భారతీయ ప్రాచీన సంప్రదాయ సమాజం నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న అత్యంత హీనమైన ఆచారం 'జోగిని' వ్యవస్థ. భారతీయ పురుష స్వామ్య దాష్టీకానికి, కులవ్యవస్థ వికృత స్వరూపానికి, గొప్పగా చెప్పుకునే మన సంస్కృతిలోని అమానవీయతకు నిలువెత్తు ప్రతీక జోగిని వ్యవస్థ. ప్రభుత్వాలు ఒకపక్క ఈ వ్యవస్థను రూపు మాపాలని చట్టాలు చేస్తాయి. మరో పక్క జోగినీ చెప్పే 'రంగా'నికి రాజధాని నగర నడిబొడ్డునే అధికారయుతంగా సకల ఏర్పాట్లు చేస్తాయి. ఈ ద్వంద్వ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ వ్యవస్థలో ఇంకా వేలాదిమంది దళిత ఆడపడుచులు మగ్గుతున్నారు. దాని కబంద హస్తాలనుంచి బయటపడి... బతుకుపోరులో అల్లాడిపోతున్నవారు మరెందరో! ఇటువంటి వారిని, వీరి విముక్తి కోసం పాటుపడిన ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, మాజీ అధికార్లను ఒక చోట చేర్చి, ఆగస్టు 20న విజయవాడలో ఒక వర్క్ షాపు నిర్వహించింది ఏపీ ఎస్సీ కమిషన్. అందులో పాల్గొన్న ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూప రాణి... జోగిని వ్యవస్థ మూలాలను తవ్వి తీసి, ప్రస్తుత పరిస్థితులను సవివరంగా మనముందు ఉంచిన వ్యాసం ఇది.
దేవదాసి, జోగిని, మాతంగి, బసివి, దేవుడమ్మ... పేరేదైనా అందరిదీ ఒకటే పరిస్థితి, అందరినీ దేవుడే సృష్టించి ఊరుమ్మడి వస్తువుని చేశాడు. ఇక్కడంతా దేవుడి పేరు మీదే జరుగుతుంది. కవి పైడి తెరేష్ బాబు అన్నట్టు దేవుడు అసమానతల్ని స ష్టించి కొందరి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ దేశంలో కనీసపు మనిషి హౌదా పొందని నికృష్ట జీవి అయిన జోగినీని సృష్టించినదీ ఆ దేవుడే! రాజు దైవాంశ సంభూతుడు అని నమ్మిన మధ్యయుగాలలో పెద్ద పెద్ద దేవాలయాలలో నాట్యం చేస్తూ దేవుడి పరిచారికలుగా ఉండడానికి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను అంకితమిచ్చేవారు. గ్రామాలలోని గ్రామదేవతలకు ఆడపిల్లలను అంకితమిచ్చే ఈ ఆచారం తెలంగాణలో 'జోగిని', రాయలసీమలో 'బసివి', నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో మాతంగి', ఉత్తరాంధ్రలో 'దేవుడమ్మ', మహారాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ ప్రాంతంలో 'మురళి' అనే పేర్లతో మధ్యయుగాల నుండీ ఉనికిలో ఉంది. మహారాష్ట్రలో 'జోగతి', కేరళలో 'మహరి', తమిళనాడులో 'మరియమ్మ', కర్ణాటకలో 'ఉలిగమ్మ' అనే పేర్లు ఈ స్త్రీలకున్నాయి. ఈ వ్యవస్థ మీద పరిశోధన చేసిన వారు దీనికి 'పవిత్ర వ్యభిచారం' అని, మతపరమైన వ్యభిచారమని లైంగిక దాస్యం అని దేవుని పత్ని అని రకరకాలుగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆచరణలో ఉన్న ఈ వ్యవస్థని కాళిదాసు కూడా తన 'మేఘ సందేశం' కావ్యంలో పేర్కొన్నాడు. ఉజ్జయినీఆలయంలో వేల సంఖ్యలో దేవదాసీలు ఉన్నట్టు కాళిదాసు రాశాడు. అయితే వారు అణగారిన కులాలకు చెందినవారని, మధ్యయుగాల తెలుగు సాహిత్యంలో కనిపించే 'మాదిగ జోగురాలు' అనే పేరు సూచిస్తుంది.
