మనిషి జీవితంలో పుట్టుక, చావు రెండూ అత్యంత ముఖ్యమైనవి. మిగతా సమాజాల్లో ఉన్న ఆచారాలు ఎట్లా ఉన్నా మన తెలుగువారు మాత్రం ఈ రెండు సందర్భాల్లోనూ మైలను పాటిస్తారు. అతి ముఖ్యమైన ఈ సందర్భాలలో కొన్ని రోజులపాటు సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే! పిల్లో, పిల్లవాడో పుట్టిన తర్వాత కొన్ని రోజులపాటు ఆయా కులాలు, మతాలను బట్టి ఒక్కో కుటుంబం ఒక్కో విధంగా మైల పాటిస్తారు. అంటే బిడ్డ పుట్టిన కుటుంబీకులు నిర్దిష్టంగా తమ ఆచారం ప్రకారం ఇన్ని రోజులని నిర్ణయించుకుని అన్ని రోజులూ పండుగలూ పబ్బాలు, ఇతర శుభకార్యాలలో పాల్గొనరన్నమాట. మైల స్నానాలు అయిన తర్వాతే అందరిలా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కనిపిస్తుంది. అట్లాగే కుటుంబంలో ఎవరైనా చనిపోయినా నిర్దిష్టమైన రోజులపాటు మైలను పాటిస్తారు. అయితే ఈ మైల సాంప్రదాయం శూద్రులకన్నా ద్విజుల (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ) లో ఎక్కువ ఆంక్షలు, ఆచార సంప్రదాయాలను కలిగి ఉంటుంది. సాధారణంగా హిందు కుటుంబాలలో ఎవరైనా ఒక మనిసి చనిపోతే ఏడాదిపాటు ఆ కుటుంబం మైల పాటిస్తుంది. అయితే హిందువుల్లోనే తలెత్తిన కొన్ని ప్రత్యామ్నాయ సంప్రదాయాలు కొందరికి యేడాది కాలం పూర్తికాకుండానే మైల నుంచి విముక్తి కలిగిస్తుంటాయి. అటువంటి సంప్రదాయం ఒకటి జక్కేపల్లి జాతరలో కనిపిస్తుంది.
సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం రెవెన్యూ పరిధిలోని వల్లాపురం గ్రామంలో పార్వతి సమేత బాల కోటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం మూడు వందల ఏళ్ల క్రితం నాటిదంటారు. ఇక్కడ జరిగే జాతర ఖమ్మం జిల్లా జక్కేపల్లి, సూర్యాపేట జిల్లా వల్లాపురం, అనంతగిరి మండలం చనుపల్లి గ్రామాల పరిధిలో ఉండడంతో ఈ మూడు గ్రామాల పేర్లతో ఈ జాతరను పిలుస్తుంటారు. ఈ జాతర ఐదురోజులపాటు అశేష భక్త జన సందోహం నడుమ అత్యంత ఘనంగా జరుగుతోంది. తొలి రోజు తెల్లవారుజాము నుండే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం ఐదు గంటల సమయంలో జక్కేపల్లి గ్రామంలో దేవుని ఊరేగింపు జరుగుతుంది. రెండవ రోజు వల్లాపురం గ్రామంలో, మూడవ రోజు అనంతగిరి మండలం చనుపల్లి గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. ఇలా మిగిలిన నాలుగు ఐదు రోజులలో కూడా ఇక్కడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జాతరకు ఖమ్మం, నల్గొండ, భద్రాచలం, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు.
ఈ ప్రాంతంలో ఒక శివరాత్రి నుంచి మరోశివరాత్రి మధ్య కాలంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఈ దేవాలయం దగ్గర జరిగే జాతరకు వచ్చి మైల తీర్చుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతున్నది. ఈ దేవాలయం పక్కన పాలేరు ప్రవహిస్తుండడంతో మైలలో ఉన్న కుటుంబీకులు తమ మైల తీర్చుకోవడానికి అనువైన స్థలంగా దీనిని భావించి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏటిలో మైల పడిన కుటుంబ వంశస్థులు అంతా తలస్నానాలు చేస్తారు. అలాగే తమతోపాటు తీసుకువచ్చిన వీరుల (పితృదేవతల) పెట్టెను, అందులో ఉన్న కొరడాను, పాదుక (చెక్క పాదాలు)లను, కత్తుల (ఆయుధాలు)ను కడిగి పసుపు కుంకుమలు అద్దుతారు. చనిపోయినవారి ఫొటోలను కూడా వీటితోపాటు పూజించి పిండిప దానం చేస్తారు. ఒక ఇంటిలో పెండ్లి కాకుండా మరణించినవారిని వీరునిగా భావించి .ఊజించడం ఈ ప్రాంతంలో ఉన్న ఆచారం. అయితే ఇది ద్విజులలో కనిపించే ఆచారం కాదు. కేవలం శూద్రులలో మాత్రమే కనిపిస్తుంది.
