జీవితం చిన్నది ప్రపంచం విశాలమైంది ప్రపంచమంతా చుట్టి రావాలంటే ఒక జీవితకాలం సరిపోదేమో. కాని చూడాలన్న తపన ఉండాలి మొదట. గడప దాటి, ఊరు దాటి వెళ్ళాలని తపించాలి కొత్త ప్రదేశాలు చూడాలని, కొత్త మనుషుల్ని కలవాలని ఆకాంక్షించాలి పేటలు నడిచి, కోటలు దాటి నదీనదమ్ములు దాటి తిరిగి రావాలన్న కోర్కెతో రగిలిపోవాలి. ఉన్నచోటునే ఉండిపోతే నిలువనీరులా కంపు గొడతారు.ప్రవహిస్తేనే నదికయినా, మనిషకయినా నవ్యత.
ప్రయాణిస్తేనే మనిషి బతుక్కి ధన్యత. పర్యటిస్తేనే లోకం తెలుస్తుంది. ఇందుకోసమో ప్రణాళిక ఉండాలి. మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ఆ పైన ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాల గురించి అవగాహన ఉండాలి. మనిషి జీవించేది ఒకే ఒక్కసారి. మరల లేదు జీవితం. మరల రాదు బతుకు. అందుకే బతికి ఉన్నప్పుడే, కాలు కదపగలిగినప్పుడే లోకం చుట్టి రావాలి.
యాత్రంటే తీర్థయాత్రలు చేయడం కాదు. తిరుపతికో, యాదగిరిగుట్టకో పోయి రావడం కాదు.
చరిత్ర క్రమాన నిలిచిన ప్రదేశాల్ని చూడాలి. చరిత్రని సృజించిన పర్యాటక స్థలాల్ని చూసితీరాలి.
ఫలానా ప్రదేశం చూడకపోతే జన్మ వృధా అనిపించే ప్రదేశాల్ని చూసి తీరాల్సిందే. ఇలా చూడటానికి పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పర్యటించడం కోసమే కొంచెం అదనంగా సంపాదించాలి. పర్యటనల కోసమే కొంచెమైనా పొదుపు చేయాలి. రాష్ట్రం దాటి వెళ్ళాలి. దేశం దాటగలమా, దేశాలు తిరగ్గలమా అని సందేహాలుంటే కనీసం మన దేశంలో చూడదగ్గ ప్రదేశాలు చూసేందుకు ప్లాన్ చేయాలి.
ప్రపంచ వారసత్వదేశాలు
యునెస్కో వారు రూపొందించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో మన దేశానికి సంబంధించి 36 ఉన్నాయి. వీటిని చూడాలన్న పట్టుదల ఉండాలి. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ హోదా పొందిన ప్రదేశాల్లో చారిత్రక వారసత్వాన్ని, ప్రకృతిలోని రమ్యతను కాపాడటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఆ ప్రదేశాల ఔన్నత్యాన్ని ఇనుమడించేలా అన్నిరకాల ఏర్పాట్లు ఉంటాయి. అందుకని మన దేశంలో ఈ వారసత్వహోదా పొందిన 36 ప్రదేశాలు పర్యటిస్తే జీవితం ధన్యమైనట్టే.
తాజ్మహల్
మొదటగా మన దేశంలో 1983లో తాజ్మహల్, ఆగ్రాకోట, అజంతా, ఎల్లోరా గుహలని ప్రపంచ వారసత్వహోదాకు అర్హమైన ప్రదేశాలుగా గుర్తించింది యునెస్కో. వీటిని సందర్శించటం జీవితంలో మరపురాని అనుభవంగా మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రపంచంలో సరికొత్త ఏడువింతల స్థానంలో తాజ్మహల్ చోటు చేసుకుంది. కనుక తాజ్మహల్ని చూస్తే నేటి ఏడు వింతల్లో ఒకదానిని చూసిన అనుభూతి అయినా మిగులుతుంది. పాలరాతి కట్టడంగా, ప్రేమకు చిహ్నంగా పేరొందిన తాజ్మహల్ను దేశదేశాల వారు వచ్చి సందర్శిస్తున్నారు. మన దేశాన్ని సందర్శించే ఇతర దేశాల అగ్రనేతల పర్యాటక కార్యక్రమాల్లో తాజ్మహల్ సందర్శనం తప్పనిసరి భాగం. అందుకని తాజ్ని చూడటం మన ప్రాధాన్యాల్లో ప్రథమస్థానం ఉండాలి.