దళిత ఆడకూతుళ్లే ఎక్కువ
జోగినీ వ్యవస్థకు బలైపోయిన స్త్రీలు ఎక్కువ శాతం మాల మాదిగలే అని బౌద్ధ పరమైన చరిత్ర కూడా రుజువు చేస్తుంది. 'జోగిని' 'యోగిని'కి పర్యాయ పదం. బౌద్ధంలోని వజ్రయానంలో స్త్రీలు కూడా మతపెద్దలుగా వ్యవహరించేవారు. ప్రాధమికంగా వీరు వైదిక బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా తాత్వక రంగంలో యుద్ధం చేసిన బ్రాహ్మణేతరులు. బౌద్ధ సాహిత్యలో ఉన్న 84 మంది సిద్దుల్లో అత్యధికులు నేటి అణగారిన కులాలవారే. దక్షిణ భారతంలో వారికి 'సిద్ధులు' అని పేరు. వారు మేధావులుగా, శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా గుర్తింపు పొందారు. వారు ఊరు బయట కొండలు, గుట్టల్లో, ఏకాంత ప్రదేశాలలో నిర్మించుకున్న విహారాలలో జీవించేవారు. సిద్ధులు తక్కువరకం లోహాలతో బంగారం చేసేవారని ప్రతీతి. ఆ ప్రయోగాలకు 'రసవాదం'(ఆల్కెమీ) అని పేరు. అలాగే సిద్ధులు వనమూలికలను సేకరించి వాటితో వైద్యం చేసేవారు. అయితే ఊరికి దూరంగా నివసిస్తూ వారు చేసే ప్రయోగాలకు గ్రామీణులు 'చేతబడి' అని 'బాణామతి' అని పేరు పెట్టి అవి చేశారనే నెపంతో స్త్రీ పురుషులను హింసించేవారు, కొన్నిసార్లు చంపేవారు. బాణామతి చేసిందని భావించే స్త్రీకి నోటి పళ్ళు రాలకొడితే ఆమె చేసిన బాణామతి పని చెయ్యదనే అపోహ కూడా ప్రజలు ఆ స్త్రీలను చిత్రహింసలపాలు చెయ్యడానికి దోహదం చేస్తుంది. అయితే, అటువంటి హత్యలకు, హింసకు గురయ్యేవారంతా కింది కులాలవారేనని సమకాలీనంగా తెలంగాణ వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న హత్యలే (విచ్ హంటింగ్) సాక్ష్యం.
బౌద్ధం ఇక్కడి నుంచి తుడిచిపెట్టుకుపోయాక వీరశైవం సామాజిక సమత అనే ఆశయం కోసం మత తాత్విక రంగంలో పనిచేసింది. అయితే బౌద్ధాన్ని అంతమొందించాలని పట్టుబట్టినవారే హిందు మతంలో ఒక పాయగా ఉన్న శైవంలో 'సాంఘిక సమానత్వం' అనే కోణాన్ని తీసుకొచ్చి బౌద్ధానికి ప్రత్యామ్నాయంగా నిలిపారు అనిపిస్తుంది. శైవంలో గ్రామదేవతలని శివుడి భార్యలుగా, తద్వారా అక్కడ అంకితమివ్వబడే జోగినీల మీద శైవమతం పట్టు సాధించింది.
సిద్ధులు అభివ ద్ధి చేసిన వైద్య శాస్త్రాన్ని 'సిద్ధ వైద్యం' అంటారు. సిద్ధుల్లో స్త్రీలు కూడా ఉన్నారు. వారికి పురుషులతో పాటు సమానంగా మతపరమైన హౌదా, గౌరవం ఉండేది. వారిని 'వజ్ర యోగినులు' అంటారు. వీరు ఇతర పురుష సిద్దులవలె వైవాహిక జీవితానికి దూరంగా ఉండి బుద్ధిజీవులుగా చెలామణి అయ్యేవారు. అయితే తామే బుద్ధి జీవులమని భావించే వైదిక బ్రాహ్మణ మతస్తులకు అది మింగుడుపడక వారిపై తీవ్రమైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. ఆ శత్రుత్వం వారిచేత బౌద్ధం పై అనేక దాడులు చెయ్యడానికి తోడ్పడింది. వైదిక మతం చేతిలో బౌద్ధం ఇక్కడ భౌతిక, నైతిక దాడులకు గురయ్యే క్రమంలో వైదిక బ్రాహ్మణ మతస్తులు బౌద్ధం మీద దుష్ప్రచారాలకు పాల్పడ్డారు. బౌద్ధ ఆరామాలను వ్యభిచార కూపాలుగా ప్రచారం చేసి వారుండే స్థావరాలను 'లంజ దిబ్బలు' అని పిలవడం మొదలుపెట్టారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన బౌద్ధ స్థావరాలన్నీ స్థానికంగా 'లంజ దిబ్బలు' లేదా 'లంజ కనుమలు'గా పిలువబడ్డాయి. ప్రాచీన కాలం నుంచి దళితుల అస్తిత్వం బౌద్ధమతంలో ఉండేదనడానికి ఇప్పటికీ ఆ దిబ్బలు ఉండే స్థావరాలలో మాల, మాదిగ కులాలవారే నివసిస్తూ ఉండడం గమనార్హం. మేధావులైన ఆ వజ్ర యోగినులే మధ్య యుగాలనాటికి మొదట బలవంతంగా తర్వాత ఆచారపరంగా హిందు మతంలో 'దేవదాసీలు' గా, భోగ స్త్రీలుగా, మార్చబడ్డారని పరిశోధకులు భావిస్తున్నారు.
