ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే...
ఇది స్మశాన వాటిక (కాటి సీను)లో సత్యహరిశ్చంద్రుడు ఏకాంతంగా అంతర్ముఖుడై పాడుకునే పద్యం. ఓ జీవన తత్వంగా అందరి నోళ్లలో తారాడుతూనే ఉంది ఇప్పటికీ... బలిజేపల్లి లక్ష్మీకాంతం విరచిత నాటకంలో ఈ జాషువా పద్యం ఒదిగిపోయింది సందర్భోచితంగా. సాక్షాత్తు హరిశ్చంద్రుడే ఆనాడు ఆ రుద్రభూమిలో అలా కచ్చితంగా పాడి ఉంటాడని భ్రమపడే పామర జనం కూడా ఉంటారు కొందరు.
ఏ పాత్రకైనా రూప సౌందర్యంతో బొమ్మకట్టడం వేరు, చతుర్విధ అభినయాలతో ఆ పాత్రకు జీవం పోసి ప్రాణ ప్రతిష్ట చేయడం వేరు.
ఆంగికం భువనం యశ్య
వాచికం సర్వ వాజ్ఞ్మయం
ఆహార్యం చంద్ర తారాది
తం వందే శివం సాత్వికం
అన్నాడు భరతుడు నాట్యశాస్త్రంలో...
ఏ దేశంలోనైనా మౌలికంగా ఈ నాలుగు అభినయాల ద్వారానే పాత్ర పోషణ జరుగుతున్నదనేది యధార్థం. తద్వారా ఆయా కాలాల, ప్రాంతాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వాతావరణం అవగతం అవుతుంది కూడా. ప్రేక్షకులకు రస సిద్ధితో పాటు విజ్ఞానం సమకూరుతుంది. ఏ కళకైనా ప్రయోజనం అదే.
ఏకపాత్రల ఆవిర్భావం
సత్యహరిశ్చంద్ర నాటకం గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. మమాత్మా గాంధి కూడా సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాతనే నిత్య సత్య సంభాషణ గావించాలనే దృఢ నిశ్చయానికి వచ్చినట్లు చెప్పుకున్నారు.
పది పన్నెండు గంటల ఒక నాటి నాటకం నేడు రెండు-రెండున్నర గంటలకు పరిమితమయింది. పూర్తిగా నాటకం ప్రదర్శనకు సాధ్యం కాని పరిస్థితుల్లో ఆ పాత్రల స్వభావాన్ని అర్థం చేయించేందుకు ఏకపాత్రలు ఆవిర్భ వించాయి. కేవలం పది, పదిహేను నిమిషాల వ్యవధిలోనే ఆ పాత్ర పుట్టుక, పరిణామం, ముగింపు లేదా కొనసాగింపు ప్రేక్షకులకు అవగతం అయ్యేలా అభినయం ద్వారా ఆ పాత్రకు రస పోషణ చేస్తాడు నటుడు.
అంతా స్వగతం లేదా లేదా ప్రేక్షకులతో ప్రత్యక్షంగా సంభాషించడం, తానున్న పరిస్థితిని (పాత్ర), అప్పటి వాతావరణాన్ని అభినయం ద్వారా ఎరుకపరచడం లేదా కళ్లకు కట్టడం. నిజంగా వేదికపై శ్మశానం ఉండదు. కాని చితిమంటలు కాలుతున్నట్లు, కాటికాపరి వేషంతో (నల్లని దుస్తులు, చింపిరి గడ్డం, భుజంపై కుండ, చేతిలో కర్రవంటి వాటితో) హరిశ్చంద్రుని రాక.
ఈ రంగాలంకరణ, రంగోద్దీపనంలో (లైటింగ్) పాత్రధారి రంగప్రవేశం చేశాక ప్రేక్షకుడు తెలియకుండానే ఆ రసార్ణవానికి చేరుకుంటాడు. ఎన్నో సార్లు చూసినప్పటికీ మళ్లీ, మళ్లీ చూడటానికి ఉత్సాహపడతారు. కారణం అభినయ తీరు.
డి.వి.సుబ్బారావు వంటి లబ్దప్రతిష్టులైతే చెప్పేదేముంది.? ఆ పద్యం-రాగం-అభినయంతో పూర్తిగా ప్రేక్షకులు తాదాత్మ్యం చెందుతారు. పామరులకే కాదు, పండితులకు సైతం ఏకపాత్ర సమారాధన లభిస్తుంది. అందరూ ఒకే లా రసప్లావితులు అవుతారు ఆ సమయంలో.
డి.వి.సుబ్బారావే హరిశ్చంద్రుడు! హరిశ్చంద్రుడే డి.వి.సుబ్బారావు అనే స్థితికి రస సిద్ది చేరుకుంటుంది. నాటకానికి మించి ఆ పాత్ర పోషణ పతాకంలా పైకి లేస్తుంది. అలా ఏకపాత్రల ఆవిర్భావానికి, వికాసానికి, అభివృద్ధికి అభినయం తోడ్పడిందనేది కాదనలేని సత్యం.
