ఓరుగల్లు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన, చారిత్రకమైన నగరం. శిల్పకళా వైభవానికి నిలువుటద్దం. జిల్లాలో ఎక్కడ చూసినా కాకతీయుల కళా సంపదనే దర్శనమిస్తుంది. నగరంలో ఉన్న ఓరుగల్లు ఖిల్లా, వేయిస్తంభాల గుడి, భద్రకాళీ దేవాలయంతో పాటు రామప్ప ఆలయం, ఓరుగల్లు కోటలు, లక్నవరం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. నాటి శిల్పకళను చూడటానికి విదేశీయులు సైతం క్యూ కడతారంటే దాని గొప్పతనం ఏంటో అర్ధమవుతుంది. అందుకే ఈ నగరం భారతదేశంలోనే హెరిటేజ్ సిటీల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ వైభవం చరిత్ర పుటల్లో నిల్చిపోయింది. రాష్ట్ర అధికారిక చిహ్నంలో సైతం కాకతీయ తోరణం ప్రత్యేక ఆకర్షణ. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఓరుగల్లు టూరిస్టులకు స్వర్గథామం! మనకు తెలిసిన ప్రాంతమే అయినా తెలియని సంగతులు అనేకం. అందుకే తెలుగువారు, ప్రత్యేకించి తెలంగాణ వారు ఓరుగల్లు ప్రాంత పర్యాటక కేంద్రాల్ని సందర్శించాలి. అప్పుడే తెలంగాణ చారిత్రక వారసత్వం ఉదాత్తత ఏమిటో తెలుస్తుంది.
పెంబర్తి హస్తకళాలు...
కాకతీయుల కళాతోరణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓరుగల్లులో ఉన్న శిల్పకళ ఓ ఎత్తైతే కాకతీయుల కీర్తిని ప్రపం చానికి చాటి చెప్పిన కళాతోరణం మరో ఎత్తు. కాకతీయుల చిహ్నంగా గుర్తింపు పొందిన కీర్తి తోరణం ఖండాంతరాల్లో ఖ్యాతి గడిచింది. వరంగల్ నగరానికి నలుదిక్కుల స్వాగతం పలుకు తోంది. కాకతీయ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీల ముందు ప్రత్యేక శోభలతో కళాతోరణం ఆకట్టుకుం టుంది. భూపాల పల్లి, సింగరేణి కార్మికుల శ్రమకు చిహ్నంగా వారి గుండె ధైర్యానికి మనోరూపంగా నిలిచింది. కాకతీయుల కీర్తి తోరణానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు పెంబర్తి హస్తకళాకారులు. వీరి హస్తకళా నైపుణ్యంతో కాకతీయుల కీర్తి నలువైపుల ఖండాంతరాలకు వ్యాపించింది. 60 ఏండ్ల రాష్ట్ర పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో సగర్వంగా కాకతీయుల కీర్తి చోటు దక్కించుకుంది.
ఓరుగల్లు ఖిల్లా...
రాజులు పోయారు... రాజ్యాలు పోయాయి... కానీ అప్పటి చరిత్రను చూపించే కట్టడాలే మిగిలాయి. వరంగల్ జిల్లా కోటకు ఎంతో చరిత్ర ఉంది. కాకతీ యులు నిర్మించిన ప్రతి కట్టడానికి ఎంతో విశిష్టత ఉంది. వరంగల్లు, ఓరుగల్లు లేదా ఏకశిలానగరం అంటారు. క్రీ.శ.12 వ శతాబ్దంలో కాకతీ యుల రాజధాని నగరం. ఈ కోటను రుద్రమదేవి పరి పాలన కాలంలో పటిష్టంగా నిర్మిం చారు. వలయాకారంలో ఉన్న ఈ ప్రాచీన నగరానికి మూడు వరుసలలో కోట గోడలున్నవి. వెలుపలి మట్టికోట 12.5 కి.మీ. వ్యాసం కలిగి ఉంది. దీని అవశేషాములు ప్రస్తుతం వరంగల్లు పట్టణం చుట్టూ అక్కడక్కడ నామమాత్రంగా కనిపిస్తాయి.రెండవ కోట మట్టితో నిర్మితమై 7.2 కి.మీటర్ల పరిధి లో ఉంది. ఈ కోట చుట్టూ రాతితో కట్టిన ప్రవేశద్వారాలుంటాయి. లోపలి కోట మధ్యభాగాన నాలుగు ఉన్నత రాతిశిలతోరణంతోనున్న స్వయంభూదేవాలయం ఉన్నది. తొలి మధ్యయుగకోటల వాస్తుశైలిని ప్రతిబింబిస్తాయి.
వేయిస్తంభాల గుడి...
