భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న అన్ని పరిణామ దశలకు భారతదేశం ప్రత్యక్ష సాక్షి. ముఖ్యంగా మానవ పరిణామానికి సంబంధించిన అన్ని యుగాలకు, దశలకు సంబంధించిన భౌతిక ఆధారాలు మనదేశంలో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలను ఆదిమానవుని నుంచి నేటి మానవుని వరకు మానవుని కార్యకలాపాలను రికార్డు చేసిన రిజిస్టర్లు మాదిరిగా చెప్పుకోవచ్చు. ఆదిమానవుని పనిముట్లున్న ప్రాంతాలు, సమాధులు, తొలిచారిత్రక యుగపు బౌద్ధ స్థూపాలు, జైన బసదులు, ఆలయాలు; మధ్యయుగపు దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు ఇట్లా ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు త్వర త్వరగా నాశనమైపోతున్నాయి. జనాభాపెరుగుదల, అభివృద్ధికార్యకలాపాలు ఊపందుకోవడం వంటి కారణాల వల్ల ఈ చారిత్రక సంపద నాశనమైపోతున్నది. మానవ ఆవాసాలు, వ్యవసాయం కోసం కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం చేపడుతున్నది. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల వందల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న భూ భాగాలు నీటి రిజర్వాయర్లలో మునిగి పోతున్నాయి. ఈ భూభాగాల్లో పైన చెప్పుకున్న అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉంటాయి. అందులో ఇప్పటికే మనకి తెలిసినవి కొన్ని ఉండవచ్చు. తెల్వనివీ ఉండవచ్చు. ఇవన్నీ శాశ్వతంగా జలసమాధి కాకముందే వాటి చరిత్రను రికార్డుచేయవలసి ఉంటుంది.
ప్రాచీన స్థలాల్లో దొరికిన మానవుని పనిముట్లను సేకరించాలి. రాక్షసగుళ్లు అని పిలిచే ఇనుపయుగపు సమాధులను తవ్వి నాటి ప్రజల జీవన విధానాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. అట్లాగే గుడులు, గోపురాలు ఉంటే వాటిని అధ్యయనం చేయాలి. అవి మరీ విలువైనవి అనుకుంటే ఆ గుడులను ఏ రాయికి ఆ రాయిగా విప్పి అక్కడికి దూరంగా వేరే ప్రాంతానికి తరలించి మళ్లీ ఇదివరకు ఎట్లాగున్నవో అట్లాగే నిర్మించాలి. ఈ కార్యకలాపాలన్నీ సాల్వేజ్ ఆర్కియాలజీలో భాగం.
Authorization