జోగినిగా మార్చడం
దేవాలయాలకు అమ్మాయిని అంకితమిచ్చేటప్పుడు వారికి దేవుడి ప్రతినిధులుగా భావించబడే పూజారి లేదా అమ్మాయికి మేనమామ వరసయ్యేవారు తాళి కట్టిస్తారు. ఆ పెళ్లి కూడా ఖరీదైన వ్యవహారమే! ఖర్చును జోగిని కాబోయే అమ్మాయి తల్లిదండ్రులే భరించాలి. ఆ ఖర్చుకోసం కావాల్సిన డబ్బు సంపాదించడానికి వలస కూలీలుగా ఇతర బొంబాయి వంటి నగరాలకు వెళ్లి కూలీ పనులు చేసి వచ్చిన డబ్బుని జోగినీ పెళ్లి తంతుకి ఖర్చుపెట్టిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. జోగిని పెళ్లి తతంగాన్ని గ్రామదేవతలకు సోదరుడుగా భావించబడే 'పోతురాజు', పెద్ద వయసు జోగినులు నిర్వహిస్తారు. వారే జోగిని చనిపోయినప్పుడు తమ ఆచారం ప్రకారం మళ్ళీ ఖరీదైన తతంగంతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. డబ్బులేక ఆ ఖర్చులు భరించే స్థితిలేని జోగినీ శవాలను స్మశానాలలోకి అనుమతించరు. బతికినన్ని రోజులు ఆమె దేవుడి భార్యగా, నిత్య సుమంగళిగా పరిగణించబడుతుంది. ఆమెకి పిల్లలు పుడితే ఆ పిల్లలకు జోగినీ స్త్రీ తండ్రి ఇంటిపేరు వస్తుంది. అలా దేవాలయాలకు అంకితమివ్వబడిన ఆమె మళ్ళీ వివాహం చేసుకోవడానికి అర్హురాలు కాదు. ఆమె మీద ఊరిపెద్దలకు అధికారం ఉన్నట్టు పెత్తనం చేస్తారు. రజస్వల అయ్యాక ఆమె మొదట గ్రామ పెద్ద కోరిక తీర్చాలి, ఆ తర్వాత ఆమె ఊరుమ్మడి వస్తువు అవుతుంది. గ్రామాలలో జరిగే జాతరలలో ఆమె ఒక విధమైన పూజారి పాత్ర వహిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు శవయాత్రలో, జాతరలలో వీరు నాట్యం చెయ్యాలి. వర్షాలు కురవకపోతే గ్రామాలలో జరిపే కొలుపులలో వేపమండలు కట్టుకుని ఎగరాలి. గ్రామ పెత్తనదారులు మద్యం తాగిస్తే తాగాలి, ఊగాలి, చిందులెయ్యాలి. అక్కడ జరిగే డప్పుల మోతకు, జనం చేసే కోలాహలానికి సహజంగానే ఆమె ఒకవిధమైన ఉన్మాద స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితిని 'పూనకం' అంటారు. ఆమె వొంటిమీదకు అతీంద్రియ శక్తులేవో వచ్చినట్టు జనం భావించి ఆమె చేత 'రంగం' పేరుతో భవిష్యత్తులో జరగబోయే విషయాలు చెప్పించుకుంటారు. ఆమెతో పచ్చి బూతులు తిట్టించుకుని, ఆమె చేత మొహం మీద ఉమ్మించుకుని అదంతా దైవానుగ్రహం అని నమ్మి ఆనందిస్తారు.