వరంగల్ అద్భుతమైన శిల్ప సంపదకు నెలవైన ప్రాంతం. ఇక్కడి కోట గోడలే కాదు దేవాలయాలు చరిత్రను చెబుతాయి. అందమైన శిల్పాలతో అంతకు మించిన ఆర్కిటెక్చర్ నైపుణ్యంతో ఆకట్టుకుంటాయి. భారతీయ దేవాలయాల్లో ఓ ప్రత్యేకత కలిగిన దేవాలయం. అద్భుతమైన శిల్ప సంపదకు, ఆర్కిటెక్చర్ విన్యాసానికి ఆలవాలమైన దేవాలయం. ఒక్క ఇటుక వాడకుండా మొత్తం రాతి స్తంభాల ఆల్లికతో నిర్మించిన దేవాలయం. ఈ దేవాలయాన్ని 1163 వ సంవత్సరంలో కాకతీయ రాజులు ఒకటవ రుద్రరాజు నిర్మించాడనే శాసనాలు ఆలయంలో కనిపిస్తాయి.
అయితే ఇప్పటి వరకు సరిగా ఇన్ని స్తంభాలు అని ఎవరు లెక్కబెట్టలేదు. గుడి మొత్తం స్తంభాలతో ఉండటంతో చేత వేయిస్తంభాల గుడి అని చేప్పుకునేవారట. దీన్నె కాలక్రమంగా వాడుకలో వేయిస్తంభాల గుడిగా పిలవడం ప్రారంభించారు. గుడి లోపల చిన్నవి, పెద్దవి లెక్కకు మించి నల్లచలువరాతి స్తంభాలు కనిపిస్తాయి. వేయిస్తంభాల గుడిని నక్షత్రాకారంలో, త్రికోణాకారంగా నిర్మించారు. కాకతీయులు మొట్టమొదట నిర్మించిన దేవాలయంగా కూడా దీనికి గుర్తింపు ఉంది. దీని పై నుంచి చూస్తే నక్షత్రాకారంలో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని త్రీకోణాలయంగా కూడా పిలుస్తారు. కానీ అన్ని దేవాలయల కంటే భిన్నంగా ఇది నిర్మాణ విశిష్టతతో ప్రసిద్ధిగాంచింది. మెట్ల దగ్గర నుంచి గోడల వరకు సందు లేకుండా చెక్కిన శిల్ప సంపద కండ్లు తిప్పుకోనివ్వదు. వేయిస్తంభాల గుడిని నిర్మించడానికి 72 సంవత్సరాలు పట్టిందట. అంతే కాదు ఇటీవల పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో ఓ ఆశ్చర్యకర విషయం బయట పడింది. ఇది మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభ, ఆర్చిటెక్చర్ నైపుణ్యాన్ని మరోసారి రుజువు చేసిందని నిపుణులు చెబుతున్నారు.
భద్రకాళీ ఆలయం...
ఏకశిల తోరణాలు ఎంత ప్రాముఖ్యతో, ఏక శిలతో చెక్కిన భద్రకాళీ అమ్మావారిది అంతే ప్రాముఖ్యత. వరంగల్ నుంచి హన్మకొండ వెళ్లే దారిలో ఎత్తైన గుట్టల మీద కనిపిస్తుంది భధ్రకాళీ ఆలయం. ఆలయానికి ఒకవైపు చెరువు, మరోవైపు అద్భుతమైన పచ్చని ప్రకృతి ప్రశాంతమైన వాతావరణం సందర్శకులను సేదతీరుస్తాయి. దేశంలోనే కలకత్తా కాళీమాత తర్వాత అంతటి విశిష్టతను కలిగిందీ భద్రకాళీ ఆలయం. ఈ ఆలయాన్ని క్రీ.శ.625 వ సంవత్సరంలో రెండవ పులకేశి నిర్మించారని చరిత్ర చెబుతుంది. చాళుక్య సంప్రదాయంలో ఏఖండ శిల అంటే అఖండంగా ఉండే ఒకే శిలలో విగ్రహాలను చెక్కేవారట. అలా భద్రకాళీ అమ్మవారి విగ్రహం ఏఖండ శిలగా దర్శనం ఇస్తుంది. ఆలయ మూల స్తంభాలు చతురస్రాకారంలో కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన స్తంభాలు గుండ్రంగా, వర్తులాకారంలో కనిపిస్తాయి. కాకతీయ రాజులు భద్రకాళీ అమ్మవారిని ఇలవేల్పుగా కొలిచేవారు. దక్షిణాచార సంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అందుకే ఇక్కడ బలులు అర్పించడం నిషేధం. ప్రతి ఏటా నాలుగుసార్లు దేవి నవరాత్రులు ఘనంగా జరుపుతారు.
లక్నవరం...
