ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టులో జానపద జాతరను తెలంగాణ అంతటా అన్ని జిల్లాల్లో జరిపి, చివరికి హైదరాబాదు రవీంద్ర భారతిలో జరపడం రాష్ట్ర అవతరణ తరువాత ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈ ఏడాది జిల్లాల్లో జరపడం సాధ్యపడలేదు కాని హైదరాబాదులో నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సౌత్ సెంట్రల్ జోన్ వారి తో కలిసి తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆగస్టు 31న నిర్వహించిన ఆ జానపద జాతర విశేషాల సమాహారమే ఇది.
రవీంద్రభారతిలో 'జానపద జాతర 2019' జరుగుతుందని తెలిసి 'జాతర' ప్రతినిధి ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టేటప్పటికి దాదాపు వెయ్యిమంది కళాకారులు, వారిని చూడటానికి వచ్చిన వందలాది ప్రేక్షకులతో ఆ ప్రాంతం అంతా కిట కిటలాడుతూ ఉంది. కళాకారులు 10 గంటలకల్లా పాత్రోచితమైన మేకప్ వేసుకుని, రకరకాల వాయిద్యాలతో రవీంద్రభారతి ప్రాంగణంలో (ఆరుబయట) ఎవరి కళను వారు ప్రదర్శిస్తున్నారు. చూడటానికి రెండు కండ్లూ చాలడంలేదు. ఎక్కువ సేపు ఒక బృందాన్నే చూస్తే మిగతా బృందాలను మిస్ అవుతామేమో అనిపించేంతగా ఉంది అక్కడి పరిస్థితి. ఫొటో జర్నలిస్ట్ వెంకట్ ఒకవైపున, ఈ రచయిత ఒక వైపున కెమెరాలతో కనిపించిన దృశ్యాన్ని కనిపించినట్టు ఆబగా కెమెరాల్లో బంధిస్తూ... కళాకారులను పలుకరిస్తూ... వారు ఎక్కడి నుంచి వచ్చారు, జీవన పరిస్థితులు ఏమిటి అని తెలుసుకుంటూ ముందుకు సాగారు. మన సంస్కృతిలోని వైవిధ్యం అంతా రవీంద్రభారతి ప్రాంగణంలోనే కొలువై ఉన్నదా అనిపించింది.
అక్కడ కనిపించిన కళాకారుల్లో నూటికి 99 మంది ఆశ్రితకులాలు, బీసీలు, సంచార జాతులు, ఎస్సీలు, ఆదివాసీలు... వారిపై ఆధారపడి జీవించే వృత్తి కళాకారులే ఉన్నారు. దళిత, ఆదివాసీ బహుజనులే వేల ఏండ్లుగా ప్రాచీన కళారూపాలను బతికిస్తూ వారసత్వంగా మనకందిస్తున్నా రని ఈ దృశ్యం మరొక్కసారి గుర్తు చేసింది.
మధ్యయుగాల్లో హిందు మతంగా ఇప్పుడు అనుకుంటున్న మతం అనే చీలికలు, పేలికలుగా ఉండేది. ఇందులో అడ్డనామాలవారు (శైవులు), నిలువు నామాలవారు (వైష్ణవులు) ముఖ్యులు. వీరు తిరిగి అనేక శాఖోపశాఖలుగా విభజితమై ఎవరి శాఖను వారు ప్రచారం చేసుకోవడానికి కొందరు పూర్తికాలిక కార్యకర్తల (ఫుల్ టైమర్స్)ను నియమించుకున్నారు. వీరిని సంబంధిత మత శాఖ గుర్తులను, నామాలను, దేవుళ్లను ధరించి ఊరూరా తిరుగుతూ నామసంకీర్తన చేస్తూ... భిక్షం స్వీకరించి బతకమని అప్పట్లో నిర్దేశించారు. ఆ విధంగా దాసరులు, జంగాలు వంటివారు సమాజంలో ఉద్భÛవించారు. అయితే ఈ కార్యకర్తల రిక్రూట్మెంట్ అంతా ఇప్పుడు తక్కువ కులాలుగా, దళితులుగా, బీసీలుగా గుర్తిస్తున్న వర్గాల నుంచే ఎక్కువగా జరగడం గమనించదగిన విషయం. రవీంద్రభారతి ప్రాంగణంలో తిరుగాడుతుంటే ఈ తరహా కళాకారులు చాలామంది కనిపించారు. వీరు కాక పెద్దమ్మోళ్లు అనే ఆదిశక్తిని నెత్తిమీద మోస్తూ... భిక్షాటన జరిపే కళాకారులూ కనిపించారు.
