గత వారం హైదరాబాదు త్యాగరాయ గాన సభలో 'మాట్లాడే బొమ్మ' కళారూపం పై 'వెంట్రిలోక్విజమ్ ఫెస్ట్-2019' అనే వర్క్షాప్ జరిగింది. అందులో ఎందరో ప్రసిద్ధి చెందిన, వర్థమాన కళాకారులు పాల్గొన్నారు. అమూల్యమైన ఈ ప్రదర్శనా కళ ... ఆర్టిస్టుకి ఎంత సమయస్ఫూర్తి, ప్రాపంచిక జ్ఞానం ఉంటే అంత బాగా పండుతుందని నిరూపిస్తూ ఈ వర్క్షాప్ సాగింది. ఆ విశేషాల సమాహారమే ఈ వ్యాసం.
మాట్లాడే బొమ్మతో వేదిక పైకి ఓ కళాకారుడు ప్రవేశించాడు. ముందున్న పిల్లలు బొమ్మను చూసి కేరింతలు కొట్టారు. ఆ బొమ్మ చాలా హాస్యం గొలిపేటట్టు, చూడ ముచ్చటగా ఉంది. అందంగా కూడా ఉంది. పెద్దలు ఏం చేస్తారో విందాం. అని సావధానంలోకి వచ్చేసారు. కళాకారుడు-బొమ్మ సంభాషణ ఇట్లా జరుగుతున్నది....
కళాకారుడు: ఇక్కడికి చాలా మంది వచ్చారు. ముందుగా హాయి చెప్పు.
బొమ్మ: మందేమన్నా కొట్టావా గురూ! తప్పులు మాట్లాడుతున్నావు.
నేనా?
నువ్వు కాకపోతే నేనా?
ఏం మాట్లాడాను తప్పులు?
ఈ ప్రోగ్రాంకి పిల్లలతో పాటు పెద్దలు కూడా వచ్చారు. అవునా.
అవును
పిల్లలకు ఎవరైనా హాయ్ చెప్తారు. పెద్దలకు నమస్కారం చెప్తారు. అది సంస్కారం. అవునా?
(చప్పట్లు మోగుతాయి)
చూశావా... నేను చెప్పింది కరెక్టు అని ఒప్పుకుంటావా?
అమ్మో నీవద్ద చాలా తెలివితేటలు ఉన్నాయే!
లేకపోతే లోకంలో బతకలేం గురూ... అందుకేగా నువ్వు నాతో స్నేహం చేస్తున్నావు. (నవ్వులు)
అది సరేకాని... అర్జెంటుగా డబ్బు-గుర్తింపు రావాలంటే ఏం చేయాలి?
'డబ్బు-గుర్తింపు' రెండూనా... (ఆలోచిస్తూ)
ఆ... రెండూ..
ఆ రెండూ రావాలంటే అర్జంటుగా గుండు కొట్టించుకోవాలి.
ఏంటి? గుండు కొట్టించుకోవాలా? నేనా?
కావాలంటే లలితా జ్యువెలరీ యాడ్స్ చూస్కో... (మళ్లీ నవ్వులు)
ఇట్లా ఈ సంభాషణలు ఆద్యంతం నవ్వులతో సరదాగా గడిచిపోతుంది. చాలా సరళంగా... సరదా సరదా మాటలతో... మధ్య మధ్యలో ఎంతైనా విజ్ఞానాన్ని అందించవచ్చు. సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు జోడించవచ్చు. అయితే ఆ కళాకారునికి ఆ చైతన్య స్థాయి ఉండాలి. లేకుంటే అవి వికటిస్తాయి. పిచ్చి చేష్టలుగా మిగిలిపోతాయి. కొన్ని జబర్దస్త్ ప్రోగ్రాముల్లాగా తిరస్కారాలు కూడా దొరుకుతాయి.
ఏ కళ అయినా కత్తి మీద సాములాంటిదే. సమకాలీన అంశాలపై సరైన అవగాహన ఈ కళాకారునికి ప్రాణవాయువు లాంటిది. ఎందుకంటే... ప్రేక్షకులు నిరంతరం మారుతుంటారు. నిన్నటి ప్రేక్షకులు, నేటి ప్రేక్షకులు ఒకరు కారు. పరిస్థితులు మారుతుంటాయి. అలాగే ఒక చోట ఉన్న ప్రేక్షకులు, వేరే చోట ఉన్న ప్రేక్షకులు వేరు వేరు. ప్రేక్షకుల్లో విద్యార్థులు, యువకులు, పిల్లలు, మహిళలు, మధ్యతరగతివారు, సామాన్యులు, మేధావులు... ఇలా ఎందరో ఉంటారు. అందర్నీ ఆకర్షించే సానుకూల అంశాలను కళాకారుడు సదా గమనంలో ఉంచుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు సమాచారంతో తాజాగా ఉండాలి. ఈ ప్రదర్శనా కళాకారులకు ఈ 'తాజా' నైపుణ్యం, సమయస్ఫూర్తి తప్పనిసరి.
