రాజస్థాన్ జానపద సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం వంటి కళలకు ప్ర్రసిద్ధి
గాంచింది. విదేశీ యాత్రికులను సైతం పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్న ఆ
ప్రాంతంలో దేశంలోని ఇతర ప్రాంతీయులు తెలుసుకోవలసిన విశేషాలు
ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పిచ్వాయి పెయింటింగ్ వేసే
విధానం. ఈ కళకు రాజస్థాన్లోని 'నాథ్ద్వారా' పట్టణం నిలయంగా ఉంది.
అందుకే దీనిని ఆ పట్టణం పేరుతోనూ వ్యవహరించడం పరిపాటి.
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదరుపూర్ నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం 'నాథ్ద్వారా'. ఇక్కడే స్థానికంగా అభివృద్ధి చెందిన ఓ అద్భుత చిత్రలేఖనా పద్ధతి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇక్కడి కళాకారుల చిత్రాలకు బయటి కన్నా స్థానికంగా ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల కళాకారులు తమ సంప్రదాయక కళను వందల ఏండ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పట్టణ కళాకారులు వేసే చిత్రాలు ఉదరుపూర్ నగరం చుట్టుపక్కలే కాక, రాజ్సమంద్ జిల్లా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద భవంతుల్ల్లో కనిపిస్తాయి. ఇండ్ల గడపలకు ఇరువైపుల మావటివారు అధిరోహించిన ఏనుగులు, పులులు, నెమళ్లు, అలంకృతులైన స్త్రీలు వంటి ఇతివృత్తాలు కలిగిన చిత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఇట్లా ఈ చిత్రాలతో భవంతులను అలంకరించడం స్థానిక సంస్కృతిలో భాగం కావడం వల్ల నాథ్ద్వారా కళ నిరంతరాయంగా కొనసాగుతున్నది. శ్రీనాథ్జీ అనే దేవుడు నాథ్ద్వారా ఇలవేల్పు. ఆయన కోసం నిర్మించిన దేవాలయాన్ని 'హవేలి' అని పిలుస్తారు. ఇది సంప్రదాయ దేవాలయంలా ఉండదు. అనేక గదులను కలుపుతూ పెద్ద వరండాలు, అనేక ద్వారాలు ఉన్న పెద్ద నిర్మాణంగా హవేలి ఉంటుంది. ఈ హవేలి ద్వారాలకు ఇరువైపుల స్థానిక కళాకారుల చిత్రాలను అలంకరిస్తారు.
నాథ్ద్వారా పట్టణం వైష్ణవంలో ఒక శాఖైన పుష్టి మార్గీయ సంప్రదాయానికి కేంద్రంగా ఉండటంవల్ల ఇక్కడ ఉన్న కళాకారులందరూ 'పిచ్వాయి' పెయింటింగ్స్ వేయడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. పిచ్వాయి పెయింటింగ్స్ అంటే శ్రీనాథ్జీ విగ్రహానికి నేపథ్యంలో ఉండే పెయింటింగ్స్. శ్రీనాథ్జీ అంటే గోవర్థన గిరిని ఎత్తుతున్నట్లు కనిపించే కృష్ణుడు. నాథ్ద్వారాలో వినిపించే స్థానిక కథలను బట్టి శ్రీనాథ్జీ విగ్రహం ఎక్కడో మధుర నుంచి నాథ్ద్వారాకి చేరిందని, అక్కడ ఆ విగ్రహాన్ని ఉంచి హవేలీ కట్టారని తెలుస్తు న్నది. అప్పటి నుంచి ఈ పట్టణం పెద్ద పుణ్య క్షేత్రంగా మారిందని చెబుతారు. భక్తిఉద్యమ కాలంలో ఉన్న వల్లభాచార్యుని పుష్టి సంప్రదా యానికి ఇది కేంద్రమయింది. అప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన చిత్రకళా సంప్రదా యంకూడా కొనసాగుతూ వస్తున్నది. దీన్ని పిచ్వాయి లేదా నాథ్ద్వారా కళగా పిలుస్తున్నారు. ఈ కళలో పెద్ద కండ్లు, వెడల్పైన ముక్కు, భారీ శరీరం ముఖ్య లక్షణాలుగా ఉంటాయి.