చనిపోయినవారికి తీరని కోర్కెలు ఉంటాయని, అవి తీరకుండా చనిపోయినందున వారు అవి తీరేవరకు తమ చుట్టూనే తిరుగుతుంటారని కుటుంబ సభ్యులు నమ్ముతారు. అలా తమ చుట్టూ తిరుగుతున్నవారి ఆత్మలను పరలోకానికి పంపాలంటే వారికి ఇష్టమైన ఆహారం, పానీయాలు, మద్యం, మాంసం వంటివాటిని సమర్పించడం ఒక్కటే మార్గమని ఇక్కడివారు నమ్ముతారు. అందుకనే మైల తీర్చుకోవడానికి వచ్చినవారు మరణించినవారికి పిండ ప్రదానం చేసిన తర్వాత దైవదర్శనం చేసుకుని, మరణించినవారికి ఇష్టమైన వంటకాలు చేసి, మద్యం, మాంసంతో పాటు సమర్పిస్తారు. మైల తీర్చుకునే తంతులో సాతానులు, బైండ్లవారు పూజారులుగా వ్యవహరిస్తారు. అయితే కొందరు బ్రాహ్మణులను కూడా పిలిచి పిండ ప్రదానం చేయిస్తున్నారు.
ఇది ప్రత్యామ్నాయ సంస్కృతి
హిందు మతం చాలా ఆంక్షలు, సంప్రదాయాలతో కూడుకున్నది. దయ, దాక్షిణ్యాలు లేకుండా ఆచార, సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటించ మంటుంది. వీటిని భరించలేక బౌద్ధం, జైనం వంటి కొత్త మతాలు పుట్టుకు వచ్చాయి. ఆ తర్వాత విదేశాల నుంచి కొత్త మతాలు వ్యాపించి హిందువులు చాలామంది అన్యమతాలలోకి మారిపోయారు. ఈ పరిస్థితుల్లో హిందుమతంలోనే పునరుజ్జీవనం తీసుకురావడానికి సంస్కర్తలు బయలుదేరారు. వీళ్లు సాగించిన ఉద్యమాన్నే 'భక్తి ఉద్యమం' అంటారు. వీరు హిందు మతంలోనే ప్రత్యామ్నాయ సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. భక్తి ఉద్యమకారుల బోధనలు, నియమాల వల్ల శైవులు, వైష్ణవుల్లో కొత్త చైతన్యం వచ్చింది. అంటరానితనాన్ని వీరు ఎండగట్టారు. నిమ్నకులాలవారిని మత ప్రచారానికి, పూజాదికాలు నిర్వహించడానికి నియమించారు. అలా నియమితులైనవారిలో ఒకరు సాతానులు. భక్తి ఉద్యమకారుల ప్రబోధాలు హిందుమత సంప్రదాయాలను సడలించాయి. అటువంటివాటిలో ఈ మైల పోగొట్టుకునే తంతుకూడా ఒకటై ఉండాలి. ఏడాది కాలం పాటు ఏ పండుగ, పబ్బం లేకుండా భక్తిపరమైన, ఇతర శుభకరమైన కార్యక్రమాల నుంచి నిషేధిస్తున్న మైల సంప్రదాయాన్ని సాతానులు సడలించారు. ఈ శివరాత్రి నుంచి వచ్చే శివరాత్రివరకు ఉన్న కాలంలో ఎవరు, ఎప్పుడు మరణించినా... వచ్చే శివరాత్రి రోజున మైలను వదిలించుకునే అవకాశం కల్పించారు. ఈ వెసులుబాటువల్ల పనీపాట చేసుకుని బతికే చాలామంది సూద్ర కులాలవారు నెల, రెండు నెలల్లోనే మైలను వదిలించుకుని స్వేచ్ఛగా ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొని ఆర్థిక వ్యవస్థలో తమ వంతు పాత్ర నిర్వహించే అవకాశం కలిగింది. నమ్మకాలను పూర్తిగా వ్యతిరేకిస్తే ప్రజామోదం ఉండదని ఇటువంటి సడలింపులను ప్రవేశపెట్టారు భక్తి ఉద్యమకారులు.
వీరుల పూజ ఏమిటి?