తాజ్ వైభవాన్ని వెన్నెల్లో చూస్తే మరింత బావుంటుంది. ఇప్పుడు రాత్రి సమయాల్లో అనుమతిస్తున్నారో లేదో గాని, అనుమతిస్తే మాత్రం వెన్నెల విరగకాసే రోజుల్లో తాజ్ని చూడాలి. మనిషిగా పుట్టినందుకు, ఈ అందమైన భూమ్మీద తిరుగాడుతున్నందుకు తాజ్మహల్ను చూడాలి. 'తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు' అన్నాడు శ్రీశ్రీ. ఆ కూలీల జన్మ ధన్యమైంది. వేలు, లక్షలుగా ఈ నిర్మాణాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం తరలి వస్తారని నాటి కూలీలు ఊహించి వుండరు. కానీ ఈ కట్టడం చూస్తుంటే ఆధునిక మానవుల శ్రమ సృజించిన గొప్ప అద్భుతంగా తోస్తుంది. అందుకని తాజ్ని చూడాలి. తాజ్ను చూడటానికి వెళ్ళినప్పుడే ఆగ్రాకోటను కూడా చూడాలి. తీరికగా రెండు మూడు రోజులు ఆగ్రాలోనే మకాం వేసి ఆ ప్రాంతాల్లో తిరగటం అపురూప అనుభవం.
మహాబలిపురం, కోణార్క
యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు పొందిన వాటిలో మహాబలిపురం ఒకటి. ఇక్కడి నిర్మాణ సమూహాలు ప్రత్యేక ఆకర్షణ. 'మహాబలిపురం మహాబలిపురం' అనే సినిమా పాట ఒకటి ఉంది. ఆ పాటని వింటూ చూస్తున్నప్పుడు మహాబలిపురం చూడాలనిపిస్తుంటుంది. అంతటి సుందరమైన శిల్ప సముదాయాల విహారస్థలి. 1984లో మహాబలిపురంతో పాటు కోణార్క్ సూర్యదేవాలయం కూడా యునెస్కో వారసత్వ హోదా గల ప్రదేశాలుగా గుర్తింపు నొందాయి. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. కోణార్క్ లోని శిల్పకళా వైవిధ్యం అపారమైంది. మరల మరల చూడాలనిపించే మహా సౌందర్యానికి కాణాచి. ఇక్కడ ఒకటీ రెండు రోజులు ఉండి చూస్తే మంచిది. ఇక్కడి సూర్యదేవాలయంలోని శిల్పకళా నైపుణ్యం చూపరుల్ని కట్టిపడేస్తుంది.
అజంతా, ఎల్లోరా గుహలు
షిరిడికి వెళ్ళిన వారు, సాయినాథుని దర్శించుకున్నాక వీటిని చూడటానికి వెళుతుంటారు. అయితే గంటో, అరగంటో చూస్తే సరిపోదు. ఒక్కో గుహల దగ్గర రోజంతా ఉండాలి. అందుకని ప్రత్యేకంగా అజంతా, ఎల్లోరా గుహల్ని చూడటానికి రెండు మూడు రోజులయినా కేటాయించుకోవాలి. ఆ నేల మీద నడయాడిన ఒకనాటి మనుషుల సృజనాత్మక జీవితంలోని ఔన్నత్యం ఏమిటో ఈ గుహల సందర్శనం ద్వారా ఆకళింపు చేసుకోగలుగుతాం. మనం ఉండకపోవచ్చు, కానీ మనం సృజించిన అక్షరాలు, చిత్రాలు, శిల్పాలు ఈ భూమ్మీద శతాబ్దాల పాటు నిలిచి ఉండటం అద్భుతం కదా. అలాంటి అద్భుతానికి మూలకర్తలైన వారి కళావిష్కరణల్ని చూడటం మన బాధ్యత. మనుషులుగా మనం ముందుతరాల వారికి ఏమివ్వగలమన్న ఆలోచన అజంతా, ఎల్లోరా గుహల్ని సందర్శిస్తే కలుగుతుంది. అందుకని ఈ ప్రాంతాలని ప్రత్యేకంగా పర్యటించాలి.