ఏది మంచో, ఏది చెడో తెలియని ముక్కు పచ్చలారని చిన్నపిల్లలను ఈ రొంపిలోకి దించడం జరుగుతుంది. వారిని దేవుడికి అంకితమిచ్చేనాటికి పది సంవత్సరాల వయసు లోపలే ఉంటుంది. జోగినీ వ్యవస్థ ఒకరకంగా అనార్య మాత స్వామిక వ్యవస్థ నుంచి వచ్చిందనే అభిప్రాయం కూడా పరిశోధకులలో ఉంది. మగ సంతానంలేని తల్లిదండ్రులు, ఒక్కతే కూతురున్న వారు తమ వారసత్వం కొనసాగడానికి కూడా తమ కుమార్తెలను జోగినీలుగా మారుస్తారు. నాయనమ్మ, అమ్మమ్మ, అమ్మ తరాలలో ఎవరైనా ఈ ఆచారంలో ఉన్నా కూడా తరవాతి తరం ఆడపిల్లల మీద అది బలవంతంగా రుద్దుతారు. కొన్నిసార్లు తల్లిదండ్రుల పేదరికం, అమ్మాయికి అవిటితనం వంటి అంశాలు కూడా వారి చేత ఈపని చేయిస్తుంది. మరికొన్ని సందర్భాలలో అమ్మాయి తల వెంట్రుకలు జడలు కట్టి ఉంటే అది దేవత అనుగ్రహమని నమ్మి, ఆమెని జోగినిగా చెయ్యమని గ్రామ పెద్దలు ఆ తల్లిదండ్రుల మీద వత్తిడి తెస్తారు. తల వెంట్రుకలు జడలు కట్టి వుండే స్త్రీల ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాల మీద జరిగిన పరిశోధనలలో ఆ జడలు వారిలో పౌష్టికాహార లోపం, పరిశుబ్రత లేకపోవడం వంటి అంశాలే ప్రధాన కారణమని తేలింది. అన్నిరకాల అవిద్య, అజ్ఞానం, వెనుకబాటుతనం, మూఢనమ్మకాలు జోగినీ వ్యవస్థ కొనసాగడానికి ప్రధాన కారణాలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సుమారు ఎనభై వేల మంది జోగినీలు, బసివిలు, మాతమ్మలు, దేవుడమ్మలుగా కొనసాగుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. కర్ణాటక లోని సౌదత్తి దేవాలయంలో స్త్రీలను జోగినీలుగా మార్చడానికి ఒక ప్రత్యేక మందిరం ఉండడం విశేషం. అక్కడి ఎల్లమ్మ గుడి కూడా జోగినీలకు ప్రసిద్ధి పొందింది. అక్కడ ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో స్త్రీలను జోగినీలుగా మార్చుతారు.
చట్టాలు చేశారు సరే... ఒక్కరినైనా శిక్షించారా?
తెలంగాణలోని పాత మహబూబ్ నగర్ జిల్లాలోని కర్నాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలలో జోగినీ వ్యవస్థ నిరాటంకంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని కర్ణాటక సరిహద్దు జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాల్లో శైవమత ప్రభావంతో 'బసివి' అనే పేరున ఈ ఆచారం కొనసాగుతుంది. ఈ బసివినులు శివుడి భార్యలుగా భావిస్తారు. 1988 జోగినీ నిరోధక చట్టం అచ్చం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలాగే పేపర్లలో పడి మూలుగుతుంది. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థలో అణగారిన కులాల స్త్రీలను బలిపశువులను చేసే ఈ వ్యవస్థ సమసిపోవాలని హేమలతా లవణం, కుముద్ బెన్ జోషి, ఎస్.ఆర్. శంకరన్ వంటివాళ్ళు ఎంతమంది కృషి చేసినా ఆ వ్యవస్థని దేవుడు పకడ్బందీగా కాపాడుతూనే ఉన్నాడు. జోగినీ నిరోధక చట్టం ప్రకారం బాధిత స్త్రీ తప్ప జోగినీగా మార్చే పూజారి, అంకితమిచ్చే తల్లిదండ్రులు, ప్రోత్సహించే కుల పెద్దలు అందరూ దోషులే. కానీ చట్టం వచ్చి ముప్పై ఏళ్ళు గడిచినా జోగినీ వ్యవస్థను కొనసాగిస్తున్నవారిలో ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం గమనార్హం.