పాత్రలే మిగులుతాయి
ప్రతి మనిషి జీవితంలో భావోద్వేగాలు ఉంటాయి. అనుభూతులు ఉంటాయి. నవరసభరితం అయిన జీవితం... అదే నవరస భరితమైన కళలో ఓలలాడుతుంది. జీవితంలో యాదృచ్చికం. అనిశ్చితం. కళ చైతన్యం, బుద్ది పూర్వకం. తొలుత రచయిత; తదుపరి పాత్రధారి ఆ భావనాత్మకతను పొంది ప్రేక్షకులకు అదే స్థితిని అందించడానికి తాపత్రయపడతారు. ఆ క్రమంలో ఒకేసారి పాత్రధారి నిశ్వేషుడై పాత్ర మాత్రమే మిగులుతుంది. ఇది అభినయంలో ఉచ్చ స్థితి. . పరాకాష్ట. అలా పాత్రలను మిగిల్చి వెళ్లిపోయిన మహానటులు ఎందరో!
''ఆహా... ఏమి ఈ మయసభ వైభవము? ఇందిందు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు కనిపిస్తున్నది. మనస్సు ఎంత కాదన్నను మయుని శిల్ప కళానైపుణ్య చమత్కార వైశిష్ట్యానికి శిరస్సు వంచి నమస్కరించడం తప్పడం లేదు.''
-ఇవి రారాజు (సుయోధన) ఏకపాత్రాభినయ వాక్కులు. కురుక్షేత్ర నాటకంలో సన్నివేశం. మయసభ వాతావరణం.
ప్రతినాయకుని అంతరంగ సంభాషణ, వక్చాతుర్యం, రాజఠీవి, అభినయించే తీరులోని గ్రేస్ (ఆకర్షణ)... అన్నీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఆచంట వెంకటరత్నం నాయుడు నుండి ఎస్వీఆర్, సీనియర్ ఎన్టీఆర్ వరకు ఎందరో అలా తమ అభినయంతో పౌరాణిక పాత్రలకు వన్నె చేకూర్చారు.
అభినయ కౌశలాన్ని పెంచే రావణాబ్రహ్మ, మహారథి కర్ణ, పాంచాలి వంటి పురాణ పాత్రలతో పాటు మనకు చారిత్రక పాత్రలు, సాంఘిక పాత్రలు కూడా ఉన్నాయి. సామ్రాట్ అశోక, చాణిక్య, రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, మహాత్మా గాంధి వంటి పాత్రలనేకం పుట్టుకొచ్చాయి.
సాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తిని యువతలో రగుల్కొలిపేందుకు ఇలాంటి పాత్రలు ఎక్కడికక్కడ ఆవిర్భవించాయి. తెలుగు పౌరుషం ఉరకలెత్తింది అప్పుడు.
అమ్మా భరత మాతా! బ్రిటీష్ సామ్రాజ్య దాస్య శృంఖలాల లో బందీలుగా ఉన్న నా సోదర భారతీయులలో ధైర్య సాహసాలు నింపవమ్మా. మా సాయుధ విప్లవానికి ఊపిరి పోయవమ్మా.! నానాటికీ నిస్తేజమైన నా మన్య ప్రజల కళ్లలో కాంతులు వెలిగించవమ్మా! అంటూ సీతారామరాజు పాత్రధారి వేదికపై మాట్లాడుతుంటే యువత కరతాళ ధ్వనులతో ఊగిపోయేది. స్వాతంత్య్రానంతరం కూడా కళాశాలల్లో, పాఠశాలల్లో దేశ భక్తిప్రపూరితమైన ఏకపాత్రలు కోకొల్లలుగా వెలిసాయంటే అతిశయోక్తి కాదు.
దైన్యానికి ప్రతీకలు
ఆ తర్వాత వ్యవస్థ రూపొందించిన దైన్యానికి ప్రతీకలుగా కొన్ని పుట్టుకొచ్చాయి, పుట్టుకొస్తున్నాయి. బతక లేని బడి పంతులు, బిచ్చగాడు, పిచ్చివాడు, బసివిని (జోగిని) మధ్యతరగతి గుమస్తా, నిరుద్యోగి, రైతు (ఆక్రోశం) వంటివి.
''ఈనాడు రైతు చేతిలో ఏముంది సార్? విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు లేవు., కరెంటు లేదు. చివరికి ఇప్పుడు భూమి కూడా లేదు. మరెలా సేద్యం చేస్తాడు సార్! మీకో విషయం తెలుసా సార్? గ్రామాల్లో చెట్లకు ఫలాలే కాదు రైతుల శవాలూ కాస్తున్నాయంటూ రైతుల మనోవేదనకు అద్దంపడ్తాయి ఇటువంటి ఏకపాత్రలు.
ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఒక పాత్రతో మమేకం అవుతాడు. తన స్వభావాన్ని, గుణగనణాల్ని అంతరంగంలో విశ్లేషించుకుంటాడు. పాత్రలు అందించే ఆశావహ దృక్పథం, మనిషి అజేయుడనే సత్యం ముందుకు నడిపిస్తాయి.
ఇక పాత్రల ప్రభావం పాత్రధారులపై అమితంగా ఉంటుంది. ప్రాపంచిక జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానంతో సమన్వయం చేసుకుంటాడు. దైనందిన వ్యవహారంలో ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడల్లా ఈ పాత్రలు తమ చెంతన నిలిచి ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, జీవన మాధుర్యాన్ని స్ఫురణకు తెచ్చి పునరుత్తేజితుడ్ని చేస్తాయి.. కళ గొప్పదనం అదే.
-కె.శాంతారావు
9959745723
Authorization