బుడిగె జంగాల వారు సంచార జీవనం గడిపే జాతుల కిందకి వస్తారు. వీరు చెప్పే కథలు బుర్రకథ వంటి కొత్త కళారూపాలకు ప్రాణం పోశాయి. భారతీయ మత, సాంస్కృతిక రంగాల్లో ముఖ్యపాత్ర పోషించిన బుడిగె జంగాల మూలాలు గురించి అనేక ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి పేరుకు పౌరాణిక కథలే కావచ్చు కానీ ఇందులో నిగూఢంగా జంగాల మూలాలు దాగి ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే కానీ వీరి సంస్కృతిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అప్పుడే వెనుకబడిన వారి అభివృద్ధికి తగిన విధమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
భారత ఉపఖండం మొత్తం రామయణ, భారత, భాగవత ప్రభావం పడని ప్రాంతాలు కనిపించవు. అత్యంత ప్రాచీన కాలం నుంచి 21 వ శతాబ్దం వరకు జరిగిన అనేక పరిణామాల తర్వాత కూడా ఈ ఇతిహాసాలు, పురాణ ప్రభావం భారతీయ జీవనంపై కొనసాగుతూనే ఉంది. స్త్రీలు పాడుకునే కలుపు పాటలు, రోకటి పాటలు, పెండ్లి పాటల్లోనూ, పురుషులు పాడుకొనే శ్రామిక వ్యవసాయ గీతాల్లో నూ, అనేక ఇతర జానపదుల కళారూపాల్లోనూ... ఒకటేమిటి అనేక ఆట, పాటుల, కళారూపాల్లో రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల ఇతివృత్తాలే కనిపిస్తాయి. జానపద కళాకారులైన బుడిగె జంగాలు చెప్పే కథలు, గాథలు ఇందుకు మినహాయింపు కాదు.
'బుడిగె' అనే వాద్యాన్ని ఉపయోగించి తందానా కథలు చెప్పే వీరికి 'బుడెగ జంగాల'ని పేరు వచ్చిందంటారు. బుడిగె పదమే తర్వాత కాలంలో 'బుడగ' బుడ్గగా ప్రచారంలోకి వచ్చిందనేది పండితాభిప్రాయం. 'జంగమ' అంటే ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండనివారని అర్థం. భక్తి ఉద్యమములో వచ్చిన సాహిత్యంలో 'శివున్ని' జంగమదేవరగా వర్ణించారు. శివుడు సంచారి. సంచార జాతులకు, ఆటవిక జాతులకు, అట్టడుగువారికి ఆరాధ్యుడు. శైవమత ప్రచారమే ముఖ్య ఉద్దేశ్యంగా జరిగిన భక్తి ఉద్యమంలో పెద్దఎత్తున ముందుకు దూసుకువచ్చినవారే ఈ జంగాలు. వీరిని.గణాయత జంగాలు, స్థావర జంగాలు. అని రెండు రకాలుగా విభజిస్తారు. గణాయత జంగాలు సంచార జీవితాన్ని గడుపుతారు. స్థావర జంగాలు ఒకే చోట స్థిర నివాసం కలిగి ఉంటారు. కథలు గానం చేయడం బుడిగె జంగాల ప్రధాన వృత్తి అయినప్పటికీ... చాపలు అల్లటం, వేటాడటం వీరి ఉపవృత్తులు. బుడిగ జంగాలు చెప్పే కథలు రెండు మూడు గంటల్లో ముగిసిపోయేవే కాదు.. రెండుమూడు రోజుల సమయం పట్టేవి ఉంటాయి.
కాల్పనికత వెనుక దయాదాక్షిణ్యాలు
బుడిగ జంగాలు చెప్పే కథల్లో ఇటీవల స్థానిక ఉద్యమకారుల జీవిత గాథల నుంచి కాటమరాజు, సదాశివరెడ్డి, సర్వాయి పాపడు, బుడ్డా వెంగళరెడ్డి వంటి చారిత్రక వ్యక్తుల వీరగాథల వరకు ఉన్నాయి. ఆరె మరాఠీలు, కాంభోజరాజు, బాలనాగమ్మ లాంటి జానపద ఐతిహ్యాలు ఉన్నాయి. గాంధారి కథ, జరాసంధుని కథ, నరకాసురుని కథ, నలచక్రవర్తి, బబ్రువాహన, మాంధాత ఇలాంటి పౌరాణిక గాథలను బుడిగ జంగాలు జనరంజకంగా చెప్పి అలరిస్తారు.
