ఇటీవల సూర్యాపేట జిల్లా నడిగూడెంలో దక్కన్ ఆర్కియలాజికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో 5వ తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో డాక్టర్ అనుపమ కైలాష్ నాట్య ప్రదర్శన మధ్యయుగం చివరలో రచించిన 'శృంగారమంజరి' నాయికలను మన కండ్ల ముందు ఉంచింది. ఆమె వ్యాఖ్యాన సహిత ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నది. ఇందుకు ఈ సమావేశాల్లో పాల్గొన్న 'జాతర' ప్రతినిధి ప్రత్యక్ష సాక్షి. శృంగారమంజరి గురించిన ఆసక్తికర విశేషాల సమాహారమే ఈ ప్రత్యేక వ్యాసం.సయ్యద్ షా కాలిముల్లా హుస్సేని అలియాస్ అక్బర్ షా, అలియాస్ బడే సాహిద్... పండితుడు, భాషావేత్త, తత్వవేత్త, కవి కూడా. బహుముఖ మేధావి అయిన అతడు 17 వ శతాబ్దం చివరలో హైదరాబాద్ నగరంలో జీవించాడు. కాలక్రమంలో అతడిని అందరూ మరచిపోయారు. ఎంతగా అంటే, ఆయన నివసించి, మరణించిన హైదరాబాదు నగరంలోనే ఆయన గురించి ఎటువంటి సమాచారం పొందే పరిస్థితి లేనంతగా! అటువంటి పరిస్థితుల్లో మద్రాస్ విశ్వవిద్యాలయ సంస్కృత విభాగం అధిపతి, డాక్టర్ వెంకట రమణ రాఘవన్ నిరంతర కృషి ఫలితంగా అక్బర్ షా గురించిన విశేషాలు, ఆయన రాసిన 'శృంగారమంజరి' అందుబాటులోకి వచ్చాయి.
డా||రాఘవన్ అక్బర్ షా రాసిన 'శృంగారమంజరి' అనే సంస్కృత గ్రంథ రాత ప్రతిని మొదటసారిగా 1943లో మైసూర్లోని ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీలో చూసి ఆశ్చర్యపోయారు. అప్పటివరకూ అటువంటి పుస్తకం ఒకటున్నదనే సంగతినే జనం మరచిపోయారు. ఆ తర్వాత అదే పుస్తక రాత ప్రతి మరొకదానిని తంజావూరులోని మహారాజా సెర్ఫోజీ సరస్వతి మహల్ గ్రంథాలయంలో కనుగొన్నారు. ఈ రెండు ప్రతులను సమన్వయం చేసి ఏక ప్రతిని రూపొందించారు రాఘవన్.
షా రాజు ఖతాల్ కుమారుడు అక్బర్ షా. సూఫీ మతాన్ని దక్కన్కి తీసుకువచ్చాడని భావిస్తున్న గెసు దరాజ్ వంశానికి చెందినవాడు షా రాజు అని పండితులు తేల్చారు. అక్బర్ షా తన తండ్రి ఖంకాలో మరో చిన్న పిల్లవాడితో కలిసి పెరిగాడు. అక్బర్ షాతో కలిసి పెరిగిన ఆ చిన్నపిల్లవాడే అబుల్ హసన్ లేదా తానా షా. షా రాజు... అబుల్ హసన్ని తానాషా (యువరాజా) అని పిలుస్తూ ఉండేవాడు. ఆ తానా షా యే గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదేమో. అక్బర్ షా చిన్న వయసులోనే మరణించారు. ఆయనను తండ్రి సమాధి ఉన్న స్మశానవాటికలోనే సమాధిచేశారు.
హైదరాబాదు సమీపంలోని మిస్రిగంజ్లోని స్మశానవాటికలోనే వీరి సమాధులు ఉన్నాయి. షా రాజు సమాధికి సంబంధం ఉన్న సజ్జాదా నాషిన్, అతని వారసులైన హజ్రత్ సయ్యద్ షా హైదర్ హుస్సేని తెలిపిన వివరాల ద్వారా అక్బర్ షా జీవితం కొంతైనా వెలుగు చూసింది.