తెలుగు రాష్ట్రాల్లో వీరశిలలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వీర శిలలకు చాలా చరిత్ర ఉంది. పూర్వం గ్రామాలు తక్కువ, అడవులు ఎక్కువగా ఉండేవి. అలాగే రాజులు, సామంతుల చేతుల్లో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. తరచుగా ఈ రాజులు, సామంతుల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. అలాగే భూస్వాముల మధ్య కూడా కొట్లాటలు జరుగుతూ ఉండేవి. యుద్ధాల కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేవారు. తమ గ్రామం కోసమో, వంశ ప్రతిష్ట కోసమో యుద్ధం చేస్తూ మరణించిన వారి శిలను చెక్కించి గ్రామం మధ్యలో పెట్టి పూజ చెయ్యటం ఒక ఆచారంగా వస్తూ ఉంది. అప్పట్లో బాగా అడవులు, గడ్డి భూములు ఉండేవి కాబట్టి క్రూర మృగాలు తరచుగా గ్రామాలపై బడి పశువులను, జనాన్ని చంపి తినేస్తూ ఉండేవి. ఇలా గ్రామాలపై దాడి చేసిన క్రూర మృగాలతో పోరాడుతూ మరణించిన వారి శిలలను కూడా ప్రతిష్టించి పూజించడం ఆచారమయింది. అడవుల్లో మేతకు వెళ్ళిన పశువులను క్రూర మృగాల నుంచి రక్షించే క్రమంలో మరణించిన వారికి కూడా వీరశిలలు వేసేవారు. ఇలా ప్రతిష్టించిన శిలలనే వీరశిలలు అని పిలుస్తున్నారు. ఈ వీర శిలలు ఎన్నుంటే ఆ వూరు అంత పౌరుషవంతులున్న వూరని అర్థం. తెలంగాణలో ఎన్నో గ్రామాల్లో వీర శిలలు ఉన్నాయి. వీటి గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని ఊళ్ళకు వీరుల శిలలు ఉన్నందున అంతకు ముందున్న పేర్లు మాయమై కొత్త పేర్లు పుట్టుకొచ్చాయి. ఈర్లదిన్నె, ఈర్లపాడు వంటి గ్రామాల పేర్లు ఈ విధంగా వ్యవహారంలోకి వచ్చినవే.
తమ వంశంలో ఎవరికైనా వీర శిలను వేస్తే ఆ వంశంలోని వారంతా శిలారూపంలో ఉన్న ఆ వీరుణ్ణి దేవునిగా కొలుస్తారు. అలా వాళ్లను కొలవడానికి ఊళ్లో ఉన్న ఆ వంశస్థులు వీరకొలుపులు కొలిచి నీరాజనం అర్పిస్తారు. ఇది మన పల్లె సీమల్లో తరతరాలుగా కనిపిస్తున్న ఆచారమే. కానీ జక్కేపల్లి జాతరకు వచ్చి మైలలు తీర్చుకునేవారు పెండ్లి కాకుండా చనిపోయినవారిని వీరులని భావిస్తూ పూజలు చేయడం కనిపిస్తుంది. వీరులన్నాక కత్తులు, కఠార్లు, కొరడాలు వంటివి ఉంటాయి కాబట,ి్ట వాటిని పెట్టెలో ఉంచి భద్రపరుస్తూ... మైలలు తీర్చే సందర్భంలో ఆ పెట్టెను కూడా చనిపోయిన ఇతర పితృదేవతలతో పాటు పూజించడం కనిపిస్తుంది. మరి చెక్కతో చేసిన పాదాలు దేనికి సంకేతం? పెద్దవారి అడుగు జాడలకు గుర్తుగా వాటిని భావిస్తారా... గుంజేడు ముసలమ్మ జాతరలోను, మరి కొన్ని చోట్ల పాద రక్షలు, చెక్క పాదాలతో దైవ దర్శనానికి వచ్చిన భక్తుల వీపుపై కొట్టడం కనిపిస్తుంది. ఇలా ఎందుకు కొడతారని అడిగితే... దెయ్యాలు, భూతాలు, గాలి వంటివి ఉంటే ఇలా కొడితే వదిలిపోతాయని అక్కడి పూజారులు అన్నారు. బహుశా ఈ చెక్క పాదాలను వీరుల పెట్టెల్లో ఉంచితే ఏ గాలీ ఆ కుటుంబాన్ని దరిచేరదనే నమ్మకం కాబోలు!
-డేగల వెంకటేశ్వరరావు; నవతెలంగాణ, నేలకొండపల్లి
Authorization