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో కనిపించే ఆరు ద్వీపాలు, గల గల పారుతున్న సెలయేరు, పక్షుల కిల కిలలు, ఇవన్నీ చూసుకుంటూ చెరువు మధ్యలో కాలినడకన వేలాడే బ్రిడ్జ్పై వెళ్తుంటే కలిగే అనుభూతి అన్నింటి కన్నా భిన్నంగా ఉంటుంది. ఇక వీటికి తోడు బోట్లో షికారు కూడా మరో మధురజ్ఞాపకాన్ని మిగుల్చుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఇంత కన్నా ఏం కావాలి. ఎత్తైన కొండల మధ్య నిండు కుండలా కనిపిస్తున్నదే లక్నవరం చెరువు. గోవిందరావు పేట మండలం బుస్సాపూర్ గ్రామానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉంది లక్నవరం చెరువు. ఈ గ్రామం నుంచి ఘాట్ రోడ్లో వంకలు వంకలుగా తిరిగే దారి గుండా వెళ్తుంటే మట్టికోట లాంటి నిర్మాణానికి చెరుకోగానే ఈ చేరువు కనిపిస్తుంది. లక్నవరం చెరువు ను పదేండ్లకిందటి వరకు రహస్య చెరువుగానే పిలిచేవారు.
పచ్చటి దుప్పటి కప్పుకున్న కొండల మధ్య ఆరు ద్వీపాలు కనిపిస్తాయి. కాంక్రిట్ జంగిల్ లో బిజీ లైఫ్లో విసిగిపోయిన జనం కాస్త సేదతీరడానికి లక్నవరం చెరువు దగ్గరకు వస్తారు. ఇక్కడికి వస్తే ఎంతటి ఒత్తిడినైనా, ఎలాంటి బాధలనైనా ఇట్టే మరిచిపోవచ్చు. అంతటి ప్రశాంత వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో నిర్మించిన లక్నవరం చెరువుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ చెరువు టూరిస్టులను కనువిందు చేయడమే కాదు వ్యవసాయానికి కూడా నీళ్లు అందిస్తుంది. ఎత్తైన కొండలను ఆసరాగా చేసుకొని లక్నవరం చెరువును తవ్వించారు. తెలంగాణ టూరిజం శాఖ పర్యాటకుల కోసం ప్రత్యేక కాటేజీలను ఏర్పాటు చేసింది. లక్నవరం సరస్సులో చిన్న చిన్న ద్వీపాలు ఒక్కొక్కటి కిలో మీటరు నుంచి మూడు కిలో మీటర్ల పరిధిలో ఎంతో అందంగా కనిపిస్తాయి.
రామప్ప గుడి...
వైవిధ్యం మన సొంతం. అది భాష, ప్రాంతం, మనుషులు, కళలు కావచ్చు. ఎందులోనైన సరే వైవిధ్యం చూపించడం ఆ వైవిధ్యంలో అద్భుతాలు ఆవిష్కరించడం మన సొంతం. అందుకే వందల ఏండ్ల పూర్వం నుంచే మన దగ్గర ఆశ్చర్య పరిచే ఇంజనీరింగ్ ప్రతిభ, అబ్బుర పరిచే ఆర్కిటెక్చర్ నైపుణ్యం, అద్భుతమైన సృజనాత్మకత కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప గుడి. కాకతీయ రాజుల కట్టడాల్లో అద్భుతమైన దేవాలయం. గుడి కంటే గుడిలోని శిల్ప సంపద ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.
అంతే కాదు ఈ దేవాలయ ప్రత్యేకతల్లో మరో విశేషం గుడి కట్టించిన వారి పేరుతోనో, గుడిలోని దేవుడి పేరుతోనో గుడి ప్రాచుర్యం పొందకుండా గుడి నిర్మించిన శిల్పి పేరుతో ప్రాచ్యురం పొందడం. మరో విశేషం... ఇసుక రాతి మీద, నల్లచలువ రాతి, ఇసుక రాతిని కలిపి గుడి మొత్తాన్ని సహజ రంగుల క్షేత్రంగా చేయడం. గుడి మెట్ల దగ్గర నుంచి మొదలుకొని పై కప్పు వరకు ప్రతిచోట ఎన్నో శిల్పాలు. ఎంతో శిల్పకళ తల తిప్పుకోలేనంతగా ఆకట్టుకుంటాయి. వరంగల్ జిల్లా పాలంపేట గ్రామంలో 800 ల సంవత్సరాల క్రితం అంటే క్రీ.శ. 1312వ శకంలో ఈ దేవాలయన్ని నిర్మించారు. పచ్చటి ప్రకృతి ఒడిలో సువిశాలమైన ప్రాంతంలో ఇసుక రాతితో నిర్మించిన అద్భుతమైన కట్టడం. నిర్మాణంలో వినియోగించిన రాయితో పాటు ఆర్కిటెక్చర్ నైపుణ్యం, సూర్యకిరణాల రిఫ్లెక్షన్ టెక్నిక్ వల్ల సూర్యకిరణాలు ప్రతి నిమిషం నేరుగా గర్భగుడిలోకి పడతాయి. ఇంకా వరంగల్ ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.
- రూప
సెల్ నెంబర్ : 7661910634
Authorization