ఇక్కడ గమనించాల్సిన సంగతేంటంటే ఈ ప్రాంగణంలో కనిపించిన కళాకారుల్లో అధికులు హిందు మతంతో సంబంధం ఉన్న కళారూపాలను ప్రదర్శించేవారే. చాలా కోలాట బృందాలు, భజన బృందాలు, బోనం కోలాట బృందాలు కనిపించాయి. వీరందరూ దాదాపుగా దైవ గీతాలకు దరువులు, నృత్యాలు చేస్తూ తమ ప్రతిభను కనబరచడానికి ప్రయత్నించినవారే.
ఒగ్గు కళాకారులు, చిందుభాగవతులు, బైండ్లవారు, పటం కథలు చెప్పే కళాకారులు... వీళ్లంతా ప్రధానంగా రామాయణ, భారత, భాగవతాలు ఆధారంగా సొంత కథలను సృష్టించుకుని, సొంత వ్యాఖ్యానాలతో కథలు చెప్పేవారే. అయితే వీటితో పాటు అనేక చారిత్రక, జానపద కథలనూ వీరు చెప్పడం మామూలు విషయమే.
దరువులు ఆదిమ సమాజపు వారసత్వం
అట్లాగే కొన్ని కళారూపాలు ధ్వని ప్రధానంగా ఉర్రూతలూగించేవీ కనిపించాయి. డప్పు కళాకారులు కేవలం దరువులు వేస్తూ వివిధ విన్యాసాలు చేయడం తెలిసిందే. రాజన్నడోలువారు, కొమ్ముకోయ నృత్యం చేసేవారు ధ్వని ప్రధానంగానే తమ ప్రదర్శన ఇస్తారు. నిజానికి ఈ ధ్వని ప్రధాన వాయిద్య కళారూపాలు అతి ప్రాచీనమైనవిగా చెప్పవచ్చు. మనిషి భాష, పాట నేర్వక ముందు ఇటువంటి కళారూపాలు పుట్టి అదే విధంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. కాల క్రమంలో పాటలు, ఆటలు (నృత్యాల్లో) ఇవి భాగమయినా... తమ సొంత ప్రతిపత్తిని మాత్రం ఇవి కొనసాగిస్తూనే ఉన్నట్టు భావించవచ్చు.
వృత్తిపర ఇంద్రజాలికులు
జానపద కళాకారుల్లో కొందరు వృత్తిపరమైన మెజీషియన్లు (ఇంద్రజాలికులు) ఉన్నారు. సాధనా శూరులు, యక్షిణి, విప్రవినోదులు, గారడీ, దేవర పెట్ట, మోడీ, బీరన్న లు, కాటి పాపలు వంటివారు ఇటువంటి వారే. ఇందులో చాలా వృత్తి కళలు నశించిపోయాయి. సాధనా శూరులు, బీరన్నలు, కాటిపాపలు వంటివారు తెలంగాణలో ఇప్పుడు మనుగడలో ఉన్నారు. ఈ జాతరలో కాటిపాపలు, సాధనాశూరులు కనిపించారు. దాదాపు వీరంత కాకపోయినా అంతో ఇంతో ఇంద్రజాల ప్రదర్శన చేసే బుడబుక్కలవారు కూడా కనిపించారు. ఈ ఇంద్రజాలికులందరూ దాదాపు శైవారాధకులే కావడం విశేషం. అయితే బుడబుక్కల వారు అంబను కూడా ఉపాశిస్తారు. వీరు వాయించే వాయిద్యం శివుని చేతిలోని ఢమరుకమని జానపదులు అంటారు.