హేమలతా లవణం ప్రారంభించిన 'సంస్కార్', గ్రేస్ నిర్మల 'ఆశ్రరు' అనే స్వచ్చంద సంస్థలు జోగినీ స్త్రీల సంస్కరణకు కషి చేస్తున్నాయి. కుముద్ బెన్ జోషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నప్పుడు హేమలతా లవణం వారి పునరావాసం కోసం ప్రభుత్వాల మీద వత్తిడి తీసుకొచ్చి జోగినీ అంకిత నిషేధ చట్టం వచ్చేలా పనిచేశారు. హేమలతా లవణం జీవించి ఉన్నప్పుడు వారి కార్యక్రమాలను నిజామాబాద్ జిల్లాలో కేంద్రీక్రుతమవ్వగా... గ్రేస్ నిర్మల స్థాపించిన 'ఆశ్రరు' కార్యక్రమాలు జోగినీ వ్యవస్థ ప్రబలంగా ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లో 'మాతంగి' పేరుతో దోపిడికి గురవుతున్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఎక్కువగా పనిచేస్తుంది.
ఎస్సీ కమిషన్లో ప్రత్యేక విభాగం ఉన్నా...
సామాజిక కార్యకర్తలు గ్రామాలలో జోగినీ స్త్రీకి మళ్ళీ వివాహం చేసే సందర్భాలలో గ్రామ పెద్దలు వారిమీద దాడి చేసి కొట్టడం అనేది చాలాసార్లు జరిగింది. గ్రామ దేవత జాతర జరిగేటప్పుడు ఆడపిల్లలను జోగినీలుగా అంకితమివ్వడం అనేది జరుగుతుంది. జాతర జరిగేటప్పుడు పోలీసులు గ్రామాలలోకి వెళ్లి వారి ఆచారంలో జోక్యం చేసుకోరు, అధికారుల ఆదేశాలతో వెళ్ళినా చోద్యం చూసి రావడం మినహా వారు చేసేది ఏమీ ఉండదు. జోగినీ స్త్రీల సంస్కరణ, పునరావాసం కోసం ఎస్సీ కమిషన్లో ప్రత్యేక విభాగం ఉన్నట్టు చాలామందికి తెలియదు. అక్కడి నిధులన్నీ వేరే కార్యక్రమాలకోసం మళ్ళించడం సర్వసాధారణం. ఇంకా కొందరు జోగినీలు ఇంకా బిచ్చగత్తెలుగా జీవించడానికి సమాజం లో వారి పట్ల ఉండే చిన్న చూపు, నిర్లక్ష్య ధోరణి, కుల, మత, పితస్వామిక కట్టుబాట్లే కారణం. అజ్ఞానం లో, చీకటిలో కూరుకుపోయి ఒకవిధమైన మానసిక వైకల్యంతో బతుకీడ్చే జోగినీ స్త్రీలలో చాలామందికి లోకం పోకడ తెలీదు. 'అభివ ద్ధి' అనే మాటకు వారు ఆమడ దూరంలో ఉన్నారు.
జీవితకాలపు దు:ఖానికి పరిహారం ఎప్పుడు?
జోగినీ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి, వారిమీద అనేకమంది పరిశోధన చేస్తున్నారు, ఎన్జీవోలు ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నాయి. అయినా ఈ వ్యవస్థ సమాజం మొహం మీద మాయని మచ్చగా ఇంకా మిగిలే ఉంది. జోగినీ స్త్రీలు, వారి బిడ్డలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండవు. ఉండడానికి ఇల్లు ఉండదు, రమ్మనే, పొమ్మనే బంధువులుండరు. కొంతమంది జోగినీలు బిచ్చమెత్తుకుని బతుకుతున్నారు. వితంతు పెన్షన్ కి గానీ, మరొక రకమైన రాయితీలకు గానీ అర్హులు కాకుండా అడ్డుపడే వీరి గుర్తింపు ఆ స్త్రీల మెడలో గుది బండై కూర్చుంది. జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థల ద్వారా జోగినీలకు, వారి పిల్లలకు రేషన్, ఆధార్ కార్డులు ఇప్పించాలని, వారి పిల్లలను సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో ఎంట్రెన్సు లేకుండా నేరుగా చేర్చుకోవాలని, వారికి తండ్రిపేరు రాయనవసరం లేకుండా వెసులుబాటు కల్పించాలని కొన్ని అధికారికమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ వాటిని చిత్తసుద్దితో అమలుపరిచేవారు లేరు. కటిక పేదరికంలో కనీస అవసరాలు కూడా తీరని ఈ ఊరుమ్మడి స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే అవమానాలు, అవహేళనలకు లెక్క లేదు. తండ్రి వైపు నుంచి గుర్తింపు లేని వీరి పిల్లలు సమాజంలో ఎదుర్కొనే పరాభవాలకు అంతే లేదు. వారికి స్కూలు అడ్మిషన్ దగ్గర నుంచి ఎదురయ్యే అవమానాలకు ఏ నేరం చెయ్యని ఆ పిల్లలు పొందే మానసిక హింస మాటల్లో చెప్పలేనిది. వారి జీవితకాలపు దు:ఖానికి పరిహారం ఎప్పుడు దొరుకుతుంది?