ఖజురాహో
1986లో ఖజురాహో నిర్మాణ సముదాయాలు, ఫతేపూర్ సిక్రిలకు యునెస్కో వారి వారసత్వహోదా లభించింది. స్త్రీ పురుషులు సమాగమానికి సంబంధించి భారతదేశం ప్రత్యేకమైంది. లైంగిక సంబంధాల సూత్రావళిని లిఖించిన వాత్సాయనుడు ఈ దేశానికి సంబంధించినవాడు. కామసూత్ర ప్రపంచానికి మనదేశం అందించిన కానుక. ఈ ప్రయత్నం మరే దేశంలో ఎవరూ చేయలేదు. అలాగే స్త్రీ పురుషుల కలయికని శిల్పకళా విన్యాసంతో ఆవిష్కరించి ప్రపంచానికి అందించిన ఖ్యాతి కూడా భారతదేశానిదే. ఇలాంటి మైథున శిల్పాల సముదాయం ఖజురాహోలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకని ఖజురాహోని చూడటం రసాత్మక అనుభవం. వెయ్యేళ్ళ కిందటనే మేను మేను కలయికలోని సౌందర్యాన్ని రాతి శిల్పాల్లో పొదిగిన భారతీయ శిల్పకళాకారుల ప్రజ్ఞని కని చిత్రపోతాం. అద్భుతమైన ఆర్కిటెక్చర్తో కూడిన శిల్పాలు, ఆలయాలు ఖజురాహోలో ఉన్నాయి. మూడు నాలుగు రోజులు తీరికగా చూస్తే, అక్కడి వింత సోయగాల్ని మనలో మధురోహల్ని నింపుతాయి.
హంపి వైభవం
విజయనగర రాజుల వైభవోపేత జీవనానికి ప్రతీక హంపి. అక్కడి శిథిలాల్లోనూ శిల్పకళ ఉట్టిపడుతుంది. 1986లోనే యునెస్కో వారి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు పొందింది ఈ పర్యాటక ప్రాంతం. గొప్ప చరిత్ర, శిల్పసంపద, ఆర్కిటెక్చర్, చక్కటి వాతావరణం కలగలసి వున్న హంపిని చూసి తీరాలి. కొడాలి సాంబశివరావు అనే కవి 32 సార్లు హంపిని సందర్శించారు. అద్భుతమైన కావ్యం రాశారు. చూసిన ప్రతి సారి కొత్తగా కనిపించడం హంపి ప్రత్యేకత. శిథిలమైనవి శిథిలం కాగా, మిగతా వాటిని భద్రంగా కాపాడుతున్నారు. కర్నాటకలోని హోస్పేట దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని నింపాదిగా చూడాలి. ఒకనాటి చారిత్రక వైభవానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ ఏదో రూపంలో కనిపిస్తాయి. అందుకని హంపిని పర్యటించడం విస్మయాన్ని కలిగించే అనుభవంగా మిగిలిపోతుంది.
చోళులు నిర్మించిన మహాదేవాలయాలు
చోళ రాజులు అద్భుతమైన మహా ఆలయాల్ని నిర్మించారు. శతాబ్దాలు గడిచినా వాటి వైభవం చెక్కుచెదరలేదు. తమిళనాడులో ఉన్న ఈ మహాదేవాలయాలకు 1987లో యునెస్కో వారి ప్రపంచ వారసత్వహోదా గుర్తింపు లభించింది. అలాగే ఇదే ఏడాది కర్నాటక రాష్ట్రంలోని పట్టాడకల్ వద్ద ఉన్న నిర్మాణ సమూహాలు, మహారాష్ట్రలోని ఎలిఫెంటా గుహలు వారసత్వహోదా గుర్తింపు పొందాయి. వీటిని చూడటం కోసం దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అందుకని మనం తప్పనిసరిగా పర్యటించాలనుకునే ప్రదేశాల జాబితాలో ఈ మూడు ప్రాంతాలు కూడా ఉండాలి. ఎలిఫెంటా గుహల సందర్శనం మరపురాని అనుభూతుల్ని అందిస్తుంది. ముంబయి వరకు వెళ్ళేవారు ఎలిఫెంటా గుహల దగ్గరకు పోయి ఒకరోజు మొత్తం అక్కడ గడిపితేనే అందం, ఆనందం. చోళ దేవాలయాల ఆర్కిటెక్చర్ని ఒకసారి చూస్తే మరచిపోలేం. తమిళనాడు ఆలయాలకీ, శిల్పసంపదకీ ప్రసిద్ధి. కనుక ప్లాన్ చేసుకొని ఆ రాష్ట్రం చుట్టి రావడం అవసరం.