వీరు రాత్రిపూట... అంటే ముఖ్యంగా తెల్లవారు ఝామున మంద్ర, మధ్యమ, తారాస్థాయిల్లో డమరుక వాయిద్యాన్ని వాయించుకుంటూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు భాష్యం, జోస్యం చెప్పుకుంటూ, పరిష్కార మార్గాలను సూచించుకుంటూ యాచన చేస్తారు.
ఇందరు కలాకారుల కరస్పర్శతో పులకిస్తూ రవీంద్రభారతి ప్రధాన హాలు లోపలకి ప్రవేశించాం. కూర్చోటానికి చాలామందికి సీటు దొరకక ఆ మూల, ఈ మూల ప్రదర్శనలను వీక్షించారు.
''దదదదదదదదద హారు.....దదదదదదదదద హారు'' అంటూ వేదిక మీదికి రావడంతోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టేలా వికటాట్టహాసం చేస్తూ... వీరభద్ర విన్యాసాన్ని ప్రదర్శించారు మొదటగా కళాకారులు. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళాకారుల స్వాధీనంలోకి వచ్చేశారు ప్రేక్షకులు. అయితే నిమిషం కూడా ప్రదర్శన జరుగకుండానే వారిని వేదికపై నుంచి పంపి నిర్వాహకులు మరో కళా బృందాన్ని పిలవడంతో ప్రేక్షకులు, కళాకారులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. 70 కళాబృందాలు ప్రదర్శన ఇవ్వాలని, అందుకే ఒక్కో కళా బృందానికి ఒకటి లేక రెండు నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నామని నిర్వాహకులు క్షమాపణలు చెబుతూ చకచకా కళాకారులను వేదిక మీదకు పిలవడం ప్రారంభించారు. ఆ విధంగా సాయంత్రం ఐదు గంటలకల్లా కార్యక్రమాన్ని ముగించగలిగారు కూడా.
గుస్సాడి, వీరభద్ర ప్రభలు, పులివేషాలు, డుబ్బుల వాయిద్యం, బుడబుక్కల, చిందు, బైండ్ల, కాటిపాపపల, రాజన్న డోలు, కొమ్ముకోయ, ఒగ్గు డోలు, శారద కాండ్రు, నందికోల. గౌడజెట్టి, బోనాల కోలాటం, బుర్రకథ, సాధనాశూరులు వంటి అనేక కళారూపాలను ప్రదర్శించే కళాకారులతో పులకించిన రవీంద్రభారతి దృశ్యాలు వారం రోజులు గడుస్తున్నా మనసులో తాజాగా, సజీవంగా కదిలాడుతూనే ఉన్నాయి!
తెలంగాణ అంటేనే జానపద కళల ఖజానా. వేలాది ఏండ్లుగా జానపద కళలను బతికిస్తూ వచ్చినవారు జానపద కళాకారులు. పూర్వీకుల వారసత్వాన్ని నిలబెడుతూ ఇప్పటికీ అనేక కళలను బతికిస్తూ ప్రదర్శిస్తున్న కళాకారులతో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నది తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ. గత ఐదేళ్లుగా అన్ని స్థాయిల్లో... అన్ని వేదికల పైన తెలంగాణ జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నది ప్రభుత్వం. ఆగస్టు 22వ తేదీన అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని జానపద, వృత్తి కళాకారుల సంఘాల సమన్వయంతో ఈ జానపద జాతరను నిర్వహించాం. మన కళ్ల ఎదుట ఉన్న ఈ కళాకారులందరినీ కలిపి వాకింగ్ హెరిటేజ్ అని అనవచ్చు. అటువంటి కళాకారులకు శుభాకాంక్షలు!
Authorization