బుడిగ జంగాలు చెప్పే కథల్లో నైన, ఇతర జానపద వృత్తిగాయకులు చెప్పే కథల్లోనైన రామాయణ, భారత, భాగవతాల్లోని అంశాలు యధాతథంగా రావు. వారి వారి పరిసరాలకు అనుగుణంగాను, వారి వారి స్థాయికి అనుగుణంగాను తగినన్ని మార్పులను, కూర్పులను, చేర్పులను చేసుకొని వాస్తవిక రీతిలో ఆత్మీయత ఉట్టిపడుతున్నట్లుగా ఉంటాయి. వారి వారి కోపతాపాలను దయాగుణాలను ప్రతిఫలింపచేస్తూ ఉంటాయి. అందుకే సీతమ్మవారి పట్ల జాలిని కురిపించి సానుభూతిని ప్రకటిస్తారు. అగ్ని ప్రవేశం చేయమని, అడవులకు వెళ్ళమని ఆదేశించిన రాముని పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు.. కథను రంజింపచేయడానికి, ప్రజలలో మానవీయ గుణాల్ని ప్రోదిచేయడానికి, శ్రీరాముడు సీతను అడవికి తీసుకెళ్ళి తలను ఖండించమని ఆజ్ఞాపించినట్లు చిత్రిస్తారు. ఆ సంగతి సీతకు అయోధ్యలోనే తెలిసినా తప్పించుకోకుండ ధైర్యంగా లక్ష్మణుని వెంట అడవికి వెళ్ళు తుంది. రాజాజ్ఞకు బద్ధుడై లక్ష్మణుడు సీతను సంహరించడానికి కత్తి ఎత్తి చేతులు రాక మూర్ఛిల్లి లేచి సీతను అడవిలోనే వదలిపెట్టి, జింక కనుగుడ్లను ఆనవాలుగా రామునికి చూపిన లక్ష్మణుని చాతుర్యం వాల్మీకి రామాయణంలో కనిపించదు. ఇది బుడిగె జంగాల సొత్తు.
అడవిలో వదిలివేయబడిన సీత ఒంటరిగా ఆ జంతువుల మధ్యనే 'కుశున్ని' కంటుంది. ఆ పసిబిడ్డను ఎత్తుకొని వాల్మీకి దగ్గరకు వెళ్తుంది. జానపదుల వాల్మీకి పరివారంతో కూడిన తపస్సంపన్నుడైన మహర్షి కాదు. ఒక సాధారణుడైన కండ్లు కనిపించని ముదుసలి. అయితే ముదుసలికి శక్తి లేదని కాదు. సీత స్నానానికి వెళ్తూ అక్కడి కోతులు తమ పిల్లల్ని ఒడిలో దాచుకోవడం గమనించి సీత ఆశ్రమనాకి తిరిగివచ్చి నిద్రిస్తున్న వాల్మీకిని లేపి చెప్పకుండా కుశున్ని తీసుకొని స్నానానికి పోతుంది. నిద్ర లేచిన వాల్మీకి ఊయలలో శిశువు కనిపించకపోవడం గమనించి తన యద మీద మట్టి తీసి, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఊయలలో పడుకోబెడతాడు. కుశునితో కూడి సీత ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు జరిగిన విషయమంతా తెలుస్తుంది. విధి సంకల్పం ఈ రీతిగా ఉందని చెప్పి, అలా పుట్టిన బాలునికి 'లవుడు' అని పేరుపెట్టి పెంచుకున్నారు.
అడవిలో సీతమ్మ కష్టాలకు తానే కారకుడ్నయ్యానని కుమిలిపోయాడు లక్ష్మణుడు. ఆమెకు ఎట్లాగయినా సాయం చెయ్యాలని బుడిగ జంగం వేషంలో వెళ్తాడు. ఇలా వేషం కట్టి వెళ్ళి తల్లి బిడ్డలకు కావలసిన మందులు, ఇతర వస్తువులు, అందించి వచ్చిన మానవతా మూర్తి లక్ష్మణుడు.
ఈ బుడిగ జంగాలు యక్షగాన రచనలను, తందాన కథలను భాగోతాలుగా ప్రదర్శిస్తారు.ఇందుకు ఉదాహరణలుగా మైరావణ చరిత్ర, శతకంఠ రామాయణం, సుగ్రీవ విజయం, ప్రహ్లాద చరిత్ర, బాణాసుర వధ, మొదలైనవి చెప్పుకోవచ్చు. హరిశ్చంద్రుని కథలో సత్యం కోసం హరిశ్చంద్రుడు తనకు తాను వీరబాహునికి అమ్ముడుపోతాడు. వీరబాహుడు బుడిగ జంగమే. ఈ బుడిగ జంగమే కాటికాపరి.
ఈ విధంగా పౌరాణిక మూలాలను ఆలంబనగా చేసుకొని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వాటితో సంబంధం పెట్టుకొని తమ పరిస్థితులకు, స్థాయికి, మనస్తత్వానికి, రాగద్వేషాలకు అనుగుణంగా కథలను, పాటలను కల్పించుకొని పాడి జనాన్ని రంజింపచేస్తారు.
- యాదయ్య
Authorization