స్థానిక జాతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఇతర అభివృద్ధి చెందిన ప్రజలను అందలాలెక్కించడం కేవలం ఇండియాలోనే కాదు. ప్రపంచమంతా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న అమెరికా, ఆ పక్కనే ఉన్న వర్థమాన దేశం మెక్సికో కూడా ఈ దారుణానికి పాల్పడటం చూస్తుంటే.. ప్రభుత్వాలన్నీ ఓ తానులో ముక్కలే అనిపిస్తుంది. ఈ రెండు ప్రభుత్వాలు కలిసి 'కొకొపా' అనే స్థానిక జాతిని మరణశయ్యపైకి ఎక్కించాయి.
కొకొపా అనే స్థానిక జాతీయులు అమెరికా (అరిజోనా రాష్ట్రం), మెక్సికో (బజాకాలిఫోర్నియా, సొనొరా రాష్ట్రాలు) దేశాల్లో విస్తరించి ఉన్నారు. కొకొపా అంటే నదీ ప్రజలు అని అర్థం. వీరు దిగువ కొలరాడో నది డెల్టాలో ఐదు వందల ఏండ్లుగా వ్యవసాయం, చేపల వేటమీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటివారికి నదీ జలాలు అందకుండా చేసి వారి జీవనాధారాన్ని, సంస్కృతిని నాశనం చేశాయి రెండు దేశాల ప్రభుత్వాలు. ఒకప్పుడు 22 వేలమంది జనాభా ఉన్న ఈ తెగవారు ప్రస్తుతం 13 వందలమందికి చేరుకొంది. అట్లాగే లిపి లేని వారి మాతృభాషను కేవలం పది మంది మాత్రమే ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి కొకొపా ప్రజలు ఎంత దీనావస్థలో మరణశయ్యపై అల్లాడుతున్నారో అర్థమవుతుంది.
ఈ అన్యాయం చూశారా?
మనిషి జీవించడానికి అతిముఖ్యమైనవి గాలి, నీరు, ఆహారం. ప్రకృతి సహజంగా లభించే ఈ మూడింటి మీద ఆధారపడే మనిషి తాను ఎక్కడ జీవించాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాడు. గాలి సంగతి అట్లా వదిలేస్తే... నీరున్న ప్రాంతంలోనే మానవ నాగరికతలన్నీ విలసిల్లాయని అనేక ప్రాచీన నదీ నాగరికతలు నిరూపించాయి. ఇప్పటికీ ప్రపంచంలోని గొప్ప గొప్ప పట్టణాలు, నగరాలు అన్నీ నదుల ఒడ్డునే అభివృద్ధి చెందడం తెలిసిందే. నదులు ప్రవహించే ప్రాంతాల్లో జీవించడానికి అవసరమైన నీరు, తినడానికి అవసరమైన పంటలు పండుతాయి కాబట్టి డెల్టాలు, నదీలోయల్లో మానవ ఆవాసాలు ఏర్పాటుచేసుకుంటూ ఉంటారు. ఈ కారణాలతోనే అమెరికా, మెక్సికో దేశాల్లో ప్రవహిస్తున్న కొలరాడో నది దిగువ డెల్టాలో జీవిస్తూ వచ్చారు కొకొపా ప్రజలు. వారి జీవనం 500 ఏండ్లు సాఫీగానే సాగింది. కానీ 1922లో అమెరికా, మెక్సికో ప్రభుత్వాలు కొలరాడో నది నీటిప్రవాహాన్ని మళ్ళించి కొకొపా ప్రజలకు నీరు రాకుండా చేశారు. దీంతో 20 లక్షల ఎకరాల మాగాణి భూమి నీరు లేక ఎండిపోయింది. వ్యవసాయం, చేపల వేట మీద ఆధారపడి జీవించే వేలాదిమంది ప్రజలు ఆకలితో అలమటించిపోతూ వచ్చారు. కొందరు ఉద్యోగాలు, ఇతర బతుకుదెరువును వెదుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. అక్కడే ఉన్నవారు దుర్భరంగా జీవితాలను వెళ్లదీస్తున్నారు.
1980ల్లో ఎల్ నినో ప్రభావం వల్ల అమెరికాలో విపరీతమైన వర్షాలు కురిసి వాగులు వంకలు పొర్లాయి. కొలరాడో నదిపై కట్టిన డాం జలాశయం నిండి ప్రమాదఘంటికలు మోగించడంతో ప్రభుత్వం గేట్లను ఎత్తివేసి కొకొపా ప్రజలు నివసిస్తున్న ప్రాంతంవైపుకు నీళ్లు వదిలింది. దీంతో కొకొపా ప్రజల కొంపాగోడు కొట్టుకుపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ ఎల్ మేయర్ ప్రాంతానికి తమ నివాసాలను మార్చుకోవలసి వచ్చింది. కానీ అక్కడ నీటి సౌకర్యం కానీ, వ్యవసాయానికి అనువైన భూములు కాని లేవు. అయితే కొన్నేళ్ల క్రితం అమెరికా, మెక్సికో ప్రభుత్వాలు ఒక్కశాతం నీటినైనా వదిలి కొకొపా మాగాణి భూములు వట్టి పోకుండా కాపాడాలనే ఒప్పందం కుదిరింది. ఇది అమలవుతుండగానే మరో ముప్పు వచ్చిపడింది.
1993లో మెక్సికో ప్రభుత్వం కొకొపా ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రవహిస్తున్న కొలరాడో నదిని బయో స్ఫియర్ రిజర్వుగా ప్రకటించింది. ఫలితంగా నదిలో చేపలు పట్టడాన్ని నిషేధించారు. దీంతో కుదుటపడుతు న్నాయనుకున్న కొద్ది మంది జీవితాలు కూడా మళ్లీ మోడువారాయి.
- మౌక్తిక్
Authorization