో పాటు భిక్షాటన కూడా చేస్తారు కాబట్టి 'బూటలకు దాసరికి బుర్ర నిండా నామాలే' అనే మరో సామెత ఉద్భవించింది. దాసరివాళ్ళు భిక్షగా ఏదిచ్చినా తీసుకుంటారు కాబట్టి 'పచ్చికంకులే దాసరి అంటే రాలిన కాడికే గోవిందా అన్నటు'్ల అనేది మరొక సామెత పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు.
కట్టిన ఇల్లు లేదు పెట్టిన పొయ్యి లేదు
ఈ సృష్టిలో ప్రతీ జీవి ఆహారం కోసం ఆరాటపడుతుంది. ఆహారం దొరికే వరకు పోరాడుతుంది. ఆరాటంలోనే పోరాటం మొదలౌతుంది. దానిలో నుంచి మంచి, మంచి ఆలోచనలు పుడతాయి. ఆ ఆలోచనలతో కూటి కొరకు కోటి విద్యలు అనే విధంగా తను ప్రయాణం మొదలౌతుంది. అలాగె మానవుడు తన ఆహార అన్వేషణకై ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. దానిలో భాగంగానే సంచారజాతిలో దాసరి తెగ కూడా ఒకటి ఉన్నది. దాసరి బాగోతాన్ని తమ కులవృత్తిగా మార్చుకున్న వీరు తమ కళతో ప్రజలను ఎంతో ఆనందింపజేస్తారు.
వీరి జీవన విధానం ఏవిధంగా ఉంటుందంటే 'యేస్తే గుడిసె-తీస్తే వోడిసె' అనే నానుడిలా ఉంటుంది. అంటే వీరు సంచారం చేస్తూ ఒక ఊరిలో వారి కుటుంబ నివాసం కోసం వేసిన గుడిసెను కొద్ది రోజుల్లోనే విప్పుకొని మరొక ప్రాంతానికి వలస వెళ్తుంటారు అని చెప్పే సందర్భంగా ఈ నానుడిని వాడడం జరిగింది.
ఈ సంచార దాసరి కళాకారులకు ఇల్లు, సొంత భూమి, ధనం ఒకే ప్రాంతం అనేవి ఉండవు. అందువల్ల వీరి బ్రతుకు దెరువు గూర్చి ఒక మాటలో చెప్పాలంటే 'ఒక దగ్గర కట్టిన ఇల్లు ఉండదు. పెట్టిన పొయ్యి ఉండదు' అనే మాట సరిగ్గ సరిపోతుంది. ఈ దాసరి కళాకారులను ఏదైనా ఒక ప్రాంతంలోని స్థానిక పెద్దలు బెదిరించినా అక్కడ బాగోతాలు సరిగ నడవకపోయినా... 'జై శివశంకర సాపసంకల' అనే విధంగా వేరే ప్రాంతాలకు వెళ్ళేవారట.
కూటికి గరీబు-మాటకు నవాబు
దాసరి కళాకారులు తమ కుటుంబ పోషణ కొరకు రాత్రివేళలో బాగోతం ఆడుతారు. పగటిలు భిక్షాటన చేస్తారు. అయితే వీరిలో కొట్లాటలు జరిగితే వారి కులపెద్దల సమక్షంలో పంచాయితీలు నిర్వహించుకుంటారు. ఆ పంచాయితీలో ఎవరివైపు తప్పు ఒరుగుతుందో (తప్పు అవుతుందో) వారు దండుగ (అపరాధ రుసుము) కడుతారు. అలాంటి సందర్భంలో ఈ దాసరులు ఇంట్లో నూకలు లేకున్నా పంచాయితీలో పెద్ద పెద్ద దండుగలు కడుతారు. అప్పుల పాలౌతారు కాని మాటకు వెనక్కి తగ్గరు. వీరి కొట్లాటలు పెద్దగా ఉంటాయి. వీరి పంచాయితీ నిర్వహణ ఒక్కొక్కసారి 3 లేదా 4 రోజుల వరకు కూడా ఉంటుంది. పంచాయితిలోని ఇద్దరు ముద్దాయిలు కులపెద్దలకు ముందుగ దడ్వత్ (పంచాయితి నిర్వహించుటకు కులపెద్దలకు ఇచ్చేటువంటి కొంత రుసుము) ఇస్తూ అయ్యా మీరు తినండి, తాగండి, వూగండి పంచాయితీ మాత్రం పెద్దగుండెలె యెడిదాకైతే ఆడిదాక చూసుకుందాం నాయిల్లు అమ్ముడుపోయినా సరే న్యాయం జెప్పుర్రి అంటూ వారికి తమ సాలును (పంచాయితికి గల కారణాలను) విన్నవిస్తారు.
గడియ రికాం లేదు గవ్వ ఆందాని లేదు
ఈ దాసరులు ఎంతో కష్టజీవులు. రాత్రంతా బాగోతం ఆడి, పొద్దంతా భిక్షాటన చేసి సరిగ నిద్రలేక అనారోగ్యం పొందేవారట. దానికి తోడు వీరికి సంతానం ఎక్కువగా ఉండేదట. ఒక్కొక్కరికి 5 నుండి 10 మంది వరకు సంతానం ఉండేదట. దానితో కుటుంబ భారము ఎక్కువయ్యేదట, దానితో వారికి అప్పులు ఎక్కువై దానికి మిత్తి (వడ్డీ) కట్టలేక ఎంత కష్టం చేసిన వారికి సరిపోయేది కాదట.
రాజుల పైస రాళ్ళ పాలు - బిచ్చగాళ్ళ పైస బింకుల పాలు
దాసరులు ఎక్కువగా మద్యమాంస ప్రియులు, ఈ దాసరి కళాకారులు ఎక్కువగా తాటి కల్లు తాగేవారట. వేట మాంసం ఎక్కువగా తినేవారట. తాళ్ళల్లో గౌడ్ దగ్గర వీరికి ఒక్కొక్కరికి ప్రతీరోజు వాడికె బింకి (ప్రతీరోజు ఒక కుండ కల్లు) ఉండేదట. ఈ దాసరి కళాకారులు తమ సంపాదనలో మద్యానికే ఎక్కువ ఖర్చు చేసేవారట. అందుకే అంటారు ''రాజులపైస రాళ్ళపాలు'' అంటే రాజులకు ఎక్కువ సంపాదన ఉండేది దాన్ని వారు అనుభవించేవారు కాదు, అది వారి రాళ్ళతో కట్టిన కోటలోనే శిధిలమై పోయేదట. అదేవిధంగా ఈ దాసరి కళాకారులు బాగోతం ఆడి భిక్షాటన చేసి సంపాదించిన ధనాన్ని కల్లు కుండలకు ప్రతిరోజు ఖర్చు చేసేవారట. అందుకే 'బిచ్చగాళ్ళ పైస బింకుల పాలు' అంటారు. బింకులు అనగా కల్లు కుండలు అని అర్థం.
ఈ వ్యాసంలో చెప్పిన సంగతులు కొన్ని గతానికి చెందినవైనా... చాలావరకు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భిక్షుక గాయకులుగా ఇంకా జీవితం కొనసాగిస్తున్న దాసరి సోదరుల జీవితం దుర్భరంగా ఉంది. అవమానాలను, పేదరికాన్ని భరించలేని కొందరు వేరే వృత్తుల్లో స్థిరపడుతున్నారు. అయినా వారి జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టు ఉంది. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలి. సమాజంలో సముచిత గౌరవంతో తలెత్తుకుని బతికే రోజులు వీరికెన్నడొస్తాయో కదా!
Authorization