కాలాన్ని, పండుగను బట్టి ఈ పెయింటింగ్స్ ను మార్చడం ఇక్కడి ప్రజ ల ఆచారం. కాబట్టి ప్రజల అభిరుచిని బట్టే కళాకారులు కూడా పెయింటింగ్స్ని కాలానుగుణంగా వేస్తారు. ఉదాహరణకు వేసవి కాలంలో పింక్ లోటస్ పెయింటింగ్స్కి డిమాండ్ ఉంటుంది. శరధ్ పూర్ణిమ నాడు రాత్రి సమయంలో కనిపించే పున్నమి చంద్రుని పెయింటింగ్కు డిమాండ్ ఉంటుంది. రాసలీల, హోలీ, అన్నకూట్ (గోవర్ధన్ పూజ) వంటి పండుగల సందర్భంగా మరికొన్ని ప్రత్యేక పెయింటింగ్స్ని ఈ కళాకారులు వేస్తారు.
పెయింటింగ్స్పై కొన్నిసార్లు ఎంబ్రాయిడరీ లేక ఏప్లిక్ వర్క్ను ఉపయోగిస్తారు. చిత్రాలకు మంచి డార్క్ బోర్డర్స్ గీస్తారు. ఇక బొమ్మలకు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు వంటి కొట్టొచ్చినట్లు ఉండే రంగులను వాడుతారు. స్వచ్ఛమైన బంగారం నుంచి రంగును తయారుచేసి దానితో బొమ్మలను అలంకరిస్తారు.
చాలా సమయం కావాలి
ముందుగా పరచిన వస్త్రంపై రఫ్గా గీయవలసిన బొమ్మ స్కెచ్ వేస్తారు. ఆ తరువాత రంగులను నింపుతారు. సహజమైన కలర్స్నే ఎక్కువగా వాడుతారు. అట్లాగే బొమ్మలు వేయడానికి, రంగులు అద్దడానికి గుర్రం, మేక, ఉడుత వెంట్రుకలతో తయారైన కుంచె (బ్రష్)లను వాడుతారు. ప్రస్తుతం తొందరగా బొమ్మలు వేయడానికి పనికివచ్చే చవకబారు బ్రష్లను కూడా కళాకారులు వాడుతున్నారు. సహజ రంగులతోపాటు బంగారాన్ని పెయింటింగ్స్ కోసం వాడటం వల్ల వాటి విలువ బాగా పెరుగు తున్నది. ఒక పెయింటింగ్కు సరిపడ బంగారం నుంచి కలర్ని తయారుచేయడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది.
దేవుని వెనుక గోడపై అలంకరించే పిచ్వాయి పెయింటింగ్ను వేయడానికి కొన్ని వారాల నుంచి నెలల కాలం పడుతుంది. ధనిక కుటుంబాలు దేవాలయాల కోసం ఇటువంటి పెయింటింగ్స్ని తయారుచేయిస్తాయి. ఇటువంటి ధనికులు మధ్యలో దేవుని బొమ్మ వేయించి ఇరువైపుల తమ బొమ్మలను చిత్రింపచేసుకుని దేవునికి సమర్పించడం కనిపిస్తుంది.
సామాన్య భక్తులు గుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి దర్శించుకున్న తరువాత శ్రీనాథ్జీ రూపాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి అనుగుణంగా కళాకారులు చిన్న పిచ్వాయి పెయింటింగ్స్ను సిద్ధం చేస్తారు.
పెద్ద పెద్ద భవంతులపై రంగులతో కళాకారులచేత బొమ్మలు వేయించే కార్యక్రమం ప్రతి ఏడాది ఉంటుంది. ఏడాదికి ఒక సారి ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సందర్భంగా గోడలకు సున్నం కొట్టించి కొత్తగా కళాకారుల చేత బొమ్మలు వేయిస్తారు. ఈ విధంగా చిత్రాలను పెద్ద ఎత్తున తమ ఇల్లు, దేవాలయాల్లో వాడటం ద్వారా నాథ్ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలవారు చిత్రకారులకు చేతినిండా ఎప్పటికీ పని ఉండేలా చేస్తున్నారు. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి కళలూ మనుగడ సాగిస్తాయని చెప్పడానికి నాథ్ద్వారా కళ ఒక ఉదాహరణ.
-మౌక్తిక్
Authorization