అక్బర్ షా 'శృంగారమంజరి' ఇతివృత్తం ప్రేమ. ముఖ్యంగా కథానాయికలు, వారి మనోభావాలపై రాసిన పుస్తకమిది. మనోహరమైన ఆ పుస్తకాన్ని ఈ యువకుడే రాశాడంటే నమ్మలేని విధంగా ఉందని పండితులు అంటున్నారు. డా|| రాఘవన్ ఒక సంపూర్ణ పరిచయంతో వెలుగులోకి తెచ్చిన శృగారమంజరి... భరతనాట్యం, కర్ణాటక సంగీతం కోసం చేసే రచనలకు అనుసరణీయం అయింది. అందుకు తాజా ఉదాహరణ డా|| అనుపమ కైలాష్ రూపొందించిన నాట్య ప్రదర్శనలు.
ఎవరీ అనుపమ కైలాష్?
డాక్టర్ అనుపమ కైలాష్ ప్రసిద్ధ నర్తకి. డాక్టర్ ఉమా రామారావు దగ్గర కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. అలాగే విలాసిని నాట్యం కోసం పద్మభూషణ్ స్వప్నసుందరి శిష్యరికం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా కూచిపూడి నాట్యం ప్రదర్శిస్తున్నారు. దశాబ్దంన్నర కాలం నుంచి విలాసిని నాట్య సోయగాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో ప్యాకల్టీ మెంబర్గా అనేక మంది పరిశోధనా విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఎందరో ఆమె దగ్గర నాట్యం నేర్చుకున్నారు. ఆమె రచించిన 'క్షేత్రయ్య పదాలలో నాయికలు' ప్రసిద్ధి గాంచింది. రెండో పుస్తకంగా తన డాక్టరల్ థీసిస్ ఆధారంగా 'అన్నమాచార్య నాయికలు - నాట్యం కోసం ఒక వ్యాఖ్యానం' వెలువరించారు. ఈ రెండు పుస్తకాల రచన ఆమెలో ఆయా సంకీర్తనలు, పదాలలో ఉన్న నాయికల హృదయాలు చక్కగా పట్టుబడటానికి దోహదం చేశాయి. ఫలితంగా ఆమె తన ప్రదర్శనల్లో వారి హొయలను, సొగసును, గారాబాన్ని, తుంటరి తనాన్ని , గర్వం, అహంభావం... ఒకటేమిటి... సకల లక్షణాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ వచ్చారు. ఈ కృషికి కొనసాగింపుగానే అక్బర్ షా శృంగారమంజరి గ్రంథంలోని నాయికలను మన కండ్లముందు సాక్షాత్కరింపచేసే కార్యానికి పూనుకోవడం. ఆమె నాట్య ప్రదర్శన చూసినవారికెవరికైనా ఒక సూఫీ పండితుడు ఇంతటి శృంగార రసాస్వాదన చేశాడా అనిపిస్తుంది. అతడిది ఎంతటి రసరమ్య హృదయం కాకపోతే ఇలాంటి రచనచేయగలుగుతాడు! ఒక ముస్లిం అయిన సూఫీ పండితుడు సంస్కృతంలో రచన చేయడమే విశేషమనుకుంటే... ఆ గ్రంథానికి గుండెకాయ ప్రేమ కావడం మరింత విశేషం. అదీ స్త్రీ హృదయం లోపల దూరి చదివినట్టు నాయికలను తీర్చిదిద్దడం అపూర్వమనిపిస్తుంది. ఈ గ్రంథంలోని విశేషాలు, నడిగూడెంలో డా|| అనుపమ కైలాష్ ఇచ్చిన లాస్య ప్రదర్శన అక్బర్ షా హృదయాంతరంగాన్ని పట్టిచూపినట్టున్నాయి.
- జి.శివరామకృష్ణయ్య
7702508259
Authorization