ఇదే విషయాన్ని ఇటీవల హైదరాబాదులో జరిగిన 'వెంట్రిలోక్విజమ్ ఫెస్ట్-2019' సందర్భంగా కళాకారులు చర్చించుకున్నారు. వెంట్రిలోక్విజం అంటే కళాకారుడే బొమ్మలా మాట్లాడటం. మిమిక్రీ సామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ల వేణు మాధవ్ వీరికి ఆది గురువు.
మిమిక్రీ (ధ్వని అనుకరణ) కళతో వేణు మాధవ్ దేశ దేశాలు పర్యటించి ఆ కళకు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తీసుకురాగలిగారు. తెలుగువారందరికీ ఇది గర్వకారణం.
సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధి వంటి మేధావులు, రాజకీయ నాయకుల వంటి వారి నుంచి, భానుమతి, ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి సినీ కళాకారుల వరకు ఎందరినో అనుకరించి ప్రజానీకాన్ని ఆయన అబ్బుర పరచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఆయన ప్రజానాట్యమండలిలో పనిచేశారు.
మిమిక్రీ కల చాలా పురాతనమైనదని, పురాణాలలో కూడా, దీనిని మనం గమనించవచ్చని వేణుమాధవ్ చెప్పేవారు. మాయా లేడి రూపంలో ఉన్న మారీచుడు అనే రాక్షసుడు రాముని బాణానికి దెబ్బతిని అచ్చం శ్రీరామచంద్రుని గొంతు లాంటి గొంతుకతో హా... సీతా... హా లక్ష్మణా... అని అరచి చనిపోయాడు. రామాయణంలోని ఈ ఘట్టాన్ని ఉదహరిస్తూ వేణుమాధవ్ కళాకారులకు పాఠాలు చెప్పేవారు.
తెలుగు విశ్వవిద్యాలయంలో అనేక కళలతో పాటు మిమిక్రీ కలలో కూడా శిక్షణ ఇస్తున్నారు. మిమిక్రీకి పై మెట్టు వెంట్రిలోక్విజమ్. బొమ్మ మాట్లాడినట్టు గొంతు మార్చి ప్రేక్షకునికి తెలియకుండా కలాకారుడే స్వయంగా మాట్లాడటం. అంటే... బొమ్మ మాటలు, తన మాటలు (ఈ సంభాషణ) అంతా తానే స్వయంగా చకచకా గొంతు మార్చి సంభాషించాలి. ఇందుకు చాలా సాధన అవసరం.
ఆ సాధనలో కళాకారులు తెలుసుకోవాల్సిన మెళుకువలు గురించి ఈ ఫెస్ట్లో వర్క్ షాప్ నిర్వహించుకోవడం శుభ పరిణామం. ఇలాంటి వర్క్ షాపులు పునవ్చరణ వల్లనే ఏ కళకైనా పురోగతి లభిస్తుంది.
అమెరికాలో వెంట్ హెవెన్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్లో ప్రముఖ అంతర్జాతీయ వెంట్రిలోక్విస్టుల చిత్రపటాల సరసన చోటు సంపాదించిన సీనియర్ కలాకారుడు జి.వి.యన్.రాజు ఈ వర్క్షాప్ను నిర్వహించారు. దీనిలో చొక్కాపు వెంకట రమణ, సంతోస్, డొనాల్డ్ సతీష్, మల్లం రమేష్, చంద్రముఖి చంద్రశేఖర్ వంటివారితో పాటు నేరెల్ల వేణుమాధవ్ కుమారుడు రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందమంది కళాకారులు ఈ మిమిక్రీ, వెంట్రిలోక్విజం కళను అంది పుచ్చుకుని జీవనం సాగిస్తున్నారు. వనితలు సైతం ముందుకు వచ్చి అలరిస్తున్నారు. అన్నిటి కంటే ముఖ్యం తమ కళను తామే సంఘంగా ఏర్పడి, సంఘటితంగా అభివృద్ధి పరుచుకోవడం ఎంతైనా ముదావహం, ఆదర్శప్రాయం.
Authorization