పక్కా ప్లాన్ తప్పనిసరి
ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు పొందిన ప్రాంతాల్ని పర్యటించడానికి వెళ్ళే ముందు ఆ ప్రాంతాల గురించి తెలుసుకోవాలి. అక్కడి సమాచారాన్ని చదవాలి. ఎంత సమయంలో చూడగలమో నిర్ధారించుకోవాలి. దీనికి అనువుగా టూర్ ప్లాన్ని రూపొందించుకోవాలి. పిల్లలతో వెళ్ళాలా, స్నేహితులతో వెళ్ళాలా, ఇద్దరే జంటగా వెళ్ళాలా అన్నది ఆయా ప్రాంతాల్ని బట్టి ఉంటుంది. అందుకని సరయిన ప్లాన్తో వెళ్ళిరావడం బాగుంటుంది. రాష్ట్రం దాటి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చూడాలనుకునే వారు ముందుగా వారసత్వ హోదా గుర్తింపు ఉన్న ప్రాంతాల దర్శనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రశాంతంగా, నింపాదిగా, తీరికగా చూసి వస్తే మధురమైన అనుభూతులు గుర్తుండిపోతాయి. ఈ హోదా గుర్తింపు పొందిన ప్రాంతాలు మన దేశంలో 36 ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు ఎన్ని చూశారు, చూడాల్సినవి ఎన్ని ఉన్నాయో ఓ సారి పరిశీలించండి. ఎవరు ఎంత వెచ్చించగలరో దానికి అనువుగా సౌకర్యాలుంటాయి. కనుక తక్కువ బడ్జెట్లో వెళ్ళి రావాలనుకునేవారు అన్నిరకాలుగా ప్లాన్ చేసుకుంటే మంచిది.
మన దేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా
1. తాజ్మహల్
2. ఆగ్రా కోట
3. ఫతేపూర్ సిక్రీ
4. అజంతా గుహలు
5. ఛత్రపతి శివాజీ టెర్మినస్
6. ఎలిఫెంటా గుహలు
7. ఎల్లోరా గుహలు
8. భింబేట్కా రాతికప్పులు
9. ఖజురాహో వద్ద నిర్మాణ సమూహాలు
10. సాంచి - బౌద్ధ స్థూపాలు
11. నలందా విశ్వవిద్యాలయం
12. మహాబోధి ఆలయం-బోధిగయ
13. చంపానేర్ పావగఢ్ పురావస్తు వనం
14. గోవా చర్చీలు, కాన్వెంట్లు
15. చోళుల ఆలయాలు
16. మహాబలిపురం వద్ద నిర్మాణ సమూహాలు
17. కుతుబ్ మినార్
18. హుమయూన్ సమాధి
19. ఎర్రకోట
20. కజిరంగ జాతీయ వనం
21. మానస జాతీయ అభయారణ్యం
22. కియోలాడియో జాతీయవనం
23. నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు
24. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు
25. సుందరబన్స్ నేషనల్ పార్కు
26. వెస్ట్రన్ ఘాట్స్
27. జంతర్ మంతర్, జైపూర్
28. రాజస్థాన్ హిల్ఫోర్ట్స్
29. మౌంటేన్ రైల్వేస్
30. హంపి
31. రాణి-కీ-వవ్ - ది క్వీన్స్ స్టెప్ వెల్, పఠన్, గుజరాత్
32. సూర్యదేవాలయం
33. పట్టాడక్కల్ వద్ద నిర్మాణ సమూహాలు
34. కంచన గంగ నేషనల్ పార్కు
35. కర్బుజీర్ వాస్తు నిర్మాణం-చండీఘడ్
36. అహ్మదాబాద్
Authorization