ఆమధ్య తెలంగాణలో ''మొగుడనేవాడు మనిషైతే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్ కి అర్హత పొందుతాను, కానీ నా మొగుడు దేవుడైపాయే. ఆడెప్పుడు సచ్చేది, పెన్షన్ ఎప్పుడోచ్చే?'' అని ఒక జోగినీ అడిగిన ప్రశ్నకి అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం ఏమని బదులిస్తుంది? ఆమెని స ష్టించిన ఆ మాయదారి దేవుడు బదులు పలకలేడు... ఒకపక్క ప్రభుత్వాధినేతలే పోతురాజుల్ని, జోగినీలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డున జాతర చేస్తూ, 'రంగం' చెప్పించుకుంటుంటే జోగినీల ప్రశ్నలకు ఎవరైనా ఎలా బదులిస్తారు?
ఎస్సీ కార్పోరేషన్ ఈ సంవత్సరం, ఆగస్ట్ ఇరవయ్యో తేదీన విజయవాడలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కి రెండు రాష్ట్రాల అధికారులతో పాటు అనేకమంది జోగినీ స్త్రీలు పాల్గొనడం విశేషం. వారిలో హాకీ క్రీడాకారిణి 'సుశీల' ఒకరు. ఆమె తల్లితో పాటు నికష్టమైన ఈ వ్యవస్థ నుంచి బైటకొచ్చి గౌరవంగా బతకాలని కోరుకునే కొందరు జోగినీ స్త్రీలు ఈ వర్క్ షాపులో పాల్గొనడం విశేషం. వారి మాటల నిండా కసి ఉంది, సమాజం తమని చూసే చూపు మీద పట్టరానంత ఆగ్రహం ఉంది. జోగినీ ఆచారం నుంచి బయటపడి మళ్ళీ వివాహం చేసుకుని సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న 'హాజమ్మ' అనే మహిళతో మాట్లాడినప్పుడు ఆమె ''జోగిని చిందేస్తే వర్షాలు పడతాయని జోస్యం చెప్పే ఆ పంతులు మాల మాదిగోళ్ళు చదువుకుని పైకి రాకపోతే సంఘానికి అరిష్టం అని చెబితే బాగుండు'' అని చమత్కరించడం విశేషం. అయితే జోగినీ వ్యవస్థ నిరోధక చట్టాన్ని మరింత బలపరుస్తూ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు, సాంఘిక సంక్షేమ శాఖకూ అనుసంధానం చేస్తూ ఈ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చెయ్యాలి. 'నిర్భయ', పోక్సో చట్టం వంటి వాటితో అనుసంధానం చెయ్యాలి. దేవుడితో పెళ్లితంతు పేరుతో చిన్నపిల్లలను జోగినీలుగా మార్చే జాతర జరిగే ప్రదేశానికి ముందస్తు సమాచారం మేరకు వెళ్లి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఈ జోగినీ వ్యవస్థను ప్రోత్సహించే గ్రామ పెద్దలు, పూజారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చెయ్యాలి. ఇప్పటివరకూ వారికి ఇచ్చిన పునరావాస సౌకర్యాల పరిస్థితి మీద సమీక్ష జరిపి న్యాయంగా వారికి సరైన పునావాసం కల్పించాలి. వీటన్నింటికంటే ముందు దేవుళ్ళను బహిష్కరించాలి.
Authorization